సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొనడానికి హరీష్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆగస్టు15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారని స్వామి సమక్షంలో ప్రైవేట్ అర్చకుడితో ఆలయ మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజ చేయించారు. సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాట ప్రకారం గడువులోపు రూ,2 లక్షల రుణమాఫీ చేయకుండా మాటతప్పడం వల్లే యాదాద్రిలో పాప ప్రక్షాళన పూజ చేయించినట్లు హరీష్రావు పేర్కొన్నారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టమని, అందుకే ప్రజలకు పాపం కలగవద్దని, సీఎంను క్షమించాలని స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు. రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలను కాపాడేందుకు, రైతులకు రుణమాఫీ, పంటలకు బోనస్ ఇచ్చేవరకు తనకు పోరాడే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment