-
ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్ చేసిన ట్యాక్స్ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేతడిసెంబర్ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
రిలయన్స్ కొత్త బిజినెస్
రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 30-45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్ రిటైల్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్లో ‘హైపర్లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్ల చొరవ కీలకమని చెప్పింది.టాటా యాజమాన్యంలోని బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో.. వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ రిటైల్ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది. ఈ అంశంపై స్పందిస్తూ..‘ప్రస్తుతం మార్కెట్లో క్విక్ కామర్స్ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా, రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్లను రిటైల్ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్(FYND), లోకస్(Locus) వంటి సాంకేతిక ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.గతేడాది రిలయన్స్..జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో నవీ ముంబయిలో క్విక్ కామర్స్ సర్వీస్ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
జెప్టోలో డెలివరీ.. హెర్షే చాక్లెట్ సిరప్లో చనిపోయిన ఎలుక
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డెలివరీ పార్శిల్లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలలో ఓ వ్యక్తి ఐస్క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్క్రీం సంస్థ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిల ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో తన అనుభవాన్ని పంచుకున్నారు.జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్ని బ్రౌనీ కేక్లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్ను కప్లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని అని పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. దయచేసి తమకు UPC అలాగే తయారీ కోడ్ను consumercare@hersheys.comకు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపాలని తెలిపింది. తద్వారా తమ బృంద సభ్యులు మీకు సహాయం చేయగలరని పేర్కొంది. View this post on Instagram A post shared by Prami Sridhar (@pramisridhar) -
జెప్టో జెట్ స్పీడ్
ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్ పలిచా ‘జెప్టో’ స్టార్టప్కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్ హిట్ కొట్టింది. ‘సక్సెస్కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫామ్ ‘జెప్టో’ సూపర్ సక్సెస్ కావడమే కాదు యూనికార్న్ స్టేటస్ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.... పాఠం నెం 1: క్లారిటీ స్టాన్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’ హండ్రెడ్ పర్సంట్. లాక్డౌన్ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్లు. పాఠం నెం 2: నమ్మకం చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్లను ఇన్వెస్టర్లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్ విషయంలో ఇబ్బంది కాలేదు. పాఠం నెం 3: ధైర్యం ‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్ఫ్రెండ్. పాఠం నెం 4: టీమ్ స్ట్రెంత్ స్టీవ్ జాబ్స్ను అభిమానించే కైవల్య, అదిత్లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్ స్ట్రెంత్ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. పాఠం నెం 5: రీసెట్ డీఎన్ఏ తమ కంపెనీ తక్కువ టైమ్లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్’ అనే టర్మ్ను కాయిన్ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్కు స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్ఏను రీసెట్ చేయాలనుకున్న సమయం అది.’ -
ఆ 3 రోజులు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న తరుణంలోకేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల విధింపు సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారని కేంద్రం వెల్లడించింది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా జీ 20 సదస్సు నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజధాని నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నగరంలో క్లౌడ్ కిచెన్, డెలివరీ సేవలకు అనుమతిని నిరాకరించారు. జొమాటో, స్విగ్గీ, అమెజాన్ అన్నీ బంద్ సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితోపాటు బ్లింకిట్, జెప్టో.. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్డీఎమ్సీ ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే.. వాటికి మినహాయింపు అయితే వీటికి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ ఉంటుందని ఆయన తెలిపారు వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 8, 9,10 తేదీల్లో ఢిల్లీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వర్క్ ఫ్రం హోమ్ సెప్టెంబర్ 8 శుక్రవారం ఓజు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయని.. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించింది. -
లాభాల్లోకి జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో మొదటిసారి ఓ త్రైమాసికంలో లాభాలను నమోదు చేసింది. జూన్తో అంతమైన మూడు నెలల కాలానికి రూ.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.186 కోట్లు నష్టపోవడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఈ ఫలితాల్లో బ్లింకిట్ గణాంకాలు సైతం కలిసే ఉన్నాయి. విడిగా ఫుడ్ డెలివరీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. హైపర్ ప్యూర్ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారం పెద్ద సంక్లిష్టతలు లేకుండా నిర్వహించేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు జొమాటో వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో తెలిపారు. వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం వ్యాప్తంగా లాభాలను ఆర్జిస్తామని ప్రకటించారు. ఇక ముందు తమ వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుందని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. వచ్చే కొన్నేళ్లపాటు తాము ఏటా 40 శాతానికి పైగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తామని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో జొమాటో కంటే బ్లింకిట్ వాటాదారులకు ఎక్కువ విలువ తెచ్చి పెడుతుందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. కొన్ని పట్టణాల్లో జొమాటో స్థూల ఆర్డర్ విలువ సమీపానికి బ్లింకిట్ స్థూల ఆర్డర్ విలువ చేరినట్టు చెప్పారు. వృద్ధిని కొనసాగించేందుకు, తాము విజయం సాధిస్తామనుకున్న కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 2 శాతం లాభపడి రూ.86 వద్ద ముగిసింది.