సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన అతగాడు తండ్రి మెడికల్ షాపును అడ్డాగా చేసుకుని రెమిడెసివిర్ (రెడీఎక్స్ఎల్) ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలెట్టాడు. ఒక్కో దాన్ని రూ.35 వేలకు అమ్ముతున్న ఇతడి వ్యవహారంపై నార్త్జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్రావు శుక్రవారం వెల్లడించారు.
సికింద్రాబాద్లోని పాన్ బజార్కు చెందిన ఆకుల మేహుల్ కుమార్ హైటెక్ సిటీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉద్యోగి. ఇతడి తండ్రి విజయ్కుమార్ పాన్ బజార్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్స్కు భారీ డిమాండ్ వచ్చింది. తన తండ్రి దుకాణంలో కూర్చున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మేహుల్ వాటిని సమీకరించుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెడుతూ వివిధ మార్గాల్లో రెమిడెసివిర్ సంబంధిత ఇంజక్షన్ అయిన రెడీఎక్స్ఎల్ సమీకరిస్తున్నాడు. వీటిని అవసరమున్నవారికి అధిక ధరలకు విక్రయిండం మొదలెట్టారు. గరిష్టంగా ఒక్కో ఇంజక్షన్ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై ఉత్తర మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం మేహుల్ ను పట్టుకుని నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు.
కేపీహెచ్బీకాలనీ పరిధిలో....
రెమిడెసివిర్ ఇంజక్షన్ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ వద్ద గల ఓ మెడికల్ షాపు వద్ద రెమిడిసెవిర్ ఇంజక్షన్ కలిగి ఉన్న జోసఫ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు నాలుగు ఇంజక్షన్లు విక్రయించాడు. మరో ఇంజక్షన్ను 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు జోసఫ్రెడ్డిని ఇంజక్షన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
హయత్నగర్లో...
రెమిడెసివిర్ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. హయత్నగర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ కొర్ర బాల్రాజు, భాషపంగు పరశురాములు, భాషపంగు రవీందర్లు పథకం ప్రకారం తమకు తెలిసిన మెడికల్ దుకాణాలు, డి్రస్టిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను రూ.30 నుంచి 35 వేలకు అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆస్పత్రి సమీపంలో ఇంజక్షన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్న బాల్రాజును అరెస్టు చేశారు.
( చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ )
Comments
Please login to add a commentAdd a comment