అప్‌గ్రేడ్‌కు మోక్షమెప్పుడో.. ? | - | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌కు మోక్షమెప్పుడో.. ?

Published Mon, Apr 3 2023 1:50 AM | Last Updated on Mon, Apr 3 2023 1:50 AM

శిథిలావస్థకు చేరిన మరిపెడ కేంద్రం   - Sakshi

మహబూబాబాద్‌: జిల్లా ఏర్పాటై ఆరేళ్లు గడుస్తున్నా మానుకోట అగ్నిమాపక కేంద్రం అప్‌గ్రేడ్‌కు నోచుకోవడం లేదు. డివిజన్‌స్థాయి కేంద్రంతోనే సేవలు అందిస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో మానుకోట, మరిపెడలో కేంద్రాలు ఉండగా.. ఒక్కరే అధికారి పర్యవేక్షిస్తున్నారు. కాగా రెండు సెంటర్లలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరిపెడ కేంద్రం రేకుల షెడ్డులో కొనసాగుతుండగా.. అది శిథిలావస్థకు చేరుకుంది. డోర్నకల్‌ కేంద్రం ప్రతిపాదనలకే పరిమితమైంది. కాగా జిల్లాలో ఏజెన్సీ, అటవీ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత వేసవిలో అగ్గిరాజుకుంటే అంతా బుగ్గిపాలు అయ్యే అవకాశం ఉంది.

సిబ్బంది కొరత..

జిల్లా కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉండగా, మరిపెడలో అవుట్‌పోస్ట్‌ కేంద్రం ఉంది. రెండు కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మానుకోట కేంద్రం పరిధిలో బయ్యారం, డోర్నకల్‌, గంగారం, గార్ల, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, కురవి, నెల్లికుదురు, ఇనుగుర్తి, నర్సింహులపేట, మానుకోట మండలాలు ఉన్నాయి. కాగా కేంద్రంలో లీడింగ్‌ ఫైర్‌మెన్లు సరిపడా ఉండగా.. పదిమంది ఫైర్‌మెన్లకు ఇద్దరు మాత్రమే ఉన్నాయి. అలాగే ముగ్గురు డ్రైవర్లకు ఒక్కరు కూడా లేరు. ఆర్టీసీ నుంచి డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఓ (స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ) ఉన్నారు.

రేకులషెడ్డులో..

మరిపెడలోని అవుట్‌పోస్ట్‌ కేంద్రం రేకుల షెడ్డులో కొనసాగుతుంది. షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. ఈ కేంద్రంలో ఇద్దరు లీడింగ్‌ ఫైర్‌మెన్లు, ముగ్గురు డ్రైవర్లు, అధికారి ఉండాలి. అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఏడుగురు హోంగార్డులు మాత్రమే పని చేస్తున్నారు. హోంగార్డులే డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ కేంద్రం పరిదిలో మరిపెడ, సీరోలు, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర, తొర్రూరు మండలాలు ఉన్నాయి. ఈ కేంద్రంలో కనీస నీటి సౌకర్యాలు లేవు.

ప్రతిపాదనలకే పరిమితం..

డోర్నకల్‌లో అగ్నిమాపక సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. దీనికి స్థలం కూడా కేటాయించారు. అయితే కేంద్రం ఏర్పాటు ప్రక్రియ చాలా సంవత్సరాలు నిలిచిపోయింది. ఇటీవల కేంద్రం మంజూరుతో పాటు పోస్టుల కేటాయింపు జరిగినట్లు సమాచారం. అయితే అధికారులు వివరాలు వెల్లడించడం లేదు.

కొంత వెసులుబాటు..

జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాలు మానుకోట కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలో నర్సంపేట కేంద్రం నుంచి ఫైరింజన్‌ వ స్తుంది. దీంతో కొంత వెసులుబాటు కలుగుతుంది.

వేసవిలో అధికంగా అగ్ని ప్రమాదాలు..

వేసవికాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. కోల్డ్‌ స్టోరేజీలు, అడవులు, గడ్డివాములు, పరిశ్రమలు, గ్యాస్‌లీకేజీలు, మిల్లుల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. గతంలో జిల్లా కేంద్రంలోని కోల్డ్‌ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఇక్కడ సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి ఫైరింజన్‌లు రావాల్సి వచ్చింది.

డివిజన్‌ స్థాయిలోనే సేవలందిస్తున్న మానుకోట అగ్నిమాపక కేంద్రం

శిథిలావస్థలో మరిపెడ కేంద్రం

రెండు సెంటర్లకు ఒక్కరే అధికారి

వెంటాడుతున్న సిబ్బంది కొరత

ప్రతిపాదనలకే పరిమితమైన

డోర్నకల్‌ కేంద్రం

వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం 1
1/1

జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement