
(నేడు భగత్ సింగ్ జయంతి)
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.
గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్గా మార్చాడు.
బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.
భగత్ సింగ్ను బ్రిటిష్వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్
ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
Comments
Please login to add a commentAdd a comment