జంగారెడ్డిగూడెం: నాలుగో తేదీ వచ్చినా ఇంకా పింఛను సొమ్ములు చేతికి అందక అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ సొమ్ము బ్యాంకులో జమ అయినా అవి తీసుకునేందుకు ఖాతాలు యాక్టివ్లో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే అందే పింఛన్ చంద్రబాబు పుణ్యమా అంటూ అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో మళ్లీ పింఛన్ కష్టాలు మొదలయ్యాయని బాధపడుతున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబునాయుడే కారణమని దుయ్యబడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బాంకుల వద్ద పడిగాపులు పడుతున్నా ఆధార్ లింక్ కాలేదని, ఖాతా మనుగడలో లేదని ఇలా వివిధ కారణాలతో పింఛన్ అందడం లేదు. ఎన్నికల పుణ్యమా అంటూ వలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేసి వారి సేవలను చంద్రబాబు దూరం చేయడంతోనే తాము ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు లబ్ధిదారులు వాపోయారు. గత నెల సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే, ఈ సారి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కూడా పట్టణంలో ఏ బ్యాంకు చూసినా పింఛన్ లబ్ధిదారులతో కిక్కిరిసిపోయాయి.
నాలుగో తేదీ వచ్చినా చేతికి అందని పింఛను సొమ్ము
బ్యాంకుల చుట్టూ తిరుగుతూఅష్టకష్టాలు పడుతున్న పండుటాకులు
ఇది చంద్రబాబు పుణ్యమేనంటూ శాపనార్థాలు
వారం తరువాత రమ్మన్నారు
పింఛన్ సొమ్ము తీసుకోవడానికి ఉదయమే బ్యాంకుకు వచ్చా. చాలా సేపు నిరీక్షించిన తరువాత కౌంటర్ వద్దకు వెళ్లగా, వారం తరువాత రమ్మన్నారు. అదేంటి అని అడిగితే మీ అకౌంట్ ఫోర్స్లో లేదు.. పునరుద్ధరించాలంటే సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ప్రతి నెలా ఏ ఇబ్బంది లేకుండా 1వ తేదీనే పింఛన్ అందేది. వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు నాలుగో తేదీ వచ్చినా పింఛను అందలేదు. ఇంకా వారం రోజులు పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– బి.వెంకటరావు, పేరంపేట, జంగారెడ్డిగూడెం