లేపాక్షి: సమస్యలు పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శుక్రవారం ఉదయం లేపాక్షి గ్రామ సచివాలయ ఆవరణలో సర్పంచ్ ఆదినారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయనకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై గ్రామ సభల్లో చర్చించి గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలు చేయి చేయి కలిపి గ్రామాభివృద్ధికి సమష్టి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనికై నా సర్పంచ్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు ఆరా తీయగా, వారపు సంత నిర్వహించే ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని, గొంగటిపల్లిలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించాలని కోరారు. అలాగే సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కళలు, ఆహార పదార్థాలు, వస్త్రాల తయారీకి మన గ్రామాలు ప్రత్యేకమని వాటిని గ్రామ సభల్లో గుర్తించి ప్రచారం కల్పించాలన్నారు. లేపాక్షి మండలంలో పట్టు, పశుపోషణ, డెయిరీ, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. సభలో డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్, ఎంపీడీఓ నరసింహనాయుడు, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సభలో కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment