Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి | Ganesh Immersion 2022 Hyderabad Mahaganapathi Shobha Yatra Highlights | Sakshi
Sakshi News home page

LIVE Updates: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి

Published Fri, Sep 9 2022 8:15 AM | Last Updated on Fri, Sep 9 2022 8:33 PM

Ganesh Immersion 2022 Hyderabad Mahaganapathi Shobha Yatra Highlights - Sakshi

ఖైరతాబాద్‌ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్‌ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

క్రేన్‌ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్‌ గణపతి

ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు

తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు ఖైరతాబాద్‌ గణేషుడు..
► ఖైరతాబాద్‌ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్‌ క్రైన్‌ వరకు తరలివెళ్తున్నాడు. 

►ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్‌ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు.

►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. వర్షం పడితే  ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్  వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది.  

► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు.  నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు.

► ఖైరతాబాద్‌  బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఖైరతాబాద్‌ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది.

►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 

►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు.

► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని.

►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు  ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. 

► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. 
►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్‌ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్‌ మోడల్‌ మెకానికల్‌ ట్రయిలర్‌ ఓల్వో ఇంజిన్‌ సామర్థ్యం. డీఎస్‌–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్‌ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. 

►ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు.  

క్రేన్‌ నంబర్‌ 4 వద్దకు..  
ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నంబర్‌–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్‌ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. 

రూట్‌ మ్యాప్‌ ఇలా.. 
ఖైరతాబాద్‌ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్‌ థియేటర్‌ ముందు నుంచి రాజ్‌ దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నం– 4 వద్దకు చేరుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement