మంగళగిరి: జగనన్నతోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేర్కొన్నారు. నగర పరిధిలోని యర్రబాలెం శ్రీనగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. లావణ్యకు హారతులు, పూలమాలలతో స్థానికులు ఘనస్వాగతం పలికారు. లావణ్య మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభివృద్ధి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే రావాలంటే మళ్లీ జగనన్నను సీఎంని చేసుకోవాలన్నారు. పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న యుద్దంతో పెత్తందార్లంతా ఏకమై డబ్బుతో ఓటర్లను కొని గెలవాలనుకొంటున్నారని, పేదలంతా ఏకమై పెత్తందార్లును ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో తనకు మంగళగిరి సీటు కేటాయించారని, ప్రజలంతా అండగా నిలిచి తనను, ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్యలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ మహిళకు సీటు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్యావంతురాలు అయిన బీసీ మహిళను చట్టసభలకు పంపడం వలన బడుగు వర్గాల సమస్యలపై గొంతెత్తి పరిష్కరించే అవకాశముందన్నారు. పెత్తందారులపై పేదలు విజయం సాధించేలా ఈ నెల 13వ తేదీ ఎన్నికలలో తమ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కిలారు రోశయ్య కుమార్తె సాయిదివ్వ మాట్లాడుతూ ఐదేళ్లలో పేదలకు ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించిన సీఎం వైఎస్ జగన్కు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, మహిళా నాయకులు సంకె సునీత, గుండాల శ్రీనివాసరావు, పలగాని కోటేశ్వరరావు, చావలి మురళీకృష్ణ, షఫి, బడేమియా, దానబోయిన నాగయ్య, నృసిముల్లా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి లావణ్య యర్రబాలెంలో ఎన్నికల ప్రచారం