
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. తాను ఇప్పటికీ సోషలిస్టు సిద్ధాంతంతోనే ఉన్నానని, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలకు సమాజ్వాదీ పార్టీ దూరం జరిగిందని విమర్శించారు.
"సోషలిస్టు భావజాలాన్ని ఎస్పీతో ముడిపెట్టకూడదు. నేను ఇప్పటికీ వ్యక్తిగతంగా సోషలిస్టు భావజాలంతోనే ముడిపడి ఉన్నాను" అని నీరజ్ శేఖర్ పీటీఐతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి దివంగత చంద్రశేఖర్ సోషలిస్ట్ భావజాలాన్ని ప్రతిపాదించినవారు. కాషాయ పార్టీని తీవ్రంగా విమర్శించేవారు.
చంద్ర శేఖర్ కుటుంబం మొత్తం ప్రస్తుతం బీజేపీలో ఉంది. అతని పెద్ద కుమారుడు పంకజ్ శేఖర్, చిన్న కుమారుడు నీరజ్ శేఖర్ కాషాయ పార్టీలో ఉండగా, అతని మనవడు రవిశంకర్ సింగ్ పప్పు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడిగా ఉన్నారు.
గతంలో బల్లియా నుంచి ఎస్పీ ఎంపీగా పనిచేసిన నీరజ్ శేఖర్ 2014 లోక్సభ ఎన్నికల్లో బల్లియా నుంచి బీజేపీ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో నీరజ్ శేఖర్కు ఎస్పీ టికెట్ నిరాకరించింది. తర్వాత ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసినప్పటికీ, నీరజ్ శేఖర్ పార్టీని వీడి 2019 జూలైలో బీజేపీలో చేరారు. బల్లియా నుంచి ప్రస్తుత ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ స్థానంలో నీరజ్ శేఖర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ తాజాగా ప్రకటించింది. 2019లో అప్పటి ప్రస్తుత ఎంపీ భరత్ సింగ్పై కాషాయ పార్టీ మస్త్కు ఎన్నికల టిక్కెట్ను ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment