భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహింపట్నం జూపూడిలోని నోవ, నిమ్రా కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలల్లోని కౌంటింగ్, స్ట్రాంగ్ రూములను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పరిశీలించారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ అనంతరం ఈవీఎంలను నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల్లో భద్రపరచనున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత తదితర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్, భద్రత ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని, అలాగే బందోబస్తు కూడా పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపునకు అనువైన సౌకర్యాలను పరిశీలించి, స్ట్రాంగ్ రూముల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. లెక్కింపు టేబుల్స్, పోలింగ్ ఏజెంట్లు వచ్చే మార్గం చుట్టు పక్కల శాంతి భద్రతల చర్యలను పరిశీలించారు. ఆయన వెంట మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి.సంపత్కుమార్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.
యార్డుకు 70,843 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 70,843 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా ,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 55,550 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.