Delhi Election Results 2020
-
‘మఫ్లర్ మ్యాన్’ సందడి ‘క్రేజీ’
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘బేబి మఫ్లర్ మ్యాన్’ సందడి చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘అవ్యాన్ తోమర్’కు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఫంక్షన్కు ఆహ్మనం అందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రామ్లీలా మైదానంలో ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెటర్, మఫ్లర్, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. (‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) ఈవెంట్లో చిన్నారి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్ ఎమ్మెల్యేలు భగవత్మాన్, రాఘవ్ చద్దా, సోమ్నాథ్ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. (వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్) చదవండి : ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు! -
పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్
-
వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్ పాడిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక కండీషన్.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'హమ్ హోంగే కామ్ యాబ్'(వి షాల్ ఓవర్కమ్) పాటను పాడి.. అందరితో పాడించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. (కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!) 1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్ ఓవర్కమ్) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.ఇంతకుముందు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ముగింపు సమయంలో కేజ్రీవాల్ ఇలాగే హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆలపించడం విశేషం. ఇక కేజ్రీవాల్తో పాటు ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్లు ఉన్నారు. ఢిల్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. -
కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!
-
కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!
న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తన పట్ల ఢిల్లీ ప్రజల ప్రేమకు వెలకట్టలేమని అన్నారు. ప్రపంచంలో అద్భుతమైన, వెలకట్టలేని విషయం ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే అని పేర్కొన్నారు. రామ్లీలా మైదానంలో ఆదివారం ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘బిడ్డపై తల్లిదండ్రులు చూపించే ప్రేమకు వెలకట్టలేం. నాపై ఢిల్లీ ప్రజలు చూపించే ప్రేమ కూడా అలాంటిదే. నా రాష్ట్ర ప్రజలపై నాకున్నది కూడా ప్రేమే. ఎన్నికల ప్రచారంలో నాపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఆరోపణలు చేశాయి. కేజ్రీవాల్ అన్నీ ఉచితం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రిగా.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా సంక్షేమం అందించడం తప్పా. విద్య, వైద్యం కూడా డబ్బులు తీసుకుని అందించాలా. అది ఎంత సిగ్గు చేటు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున ఇక రాజకీయాల గొడవ వదిలేయాలని ఆయన ప్రజలను కోరారు. పార్టీ ఏదైనా, ఎవరికి ఓటేసినా ఢిల్లీ జనమంతా ఒకే కుటుంబంగా అభివృద్ధి వైపు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా అందరం ఒకే ఫ్యామిలీ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇక మంత్రులుగా మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రమాణం చేశారు. కొత్త ముఖాలకు చోటు దక్కలేదు. -
ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు!
కేజ్రీ... హ్యాట్రిక్ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... (చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం) పవన్ కుమార్ చామ్లింగ్ (ఎస్డీఎఫ్) రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24 ఏళ్ల 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్కుమార్ చామ్లింగ్ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్ బహుదూర్ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్ 1992లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు. సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్కుమార్పై ఒక క్రేజ్ని సృష్టించాయి. చామ్లింగ్ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు. సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. జ్యోతిబసు (సీపీఐ–ఎం) రాష్ట్రం: పశ్చిమ బెంగాల్, పదవీ కాలం: 23 ఏళ్ల 137 రోజులు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మాణిక్ సర్కార్ (సీపీఐ–ఎం) రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19 ఏళ్ల 363 రోజులు తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం మాణిక్ సర్కార్. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్ కుటుంబంలో జన్మించిన మాణిక్ సర్కార్ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్ సర్కార్ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది. బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్ సర్కార్ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్ సర్కార్ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) రాష్ట్రం: ఒడిశా, పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కాలంలో జనతాదళ్ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నవీన్ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15 ఏళ్ల 25 రోజులు ఇప్పుడు అందరం కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్. కాంగ్రెస్ డార్లింగ్గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. రమణ్ సింగ్ (బీజేపీ) రాష్ట్రం: ఛత్తీస్గఢ్, పదవీ కాలం: 15 ఏళ్ల 4 రోజులు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్తోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు రమణ్ సింగ్. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్ సింగ్ను ఆప్యాయంగా చావాల్ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్గఢ్ పరిపాలనను రమణీయంగా మార్చాయి. వ్యూహాత్మకంగా నక్సల్స్ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్ సింగ్పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్ సింగ్ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్ సింగ్ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. నరేంద్ర మోదీ (బీజేపీ) రాష్ట్రం: గుజరాత్, పదవీ కాలం: 12 ఏళ్ల 226 రోజులు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. గుజరాత్ మోడల్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్లో అత్యధికమన్న వాదనా ఉంది. -
‘కాంగ్రెస్కి కరోనా వైరస్.. భారీ నష్టం’
కొచ్చి: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్బాగ్ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్కేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్టుగా భారీగా నష్టం జరిగిందన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది) -
నా లెక్క తప్పింది: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని వ్యాఖ్యానించారు. టైమ్స్ నౌ సమ్మిట్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యల కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘దేశ్ కే గదరానోంకో గోలీమారో’’ (దేశ ద్రోహులను కాల్చండి) వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి ఎవరైనా తనతో చర్చకు రావొచ్చని అమిత్ షా తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా సీఏఏకు వ్యతిరేకంగా షాహిన్బాగ్లో నిరసనలు, ధర్నాలు జరగడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం బీజేపీపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా.. తాను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సొంతం చేసుకోగా.. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లు ఆప్ గెలుచుకోగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.(ఆరోజే బిగ్ అనౌన్స్మెంట్: ప్రశాంత్ కిషోర్) -
‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన.. 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్) ఆ పార్టీలో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. తాజాగా.. బిగ్ అనౌన్స్మెంట్ అంటూ ఆప్ చేసిన మరో ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మంగళవారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వేషధారణతో ఉన్న.. ఓ బుడతడి ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆప్ విజయోత్సవాల్లో భాగంగా మినీ మఫ్లర్మ్యాన్ అంటూ పార్టీ సైతం ఆ బుడ్డోడి ఫొటోను షేర్ చేసింది. (కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!) ఇక ఫిబ్రవరి 16న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న నేపథ్యంలో.. బేబీ మఫ్లర్మ్యాన్ను బంపర్ ఆఫర్ వరించింది. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి సదరు బుడ్డోడిని ఆహ్వానిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు... ‘‘బిగ్ అనౌన్స్మెంట్: ఫిబ్రవరి 16న జరుగనున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి బేబీ మఫ్లర్మ్యాన్ను ఆహ్వానించాం. సూట్ అప్ జూనియర్!’ అని మరోసారి అతడి ఫొటోను షేర్ చేశారు. కాగా ఫిబ్రవరి 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ రికార్డు స్థాయిలో 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకలేకపోయింది. Big Announcement: Baby Mufflerman is invited to the swearing in ceremony of @ArvindKejriwal on 16th Feb. Suit up Junior! pic.twitter.com/GRtbQiz0Is — AAP (@AamAadmiParty) February 13, 2020 -
ఆరోజే బిగ్ అనౌన్స్మెంట్: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీతో జట్టుకట్టినా విజయం వారిని వరిస్తుందని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి పీకే రచించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలకు ముందు బిహార్లో చోటుచేసుకున్న పరిణామాలు పీకే రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తించాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)పై ప్రశాంత్కిషోర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ వాటికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు జేడీయూ ఉపాధ్యక్షుడుగా ఉన్న పీకేను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనపై వేటు పడింది.( ఆరోజు.. అక్కడే మాట్లాడతా: ప్రశాంత్ కిషోర్) ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ విషయాల గురించి మాట్లాడతానని పీకే గతంలో ఓ ప్రకటన చేశారు. అయితే ఫిబ్రవరి 11న రిజల్ట్స్ వచ్చినప్పటికీ.. బిహార్ రాజకీయాల గురించి ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. దీంతో రాజకీయ భవిష్యత్తు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీకే.. ‘ఫిబ్రవరి 11 తర్వాత అందరూ కీలక ప్రకటన(బిగ్ అనౌన్స్మెంట్) గురించి ఎదురుచూశారు. అయితే ఫిబ్రవరి 18న ఆ విషయం గురించి మాట్లాడబోతున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ.. పీకే టీంతో జట్టుకట్టారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఐప్యాక్ బృందం.. దీదీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. (పీకే.. పక్కా వ్యూహకర్త) -
కేజ్రీవాల్ ఖాతాలో మరో ‘విజయం’!
న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించింది. దీంతో అనూహ్యంగా ఒక్క రోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ క్యాంపెయిన్లో భాగస్వాములు అయ్యారు. దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో చేరారు. ఇది భారీ విజయం’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. (కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!) More than 1 million people have joined AAP within 24 hours of our massive victory. To join AAP, give a missed a call on : 9871010101#JoinAAP pic.twitter.com/o79SV8bj01 — AAP (@AamAadmiParty) February 13, 2020 ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ 62 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఈ క్రమంలో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాలే చేజిక్కించుకున్నారు. ఆయన ఈనెల 16న ఢిల్లీలోని రామలీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (16న కేజ్రీవాల్ ప్రమాణం) -
కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై మూడోసారి కొలువుదీరనున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తన కేబినెట్లో ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఈ దఫా కూడా మంత్రులుగా కొనసాగుతారని వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి అఖండ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ పిలుపు మేరకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నారు. చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్ కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది. ఈ క్రమంలో ఆప్ ఘన విజయంలో కీలకంగా వ్యవహరించిన మహిళా ఎమ్మెల్యే అతిషిని.. కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అదే విధంగా యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు కూడా మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. వీరి కోసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే... గతంలో కేజ్రీవాల్ కేబినెట్లో ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖైలాశ్ గెహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతం.. మరోసారి మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నట్లు తాజా సమాచారం. -
కాంగ్రెస్లో చిచ్చురేపుతున్న ఢిల్లీ ఫలితాలు
-
చిదంబరంజీ.. మన దుకాణం మూసేద్దాం..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుతూ బీజేపీ ఓటమిని ఆస్వాదిస్తూ ఆప్ను అభినందనల్లో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ దీటుగా బదులిచ్చారు. ‘చిదంబరంజీ..బీజేపీని ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందా..లేదంటే పార్టీ పరాజయాన్ని పక్కనపెట్టి ఆప్ విజయాన్ని సంబరంగా జరుపుకోవడం ఏంటి..? నా ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తే ఇక పీసీసీ దుకాణాలను మూసేద్దా’మని శర్మిష్ట ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉండే వివిధ రాష్ట్రాల ప్రజలు కాషాయ పార్టీని ఓడించడంతో ప్రమాదకర బీజేపీ అజెండాను ప్రజలు తిరస్కరించారని వెల్లడైందని, 2021, 2022లో ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు సరైన ఉదాహరణగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిదంబరం ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్ధానాలకు గాను ఆప్ 62 స్దానాలు దక్కించుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టగా బీజేపీ 8 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్కు ఒక్క స్ధానం కూడా దక్కలేదు. -
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్ను వీడి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
కేజ్రీవాల్.. ఫిబ్రవరి 14!
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్ది ప్రేమ వివాహం. ఎగ్జిట్ పోల్స్ నిజం! ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్వర్ష్లు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్ సర్వే ఆప్కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్ ఆప్కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్వర్ష్ అంచనాల ప్రకారం ఆప్కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. (చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్) మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (చదవండి: ఏ.కే.–62) -
ఆప్ ‘హ్యాట్రిక్’సంబరాలు
-
మోదీ ట్వీట్.. కేజ్రీవాల్ రిప్లై
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్కు, అరవింద్ కేజ్రీవాల్కు కంగ్రాట్స్. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే మోదీ ట్వీట్పై కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘థాంక్యూ సో మచ్ సార్. న్యూఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని బదులిచ్చారు. కాగా, నేడు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ 62 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరువలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. చదవండి : ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు : కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ -
ఘోర ఓటమి: ఖుష్బూ, షర్మిష్ట ఫైర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దేశ రాజధాని ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ.. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ భారీ ఓటమిపై కాంగ్రెస్ మహిళా నాయకులు షర్మిష్టా ముఖర్జీ, ఖుష్బూ సుందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి .. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు... ‘‘ ఢిల్లీలో మరోసారి మనం నాశనం అయిపోయాం. ఆత్మశోధన చేసుకున్నది చాలు. ఇది కార్యాచరణ మొదలుపెట్టాల్సిన సమయం. ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఒక వ్యూహం లేదు. రాష్ట్ర స్థాయిలో సమన్వయం లేదు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. మూలాలే సరిగ్గా లేవు. ఈ వ్యవస్థలో భాగమైన నేను కూడా ఈ వైఫల్యానికి నా వంతు బాధ్యత వహిస్తా’’అని షర్మిష్ట ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: థాంక్యూ ఢిల్లీ.. షాక్ తగిలిందా: ప్రకాశ్ రాజ్ అదే విధంగా ఖుష్బూ కూడా పార్టీ కార్యకర్తల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించలేదు. మరోసారి ఘోరంగా విఫలమయ్యాం. మనం అసలు సరిగ్గా పనిచేస్తున్నామా? మనం చేసేది సరైందేనా? అసలు సరైన దారిలోనే ఉన్నామా? వీటన్నింటికీ.. ‘నో’ అనే కదా సమాధానం. కనీసం ఇప్పటి నుంచైనా పనిచేయడం మొదలుపెట్టాలి. క్షేత్రస్థాయిలో, మధ్య స్థాయిలో, ఉన్నత స్థాయిలో పరిస్థితులను చక్కబెట్టాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో ఆప్ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్ We r again decimated in Delhi.Enuf of introspection, time 4 action now. Inordinate delay in decision making at the top, lack of strategy & unity at state level, demotivated workers, no grassroots connect-all r factors.Being part of d system, I too take my share of responsibility — Sharmistha Mukherjee (@Sharmistha_GK) February 11, 2020 Wasnt expecting magic in Delhi for #Congress Decimated yet again. Are we doing enough? Are we doing it right? Are we on the right track? NO is the big answer. We need to start working now. Its now or never. Ground level,middle level n top level. Things need to be set right. — KhushbuSundar ❤️ (@khushsundar) February 11, 2020 -
థాంక్యూ ఢిల్లీ.. షాక్ తగిలిందా: ప్రకాశ్ రాజ్
బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ‘సామాన్యుడి’కి అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలను ప్రశంసిస్తూనే.. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు... ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్ తగిలిందా?’’అని ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా.. ‘‘పేరున్న వాళ్లను.. బద్నాం చేసే వాళ్లను కాకుండా.. కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రకాశ్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ తీరుపై అనేకమార్లు విమర్శలు గుప్పించారు. చదవండి: హస్తిన తీర్పు: ఆప్ 62.. బీజేపీ 8 కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న 70 స్థానాల్లో ఎన్నికల్లో... ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క స్థానంలో కూడా గెలుపొందని కాంగ్రెస్ పార్టీ.. పలు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. మరోవైపు వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు అఖండ విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన హనుమాన్ మందిర్కు వెళ్లి దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ తీసుకోనున్నారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్ CAPITAL PUNISHMENT.... Goli maarne walon ko.... jhadu se mara..... SHOCK LAGA??? ಗೋಲಿಬಾರ್ ಮಾಡೋರಿಗೆ ಜನ ಪೊರಕೇಲಿ ಹೊಡುದ್ರು.. SHOCK ಹೊಡೀತಾ??#JustAsking — Prakash Raj (@prakashraaj) February 11, 2020 -
ఆప్ విజయంపై కేజ్రీవాల్ కుటుంబం హర్షం
-
ఇది ఢిల్లీ ప్రజల విజయం
-
ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఢిల్లీ ప్రజల విజయంగా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కేంద్ర కార్యాలయంలో ఆప్ కార్యకర్తలతో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై, ఇక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారని అన్నారు. దేశంలోనే కొత్త రాజకీయ అధ్యాయం తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధికే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మూడోసారి తమ కొడుకుపై నమ్మకం ఉంచి భారీ విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఐ లవ్ యూ ఢిల్లీ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం. విద్య, వైద్యం కోసం చేసిన కృషి వల్లే ఆప్ను ప్రజలు మళ్లీ ఆదరించారు. ఈ రోజు మంగళవారం.. హనుమాన్జీ ఢిల్లీ ప్రజలను ఆశీర్వాదించారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తూనే ఉండటానికి హనుమాన్జీ మాకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆప్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. అందరం కలిసి పనిచేస్తూ ఢిల్లీని సుందర నగరంగా తీర్చిదిద్దుదామ’ని పిలుపునిచ్చారు. -
ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. (హస్తిన తీర్పు : ‘ఇది ఢిల్లీ ప్రజల విజయం’) ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. 'జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)' అంటూ ఆయన మూడు ముక్కల్లో కేజ్రీవాల్ విజయంపై తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో నితీశ్ సారథ్యంలోని జేడీయూ పొత్తు నేపథ్యంలో ఢిల్లీలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పోటీ చేసింది. అమిత్ షాతో కలసి నితీశ్ మూడు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై నితీశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని.. వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్కు సీఎం జగన్ అభినందనలు ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర . -
అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్
-
కేజ్రీవాల్కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమైంది. ఈ సందర్బంగా ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్కి, ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కేజ్రీవాల్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఆప్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.(హస్తిన తీర్పు : లైవ్ అప్డేట్స్) -
ఢిల్లీ ఫలితాలు : ‘కమల దళానికి తగిన శాస్తి జరిగింది’
-
ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్మ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. స్మైలీ ఫేస్ ఎమోజీతో ‘మఫ్లర్మాన్’ పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్ చేసింది. ఆప్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లా వున్న ఒక పసిబిడ్డ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అభిమానుల లైక్లతో పాటు కమెంట్లు, అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆప్ షేర్ చేసిన మినీ మఫ్లర్ మాన్ ఫోటో వైరల్ అవుతోంది. ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరో యూజర్ ఆప్కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్, పాకిస్తాన్ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్ చేయడం విశేషం. Mufflerman 😄 pic.twitter.com/OX6e8o3zay — AAP (@AamAadmiParty) February 11, 2020 He will be the CM one day. 😍#DelhiResults Mophlar Men pic.twitter.com/oFrpjKgQY4 — Pramod Gupta (@PramodG96346806) February 11, 2020 -
ఢిల్లీ ఫలితాలు : ‘2021లో ఏం జరుగుతుందో చూడండి’
కోల్కత : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే 45 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. మరో 17 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వరుసగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అభినందనల వెల్లువ మొదలైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు బీజేపీ పతనం మొదలైందని ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. (చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర) క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీన పడటం ప్రారంభమైందని, త్వరలోనే కాషాయ దళం ప్రభ కోల్పోతుందని మమత పేర్కొన్నారు. వచ్చే యేడాది జరగుబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ విద్యార్థులను, మహిళలను టార్చర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు కాషాయ దళానికి తగిన శాస్తి చేశారని చురకలంటించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించగా, 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు వచ్చేలా కనిపించడం లేదు. చదవండి : న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన -
ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే ‘బిర్యానీ’ కూడా తనవంతు పాత్రను నిర్వహించిందని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారడమే అందుకు కారణం. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాద్లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్ ప్రభుత్వం ‘బిర్యానీ’ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవియా అయితే ‘షహీన్ బాద్లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదిగో ప్రూఫ్, అదిగో ప్రూఫ్’ అంటూ ఏవో ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. ఇలా ‘బిర్యానీ’ని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ‘బిర్యానీ’ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్కు జైలు అధికారులు ‘బిర్యానీ’ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దక్షిణాసియా ముస్లింలకు బహు పసందైన ‘బిర్యానీ’ని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ కట్టకట్టుకొని తమకే పడతాయని బీజేపీ నేతలు ఆశించారు. అయితే ఆ నినాదాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలే సూచిస్తున్నాయి. నిమిషానికి 95 వేల ఆడర్లు భారత్లో ప్రతి నిమిషానికి 95 బిర్యానీల ఆర్డర్ వస్తోందని ఇంటికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న అతి పెద్ద యాప్ ‘స్విగ్గీ’ లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశంలో జాతీయ ఆహారంగా ‘బిర్యానీ’ని గుర్తించాలనే స్థాయికి దీని ప్రాధాన్యత పెరిగింది. భారత దేశ ఆహారాన్ని రుచి చూడాలనుకునే విదేశీయులు మొట్టమొదగా బిర్యానీ, ఆ తర్వాత బటర్ చికెన్ను శోధిస్తారని ‘ఎస్ఈఎం రష్’ 2019లో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ధోని హోటల్ మారిన వైనం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన బస చేసిన హోటల్లోకి బయటి నుంచి బిర్యానీని అనుమతించకపోతే ఆయన ఏకంగా హోటల్ నుంచే మకాం మార్చారు. పర్షియన్ పదం బిర్యాన్ నుంచి బిర్యానీ వచ్చింది. పర్షియన్లో బిరింజ్ అంటే బియ్యం అని అర్థం కూడా ఉంది. బిర్యానీ మొఘల్స్ వంటకమని, వారి నుంచి ఇది భారత్కు వచ్చిందని చెబుతారు. తుర్క్–మంగోల్ చక్రవర్తి తైమార్ 14వ శతాబ్దంలోనే ఈ వంటకాన్ని భారత్కు తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది. నిజాం నవాబులు, లక్నో నవాబులు ఈ వంటకాన్ని అమితంగా ప్రేమించి ప్రాచుర్యంలోకి తెచ్చారు. పలు రకాల బిర్యానీలు హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సంప్రదాయ మొఘలాయ్ బిర్యానీ కూడా హైదరాబాద్లో దొరకుతుంది. అలాగే బెంగళూరు బిర్యానీ, కోల్కతా బిర్యానీ, ముంబై బిర్యానీ, లక్నో బిర్యానీ (పుక్కీ బిర్యానీ, అవద్) అంటూ ఏ ప్రాంతం బిర్యానీలకు ఆ ప్రాంతం ప్రత్యేకతలుండగా హైదరాబ్ దమ్, మొఘలాయ్, థలస్సరీ బిర్యానీలు దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో దొరకుతున్నాయి. బిర్యానీ అంటే ప్రధానంగా మటన్తో చేసేదని, ఇప్పుడు చికెన్, ఎగ్, ఫిష్, ప్రాన్స్లతోపాటు విజిటెబుల్ బిర్యానీలు కూడా దొరకుతున్న విషయం తెల్సిందే. (హస్తిన తీర్పు : లైవ్ అప్డేట్స్) చదవండి : ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్మ్యాన్ -
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది .సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 18 స్థానాల్లో విజయం సాధించి, 40 స్థానాల్లో ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఆప్కు భారీ విజయం కట్టబెట్టినందుకుగాను ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు. ‘ భారత దేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కేజ్రీవాల్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీప్ స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 15 స్థానాల్లో విజయం సాధించి, 43 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది. -
స్టాక్ మార్కెట్ లాభాల బాట..
ముంబై : కరోనా వైరస్ భయాలు క్రమంగా వీడుతుండటంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. మెటల్, బ్యాంక్, ఆటో సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు విస్పష్ట తీర్పు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 286 పాయింట్ల లాభంతో 41,288 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 98 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,129 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మారుతి సుజుకి, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడుతుండగా..టీసీఎస్, నెస్లే ఇండియా స్వల్పంగా నష్టపోతున్నాయి. చదవండి : ఐపీవోలకు అచ్ఛేదిన్! -
ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ
-
కేజ్రీవాల్కు డబుల్ ధమాకా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది. భార్య బర్త్డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్కు మరోసారి పట్టం కట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్లో నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందు ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన విషయం తెలిసిందే. హ్యాపీబర్త్డే సునీతా మేడమ్..మా హీరోకు మీరే బలం..మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన రోజే పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, కేజ్రీవాల్ వెనుకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన సునీత తమ కుమారుడు తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడని పేర్కొన్నారు. తన భర్త కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఆప్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. చదవండి : ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం -
ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. (చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. టపాసుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప్ శ్రేణులు టపాసులు పేల్చడం లేదు. టపాసులకు బదులు బెలూన్లను గాల్లోకి వదిలి, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
పుంజుకున్న బీజేపీ..పత్తాలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 10.35గంటలకు ఆప్ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 21 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. ఈసారి పుంజుకుంది. గతం కంటే ఐదింతలు మెరుగైంది. 27 స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంది. 14 స్థానాల్లో ఆప్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మెడల్ టౌన్లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ 4 , న్యూఢిల్లీలో ఆప్ 9, బీజేపీ 1, నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఆప్ 8, బీజేపీ2, వెస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, సౌత్ ఢిల్లీలో ఆప్ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
హస్తిన తీర్పు : మోదీ, రాహుల్ ట్వీట్
నా ప్రత్యేక అభినందనలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించిన ఫలితాలతో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ప్రశంసల జల్లులు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ, స్థానిక నేతలు కేజ్రీవాల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఫలితాల అనంతరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి శుభాకంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను’అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్కు తన ప్రత్యేక అభినందనలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ 62.. బీజేపీ 8 ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏం కనిపించలేదు. కేజ్రీవాల్ అండ్ టీమ్కు అభినందనలు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా ప్రనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ది చేస్తుందనే నమ్మకంతోనే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రజా సమస్యలు లెవనెత్తుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను బీజేపీ పోషిస్తుందన్నారు. ఇక ఢిల్లీ అభివృద్దికి కృషి చేస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్ అండ్ టీమ్కు అభినందనలు అంటూ నడ్డా ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్కు అభినందనల వెల్లువ ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలదన్ని అఖండ విజయంతో ఆప్ దూసుకపోతోంది. ఇప్పటికే 45 స్థానాల్లో ఆప్ గెలుపొందగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కేజ్రీవాల్ అండ్ టీం సాధించిన ఈ సూపర్బ్ విక్టరీపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్కి, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్కు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం కేజ్రీవాల్కు శుభాభినందనలు తెలిపారు. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో కూడా కనీసం ఒక్కసారైనా ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు డిప్యూటీ సీఎం విజయం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పర్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మరోసారి కంగుతినిపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్కు ప్రశాంత్ కిశోర్ అభినందనలు ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్ ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. ఐదింతలు పెరిగిన బీజేపీ బలం దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఉచిత విద్యుత్తో ఆప్కు అనుకూలం: బీజేపీ ఎంపీ నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. సంబరాల్లో ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. సత్తా చాటిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ మొదటి నుంచి లీడ్లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారాకా, జనక్ పురి, కృష్ణానగర్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మనీష్ అక్షర్ ధామ్ కౌంటింగ్ సెంటర్లో ప్రతాప్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థి రవినేగి పాల్గొన్నారు. అక్కడక్కడ మెరుస్తోన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్ లీడ్లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్పాల్ సింగ్ ఆప్ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 55 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 13 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దూసుకెళ్తున్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 15, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆప్ నేత,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కౌంటింగ్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి... శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఈ ఉదయం నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. పిల్లలతో కలిసి వారంతా కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వత్రా ఉత్కంఠ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్బూత్లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది.