
లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం, ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి మరింత సమయం పట్టనుంది. ఐపీఎల్-2024 సీజన్లో తన పేస్ బౌలింగ్తో మయాంక్ అందరని ఆకట్టుకున్నాడు.
155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్.. 6.99 ఏకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో అవకాశమివ్వాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ అతడి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారింది. తరచుగా గాయాల బారిన పడుతుండటంతో మయాంక్ అరంగేట్రం ఎప్పడన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మయాంక్ డెబ్యూపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు.
అతడి ఎంపికపై తను ఇప్పుడే ఏమి చెప్పలేను అని జైషా తెలిపాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
"మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే మయాంక్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.
కానీ అతడొక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం అతడు ఏన్సీఎలో ఉన్నాడు. మా ఫిజియోల పర్యవేక్షణలో అతడు తన పునరావాసాన్ని కొనసాగిస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment