విశాఖ సిటీ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. ఓటరు తీర్పుపై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితాల కోసం 20 రోజుల పాటు వేచి చూడాల్సిందే. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుతో టెన్షన్కు తెరపడనుంది. అప్పటి వరకు ఓటరు తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉండనుంది. విశాఖలో 7 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జిల్లాలో 1991 పోలింగ్ కేంద్రాలకు గాను కొన్నింట్లో రాత్రి 11 గంటల వరకు ఓటింగ్ జరిగింది. అనంతరం ఎన్నికల అధికారులు రాత్రి పటిష్ట భద్రత మధ్య ఈవీఎం, వీవీ ప్యాట్లను ఆంధ్రా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించి భద్రపరిచారు.
మూడంచెల భద్రత
స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 20 రోజుల పాటు ప్రజా ఓటు భద్రంగా ఉండేందుకు అక్కడ మూడంచెల భద్రతను కల్పించారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చారు. ఆయా ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్ భద్రతను పరిశీలించిన సీపీ
ఏయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ మంగళవారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏయూలో అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అక్కడి పరసర ప్రాంతాలను పరిశీలించి భద్రతపై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు.
ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకు సీల్
మహారాణిపేట : ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, సాధారణ పరిశీలకుడు అమిత్ శర్మ పరిశీలించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈవీఎంలను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. ఈ రూమ్లకు సీల్ వేయడంతోపాటు కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు.
ఏయూలో స్ట్రాంగ్ రూమ్లకు చేరిన
ఈవీఎంలు
మూడంచెల భద్రత ఏర్పాటు
20 రోజుల పాటు అభ్యర్థులో టెన్షన్
జూన్ 4న ఉత్కంఠకు తెర