సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భానుడి భగభగలు.. ఎండ తీవ్రత అభిమాన ఝరి ముందు చిన్నబోయాయి. తమ అభిమాన నేతను చూసిన ఆనందంతో ప్రజలు కేరింతలు కొట్టగా.. ఉప్పెనలా తరలివచ్చిన అశేష జనవాహినితో సింహపురిలో పండగ వాతావరణం నెలకొంది. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో సీఎం జగన్మోహన్రెడ్డి శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘట్టం ఆవిష్కృతమైంది. పెత్తందారుల పక్షాన నిలిచిన చంద్రబాబును ఉద్దేశించి పంచ్ డైలాగులతో జననేత ప్రసంగించిన తీరు ప్రజలను ఆలోచింపజేసింది. మా నమ్మకం నువ్వే జగన్.. నీ వెంటే మేము అనే అనే నినాదాలు మార్మోగాయి.
మేమంతా సిద్ధం..
ప్రచార వాహనంపైకి సీఎం జగన్మోహన్రెడ్డి చేరుకోగానే, జగన్నినాదాలతో గాంఽధీబొమ్మ సెంటర్ మార్మోగిపోయింది. సీఎం ప్రసంగిస్తున్నంత సేపూ నేతలు, అభిమానులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. సిద్ధమా అని జగన్ పిలుపునివ్వగా.. మేమంతా సిద్ధం అంటూ ప్రజలు పిడికిలి బిగించి గట్టిగా నినాదాలు చేశారు.
దారిపొడవునా జేజేలు
ఎన్నికల ప్రచారం అనంతరం వీఆర్సీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక వాహనంలో ఆయన వెళ్లారు. దారి పొడవునా జనం జేజేలు పలికారు. రెట్టించిన ఉత్సాహంతో అందరూ చేతులూపారు. మామయ్య వచ్చారంటూ చిన్నారులు కేరింతలు కొట్టారు. అనంతరం 6.10కు హెలికాప్టర్లో రేణిగుంటకు ఆయన పయనమయ్యారు. సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి అభ్యర్థులు కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, నేతలు హనుమాన్రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.