
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్ఖండ్లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు.