ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
Published
Wed, May 8 2024 5:40 AM
నగరంపాలెం: ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయవాడలో రోడ్ షో సందర్భంగా గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీస్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలు బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చందోలు చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని జాతీయ రహదారి –16 వైపు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
దేవస్ధానానికి
రూ.లక్ష విరాళం
తాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండల పరిధిలోని కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి దాత మంగళవారం రూ.1,01,116లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ చేబ్రోలు వాస్తవ్యులు చిన్నంశెట్టి పోతురాజు, పార్వతి దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం ఈ విరాళాన్ని అందజేశారని వెల్లడించారు. అనంతరం దాతలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ మెంబర్లు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.