సాక్షి,పాడేరు: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పటివరకు పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,512 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పాడేరులో 2,297 మంది, అరకులోయ నియోజకవర్గంలో 2,242 మంది, రంపచోడవరంలో 2,973 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. హోం ఓటింగ్ను మంగళవారం జిల్లాలో 202 మంది వయో వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
ఓటింగ్ ప్రక్రియ పరిశీలన
రంపచోడవరం: స్థానిక ఏపీఆర్ బాలికల పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం పరిశీలించారు. రంపచోడవరం ఆర్వో ప్రశాంత్కుమార్, చింతూరు పీవో చైతన్యతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
అరకులోయ రూరల్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం 987 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి
అభిషేక్ తెలిపారు.
7,512 మంది ఉద్యోగులు వినియోగం
కలెక్టర్ విజయసునీత