కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 150 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులే నన్ను గెలిపిస్తాయి. నేను రైతు బిడ్డను. రైతుల కష్టాలపై అవగాహన ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా కోసం పోరాడుతా. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్పై హక్కు కోల్పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సాగర్ నుంచి ఈసారి సాగునీరు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తా.
1.90 లక్షల ఉద్యోగాలిచ్చాం
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 1.90 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను విస్మరించింది. నేను గెలిచాక నిరుద్యోగుల తరఫున పోరాడుతా.
రోడ్లు, రైల్వేలైన్లు అభివృద్ధి చేయిస్తా..
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు రైల్వే, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదు. నేను ఎంపీగా గెలిచాక రోడ్లు, రైల్వేల అభివృద్ధికి బాటలు వేస్తా. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ – విజయవాడ రైలు మార్గం ఏర్పాటుకు కృషిచేస్తా. జాతీయ రహదారిపైన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, హైవేల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడతా.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి