నల్లగొండ: ఎన్నికల విధుల నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర కీలకమని, వారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సెక్టోరియల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఓలు ఏపీఓలు, ఇతర సిబ్బంది కేటాయించిన విధులను సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. సెక్టోరియల్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ను పూర్తిస్థాయిలో చదవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదులు రావొద్దు
ఏ ఉద్యోగి తనకు పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదు చేయకూడదని, ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఫారం–12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించి శిక్షణ తరగతులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి, వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హరిచందన