రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన కలియుగదైవం ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం శ్రీవారు భక్తులకు హనుమద్ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. హనుమద్ వాహనోత్సవ సేవలో భాగంగా సుగాలి సంఘం ఆధ్వర్యంలో మేళతాళాలతో సాయంత్రం స్వామి వారిని హనుమద్ వాహనంపై కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి కోట, మొలకాల్మూరు రోడ్డు, వినాయక సర్కిల్, పాతబస్టాండ్, లక్ష్మీబజార్ మీదుగా ఊరేగించి..తిరిగి ఆలయానికి చేర్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, ఈఓ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి పెళ్లికి భక్తులంతా అతిథులే
రాయదుర్గం: కోటలోని ప్రసన్న వెంకటరమణుడి ఆలయంలో శనివారం విశిష్ట సంప్రదాయ పద్ధతులతో జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులంతా అతిథితులుగా తరలిరానున్నారు. శుక్రవారం వరుడిగా వెంకటేశ్వరుడు, వధువుగా అరవ తెగకు చెందిన 14 ఏళ్ల బాలికను ముస్తాబు చేశారు. శనివారం ఉదయం కన్యాదాత స్వగృహం నుంచి వరుడు ఉండే వేంకటరమణుడి ఆలయం వరకు చేపట్టే ఊరేగింపునకు చేసిన ఏర్పాట్లను ఆలయ ఈఓ నరసింహారెడ్డి పరిశీలించారు. 11:30 గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టి సంప్రదాయ పద్ధతి ప్రకారం కల్యాణం జరిపించనున్నారు.