Video: Hyderabad Woman Seen Starving On US Chicago Roads, Mother Makes Emotional Appeal To EAM - Sakshi
Sakshi News home page

Hyd Woman On US Roads: హృదయ విదారకం.. ఎంఎస్‌ కోసం యూఎస్‌కు.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్‌ మహిళ

Published Wed, Jul 26 2023 6:46 PM | Last Updated on Thu, Jul 27 2023 11:18 AM

Hyderabad Woman Seen Starving On US Roads Mother Appeals For Help - Sakshi

ఉన్న ఊరు, దేశం విడిచి విదేశాల్లో సెటిల్​ కావాలనే కోరిక కలిగిన వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉన్నత చదువుల కోసం, బెటర్‌ లైఫ్‌, లగ్జరీగా బతకాడనికి చాలా మంది విదేశాల బాటపడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, దుబాయ్‌, యూకే, సింగపూర్‌ అంటూ ఎంచక్కా ఎగిరిపోతున్నారు. అయితే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని ముక్కు ముహం తెలియని దేశంలో జీవించడం అంత సులభం కాదు. ఏ ఆపద, కష్టం, విపత్తు ఎదురైనా అండగా నిలిచేందుకు ఎవరూ ఉండరు.

తాజాగా అలాంటి ఓ దుర్భర పరిస్థితే హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన మహిళకు ఎదురైంది. ఎంఎస్‌ చదవడానికి యూఎస్‌ వెళ్లిన యువతి చికాగో రోడ్లపై దీనస్థీతిలో కనిపించింది. హైదరాబాద్‌కు చెందిన ‘సైదా లులు మిన్హాజ్ జైదీ’ మిచిగాన్‌ రాష్ట్రంలోని  డెట్రాయిట్ ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఆమె వస్తువులన్నీ ఎవరో దుండగులు దొంగిలించారు. దీంతో ప్రస్తుతం ఆమె చికాగోలోని రోడ్లపై ఆకలికి అలమటిస్తూ దయనీయ స్థితిలో తిరుగుతోంది. 

ఆమె పరిస్థితిని తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ పోస్టులో యువతి తన పేరు, వివరాలు తెలియజేస్తున్న వీడియో కూడా ఉంది. అయితే ఆమె బక్కచిక్కిపోయి, తినడానికి ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి వహాజ్‌ ఫాతిమా తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు లేఖ రాశారు. కూతురుని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు తమకు సాయం చేయాలని అర్థించారు. 
చదవండి: మొబైల్‌ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం

తల్లి రాసిన లేఖలో.. ‘హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన మిన్హాజ్‌ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ట్రైనీ( TRINE) యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసేందుకు యూఎస్‌ వెళ్లింది. తరుచూ మాతో టచ్‌లోనే ఉంది. కానీ గత రెండు నెలలుగా తనతో సంబంధాలు తెగిపోయాయి. అయితే నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. చికాగో రోడ్లపై నిరాశ్రయురాలిగా నా కూతురు కనిపించింది. దయచేసి తక్షణమే జోక్యం చేసుకుని, నా కుమార్తెను వీలైనంత త్వరగా తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలేని ఇండియన్ కాన్సులేట్‌ను కోరుతున్నాను’  అని పేర్కొంది.

మహిళ విజ్ఞప్తిపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. సయ్యద్ లులు మిన్హాజ్ కేసు గురించి ఇప్పుడే తెలుసుకున్నామని, దీనిపై వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపింది. కాగా మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement