● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు
మంచిర్యాలటౌన్: దేశంలో ఏ పార్టీ పాలన చేపట్టాలన్నా యువత చేతుల్లోనే ఉందని, దేశ భవిష్యత్ దృష్ట్యా యువత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో బుధవారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు, మహిళల మద్దతు లేకుంటే ఏ పార్టీ మనుగడలోకి రాదని, కులం, మతం పేరుతో విద్వేషాలు రగిలించాలని యత్నించే పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు కల్పిస్తానని, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని పునరుద్ఘాటించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు. నరేంద్ర మోదీ ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పదేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రేమ్సాగర్రావు, వివేక్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.