మళ్లీ సంకీర్ణ యుగంలోకి కేంద్ర స‌ర్కారు | Coalition Era Returns, Coalition Dharma Will Follow | Sakshi
Sakshi News home page

మళ్లీ సంకీర్ణ యుగంలోకి కేంద్ర స‌ర్కారు

Published Wed, Jun 5 2024 3:10 PM | Last Updated on Wed, Jun 5 2024 3:30 PM

Coalition Era Returns, Coalition Dharma Will Follow

లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశాన్ని మ‌రోసారి సంకీర్ణ రాజ‌కీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. ప‌దేళ్ల త‌ర్వాత ఓట‌ర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వ‌కుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓట‌ర్లు బీజేపీకి 240 సీట్లే క‌ట్ట‌బెట్ట‌డంతో కొంత నిరాశ ఎదురైనా ఎన్‌డీఏకు మెజారిటీ  రావ‌డంతో క‌మ‌ల‌నాథులు సంతృప్తి ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.  బీజేపీ సొంతంగా 272 సీట్ల‌ మెజారిటీకి మార్క్ చేరుకోలేక‌పోయినా, ఎన్‌డీఏ కూట‌మిగా 292 సీట్లు సాధించింది. దాంతో సునాయాసంగా కేంద్రంలో స‌ర్కారు ఏర్పాటు చేయ‌బోతోంది. 

అయితే 2014, 2019 ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా న‌రేంద్ర‌మోడీ త‌న పాల‌న‌లో మార్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌బోతోంది. ఎన్‌డీఏలో కీల‌క భాగ‌స్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీ, షిండే శివ‌సేన‌, ఎన్సీపీ త‌దిత‌ర పార్టీల అభిప్రాయాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల్సిందే.  అయితే బీజేపీకి మెజారిటీ మార్క్ దాట‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పైనా విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. 

ప్ర‌ధానంగా యూపీలో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండ‌గా నిల‌బ‌డలేద‌ని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను మారుస్తార‌నే విప‌క్షాల ప్ర‌చారం ఠాకూర్ల‌కు ఆగ్ర‌హం తెప్పించ‌డం వ‌ల్లే బీజేపీకి సీట్లు త‌గ్గాయ‌ని అంటున్నారు. అలాగే మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, న్సీపీ పార్టీల‌ను చీల్చ‌డ మ‌హారాష్ట్ర ఓట‌ర్ల‌కు ఆగ్ర‌హ‌న్ని తెప్పించాయి. దాని ఫ‌లితంగా బీజేపీకి ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌లేదు. వీటికి తోడు బీజేపీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌ని, రాజ్యాంగాన్ని మారుస్తుంద‌ని కాంగ్రెస్ స‌హా ఇండియా కూట‌మి చేసిన ప్ర‌చారం దెబ్బ హిందీ రాష్ట్రాల‌లో బిజెపి స్ట్రయిక్ రేటును తగ్గించింది.

ఇటు ఇండియా కూట‌మి అనూహ్యాంగా పుంజుకుని బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించింది. ఇండియాకు 234 సీట్లు తెచ్చుకుని మెజారిటీ మార్క్‌కు దూరంగా ఆగిపోయింది. అయితే విపక్షంలో ఉండాలా? అధికారం కోసం ప్ర‌య‌త్నించాలా అన్న దానిపై ఆ పార్టీలో చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. విప‌క్షంలో కూర్చుంటామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో, ఆ కూట‌మి అధికారం కోసం ప్ర‌య‌త్నిస్తుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. 

మెజారిటీకి 38 సీట్లు త‌క్కువ‌గా ఉండ‌డంతో నితీష్, చంద్ర‌బాబు మ‌ద్ద‌తు కోసం ఇండియా కూట‌మి తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంటున్నారు. ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాక‌పోవ‌డంతో  కేంద్రంలో  అస్థిర‌త కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రింగా ఇప్ప‌టివ‌ర‌కు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని న‌డిపారు. తొలిసారిగా సంకీర్ణ ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హించ‌బోతున్న న‌రేంద్ర‌మోదీ ఆ దిశ‌గా ప‌ట్టువిడుపుల‌తో, భాగ‌స్వాముల ఆకాంక్ష‌ల‌ను సంతృప్తి ప‌రుస్తూ పాల‌న‌ను కొన‌సాగించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement