టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. వార్నర్(4) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147), సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.