UDF
-
కేరళలో ఎల్డీఎఫ్ ఇక ఇంటికే..
తిరువల్ల/తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి కౌంట్డౌన్ మొదలైందని తేల్చిచెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. శనివారం కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో వామపక్షాల పాలనకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఎల్డీఎఫ్ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాలతోపాటు గోవాలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదే తరహాలో కేరళలోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. అవినీతి, మతతత్వమే అవరోధాలు కేరళలో ప్రగతికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలోనే ఉండిపోయిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు కేరళను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఇక్కడి అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలతో ప్రధానంగా మహిళలే అత్యధికంగా లబ్ధి పొందారని వెల్లడించారు. కేరళలో ప్రగతికి అవినీతి, మతతత్వం అతిపెద్ద అవరోధాలుగా మారాయన్నారు. అవి తొలగిపోవాలంటే ఎల్డీఎఫ్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి బీ–టీమ్ అంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు సరస్పరం నిందలు వేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి కేరళలో ఎ–టీమ్ బీజేపీ మాత్రమేనని స్పష్టంచేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య రహస్య స్నేహం సాగుతోందన్నారు. అవి రెండు ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని విమర్శించారు. అందుకే ఆ రెండు పక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఎల్డీఎప్, యూడీఎఫ్ల అరాచకాలపై దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. వారి నోటిదురుసు వల్ల పశ్చిమాసియాలోని భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. గల్ఫ్లో మన భారతీయుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తిరువనంతపురంలో భారీ రోడ్ షో ప్రధాని మోదీ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సాయంత్రం రోడ్ షోలో పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. వీధులు కిక్కిరిసిపోయాయి. నగరం జనసంద్రాన్ని తలపించింది. మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ అభ్యర్థులు పాలుపంచుకున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన మో దీ రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. -
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేరళలో నిర్వహించిన ఒక సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే విషయంలో భారీ ట్విస్ట్ ఇచ్చింది.కేరళలో Citizens Opinion Research and Evaluation (CORE) సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే మార్చి 23 నుండి 30 మధ్య రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల నుండి 31,706 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. తద్వారా వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో అధికార కూటమి అయిన LDFకు మిశ్రమ స్పందన లభించగా, UDF పనితీరుపై ప్రజలు కొంత మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక NDA విషయానికి వస్తే తీవ్రమైన ప్రతికూల భావనను ఎదుర్కొంటోంది.👉ప్రస్తుత ప్రభుత్వం ఎల్డీఎఫ్ విషయానికి వస్తే.. సుమారు 43.1% మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ పనితీరుకు సానుకూల రేటింగ్ ఇచ్చారు. అందులో 17.16% మంది 'చాలా బాగుంది' అని, 25.94% మంది 'బాగుంది' అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో విమర్శకులను కూడా ఎదుర్కొంటోంది. సుమారు 25.74% మంది ప్రభుత్వ పనితీరును 'బాగోలేదు' లేదా 'అస్సలు బాగోలేదు' అని అభివర్ణించారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. సగటున 31% పాజిటివ్గా స్పందించారు.👉ఇక, యూడీఎఫ్ విషయానికి వస్తే.. 42.07% మంది ఓటర్లలో 28.72% మంది మాత్రమే దాని పనితీరును 'బాగుంది' లేదా 'చాలా బాగుంది' అని రేట్ చేశారు. 29.22% మంది బాగాలేదు లేదా అసలు బాగాలేదు అని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో లాభం ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున ఊపు లేదు.👉మరోవైపు.. ఎన్డీయే కూటమి విషయానికి వస్తే.. కూటమి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రతిస్పందించిన వారిలో 60% కంటే ఎక్కువ మంది కూటమి పనితీరును బాగాలేదు లేదా అస్సలు బాగాలేదు అని రేటింగ్ ఇచ్చారు. కేవలం 11.66% మంది ఓటర్లు మాత్రమే దానికి సానుకూల రేటింగ్ ఇచ్చారు. ఎన్డీయే సానుకూల రేటింగ్ దక్షిణ కేరళలో కొంత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వేను విశ్లేషిస్తే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య పోటాపోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా..ఉత్తర కేరళ: LDF బలంగా ఉంది.మధ్య కేరళ: UDF పోటీలో ఉంది.దక్షిణ కేరళ: విభిన్న అభిప్రాయాలు, స్పష్టమైన ఆధిక్యం లేదు.నియోజకవర్గాల వారీగా అంచనాలు (35 కీలక సీట్లు)ఉత్తర కేరళ (కాసరగోడ్, కన్నూర్, వయనాడ): LDF బలంగా ఉండగా, UDF కొంత పోటీ, NDA బలహీనంగామధ్య కేరళ (ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్): LDF/UDF సమాన పోటీ, UDF కొంత ఆధిక్యం, NDA ప్రభావం తక్కువదక్షిణ కేరళ (తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట): LDF/UDF విభిన్న ఆధిక్యం, UDF కొన్ని సీట్లలో బలంగా, NDA ప్రతికూల అభిప్రాయం -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు -
పేరులో నేముంది?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీ ఎఫ్ హోరాహోరీ తలపడుతుండగా బీజేపీ సార థ్యంలోని ఎన్డీఏ కూడా ఉనికి చాటుకునే ప్రయ త్నాల్లో ఉంది. అయితే ప్రధాన పార్టీలకు ‘పేర్ల గొడవ’ పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. తమ అభ్యర్థుల పేరుతోనే ఉన్న పలువురు వ్యక్తులు పోటీలో ఉండటంతో అవి తల పట్టుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా వారిని నయానో భయానో బరి నుంచి తప్పించే పనిలో పడ్డాయి. లేదంటే వాటి ఓట్లకు ఎంతో కొంత గండి పడే పరిస్థితి నెలకొంది. అన్ని స్థానాల్లోనూ అధికార, విపక్ష కూటముల నడుమ హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కొన్ని ఓట్లు తగ్గినా తమ గెలుపోటములే ప్రభావితం అవుతాయంటూ పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి.విజయన్పై విజయన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గంలో కన్నూరుకు చెందిన ఎ.ఎం.విజయన్ అనే మరో వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశాడు! తిరువంబాడిలో ముస్లిం లీగ్ నేత ఖాసింపై అదే పేరుతో ఉన్న మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా కాలంసెరి స్థానంలో మంత్రి పి.రాజీవ్ కూడా ఇలాంటి పరీక్షే ఎదుర్కొంటున్నారు. రాజీవ్ పేరుతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. అంబలపుజ స్థానంలో సీపీఎం సీనియర్ నేత జి.సుధాకరన్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుధాకరన్ అనే పేరున్న మరో అభ్యర్థి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. కోయిలాండిలో కాంగ్రెస్ నేత కె.ప్రవీణ్కుమార్పై అదే పేరుతో ఉన్న మరో అభ్యర్థి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల పోటీ చేస్తున్న హరిపాద్ స్థానంలో రమేశ్ అనే మరో వ్యక్తీ బరిలో ఉన్నారు. ఇరింజలకుండ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి థామస్ ఉన్నితాన్కు థామస్ అనే స్వతంత్రుని నుంచి సవాలు ఎదురవుతోంది.బైపోర్లో గమ్మత్తుకోజికోడ్ జిల్లాలోని బైపోర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత పి.వి.అన్వర్ బరిలో ఉండగా అదే పేరుతో ఏకంగా మరో నలుగురు పోటీ చేస్తున్నారు! ఎల్డీఎఫ్ తరఫున పర్యాటక మంత్రి పి.ఎ.మహ్మద్ రియాజ్ పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరో ఇద్దరు కూడా బరిలో ఉన్నారు! వట్టియూర్కవు అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే వి.కె.ప్రశాంత్పై కె.ప్రశాంత్ అనే స్వతంత్రుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కె.మురళీధరన్ పోటీ చేస్తుండగా అదే పేరుతో మరో అభ్యర్థి కూడా బరిలో నిలిచారు.ప్రధాన పార్టీలకు ‘ప్రసాద్’చెర్తాల స్థానంలో ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరిదీ ఒకే పేరు కావడం విశేషం. ఎల్డీఎఫ్ నుంచి మంత్రి పి.ప్రసాద్, కాంగ్రెస్ నుంచి కె.ఆర్.రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు! ఇది చాలదన్నట్టు ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా స్వతంత్రునిగా ఇక్కడ బరిలో నిలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లూటీదార్లు!
పాలక్కాడ్/త్రిసూర్: సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలైన ఎ–టీమ్. అంతే తప్ప ఎవరికీ బి–టీమ్ కాదు’’ అని తేల్చిచెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చిచెప్పారు. కేరళ ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని అన్నారు.కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ‘మోదీ గ్యారంటీ’ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి ఎన్డీయేకు ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు.అన్ని కుంభకోణాలపై దర్యాప్తుకేరళను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆ రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి, జేబులు నింపుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేం గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని ప్రకటించారు.ఆ సొమ్మంతా కక్కిస్తాం పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో కేరళ రుణ భారం మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటేసిందరి మోదీ చెప్పారు. ‘‘ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్డీఎఫ్ నేతల జేబుల్లోకే వెళ్లింది. మేం రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కు నిధులు విడుదల చేశాం’’ అని చెప్పారు. ‘‘మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణంపై దృష్టి పెట్టాం.చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్లో ‘నారీశక్తి వందన్ అధినియమ్ చట్టం’ తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు. త్రిసూర్లో భారీ రోడ్ షో కేరళలోని త్రిసూర్లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. డోలు వాయించిన మోదీపాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం ‘చెండా’పై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలిబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక దాకా జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన అర నిమిషం పాటు కొన్ని బీట్లు వాయించి అలరించారు. సభలో ఇద్దరు చిన్నారులు పెయింటింగ్లను పట్టు కొని ఉండటం గమనించిన మోదీ, వా టిపై వాళ్లు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యు త్తరం పంపుతానన్నారు. ఆ పెయింటింగులను తీసుకో వాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైక్కు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది.కష్టకాలంలోనూ సత్తా చాటుతున్నాం: మన్ కీ బాత్లో మోదీసాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి క్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సహకారంతో దేశం దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పీఎం సూర్య ఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోందని, ఫిట్నెస్పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. జల సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలన్నారు. పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన ’జ్ఞాన్ భారతం సర్వే’లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.నీమమ్తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్కు చెందిన కె.శివన్కుట్టిపై బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.శబరీనందన్ పోటీలో ఉన్నారు.కళక్కొట్టం బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్రన్ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.వట్టియుర్కవుఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్నే యూడీఎఫ్ ఈసారీ పోటీకి పెట్టింది.మంజేశ్వరంబీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.పాల చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) చైర్మన్జోస్ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి.కప్పన్తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.నట్టికగత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్ ఈసారి బీజేపీ టికెట్పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది. మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.అరన్ములపత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్ వర్కుకి టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.త్రిసూర్గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్ నాయ కుడు వేణుగోపాల్కు టికెట్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు.పాలక్కాడ్ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్ కావాలనే హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్కు టికెటిచి్చందని సతీశన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్’ఇ.శ్రీధరన్కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్ పిశరోడికి టికెట్ ఇచ్చింది. -
కమ్యూనిస్టు కూటమికి ఎదురుగాలి
కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజక వర్గాల్లో ఓటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. మరోవైపు ఎన్డీయే కూటమి ఉనికి పెంచుకుంటుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్’ బలపడుతోంది. దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభు త్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్ధాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బల హీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభా వాల వల్ల ఎల్డీఎఫ్ బలహీనపడ్డ తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడుఅసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయ పరంపర కొనసాగించింది. ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడు గుల సంక్షేమం, పింఛన్లు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూని స్టుల సహజ సైద్ధాంతిక బలం, వ్యవస్థీకృత నిర్వహణ వంటివి దళితుల మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో... ఎన్నిక లకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది. వేగంగా మార్పులుకేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూట ముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర–పట్టణ ఓటర్ ఆకాంక్షలు; కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకులు’ బలహీనపడటం; కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ, తిరిగి పుంజుకుంటూ, యూడీఎఫ్ కిందటిఅసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం... ఈ మూడంశాలు ‘ఓటు రాజకీయాల్ని’ ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించ వచ్చు, లేదా ఓటు బ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్కైనా మేలు చేయ వచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువ నంతపురం కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే.... నికరంగా నష్ట పోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు. గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయ కుడు కె.సి. వేణుగోపాల్కు ఏఐసీసీలో ప్రాధాన్యం పెరగటంవంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్సభ ఎన్ని కల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళి తుల్లో బీజేపీ బలపడటం సీపీఎంకు ఆందోళన కలిగిస్తున్న అంశం. చీలిక విసిరిన సవాల్ దళిత ఉప కులాల్లో వచ్చిన చీలికలు అటు యూడీఎఫ్కు, ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతం. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉప కులాలున్నాయి. రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటికాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3–6 స్థానాలకు పెరిగితే, ఎల్డీఎఫ్ పట్టు 10–7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గం పైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది. అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టు కోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్ధాంతికంగా మంద గిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూని స్టులకు కొంత పట్టు సడలింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.ప్రజానాడి సంకేతాలే కీలకంప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి. అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థి తులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -దిలీప్ రెడ్డి -
కేరళని ధ్వంసం చేసింది వారే : మోదీ
కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల అయ్యప్ప దేవాలయంలో గోల్డ్ చోరీ నిందితులని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఈ సారి అధికార మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) కేరళలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టుల ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురంలో LDF, UDF ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని తెలిపారు. మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఇటీవల తిరువనంతరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆయన ప్రస్థావించారు. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న LDF, UDF కూటములకు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదిగిందన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ "రాబోయే ఎన్నికలు కేరళ స్థితిని గతిని రెండింటిని మారుస్తాయి. ఇప్పటివరకూ మీరు కేరళని రెండువైపుల నుంచే చూశారు. LDF, UDF రెండు కూటములు కేరళని ధ్వంసం చేశాయి. కానీ మూడోవైపు కూడా ఉంది అదే అభివృద్ధి, పరిపాలన అదే బీజేపీ" అని ఆయన అన్నారు. ఇంతకాలం ఈ రెండుకూటములు అవినీతి, లంచగొడితనం చేసి రాష్ట్రాన్ని బాగుపడకుండా చేశాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ "ముస్లీం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్" గా మారిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వికసిత్ కేరళగా మార్చే హామీ తనదని అన్నారు. LDF, UDF కూటములు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి ఆ రెండింటి పాలన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందని వారికి తెలుసని మారేది ప్రభుత్వమే.. పాలన కాదు ఆ రెండు పార్టీల విధానం ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని అది బీజేపీ పార్టీనేనని మోదీ స్పష్టం చేశారు.ఇటీవల తిరువనంతపురం ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతమని అక్కడ పాలించడానికి బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర యువతకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ఇండియా భారీ ఒప్పందాలు చేసుకుంటుందని అందుకే కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. -
కేరళలో బుజ్జగింపు రాజకీయాలు
తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్లపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రెండు పక్షాలు రాష్ట్రంలో అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా యన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన ప్రాంతంగా మార్చాయని మండిపడ్డారు. శనివారం ఆయన తిరువనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగించారు. పీఎఫ్ఐ అనుబంధ సంస్థలను కేంద్రం 2022లో చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. కేరళలో పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించే అధికారం ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆ సంస్థ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా వామపక్ష ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. ‘రాష్ట్రాభివృద్ధి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో మాత్రమే సాధ్యం. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు. వికసిత్ కేరళమ్ మాత్రమే వికసిత్ భారత్కు మార్గమని చెప్పారు. అందుకే, బీజేపీ లక్ష్యం ఇక నుంచి వికసిత్ కేరళమ్’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలో పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండటం కంటే రాష్ట్రాన్ని వికసిత్కు కేంద్రంగా మార్చడం ముఖ్యమైన విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ కేరళమ్ మిషన్ లోగోను ఆవిష్కరించారు. బీజేపీ, సీపీఎంలకు పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ప్రధానమైన తేడా ఒకటుందని చెబుతూ ఆయన..బీజేపీ కేడర్ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తే, సీపీఎం కేడర్ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయం మరార్జీ భవన్ను ప్రారంభించారు. -
Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ
కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. బీజేపీకి కేడర్ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవని ఏకైక రాష్ట్రం కేరళే. అయినా 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాదించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా కాషాయదళం కష్టపడుతోంది.క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకూ చేరువయ్యేందుకు ప్రయతి్నస్తోంది. ఫలితంగా పలు స్థానాల్లో పోటీ ఇప్పటికే త్రిముఖంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకూ శుక్రవారం రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపై ఫోకస్... త్రిసూర్రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటు డు సురేశ్ గోపి ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా నిలి చారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కణ్నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ విజయం సాధించారు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వడకర ఎంపీ కె.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమారుడు.నాలుగు పర్యా యా లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మురళీధరన్కు విన్నింగ్ మాస్టర్గా పేరుంది. సీపీఐ నుంచి మాజీ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. 35 శాతమున్న క్రిస్టియన్ ఓటర్లు నిర్ణాయకం కానున్నారు. 16 శాతమున్న ముస్లిం ఓట్లూ కీలకమే. ప్రధాని మోదీ ఇప్పటికే త్రిసూర్లో రోడ్డు షో జరిపారు. కరువన్నూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ స్కాం అధికార ఎల్డీఎఫ్కు ఇక్కడ ప్రతికూలంగా మారనుందని అంచనా.పాలక్కాడ్బీజేపీ ఆశలు, ఆకాంక్షలకు పాలక్కాడ్ నియోజకవర్గం కీలకం కానుంది. కేరళలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఇది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వీకే శ్రీకందన్ ఇక్కడ గెలిచారు. ఈసారి కూడా పార్టీ తరఫున ఆయనే బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి విజయ రాఘవన్కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ వరుసగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కృష్ణ కుమార్ 21.44 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తోంది.వయనాడ్ఇది 2009 లోక్సభ ఎన్నికల ముందు ఏర్పాటైన నియోజకవర్గం. అప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎం.ఐ.షానవాజ్ గెలిచారు. 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఖాయమని తేలడంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వయనాడ్ నుంచీ బరిలో దిగారు. అమేథీలో ఓడినా ఇక్కడ ఆయన ఏకంగా 4.31 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.ఎన్డీఏ అభ్యరి్థ, బీడీజే (ఎస్) నేత తుషార్ వెల్లప్పల్లికి 78,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం రాహుల్కు ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. అన్నీ రాజా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య. ఇక సురేంద్రన్ ఉత్తర కేరళలో గట్టి పట్టున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో పతనంతిట్టలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కు 64.9 శాతం ఓటర్లు రాగా, సీపీఎంకు కేవలం 25.24 శాతం ఓట్లే లభించాయి. ఎన్నికల ముందే ఇక్కడ కాంగ్రెస్కు షాక్ తగిలింది. కాంగ్రెస్ డీసీసీ జనరల్ సెక్రటరీ పీఎం సుధాకరన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహించారు. అమేథీ మాదిరిగానే వయనాడ్ నుంచి కూడా రాహుల్ పారిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. అట్టింగల్ఇక్కడ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ అదూర్ ప్రకాశ్ను కాంగ్రెస్ మరోసారి పోటీలో నిలిపింది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి వి.జోయ్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అదూర్ 2,80,995 ఓట్లతో (38.34 శాతం) గెలిచారు. సీపీఎం అభ్యర్థి అనిరుద్ధ్ సంపత్కు 34.5 శాతం, బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు 24.97 శాతం ఓట్లు లభించాయి. అట్టింగల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పథనంతిట్టఇక్కడ కూడా త్రిముఖ పోటీ వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడైన అనిల్ ఆంటోనీని బీజేపీ బరిలో నిలిపింది. సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీకి కాంగ్రెస్ మరోసారి అవకాశమిచి్చంది. సీపీఎం తరఫున మాజీ మంత్రి థామస్ ఇజాక్ పోటీలో ఉన్నారు. తన కుమారుడు ఓడాలని కోరుకుంటున్నానని, ఆంటో ఆంటోనీదే విజయమని ఏకే ఆంటోనీ ప్రకటించడం విశేషం!శబరిమల ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ కేథలిక్స్ క్రైస్తవులే కావడం విశేషం! 2019 లోక్సభ ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ 37.11 శాతం ఓట్లతో సీపీఎం అభ్యర్థి వీణా జార్జ్పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ 29 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా 2014లో 16 శాతానికి, 2019లో 29 శాతానికి పెరిగాయి.కాసర్గోడ్సిట్టింగ్ ఎంపీ రాజ్మోహన్ ఉన్నితాన్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సతీశ్ చంద్రన్పై ఆయన 1.4 లక్షల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈ విడత ఎంఎల్ అశి్వనికి అవకాశమిచ్చింది. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం మధ్యే ఉండనుంది. కొద్ది రోజులుగా సీపీఎం అభ్యర్థి ఎం.వి.బాలకృష్ణన్ పట్ల స్పష్టమైన మొగ్గు కన్పిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి ప్రజామద్దతు పెరుగుతోందని, మోదీ సర్కారుకు ఈసారి రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని అశ్విని అంటున్నారు. కేరళలో తిరువనంతపురం లోక్సభ స్థానంలో కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి హాట్రిక్ వీరుడు శశిథరూర్ పోటీలో ఉండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బీజేపీ బరిలో దింపింది. ఎల్డీఎఫ్ సంకీర్ణం తరఫున పి.రవీంద్రన్ (సీపీఐ) తలపడుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ: రాహుల్గాంధీపై ప్రధాని సెటైర్లు
తిరువనంతపురం: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల పాలనలో కేరళ పరిస్థితి దిగజారిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని పాలక్కాడ్లో సోమవారం(ఏప్రిల్ 15) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా లెఫ్ట్ ప్రభుత్వాలు ఎక్కడున్నా ఒకేలా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ యువరాజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు. కానీ కేరళ పజలకు ఉన్న ఒక్క సమస్యపైనా మాట్లాడడు’ అని రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని చురకంటించారు. మరోపక్క బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై సోమవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్గాంధీ విమర్శలు -
కేరళలో 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
తిరువనంతపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో విపక్షాల యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి తరఫున అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో దిగనుంది. కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉండగా మా పార్టీ 16 చోట్ల పోటీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. యూడీఎఫ్ కూటమి పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచి్చంది. సీట్లపంపకాల వివరాలను కాంగ్రెస్ కేరళ చీఫ్ కె.సుధాకరన్, యూడీఎఫ్ చైర్మన్ వీడీ సతీశన్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 16 చోట్ల, యూడీఎఫ్ కూటమి పార్టీ అయిన యునియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) రెండు చోట్ల, కేరళ కాంగ్రెస్(జాకబ్) పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ చెరో ఒక స్థానంలో పోటీకి నిలుస్తాయని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ చెప్పారు. కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తున్నందుకు బదులుగా కేరళలో వచ్చే దఫాలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం నుంచి ఐయూఎంఎల్కు కాంగ్రెస్ మద్దతు పలకనుంది. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలవడమే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమికి మద్దతివ్వాలని యూడీఎఫ్ నిర్ణయించుకుంది. -
ఆ రెండు పార్టీల చరిత్ర అవినీతికి మారు పేరు: ప్రధాని మోదీ
కొచ్చి: కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో పాల్గొని ప్రసంగించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయటంలో బీజేపీకి మాత్రమే ఘనమైన రికార్డు ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు పట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గడిచిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేరళలోని బీజేపీ కార్యకర్తలు ఎంత శక్తివంతులో త్రిస్సూర్లో ఏర్పాటు చేసిన ‘నారి శక్తి సమ్మేళనం’ కాన్ఫరెన్స్ ద్వారా అర్థమైందని మోదీ అన్నారు. అటువంటి వారే బీజేపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు. దేశంలోనే తక్కువ కాలంలో రికార్డు స్థాయితో అభివృద్ధి చెందుతూ... దేశ భవిష్యత్తు పట్ల సంపూర్ణమైన దార్శనికత ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? -
మణిపూర్ సమస్యను కామెడీగా మార్చేస్తారా?
వయనాడ్: మణిపూర్ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు. ‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్ అనే భావనకే మణిపూర్లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు. భారత్ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్ ప్రశ్నించారు. మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు. మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు. -
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
సోలార్ స్కాం: సరితా నాయర్కు 6 ఏళ్ల జైలు
కోజికోడ్: సోలార్ ప్యానెల్ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్ ప్రస్తుతం కోవిడ్తో క్వారంటైన్లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు. ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు గాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించా రు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్కు చెందిన అబ్దుల్ మజీద్ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
ఐసోలేషన్లో ఎమ్మెల్యే అభ్యర్థి.. అయోమయంలో కార్యకర్తలు
కొచ్చి: మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల వలన కూడా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, భారీగా జనాలు గుమిగూడడం వంటివి జరుగుతుండడంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. దీని ఫలితంగా తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి పాజిటివ్ తేలింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఐసోలేషన్లో ఉండడంతో ప్రస్తుతం కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎన్నికల సందర్భంగా ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ - యూడీఎఫ్) కొచ్చి అభ్యర్థి టోనీ చమ్మని ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అయితే తనకు కరోనా సోకిందని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని.. ప్రచారం చేయలేనని చెప్పేశారు. దీంతో పార్టీ నాయకులు, ఆయన అనుచరులు ఆందోళనలో పడ్డారు. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రజలను కలిసేందుకు అభ్యర్థి రాకపోతే దాని ప్రభావం పోలింగ్లో తెలుస్తుందని భయాందోళన చెందుతున్నారు. గెలిచే స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి టోనీ చమ్మని మాత్రం మీరు ప్రచారం చేసేయండి.. మనదే విజయం అని చెబుతున్నారు. ఈ విధంగా కరోనా వలన రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సీఎంకు మరో తలనొప్పి : రంగంలోకి కొత్త పార్టీ
సాక్షి, తిరువనంతపురం : రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)నేత మణి సీ కప్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు గాను ఒక కమిటీనీ ఏర్పాటు చేశారు. కేరళలో అధికార కూటమి ఎల్డీఎఫ్లో భాగంగానున్న ఎన్సీపీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లో చేరిన అనంతరం తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. కప్పెన్ కొత్త పార్టీ, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో 25వ రాజకీయ పార్టీగా అవతరించనుంది. కొత్త పార్టీ యోచనలో భాగంగా 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మణి సీ కప్సన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పార్టీ పేరు, చిహ్నం ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారాంతంలో పార్టీ పేరు తదితర వివరాలు వెల్లడికానున్నాయని అంచనా. ఏడు జిల్లాల ఎన్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర క్యాడర్లోని తొమ్మిది మంది నేతల మద్దతు ఉన్నట్టు ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్ యూడీఎఫ్లో చేరారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల నేతృత్వంలోని ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత కేఎం మణి మరణించడంతో, పాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు. అయితే, రానున్న ఎన్నికల్లో పాల స్థానంలో టికెట్ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఐ సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిర్ణయించడం ఎన్సీపీ ఎమ్మెల్యే మణి సీ కప్పన్కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి గుడ్పైచెప్పి యూడీఎఫ్లో చేరారు. ఆదివారం ఐశ్వర్య ర్యాలీలో మాట్లాడిన ఆయన ఎల్డీఎఫ్కు అధికారం దక్కదని, రాష్ట్రంలో ఈ పార్టీకి కాలం చెల్లినట్టేనని వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్కు ఎదురు దెబ్బ తగలనుంది. -
కేరళ ఎన్నికలు; ఓట్ల ‘ముసాయిదా’
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పక్షాలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు జూన్ ఒకటితో పూర్తికాబోతోంది గనుక ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. కేరళ ప్రజలిచ్చే తీర్పు విలక్షణంగా వుంటుంది. ఒకే ఒక్క పార్టీకి అధికారం కట్టబెట్టే సంప్రదాయం అక్కడలేదు. కూటములుగా వెళ్తేనే ఆదరణ లభిస్తుంది. అలాగే వరసగా రెండు దఫాలు అధికారం ఇచ్చే సంప్రదాయం కూడా 80వ దశకం తర్వాత పోయింది. ఆ లెక్క ప్రకారం ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు అవకాశం రావాల్సి వుంది. కానీ గతంతో పోలిస్తే 2018నాటి శబరిమల వివాదం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎంతో కొంత పుంజుకుంది. అందుకే కావొచ్చు... తాము అధికారంలోకొచ్చాక శబరిమలలో 10–50 ఏళ్ల మధ్యనున్న ఆడవాళ్లు ఆలయ ప్రవేశం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అందుకు సంబంధించి ‘అయ్యప్ప భక్తుల(మత సంబంధ ఆచారాల, సంప్రదాయాల, వాడుకల పరిరక్షణ) ముసాయిదా బిల్లును కూడా రూపొందించింది. ఈ ముసాయిదా ప్రకారం ఆలయ ప్రధాన పూజారి ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు ఏమిటన్నది నిర్ణయి స్తారు. వీటిని ఉల్లంఘించినవారు రెండేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వున్న విధి నిషేధాలపై చాన్నాళ్లుగా వివాదం వుంది. ఆ విషయంలో దాఖలైన పిటిషన్లపై 2018లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువరిస్తూ మహిళలకు ఏ కారణం చూపి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించినా అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం మత విశ్వాసాలను న్యాయస్థానాలు ప్రశ్నించజాలవని, అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ప్రజలు ఆచరిస్తారని... అందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తెలిపారు. ప్రస్తుతం అది ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో వుంది. ఆ తీర్పు ఏవిధంగా వుంటుందో చూడాల్సివుంది. ఈలోగానే కాంగ్రెస్ ఈ ముసాయిదా బిల్లుతో హడావుడి చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తీర్పు భక్తుల మనో భావాలకు అనుగుణంగా వచ్చేలా మెరుగైన వాదనలు వినిపిస్తామని, అది త్వరగా వెలువడేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని చెప్పటం వరకూ ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో వున్న ఒక వ్యవహారంలో చట్టం తీసుకొస్తామని చెప్పటమే కాదు... ముసాయిదాతో సహా సిద్ధమైపోవటం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట. శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు బీజేపీ, కాంగ్రెస్లతోసహా అందరూ స్వాగతించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్, సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు మాత్రమే కాదు... ఆరెస్సెస్ సైతం అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలన్న తీర్పుతో ఏకీ భవించారు. అయితే ఆ తర్వాత బీజేపీ, ఆరెస్సెస్లు వెనక్కి తగ్గాయి. అయ్యప్ప భక్తుల మనో భావాలకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్టు ఆ రెండు సంస్థలూ ప్రకటిం చాయి. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, రాహుల్గాంధీ కూడా మొదట్లో ఆ తీర్పును సమర్థిస్తు న్నట్టు తెలిపారు. కానీ ఆ తర్వాత పీసీసీ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరి తీసుకుంది. ఆ తీర్పు నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో బీజేపీ, కాంగ్రెస్లు పోటాపోటీగా పాల్గొన్నాయి. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించింది. 20 స్థానాల్లో 19 దక్కించుకుంది. సీట్లు రాకపోయినా బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. కానీ నిరుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. యధా ప్రకారం బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరిగింది. నగర ప్రాంతాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు చెరో మూడు కార్పొరేషన్లు వచ్చాయి. ఈ పరిస్థితే యూడీఎఫ్ను కలవరపెడుతోంది. ఎందుకంటే 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక యూడీఎఫ్ కూటమిని ఓడించి ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ధోరణే కొనసాగింది. అలాగే యూడీఎఫ్ భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్ మణి వర్గం రెండుగా చీలి, బలమైన వర్గం ఎల్డీఎఫ్లో చేరింది. ఇది కూడా తనకు నష్టం కలిగిస్తుందన్న భయం కాంగ్రెస్కు వుంది. ఫలితంగానే ఈ ముసాయిదా బిల్లు బయటికొచ్చింది. హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు పాటు పడుతున్నట్టు కనిపించేందుకు బీజేపీ మొదటినుంచీ ప్రయత్నిస్తోంది. దాన్ని మరింత పెంచుకునేందుకు కావొచ్చు... కేరళలో యూపీ తరహా లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చి హిందూ, క్రైస్తవ మతాల ఆడపిల్లలను రక్షిస్తామంటోంది. కాంగ్రెస్ కూడా దానితో పోటీ పడాలని చూస్తున్నదని శబరిమల బిల్లు తీరు చెబుతోంది. ఎన్నికల్లో లేవనెత్తడానికి, అధికార పక్షాన్ని విమర్శించడానికి కేరళలో సమస్యలకేమీ కొదవలేదు. అక్కడ యూడీఎఫ్ను గతంలో ఇరకాటంలో పడేసిన సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయరే ఎల్డీఎఫ్ నేతల ఆసరాతో కొందరికి ప్రభుత్వోద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణలు గుప్పుమంటు న్నాయి. బంగారం స్మగ్లింగ్ కేసు సరేసరి. పాలనాపరంగా వుండే లోటుపాట్లనూ, ఇతరత్రా సమస్య లనూ లేవనెత్తి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తేనే కాంగ్రెస్కు, దాని నేతృత్వంలోని యూడీఎఫ్కూ భవిష్యత్తు వుంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మెలిగితే ప్రజలు దాన్ని గ్రహించలేనంత తెలివితక్కువవారు కాదు. -
ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో అక్టోబర్ 21న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వట్టియూర్కావు, కొన్ని, ఆల్రూర్, ఎర్నాకుళం, మంజేశ్వరమ్ స్థానాలలో ఉపఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నాలుగు స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షం యూనియన్ ముస్లిం లీగ్ ఓ స్థానంలో పోటీ చేయనుంది. టీజీ వినోద్, (ఎర్నాకుళం), ఏడీవీ శానిమోల్ ఉస్మాన్, (ఆరూర్), పి.మోహన్ రాజ్న్,(కొన్ని) (వట్టియూర్కావు) నుంచి కె.మోహన్ కుమార్ బరిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల జాబితాను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. గత వారం కేరళలోని పాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన యూనైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ సాంప్రదాయక ఓటు బ్యాంకును కోల్పోవడం యూడీఎఫ్ను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం త్వరలో జరిగే ఉపఎన్నికలపై పడుతుందేమోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్లోని ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏ మేరకు విజయావకాశాలను దెబ్బతీస్తాయోనని పార్టీ నాయకులు మదనపడుతున్నారు. -
నో మోదీ.. కేరళ బ్యూటీ అదే: బాలీవుడ్ హీరో
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్షన్ హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘మద్రాస్ కేఫ్’, ‘సత్యమేవ జయతే’, ‘బాట్లా హౌస్’ వంటి వరుస హిట్లతో ఈ హీరో దూసుకపోతున్నాడు. అయితే గతంలో సినిమాలు తప్ప వేరే జోలికి వెళ్లని జాన్ అబ్రహం.. ఈ మధ్యకాలంలో రాజకీయ విషయాలను ప్రస్తావిస్తూ హాట్ టాపిక్గా మారాడు. బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదని, పరిశ్రమ మతపరంగా చీలిపోయిందని, ఇది అక్షర సత్యమని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జాన్ పలు రాజకీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్కు గురిచేశాడు. కేరళ ఇంకా ఎందుకు మోదీ వశం కాలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘దటీజ్ బ్యూటీ ఆఫ్ కేరళ’అంటూ సమాధానమిచ్చాడు. దీంతో అక్కడి వారంతో ఆశ్యర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానికి వివరణ కూడా ఇచ్చాడు. ‘కేరళలో ప్రతీ పది మీటర్లకొక టెంపుల్, మసీద్, చర్చిలు ఉంటాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా మతపరమైన గొడవలు జరగలేదు. జరగవు కూడా. ప్రపంచ వ్యాప్తంగా చూసినా అన్ని మతాల వారు ప్రశాంత వాతావరణంలో జీవించే రాష్ట్రం కేరళ మాత్రమే. అంతేకాకుండా చాలావరకు మలయాళీ ప్రజల్లో కమ్యూనిజం భావజాలం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణించినపుప్పుడు ఒక్క కేరళ మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆయనకు సంబంధించిన ఫ్లేక్సీలు, నివాళులు అర్పించడం చూడలేదు. మా నాన్న ఎక్కువగా నన్ను కమ్యూనిజంకు సంబంధించిన విషయాలను తెలుసుకునేలా ప్రభావితం చేశారు. సమానత్వం, అందరికీ సమాన సంపద అనే వాటిని నమ్ముతున్నాం కాబట్టే కేరళ రోజురోజుకు అభివృద్ది చెందుతోంది’అంటూ జాన్ అబ్రహం పేర్కొన్నాడు. ప్రస్తుతం జాన్ అబ్రహం వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. కొందరు అబ్రహంకు మద్దతు నిలవగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. అబ్రహం చేసిన వ్యాఖ్యల్లో పెద్ద అంతరార్థమే దాగుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి హవా నడిచినా.. కేరళలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 19 స్థానాల్లో గెలిచి బలమైన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’ చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అక్షయ్ చిత్రానికి ధీటుగా బాట్లా హౌస్ కలెక్షన్లను సాధించింది. చదవండి: బాలీవుడ్పై బాంబ్ పేల్చిన హీరో! -
చితక్కొట్టుకున్న కార్యకర్తలు.. వీడియో వైరల్
తిరువనంతపురం : కేరళలోని కొల్లాంలోని పూయపల్లిలో రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన కేరళలో పోలింగ్ జరుగనున్న 20 లోక్సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన ఆదివారం పూయపల్లిలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండాలతోనే ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. -
కేరళలో కాంగ్రెస్ దశ తిరిగినట్టేనా?
ఎన్నికల్లో విజయావకాశాలనేవి ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తరుగుతాయో కచ్చితంగా చెప్పలేమంటారు. చివరి క్షణం వరకూ పరిస్థితులు మారుతూనే ఉంటాయి. కాంగ్రెస్ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. దేశవ్యాప్త పరిస్థితి ఏమిటన్నది పక్కనపెడితే.. కొంత ఊగిసలాట తరువాత కేరళలోని వయనాడ్ నుంచి పోటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధపడటంతో ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి పంట పండిందని అంటున్నారు పరిశీలకులు. కేరళలో ఐదేళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. ప్రజలు ఒకసారి వామపక్షాలతో కూడిన లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్కు పట్టం కడితే.. మరోసారి కాంగ్రెస్ ఐయూఎంఎల్ తదితర పార్టీలతో కూడిన యూడీఎఫ్కు అధికారమివ్వడం కద్దు. ఇందుకు తగ్గట్టుగానే ఈసారి యూడీఎఫ్దే అధికారమని చాలామంది భావించారు. అయితే చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కొంత అసందిగ్ధత ఏర్పడింది. కానీ, వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఖరారు కావడంతో యూడీఎఫ్లో కొత్త జోష్ వచ్చింది. అంతేకాదు.. కన్నూర్ జిల్లా వడకర నుంచి కె.మురళీధరన్ పోటీపై నెలకొన్న అస్పష్టత కూడా తొలగిపోవడంతో ఈ కూటమి ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలకు ఇంకా 22 రోజులు ఉండటం.. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులను నిలపడం వంటి కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈసారి యూడీఎఫ్ కేరళలో అత్యధిక స్థానాలనుకైవసం చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. రాహుల్ అభ్యర్థిత్వం కీలకం కేరళ ఎన్నికల ఫలితాలను రాహుల్ అభ్యర్థిత్వం బాగా ప్రభావితం చేస్తుందని అంచనా. వయనాడ్, కోజికోడ్, మళ్లపురం జిల్లాలతో కూడిన వయనాడ్ గాంధీ కుటుంబానికి సురక్షితమైన స్థానంగానే భావిస్తున్నారు. ప్రధాని అభ్యర్థి ఒకరు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటే.. దాని ప్రభావం ఇరుగు పొరుగున ఉండే మలబార్, పాలక్కాడ్, కాసరగోడ్ ప్రాంతాల ఎన్నికలపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ యూడీఎఫ్కు కలిసొచ్చే అంశాలు. అయితే మధ్య కేరళ ప్రాంతంలో మాత్రం యూడీఎఫ్కు గట్టి పోటీ ఎదురవుతోంది. చాలక్కుడి, ఇడుక్కి జిల్లాల్లో గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ చేతిలో యూడీఎఫ్ ఓటమి పాలైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక యూడీఎఫ్కు బాగా పట్టున్న ఎర్నాకుళంలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.వి.థామస్ను పక్కనబెట్టి యువ హిబీ ఈడెన్ను బరిలోకి దింపింది. ఎల్డీఎఫ్ కూడా పి.రాజీవ్ రూపం లో ఓ యువ అభ్యర్థిని నిలిపినప్పటికీ ఈసారి హిబి ఈడె న్కు అవకాశం ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు. కొట్టాయంలో రసకందాయం 2014 ఎన్నికల్లో ఇక్కడ యూడీఎఫ్ భాగస్వామి కేరళ కాంగ్రెస్ లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందింది. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నా.. ఈ పార్టీని వ్యతిరేకించే నేతల మద్దతుతో యూడీఎఫ్ ఈసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ ఈ స్థానానికి కొత్త అభ్యర్థిని ప్రకటించడం ఆ కూటమికి నష్టం చేకూర్చే అంశంగా పరిగణిస్తున్నారు. కొట్టాయానికి పొరుగున ఉన్న పథనంతిట్టలో సిట్టింగ్ ఎంపీ ఆంటోనీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎల్డీఎఫ్ ఈ స్థానంలోని క్రిస్టియన్ మెజార్టీ ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో అరణ్మూల ఎమ్మెల్యే వీణా జార్జ్ను బరిలోకి దింపింది. అయితే ఆర్థడాక్స్ చర్చ్ ఎల్డీఎఫ్కు వ్యతిరేకమన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందన్న భావన కూడా ఇక్కడ ఉంది. శబరిమల అంశం తనకు కలిసివస్తుందని పథనంతిట్ట బీజేపీ అభ్యర్థి కె.సురీంద్రన్ భావిస్తున్నప్పటికీ పూంజార్, కంజీరప్పళ్లి అసెంబ్లీ స్థానాలు యూడీఎఫ్కు అనుకూలంగా ఉండటం వల్ల ఫలితం ఆసక్తికరంగా మారనుంది. దక్షిణ కేరళ పరిస్థితి... కేరళ దక్షిణ ప్రాంతంలోని చాలా స్థానాల్లో శబరిమల అంశం ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా.. యూడీఎఫ్కు అనుకూలంగా మారనుందని అంచనా. రాజధాని తిరువనంతపురంలో 2014 నాటి ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్కు బీజేపీ అభ్యర్థి ఒ.రాజగోపాల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ను బరిలోకి దింపింది. అయితే ముక్కోణపు పోటీ కావడం శశిథరూర్కు కలిసివస్తుందని, ఎల్డీఎఫ్ అభ్యర్థి సి.దివాకరన్ మూడోస్థానానికి పరిమితమవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటింగళ్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి ఎ.సంపత్కు కొంత మొగ్గు ఉన్నట్టు కనిపిస్తున్నా అదూర్ ప్రకాశ్ రూపంలో కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిని నిలపడంతో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. కొల్లంలోనూ పరిస్థితి ఇదే తీరున ఉండనుంది. యూడీఎఫ్కు గట్టి పట్టున్న పొన్నానిలో ఈసారి తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది. నీలంబర్ ఎమ్మెల్యే పి.వి.అన్వర్కు ఉన్న ధనబలం ఐయూఎంఎల్ అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్ను ఓడిస్తుందన్నది ఎల్డీఎఫ్ అంచనా. అయితే వయనాడ్లో రాహుల్గాంధీ పోటీ ప్రభావం దీనిపై ఉంటుందని, కోజికోడ్, కన్నూర్, వడక్కరలోనూ ఇదే పరిస్థితి అని పరిశీలకులు భావిస్తున్నారు. కాసరగోడ్ సీపీఎంకు బలమైన స్థానమైనప్పటికీ అక్కడి నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్మోహన్ ఉన్నితన్ పోటీ చేస్తుండటం ఎల్డీఎఫ్కు వ్యతిరేక ఫలితాలు వచ్చేందుకు కారణమవుతుందని అంచనా. -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
ఢిల్లీ నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించారు. గతంలో డొమెస్టిక్ విమానాలలో ప్రయాణించే వారి నుంచి యూడీఎఫ్ను రూ.275 నుంచి గరిష్టంగా రూ.550 వరకు తీసుకునేవారు. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.635 నుంచి గరిష్టంగా రూ.1,270 చెల్లించేవారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్లే విమాన ప్రయాణికులు సాధారణ యూడీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు నిజంగా శుభవార్తే. కొత్త చార్జీలతో డొమెస్టిక్ సర్వీస్ ప్రయాణికులకు రూ.233 నుంచి 466 వరకు ఆధా అవగా, ఇంటర్నేషనల్ సర్వీస్ ప్యాసింజర్స్కు రూ.518 నుంచి గరిష్టంగా రూ.1,048 వరకు భారం తగ్గనుంది. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ 2015 డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిపాదన చేయగా రెండున్నరేళ్ల తర్వాత యూడీఎఫ్ ధరలు సవరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అధికారులు తెలిపారు. -
కాంగ్రెస్తో మాకు అటిట్యూడ్ ప్రాబ్లం!
కేరళలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కాంగ్రెస్-ఎం షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) నుంచి తప్పుకొంటున్నట్టు కాంగ్రెస్-ఎం ప్రకటించింది. యూడీఎఫ్ నుంచి తప్పుకోవడమే కాకుండా హస్తంతో దోస్తీని కూడా తెగదెంపులు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్-ఎం అధినేత కేఎం మణి ప్రకటించారు. యూడీఎఫ్ నుంచి తాము వైదొలగడానికి కేరళ కాంగ్రెస్ నేతల అటిట్యూడ్ (ధోరణి)యే కారణమని ఆయన పేర్కొన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి తీరు కారణంగానే తాము వేరవుతున్నట్టు చెప్పారు. అయితే, అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్లోనూ తాము చేరబోమని, స్వతంత్రంగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా, యూడీఎఫ్ భాగస్వామిగా కాంగ్రెస్ ఎం పార్టీ మూడు దశాబ్దాలపాటు కొనసాగింది. కాంగ్రెస్ ఎం తమతో దోస్తీకి కటీఫ్ చెప్పడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
ప్రతిపక్షంలో పడతులు సున్నా!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. 140 స్థానాలున్న కేరళ శాసనసభలో కేవలం 8 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరంతా ఎల్డీఎఫ్ కు చెందినవారే కావడం విశేషం. అధికారం కోల్పోయిన యూడీఎఫ్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా పోవడం గమనార్హం. ఊమెన్ చాంది ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళా ఎమ్మెల్యే పీకే జయలక్ష్మి ఓడిపోయారు. మే 16న జరిగిన తాజా ఎన్నికల్లో 109 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సీపీఎం నుంచి ఐషా పొట్టి, కేకే శైలజ, మెర్కికుట్టి అమ్మ, వీణా జార్జి, యు ప్రతిభ హరి గెలుపొందారు. సీపీఐ నుంచి ఈఎస్ బీజీ మోల్, గీతా గోపి, సీకే ఆశ విజయం సాధించారు. గత అసెంబ్లీలో అధికార పక్షం నుంచి ఒకరు, విపక్షం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
ఉమెన్ చాందీ రాజీనామా
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తన పదవికీ రాజీనామా చేశారు. శుక్రవారం పదిన్నర గంటల ప్రాంతంలో తన రాజీనామా లేఖను గవర్నర్ పీ సదాశివంకు అందించారు. గవర్నర్ బంగ్లాకు స్వయంగా వెళ్లి నమస్కరించిన చాందీ.. ఆ తర్వాత రాజీనామా లేఖ సమర్పించి బయలుదేరారు. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వామపక్ష కూటమి చేతిలో చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎల్డీఎఫ్ ఇక్కడ విజయాన్ని సాధించింది. దీంతో సంప్రదాయం ప్రకారం చాందీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు 91 స్థానాలు రాగా.. చూడీఎఫ్ కు కేవలం 46 స్థానాలు మాత్రమే వచ్చాయి. -
కేరళ అసెంబ్లీకి వారసుల పోటీ
తిరువనంతపురం: దేశంలో వారసత్వ రాజకీయాలకు తెరదించాలని ఎవరు ఎంత మొత్తుకున్నా అనాదిగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 16, 27న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో కూడా 140 స్థానాలకుగాను ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీలో ఉన్నారు. సహజంగానే అధికార పక్షమైన యూడిఎఫ్ నుంచే ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ వారసత్వం అనకపోవచ్చేమోగానీ ఈసారి సముచిత స్థానాలను దక్కించుకోవాలని ఆశిస్తున్న బీజేపీ నుంచి భార్యా భర్తలు పోటీ చేస్తున్నారు. యూడీఎఫ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల సంబంధీకులు 17 మంది పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు కే. కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాల్ త్రిస్సూర్ నియోజక వర్గం నుంచి, కుమారుడు కే. మురళీధరన్ వట్టియురుకావు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, మాజీ సీఎం మొహమ్మద్ కోయ కుమారుడు ఎంకే మునీర్, మాజీ డిప్యూటి సీఎం అవుకాది కుట్టి నహా కుమారుడు పీకే అబ్దూరబ్బ్, మాజీ మంత్రి టీఎం జాకబ్ కుమారుడు అనూప్ జాకోబ్, మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఈడెన్ కుమారుడు హిబీ ఈడెన్, మాజీ మంత్రి బేబీ జాన్ కుమారుడు శిబూ బేబీ జాన్, మాజీ మంత్రి పీఆర్. కురూప్ కుమారుడు కేపీ మోహనన్, ఎంపీ వీరేంద్ర కుమార్ కుమారుడు ఎంవీ. శ్రేయమ్స్ కుమార్, మాజీ మంత్రి కే. నారాయణ కురూప్ కుమారుడు డాక్టర్ ఎన్. జయరాజ్, మాజీ ఎమ్మెల్యే పీ.సీతిహజి కుమారుడు పీ.బషీర్, మాజీ స్పీకర్ కార్తికేయన్ కుమారుడు కేఎస్. శబరినాథన్, మాజీ మంత్రి ఎన్. రామకష్ణన్ కూతురు అమతా రామకష్ణన్, మాజీ ఎమ్మెల్యే తొప్పిలి రవి కుమారుడు సూరజ్ రవి, మాజీ ఎమ్మెల్యే కేకే. థామస్ కుమారుడు సిరియాక్ థామస్, మంత్రి ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్, మాజీ ఎమ్మెల్యే కేసీ. చరియన్ భార్య మరియమ్మ చరియన్లు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ నుంచి ఎనిమిది మంది వారసులు పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి ఆర్ బాలకష్ణ పిళ్లై కుమారుడు కేబీ. గణేష్ కుమార్, మాజీ మంత్రి నీలాలోహిత్ దాస్ భార్య జమీలా ప్రకాశమ్, మాజీ సీఎం పీకే. వాసుదేవన్ నాయర్ కూతురు శారదా మోహన్, మాజీ మంత్రి ఎంవీ. రాఘవన్ కుమారుడు ఎంవీ. నికేష్ కుమార్, మాజీ మంత్రి వీకే. రాజన్ కుమారుడు వీఆర్. సునీల్ కుమార్, మాజీ మంత్రి కేఎం. జార్జి కుమారుడు కే. ఫ్రాన్సిస్ జార్జి, మాజీ ఎమ్మెల్యే పీఐ. పాలోజ్ కుమారుడు సజూ పాల్, మాజీ ఎమ్మెల్లే ఎంకే. కేశవన్ కుమారుడు కే. అజిత్ పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి శోభా సురేంద్రన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఆమె భర్త కేకే. సురేంద్రన్ పొన్నాని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. -
కేరళ స్థానిక ఎన్నికల్లో ఎల్డీఎఫ్ జయభేరి
♦ చతికిలబడ్డ అధికార యూడీఎఫ్ ♦ మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని అధికార యూడీఎఫ్కు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా పరిగణించిన ఈ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని విపక్ష ఎల్డీఎఫ్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ తాజాగా ఒక మున్సిపాలిటీలో గెలవడంతోపాటు 14 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. ముఖ్యంగా 100 వార్డులుగల తిరువనంతపురం కార్పొరేషన్లో 34 వార్డుల్లో గెలుపొందింది. మొత్తం ఆరు కార్పొరేషన్లకుగాను నాలుగు కార్పొరేషన్లు, 86 మున్సిపాలిటీలకుగాను 45 మున్సిపాలిటీలు, 941 గ్రామ పంచాయతీలకుగాను 545 పంచాయతీల్లో ఎల్డీఎఫ్ విజయదుంధుభి మోగించింది. యూడీఎఫ్ రెండు కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలు, 366 గ్రామ పంచాయతీల్లోనే గెలుపొందింది.


