
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది.
తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు.