భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీలో మారుమూల గ్రామాల ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ అన్నారు. వర్షకాలం వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అస్వస్థతకు గురైన వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. జాతీయ డెంగీ డే సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై ఆదివాసీ గిరిజనులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లోని గుంతలు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, నీటి తొట్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.
‘పినపాక’ ప్రజల సహకారం మరువలేనిది
మణుగూరురూరల్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు పినపాక నియోజకవర్గ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, ఇందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత మండలాలైన గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం తదితర మండలాల్లో కూడా ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగియడం ప్రశంసనీయమని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బాధ్యత వహించిన మణుగూరు తహసీల్దార్ వి. రాఘవరెడ్డికి, నాయబ్ తహసీల్దార్, ఎన్నికల డీటీ నాగరాజుతో పాటు రెవెన్యూ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్