Published
Wed, Apr 17 2024 8:20 AM
| Last Updated on Wed, Apr 17 2024 8:20 AM
సంగారెడ్డి టౌన్ : సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులకు జేజేలు అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘం మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదీవే నుంచి అంబేడ్కర్ జయంతుల సందర్భంగా సామాజిక సంఘీభావ నిధి సేకరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కార్మికుల నుంచి రూ.1,61,547 విరాళం సేకరించారు. మంగళవారం ఆ నగదును హైదారాబాద్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి పాలడుగు భాస్కర్, చుక్క రాములు చేతుల మీదుగా రాష్ట్ర కమిటీ కి అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. దళిత, బహుజన, మైనార్టీల సమస్యలు పరిష్కరించకుండా పాలకులు వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నేటికీ కుల వివక్ష, అంటరానితనం, పేదరికం తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. పాలకులు వివక్షతను రూపుమాపకుండా చోద్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల పేరుతో విభజన పాలనసాగిస్తుందని ఆరోపించారు. సామాజిక ఉద్యమాలకు సీఐటీయూ సంఘీభావంగా అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, జె.మల్లికార్జున్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య, నాయకులు మహిపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment