సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరు స్వయం శక్తితో ఎదగాలని ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ, ఉపాధి పథకాలను అమలు చేశారని, అయితే కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఐదు గ్యారెంటీలతో తాత్కాలికంగా ఉపశమనం పొందేలా చేస్తూ జనాలను మోసగిస్తున్నారని, ఇది ఎంతో కాలం నడవదని మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ అవినీతి రహిత, మచ్చలేని పాలన అందిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావడం లేదని, పన్నులు ద్వారా చెల్లించిన డబ్బులు కూడా తిరిగి అంతో, ఇంతో ఇవ్వడం లేదని, బీజేపీ లోక్సభ సభ్యలు నిధులు తీసుకుని రావడం లేదని పదే పదే అబద్ధాలు చెబుతున్న సీఎం బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయన్న దానిపై చర్చిద్దామా అని సవాల్ విసిరారు. ఓటు బ్యాంకు కోసం ఇలాంటి నీచరాజకీయాలు చేయకూడదని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారని గుర్తు చేశారు. కామన్ సివిల్ కోడ్ మినహా ఇస్తే ఏ హామీ నెరవేర్చలేదో చెప్పాలన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయంపై స్పందిస్తూ ఎన్నికల్లో తమ పార్టీకి ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మురహరగౌడ, నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్, జీ.రామచంద్రయ్య, వీరశేఖరరెడ్డి, పాలన్న తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు సిద్దమా ?
మాజీ సీఎం సదానందగౌడ