యూపీలో కలకలం.. గోనె సంచిలో దళిత యువతి మృతదేహం | UP Dalit Woman Body Found In Sack Family Says Killed For Backing BJP | Sakshi
Sakshi News home page

యూపీలో కలకలం.. గోనె సంచిలో దళిత యువతి మృతదేహం

Nov 20 2024 5:03 PM | Updated on Nov 20 2024 7:07 PM

UP Dalit Woman Body Found In Sack Family Says Killed For Backing BJP

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ గోనె సంచిలో దళిత యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. నేడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. 

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ యాదవ్, మోహన్ కతేరియాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో నిందితులు ఆమెను హత్య చేశారని యువతి తల్లిదండ్రులు చెప్పారని మెయిన్‌పురి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

అయితే మూడు రోజుల క్రితం  ప్రశాంత్ యాదవ్ తమ ఇంటికి వచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారని బాధితురాలి తండ్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తన కుటుంబానికి ఇల్లు లభించినందున బీజేపీ గుర్తుకు ఓటు వేస్తానని  తన కూతురు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్‌ యాదవ్ ఆమెను బెదిరించి, సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌కు ఓటు వేయమని అడిగాడని తెలిపారు.  బీజేపీకి ఓటు మద్దతు ఇచ్చినందుకు యువతిని కిడ్నాప్‌ చేసి హత్య చేశారని ఆరోపించారు. 

మహిళ మృతిపై సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌లో, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రశాంత్ యాదవ్, అతని అనుచరులు తమ పార్టీకి ఓటు వేసేందుకు నిరాకరించినందుకు దళిత కుమార్తెను దారుణంగా హత్య చేశారు’ అని బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ కర్హల్ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. పి సమాజ్ వాదీ పార్టీ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని, దీనికి ఎస్పీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement