
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు 3.48 కోట్ల మంది అర్హులుగా తేలారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన వారికి మే 1వ తేదీ నుంచి టీకా వేయవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారో లెక్కించింది. వ్యాక్సిన్ వేసేందుకు 3,48,24,227 మంది అర్హులు ఉన్నట్టు తేలింది.
వీరిలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే 2,04,70,364 మంది ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు 46,14,577 మంది టీకా వేయించుకున్నారు. వీరిలో 40,15,948 మంది తొలిడోసు వేయించుకోగా, 5,98,629 మంది రెండో డోసు కూడా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 60 ఏళ్లు దాటిన వారు 16,43,124 మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ వేయాల్సి ఉండటంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలతో మాట్లాడారు. కంపెనీలతో పూర్తిగా చర్చలు జరిపాక ఎన్ని దశల్లో వ్యాక్సిన్ రాష్ట్రానికి వస్తుందో చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment