
photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న (ఏప్రిల్ 24) మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో (34 బంతుల్లో 34, 4-0-21-2) రాణించినందుకు గాను జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అక్షర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించినప్పటికీ, ఢిల్లీని గెలిపించింది మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముకేశ్ కుమారేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిలో చివరి ఓవర్ బౌల్ చేసిన ముకేశ్ అద్భుతమైన యార్కర్ బంతులను సంధించి, సన్రైజర్స్ను గెలవనీయకుండా చేశాడని అంటున్నారు.
ఆఖరి ఓవర్లో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని (13 పరుగులు) ముకేశ్ అద్భుతంగా డిఫెండ్ చేశాడని (5 పరుగులు మాత్రమే ఇచ్చాడు), ఢిల్లీపై ఫీల్డింగ్ పెనాల్టీ (30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి) అమల్లో ఉన్నా ఎంతో పరిణితితో బౌలింగ్ చేశాడని ముకేశ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 29 ఏళ్ల ముకేశ్ (బిహార్) ఎంతో అనుభవం ఉన్న బౌలర్లా ఆఖరి ఓవర్లో పరిస్థితులను హ్యాండిల్ చేశాడని, ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేలే అయినా తమ హీరో మాత్రం ముకేశేనని ఢిల్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సైతం ముకేశే తమను గెలిపించాడని, ఒత్తిడిలో అతడు పరిస్థితులను హ్యాండిల్ చేసిన తీరు అమోఘమని ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముకేశ్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.
కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25), మనీశ్పాండే (34), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టారు. కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. ఇషాంత్ శర్మ (1/18), నోర్జే (2/33), ముకేశ్ (0/27), అక్షర్ (2/21), కుల్దీప్ (1/22) ధాటికి చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment