
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది.
యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే..
కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది.
అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్లను తీసుకుని వాటిని యూజర్కు తెలిసేలా ప్లేస్టోర్లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!