సాక్షి, అమలాపురం: కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్కు ప్రతిపాదించిన అలైన్మెంట్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం రైల్వే లైన్ అలైన్మెంట్పై ఆయన మాట్లాడారు. భట్నవిల్లి– గుడిమెళ్లంక వరకూ ఉన్న ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ వెళుతున్న గ్రామాల్లో గత నెలలో వివిధ శాఖల అధికారులతో సర్వే చేశామన్నారు. అలైన్మెంట్లో సమస్యలను గుర్తించి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించారని తెలిపారు. రాజోలు సమీపంలో పలుచోట్ల గెయిల్ పైప్లైన్లు, మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామంలో పదెకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని, ఆ చెరువుపై ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ వెళుతుందన్నారు. దీనిపై స్థానిక ప్రజలను ఒప్పించాల్సి ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జేసీ టి.నిషాంతి, ఆర్డీఓలు కె.మాధవి, శ్రీకర్, కతీబ్ కౌశర్ బానో, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామలింగరాజు పాల్గొన్నారు.
21 నుంచి వాడపల్లి
వెంకన్న బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ నల్లం చక్రధరరావు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పందిరి రాట కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో స్వామివారికి కల్యాణం, మహా సుదర్శన హోమం, అష్టోత్తర కలశాభిషేకం, సుప్రభాత సేవ, నవగ్రహ హోమం, లక్ష కుంకుమార్చన, మహాపుష్ప యాగం, శ్రీవేంకటేశ్వరస్వామి హోమం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ తదితర ఆర్జీత సేవలు నిర్వహిస్తారని ఈఓ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment