అదరగొట్టిన అమ్మాయిలు | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అమ్మాయిలు

Published Tue, Apr 23 2024 8:25 AM

- - Sakshi

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

జిల్లాలో 83.20 శాతం ఉత్తీర్ణత

గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

ప్రైవేటుకు దీటుగా రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

సాక్షి, రాజమహేంద్రవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా అమ్మాయిలు అదరగొట్టారు. గత నెల 18 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ సోమవారం విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా 23,367 మంది ఈ పరీక్షలకు హాజరు కాగా 19,441 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం 70.32 కాగా ఈసారి అది 83.2 శాతానికి ఎగబాకడం విశేషం. రాష్ట్రంలో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఈసారి సున్నా శాతం ఫలితాలు సాధించిన పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. ఈ పరీక్షల్లో మొత్తం 3,926 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి వచ్చే నెల 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు రీ వెరిఫికేషన్‌, కౌంటింగ్‌కు ఈ నెల 30వ తేదీ రాత్రి 11 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

పెరిగిన ఉత్తీర్ణత

గత ఏడాది పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 22,465 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 15,798 మంది ఉత్తీర్ణులై 70.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. 11,334 మంది బాలురకు 7,641 మంది (67.42 శాతం), 11,131 మంది బాలికలకు 8,157 మంది (73.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 11,410 మంది ప్రథమ, 2,875 మంది ద్వితీయ, 1,513 మంది తృతీయ శ్రేణుల్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 12.7 శాతం పెరిగి, 83.2 శాతంగా నమోదు కావడం విశేషం.

ప్రభుత్వ ప్రోత్సాహంతో..

విరిగిన కుర్చీలు.. కనీస వసతులకు కూడా నోచుకోని తరగతి గదులు.. ఒకే గదిలో కిక్కిరిసిన విద్యార్థులతో అవస్థలు.. ఆపై బోధనా సిబ్బంది కొరతతో అల్లాడుతున్న అధ్యాపకులు.. అందని ద్రాక్షగా మారిన మెరుగైన విద్యా బోధన.. ఇదీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. నిరాదరణకు గురై, వసతుల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. బోధనా సిబ్బంది కొరత తీర్చారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై పాఠ్యాంశాల బోధన దిశగా అడుగులు వేశారు. కాలికి వేసుకునే బూట్ల నుంచి.. యూనిఫాం, బ్యాగ్‌, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు.. రోజుకో రుచికరమైన వంటకాలతో మధ్యాహ్న భోజనం.. ఇలా అనేకం విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఫలితంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని రీతిలో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు.

ప్రత్యేక శ్రద్ధతో..

విద్యార్థుల ప్రగతిపై ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. టెన్త్‌లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్‌ పెట్టి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా తీర్చిదిద్దారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేసి, తిరిగి రివిజన్‌ చేయడంతో విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాసేలా శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులతో తరచుగా సమావేశమై, తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి, వారి ప్రతిభను గుర్తించారు. వెనుకబడవుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నమూనా పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించి, వాటిలో మార్కుల సాధనపై విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఫలితంగా విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించారు. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

జిల్లాలో టెన్త్‌ ఫలితాలు ఇలా..

పరీక్షకు హాజరైన విద్యార్థులు : 23,367

ఉత్తీర్ణులైన వారు : 19,441

ఉత్తీర్ణత శాతం : 83.20

ప్రథమ స్థానం : 14,684

ద్వితీయ : 3,101

తృతీయ : 1,656

పరీక్షకు హాజరైన బాలికలు : 11,430

ఉత్తీర్ణులు : 9,793

ఉత్తీర్ణత శాతం : 85.68

పరీక్షకు హాజరైన బాలురు : 11,937

ఉత్తీర్ణులు : 9,648

ఉత్తీర్ణత శాతం : 80.82

1/1

Advertisement
Advertisement