
హనుమకొండ: చెత్త ఏరే చిట్టిచేతులు నోట్బుక్స్ పట్టాయి. చెదిరిన నెత్తి, చిరిగిన బట్టలతో ఉండే పిల్లలు శుభ్రంగా తయారై బడిబాట పట్టారు. 11 మంది బాలలు చెత్తకుప్పలను వీడి చదువులమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చెత్త ఏరుకునే బాలలతోపాటు తల్లిదండ్రులను పిలిపించారు. చదువు ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన, చైతన్యం కల్పించారు. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. వెంటనే జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీనును పిలిపించి 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చించారు. పిల్లలకు నోట్బుక్స్ అందించారు. బాలలకు, తల్లిదండ్రులకు వినయ్భాస్కర్ భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment