ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తనను గెలిపిస్తే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్కు ప్రత్యేకత ఉందన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందిస్తామన్నారు. 2019లో డీఎస్ కొడుకు అని పార్టీలకతీతంగా అర్వింద్ను గెలిపించారని, ఇప్పుడు ఆయన అహంకార పూరిత ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. రైతు బిడ్డనైన తనకు రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్, బాల్కొండ రైతాంగం చైతన్యవంతులని, ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతో సాగునీరందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్కంపల్లి సెజ్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఖలీల్వాడి/ఆర్మూర్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని.. ఇందూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందూరు గడ్డపై మూడు రంగుల జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంపు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్పై ఉక్కు పాదం మోపుతున్నట్లు చెప్పారు. వంద రోజుల్లో ఇన్ని పనులు చేస్తే.. కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ మాట్లాడుతు న్నారన్నారు. బుధవారం ఆర్మూర్, నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఐదేళ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ కూతురు వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరుస్తామని, ఎర్రజొన్న, పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దీంతో ఇక్కడి రైతులు ఎన్నికల్లో కవితకు గుణపాఠం చెప్పారన్నారు. బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు మోడీ చెప్పిన అబద్ధాలను మళ్లీ చెబుతూ మోసం చేస్తున్నారని వాటిని నమ్మి మరోమారు మోసపోవద్దన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలు చేస్తే పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించి కేంద్రం మెడలు వంచారన్నారు. అదే పౌరుషాన్ని ఆర్మూర్ ప్రాంత రై తాంగం సైతం ప్రదర్శిస్తోందంటూ అభినందించా రు. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ఆదర్శ గ్రామం అంకాపూర్తో పాటు చైతన్యవంతమైన రైతులు ఇక్కడ ఉన్నారన్నారు. 2014, 2019లో బీఆర్ఎస్, బీజేపీలను గెలిపించి రైతులు మోసపోయారని.. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్మూర్ సిద్దులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని.. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కోను గోలు చేస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు సాధించాలన్నా, చక్కెర కర్మాగారం తెరుచుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నారు. ఎన్నికల అనంతరం మంత్రులతో ఉపసంఘాన్ని వేసి రూ. 42 కోట్లు కేటాయించి చక్కెర కర్మాగారం ప్రారంభింపజేస్తామన్నారు. జీవన్రెడ్డి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నేత అని తెలిపారు. నిజాయితీ గల రైతు బిడ్డకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆర్మూర్లో నిర్వహించిన రోడ్షోలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నాయకులు పొద్దు టూరి వినయ్కుమార్రెడ్డి, ముత్యాల సునీల్కుమార్రెడ్డి పాల్గొనగా.. నిజామాబాద్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షులు మానా ల మోహన్రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, తాహెర్బిన్ హందాన్, మాజీమేయర్ సంజయ్, గడుగు గంగాధర్, మహిళా కాంగ్రెస్ నగరాధ్యక్షురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్సిటీగా మారుస్తా..
నిజామాబాద్ గడ్డపై మూడు రంగుల
జెండా ఎగరాలి
జీవన్రెడ్డిని లక్ష మెజారిటీతో
గెలిపించాలి
ఎంపీ అర్వింద్ చేసింది గాడిద గుడ్డే..
సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోగా
రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం
2021లో రైతులు చేసిన పసుపు
ఉద్యమమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది
ఆర్మూర్, నిజామాబాద్ రోడ్ షోల్లో
సీఎం రేవంత్రెడ్డి