మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్‌ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్‌ | Sakshi
Sakshi News home page

మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్‌ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్‌

Published Fri, May 17 2024 3:22 PM

Nirmala Sitharaman Slams Arvind Kejriwal In Swati Maliwal Row

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్‌ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్‌ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్‌ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హం

ఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు.

తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్‌ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.

‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్‌ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్‌ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

Advertisement
 
Advertisement
 
Advertisement