
నక్కపల్లి/పాయకరావుపేట : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకేనని నియోజకవర్గ పరిశీలకుడు యనమల కృష్ణుడు చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కృష్ణుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే అధికారం పరిశీలకులకులేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపు నేత గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనితకు టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలు మద్దతిచ్చే ప్రసక్తిలేదని హెచ్చరించారు.
నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి.. కాపులను, జనసేనతోపాటు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాలు తెలియక యనమల కృష్ణుడు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో అనితకు ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీయేనని, తమ మద్దతువల్లే ఆమె గెలిచారని బుజ్జి చెప్పారు. పదవి చేపట్టిన వెంటనే ఆమె తనపై రేప్ కేసు పెట్టించిందని, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, కాపుల వ్యతిరేకి అయిన ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకే కేటాయించాలని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కోరుతున్నారని ఆయన తెలిపారు. పాయకరావుపేట టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నిర్ణయిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment