రవితేజ సినిమాతో క్లాష్‌.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్‌ కిషన్‌ | Sakshi
Sakshi News home page

రవితేజ సినిమాతో క్లాష్‌.. మేము వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్‌ కిషన్‌

Published Fri, Jan 19 2024 7:45 AM

Sundeep Kishan Comment On Eagle Movie Clashes - Sakshi

సందీప్‌కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'.  ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా వంటి చిత్రాలకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు.తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన చిత్రం ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అనే డైలాగుతో ట్రైలర్‌ మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'ఈగల్‌' చిత్రం కూడా ఫిబ్రవరి 9న విడుదల అవుతుంది. దీంతో రవితేజ చిత్రంతో వస్తున్న క్లాష్‌ గురించి సందీప్‌కిషన్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 'ఊరు పేరు భైరవకోన' చిత్రాన్ని వాస్తవంగా సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నాం. ఆ తేదీలలో చాలా సినిమాలు ఉండటం చూసి వెనక్కు తగ్గాం. దీంతో ఫిబ్రవరి 9న  వెళ్దాం అనుకున్నాం. అప్పటికే ఫిబ్రవరి 9న 'టిల్లు స్క్వేర్‌' రేసులో ఉంది. ఆ సమయంలో ఆ చిత్ర యూనిట్‌తో మాట్లాడుకుని మేము రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాం.

ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రిలీజ్‌ డేట్‌ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఈ సినిమా వివషయంలో ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. రవితేజతో డైరెక్టర్‌  వి.ఐ.ఆనంద్‌ కూడా పని చేశారు. అయన్ను ఎవరైనా అభిమానిస్తారు. 'ఈగల్‌' నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో మా చిత్ర నిర్మాతకు మంచి స్నేహమే ఉంది. 'ఈగల్‌' రిలీజ్‌ విషయంలో  మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. వాళ్లు మాతో టచ్‌లోకి రాలేదు. వారి నుంచి ఫోన్‌ వచ్చింటే స్పందించేవాళ్లమే.. ఎన్ని జరిగినా  ఫిబ్రవరి 9వ తేదీనే రావాలని ఫిక్స్‌ అయ్యాం. మరోసారి విడుదల తేదీ మారిస్తే మాకు ఎన్నో సమస్యలున్నాయి.

సంక్రాంతి రేసులో ఎక్కువ చిత్రాలు ఉండటంతో ఈగల్‌ తప్పుకోవాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒక సమావేశం పెట్టి కోరింది. అందుకుగాను ఈగల్‌ చిత్రానికి సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ ఇస్తామని చెప్పింది. అప్పటకే ఫిబ్రవరి 9న విడుదలకు రెడీగా ఉన్న  'టిల్లు స్క్వేర్‌' వాయిదా వేసుకుంది. కానీ ఆ సమయంలో 'ఊరు పేరు భైరవకోన' చిత్రం టీమ్‌తో చర్చలు జరిగినట్లు లేదని తెలుస్తోంది. దీంతో ఊరు పేరు భైరవకోన,ఈగల్‌ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి.

వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో ఇప్పటికే టైగర్‌ చిత్రంలో సందీప్‌కిషన్‌ నటించాడు. సందీప్‌ సరసన కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కనిపించనున్నారు. రాజేశ్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకులు.

Advertisement
Advertisement