
టీఎస్ ఈఈయూ–327 కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి
హన్మకొండ : మాటల గారడితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్–327 కార్యాలయంలో మేడేను యూనియన్ నాయకులు, ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీఎస్ ఈఈయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.
అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెటన్లు అంద చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హామీలను విస్మరించారని విమర్శించారు. వరంగల్ నగరంలో మూడు రోజుల పాటు ఉండి డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలవుతున్న ఇప్పటికీ అతిగతీ లేదని దుయ్యబట్టారు. మాటలతో మాయ చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణస్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్మికులకు అండగా నిలుస్తున్న యూనియన్ ఇదొక్కటేనని అన్నారు.
రక్తదానం చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి ఇ.వి.శ్రీనివాస్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, యూనియన్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశికుమార్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుచ్చయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, మçహాబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు హనుము, ప్రధాన కార్యదర్శి బాబు, జనగామ జిల్లా కార్యదర్శి బాలు, నాయకులు ఫయిం, శ్రీనివాస్, జశ్వంత్, లక్ష్మణ్నాయక్, జి.రమేష్, రమణారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment