Bihar Election 2020 Results
-
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్లో బిహార్ ఎన్నికల ఫలితాల ఎపిసోడ్ చివరి అంకానికి చేరినట్లు కనపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు బిహార్ కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ తెర ముందుకొచ్చారు. తన వల్లే పార్టీ రాష్ట్రంలో పరాజయం పాలైందని ఒప్పుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఓటమి గల కారణాలను వివరించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. గత 20 ఏళ్లలో ప్రత్యర్థులు గెలుస్తున్న సీట్లను తమకు కేటాయించడం వల్లే ఈ పరాజయం పొందామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తమకు బలంలేని చోట పోటీకి దిగామని, పరాజయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానని అన్నారు. వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్న చోట సరిచేయాలని అధినేతతో చెప్తానని అన్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆయన అంగీకరించారు. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయిన గెలవాలంటే పార్టీలో భారీ సంస్కరణలు అమలు చేయాలని అన్నారు. ఇంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టాలని పరోక్షంగా రాహుల్ని ఉద్ధేశించి బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ నానాటికీ బలహీన పడుతుందని, వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని మరో సీనియర్ నేత చిదంబరం సూచించారు. అంతేకాకుండా బిహార్లో సీట్ల ఎంపికలో సరిగా వ్యవహరించలేదని, ప్రతిపక్షాలు గత 20 ఏళ్లలో గెలుస్తున్న 25 సీట్లను అంటగట్టారని అన్నారు. అన్ని స్థానాల్లో కాకుండా 45 సీట్లలో పోటీకి నిలిపితే బాగుండేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కపిల్ సిబల్ అంటే చాలా గౌరవమని అన్నారు. పరాజయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్పిందని అన్నారు. బిహార్లో కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయానికి దగ్గరలో ఉండేదన్న వ్యాఖ్యలపై మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లో ఉప ఎన్నికల్లోనూ పరాజయం తరువాత ఇవి తీవ్రమయ్యాయి. (చదవండి: కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు) -
మూన్నాళ్ల ముచ్చట.. మంత్రి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మూడు రోజుల కిందట బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. కాగా గతంలో ఆయన భాగల్పూర్ వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్సలర్గా పని చేశారు. ఆ సమయంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్ అవినీతిపరులకు కేబినెట్లో చోటు కల్పించారంటూ ఆర్జేడీ నేతలు ఆరోపించారు. (చదవండి: వీడియో వైరల్.. నెటిజన్ల విమర్శలు) ఇక ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడటంతో ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి తరుణంలో మేవాలాల్ చౌదరి రాజీనామా చేయడం గమనార్హం. (చదవండి: బిహార్: మంత్రులకు శాఖల కేటాయింపు) -
కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్లో బిహార్ ఎన్నికల రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించగా, తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అన్ని ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతోందని, సంస్థాగతంగా అది నిరూపితమవుతోందని అన్నారు. పార్టీ అనేక పరాజయాల్లో తాను నాయకత్వాన్ని బలపరిచానని, విధేయతతో మెలిగానని అన్నారు. బిహార్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అన్నిటి కన్నా మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం కింది స్థాయిలో కాంగ్రెస్ బలంగా లేదని తెలియజేస్తుందని అన్నారు. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లోపించడం కానీ లేదా పార్టీ బలహీనపడిపోవడం కానీ కావచ్చని చెప్పారు. బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ... చివరకు ఫలితం తారుమారైందని అన్నారు. ఈ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరుస ఎదురు దెబ్బలతో కాంగ్రెస్ డీలా పడుతుందని సమీక్ష అవసరమని అన్నారు.సీపీఐ(ఎంఎల్)ఎంఐఎం వంటి చిన్న చిన్న పార్టీలు మంచి ఫలితాలు సాధించాయని,కారణం అవి సంస్థాగతంగా బలంగా ఉండటంతో సాధ్యమయిందన్నారు.ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగవలసి ఉన్న ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం’ అన్నారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గాంధీయేతరులు పార్టీని నడిపించాలని పిలుపునిచ్చారు కదా అనే ప్రశ్నకు చిదంబరం జాగ్రత్తగా సమాధానం ఇచ్చారు. "ఎఐసిసి (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సమావేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో నేను చెప్పలేను. ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు" అని ఆయన అన్నారు. బిహార్లో పార్టీ ఓటమి తరువాత చాలా మంది తమ గళాన్ని విప్పుతున్నారు.పార్టీ పనితీరును సమీక్షించాలని, ఆత్మపరీశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కపిల్ సిబల్ అయితే బహిరంగంగా పార్టీ క్షీణించిందని,రాజకీయలను అర్థం చేసుకునే అనుభవజ్ఞులైన వారి చేతిలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ కూటమి బిహార్లో విజయానికి కొద్ది దూరంలో ఆగిందని, అయిన నిందలన్నీ మాపైనే పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ 19 మాత్రమే గెలుచుకుందన్నారు.యూపీ,ఎంపీలో కీలకమైన సమయంలో చేతులెత్తేసిందని అన్నారు. -
బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి సామాజిక నేపథ్యం ఏమిటీ? వారు సమాజంలో ఏ వర్గానికి చెందిన వారు? తెలుసుకునేందుకు విజేతల కుల, మతాలు, ఆడ, మగ అంశాలపై ‘త్రివేది సెంటర్ ఆఫ్ పొలిటికల్ డాటా’ పరిశోధకులు వివరాలు సేకరించి ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ వద్ద నున్న డాటాతో విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40.7 శాతం మంది ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన వారు కాగా, అగ్రవర్ణాలకు చెందిన వారు 30 శాతం మంది, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16. 5 శాతం మంది ఉన్నారు. ముస్లిం మతానికి చెందిన వారు 8 శాతం మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారికన్నా ఇతర వెనక బడిన వర్గాల వారే ఎక్కువ మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన వారు బీజేపీ తరఫున 34 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 13 మంది జేడీయూ తరఫున పది మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు విజయం సాధించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వారు రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 39 మంది, బీజేపీ తరఫున 27 మంది, జేడీయూ తరఫున 22 గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున ఇద్దరంటే ఇద్దరే విజయం సాధించారు. (చదవండి: కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్) ఇక టిక్కెట్ల కేటాయింపు విషయానికొస్తే మొత్తం 110 అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకు 52 టిక్కెట్లు, ఇతర వెనకబడిన వర్గాలకు 39, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 15 టిక్కెట్లు, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఒక టిక్కెట్ కేటాయించింది. ముస్లిం వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో ఓబీసీలకు 69 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 18, ముస్లింలకు 19 టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన మరో 14 మంది అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఓబీసీలేనని అర్థం అవుతోంది. జేడీయూ విషయానికొస్తే ఓబీసీలకు 59 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23 టిక్కెట్లు, షెడ్యూల్డ్ కులాలకు 18, ముస్లింలకు 11, షెడ్యూల్డ్ తెగలకు ఒక టిక్కెట్ కేటాయించారు. ముగ్గురు అభ్యర్థుల వివరాలు తెలియరాలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల వారికే ఎక్కువ సీట్లను కేటాయించగా, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వెనకబడిన వర్గాల వారికే కేటాయించాయి. ఇక అగ్రవర్ణాల్లో ఏ సామాజిక వర్గానికి పార్టీలు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాయో పరిశీలిస్తే ఏ వర్గానికి ఆ పార్టీలు ప్రాధన్యత ఇచ్చాయో కూడా స్పష్టం అవుతుంది. బీజేపీ 24.5 శాతం టిక్కెట్లను రాజ్పుత్లకు, 11.8 శాతం టిక్కెట్లు బ్రాహ్మణులు, 7.3 శాతం టిక్కెట్లు భూమిహార్లు, బిహార్లో ఓబీసీలుగా పరిగణించే కొమట్లు కూడా వారి జనాభాతో పోల్చి చూస్తే ఎక్కువగానే ఇచ్చింది. ఇక ఓబీసీల్లో యాదవ్లకు 13.6 శాతం, ఇతర ఓబీసీలకు 22 శాతం టిక్కెట్లు కేటాయించింది. జనతాదళ్ యూ పార్టీ ఓబీసీల్లో కుర్మీలకు 14 శాతం, యాదవ్లకు 13 శాతం టిక్కెట్లను కేటాయించగా, యాదవ్లు, కుర్మీలు కాకుండా ఇతర ఓబీసీలకు 25 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ 31 శాతం టిక్కెట్లను యాదవ్లకు, మిగతా శాతం టిక్కెట్లను మిగతా అన్ని వర్గాలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల వారికి 40 శాతం టిక్కెట్లను, ముస్లింలకు 17 శాతం టిక్కెట్లను కేటాయించింది. బీజీపీ కారణంగా 2000 సంవత్సరం నుంచి బీహార్ ఎన్నికల్లో ఠాకూర్ల ప్రాబల్యం పెరగతూ వస్తోంది. అందుకనే ఆ రాష్ట్రంలో బీజేపీని రాజ్పుత్ల పార్టీగా వ్యవహరిస్తున్నారు. తగ్గిన మహిళల ప్రాతినిధ్యం గత అసెంబ్లీ కన్నా ఈసారి ఎన్నికల్లో పలు పార్టీల తరఫున ఎక్కువ మంది మహిళలు పోటీ చేసినప్పటికీ తక్కువ మంది విజయం సాధించడం గమనార్హం. 2015 ఎన్నికల్లో 273 మంది మహిళలు పోటీ చేయగా, ఈసారి 371 మంది పోటీ చేశారు. వారిలో మహా కూటమి తరఫున 62 మంది పోటీ చేయగా, ఏన్డీయే తరఫున 37 మంది పోటీ చేశారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి 26 మంది మాత్రమే విజయం సాధించారు. -
బిహార్: మంత్రులకు శాఖల కేటాయింపు
పట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతిష్ కుమార్ ముఖ్యమంత్రిగా సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రి మండలిలో బీజేపీకి 7, జేడీయూకి 5 పదవులు దక్కాయి. హెచ్ఏఎం, వీఐపీలు కూడా మంత్రిమండలిలో స్థానం సంపాదించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కీలకమైన హోంశాఖతో పాటు ప్రజా పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి, రేణూ దేవి, తార్ కిషోర్లను డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కాగా రేణూ దేవి గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఇక నితీశ్ కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం పంచాయతీ రాజ్, సంక్షేమం, పరిశ్రమల శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్నారు. నితీశ్ సీఏంగా ఉన్న 15 ఏళ్లలో ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన సుశీల్ మోదీ స్థానంలో రేణూ దేవి, తార్ కిషోర్కు ఈసారి అవకాశం కల్పించడం గమనార్హం. తార్ కిషోర్ ఆర్థిక, వాణిజ్య పన్నులు, పర్యావరణం, అటవీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ , పట్టణాభివృద్ధి శాఖలను పర్యవేక్షించనున్నారు. ఇక మంగళవారం జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో నవంబర్ 23 నుండి నవంబర్ 27 వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశానికి నూతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 17వ అసెంబ్లీ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.(చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి) మాజీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి (జేడీ-యు)- గ్రామీణ ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, సమాచారం , ప్రజా సంబంధాలు, పార్లమెంటరీ వ్యవహారాలు బిజేంద్ర ప్రసాద్ యాదవ్(బీజేపీ)- ఇంధన, నిషేధ, ప్రణాళిక, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు మేవాలాల్ చౌదరి (జేడీ-యు)- విద్యా శాఖ షీలా కుమారి(బీజేపీ)- రవాణా శాఖ మాజీ సీఎం, హెచ్ఏఎం అధినేత జితన్ రామ్ మాంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్- చిన్న నీటిపారుదల , ఎస్సీ / ఎస్టీ సంక్షేమ శాఖలు ముఖేష్ సాహ్ని(వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ- వీఐపీ)- పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మంగల్ పాండే (బీజేపీ)- ఆరోగ్య, రహదారి, కళా సంస్కృతి శాఖ అమ్రేంద్ర ప్రతాప్ సింగ్(బీజేపీ)- వ్యవసాయం, సహకార సంస్థలు రాంప్రీత్ పాశ్వాన్- ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ జీవేశ్ మిశ్రా(బీజేపీ)- పర్యాటక, కార్మిక, గనుల శాఖ రామ్ సూరత్ రాయ్- రెవెన్యూ, న్యాయ శాఖ -
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్కు ఇది ఏడోసారి. 2005 నవంబర్ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్ బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్భవన్లో నితీశ్తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్ఏఎం నుంచి మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్(ఎంఎల్సీ), వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్ ముకేశ్ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్ యాదవ్కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. 2000లో తొలిసారి నితీశ్కుమార్ బిహార్ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్కుమార్ బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. -
కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరోసారి పార్టీ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బీహార్తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. తాము ఆశించిన స్థాయిలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదని కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలివైనదని, ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుందన్నారు. పార్టీ అధినాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ గత ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఈ అంశంపై పార్టీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే తన అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పటికీ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేయడంలేదని, బహిరంగంగా వ్వక్తపరచకుండా తనను పార్టీ నిర్భందించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నాయకత్వ మార్పు చేసి దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మనతో కలిసి రావాలనుకోవడం సరైంది కాదని మనమే ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనుభవం ఉన్నవారిని ప్రోత్సహించాలని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బిహార్తో పాటు ఉప ఎన్నికల్లో ఓటమిని సాధారణ విషయంగానే భావిస్తున్నట్లు ఉందని, ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
బిహార్ డిప్యూటీ సీఎంగా మహిళకు చాన్స్!
పట్నా: బిహార్ మంత్రి మండలిలో ఏ పార్టీకి అధిక ప్రాధాన్యం, ఎవరెవరికి అవకాశం దక్కనుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి మంత్రి మండలిలో అధిక ప్రాధాన్యం ఉండనుంది. బీజేపీ నేతలు తారా కిశోర్ ప్రసాద్, రేణు దేవికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీ లెజిస్లేటివ్ నేతగా తారా కిశోర్ ప్రసాద్, ఉప నేతగా రేణు దేవి ఎన్నికవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ నేత నంద కిశోర్ స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. జేడీయూ నుంచి విజయ్ చౌదరి మరోమారు మంత్రి పదవి చేపట్టనున్నారు. హెచ్ఏఎం పార్టీ నుంచి సంతోష్ సుమన్, వీఐపీ పార్టీ నుంచి ముఖేశ్ సాహ్ని మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీయూ నేత విజేంద్ర యాదవ్, జేడీయూ బిహార్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, తారాపూర్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి, ఫూల్పూర్ ఎమ్మెల్యే షీలా కుమారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుత నితీశ్ కేబినెట్లో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి ఈసారి మొండిచేయి ఎదురవనుంది. అయితే, ఆయనకు కేంద్రంలో పదవీ బాధ్యతలు ఇస్తారని తెలిసింది. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ పార్టీల మహాగఠ్ బంధన్ 110 స్థానాలు మాత్రమే సాధించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
‘రాహుల్ ఆ సమయంలో ప్రియాంక ఇంట్లో ఉన్నారు’
పట్నా: బిహార్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్లో పరస్పర విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్తో దోస్తీనే తమను దెబ్బ తీసిందని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మనసుపెట్టి పని చేయలేదని వ్యాఖ్యానించారు. తమ కూటమికి కాంగ్రెస్ ఒక అడ్డంకుగా మారిందని విమర్శించారు. 70 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి కనీసం 70 బహిరంగ సభలను కూడా కాంగ్రెస్ నిర్వహించలేకపోయిందని అన్నారు. రాహుల్ గాంధీ మూడు రోజులు మాత్రమే ర్యాలీల్లో పాల్గొన్నారని, ప్రియాంక గాంధీ అసలు రానేలేదని వాపోయారు. బిహార్తో పెద్దగా పరిచయం లేదని ఇలా చేయడం తగదని అన్నారు. తమ దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందని తివారీ అన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీచేసి తక్కువగా సీట్లను సాధించడంపట్ల ఆ పార్టీ దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక ఇంటికి పిక్నిక్కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పార్టీని నడిపే విధానం ఇదేనా అని రాహుల్ని తివారం సూటిగా ప్రశ్నించారు. మరోవైపు కూటమిలో సీట్ల పంపకం చాలా ఆలస్యం కావడంతోనే ప్రచారం సరిగా సాగలేదని, ఓటమికి అదే కారణమని కాంగ్రెస్ వాదిస్తోంది. కాగా, 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరగ్గా.. ఎన్డీఏ కూటమి 124 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కూటమి మహాగఠ్ బంధన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 111 సీట్లలో విజయం సాధించింది. మహాగఠ్ బంధన్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని కూటమి సభ్యులు విమర్శిస్తున్నారు. 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలో మాత్రమే గెలుపొందడం దీనికి కారణం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందింది. ఇక 76 స్థానాల్లో గెలుపొందిన ఆర్జేడీ బిహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో మూడు సీట్లలోనే విజయం సాధించిన లెఫ్ట్ పార్టీలు తాజాగా 16 స్థానాల్లో గెలుపొందాయి. -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్భవన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
నాలుగో సారి బిహార్ సీఎంగా నితీశ్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్ పగ్గాలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాలుగోసారి చేపట్టనున్నారు. ఈ వీషయాన్ని ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఆదివారం నితీష్ కుమార్ ఇంట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేడీయూతో పాటు బీజేపీ, హెచ్ఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి పక్ష నేత, ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్త్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సుదీర్ఘం చర్చల అనంతరం శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది. 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్ కుమార్నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రేపు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో అవామీ మోర్చా, వికాస్ వీల్ హిన్సాన్ చెరో 4 చోట్ల గెలుపొందింది. -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్పరివార్తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
బిహార్లో నేనే విజేత: తేజస్వి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు. గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్విæ ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నితీశ్‡ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు. నితీశ్ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఓట్ల తేడా 0.03% ఎన్నికల్లో హోరాహోరి పోరు మధ్య బొటాబొటి సీట్ల మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న ఎన్డీయే ఓట్ల విషయంలో మరీ వెనుకబడిపోయింది. ఎన్డీయేకి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్కి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 0.03శాతం. ఎన్డీయే కూటమికి 37.26శాతం ఓట్లు పోలయితే, మహాఘట్ బంధన్ కూటమికి 37.23% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీలకు 25.51% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకి 1,57,01,226 ఓట్లు వస్తే, మహాఘట్ బంధన్కి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 12,768 ఓట్లు మాత్రమే. ఇరుపక్షాల మధ్య గెలుపు ఆధిక్యాలు అత్యంత స్వల్పంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. 243 సీట్లకు గాను 130 సీట్లకు సంబంధించి మొత్తం పోలయిన ఓట్లలో సగటు ఆధిక్యం 16,825గా ఉంది. -
ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
పట్నా: లోక్ జనశక్తి పార్టీని ఎన్డీయేలో కొనసాగించడంపై నిర్ణయం తీసుకునేది కూటమిలోని కీలక భాగస్వామి అయిన బీజేపీయేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితం కావడానికి ఎల్జేపీనే కారణమన్న వార్తలపై నితీశ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 71 స్థానాల్లో గెల్చడం తెల్సిందే. ఎన్డీయే మిత్రపక్షాలతో శుక్రవారం చర్చించి, ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తామని నితీశ్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగుస్తుందని, అందువల్ల ప్రమాణ స్వీకారానికి తమకు తగినంత సమయముందని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 లోపు ప్రమాణ స్వీకారం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల సీఎంగా పాలనలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశముందా? అన్న ప్రశ్నకు నితీశ్.. అలాంటిదే ఉండబోదని సమాధానమిచ్చారు. ‘నేరాలు, అవినీతి, మతతత్వం.. ఈ మూడింటి విషయంలో రాజీ ఉండదు. వాటి విషయంలో మా విధానంలో మార్పు ఉండదు. నేను సీఎం అయిన తరువాత బిహార్లో ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు’ అన్నారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో గెలుపొందడంపై స్పందిస్తూ.. ప్రజా తీర్పు అంతిమమని వ్యాఖ్యానించారు. ‘ఇవే నా చివరి ఎన్నికల’ని ప్రచార సమయంలో తాను చేసిన వ్యాఖ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీశ్కుమార్ తెలిపారు. ‘చివరి ఎన్నిక అంటే నా ఉద్దేశం చివరి ప్రచార సభ అని’ అని వివరణ ఇచ్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం!? బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి నితీశ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. పవిత్రమైన ‘భయ్యూ దూజ్’ పండుగ రోజైన సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి. -
బిహార్ ఫలితాలు; ఎన్డీఏ విజయం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని 40 లోక్సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్ అంశాల కారణంగా నాడు అన్ని లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. (చదవండి.. బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్ను 2020లో కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేసింది. దాంతో దేశవ్యాప్తంగా వలసలు పోయిన బిహారీలో ఆకలిదప్పులతో అలమటిస్తూ, అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో బిహార్లో పాలకపక్ష మనుగడ ఈసారి ఎన్నికల్లో ప్రశ్నార్థకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నిలకపై ప్రధానంగా అభివృద్ధి అంశం ప్రభావితం చేస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడగా, నిరుద్యోగం ప్రభావితం చేస్తుందని 30 శాతం మంది, ద్రవ్యోల్బణం ప్రభావం చూపిస్తుందని 11 శాతం మంది ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాలేవి నిజం కాలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్షలాది బిహారి పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందజేయడం ఎన్నికల ఫలితాలను ఎంతో ప్రభావితం చేసింది. తమను వాస్తవంగా గెలిపించిందీ సైలెంట్ ఓటర్లయిన మహిళలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలో పూర్తి వాస్తవం ఉంది. మగవారికన్నా ఐదుశాతం ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళల కోసం మోదీ చేపట్టిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఎంతోకొంత మహిళలను ప్రభావితం చేయగా, స్థానిక సంఘాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను నితీష్ ప్రభుత్వం కల్పించడం, పాఠశాలలకు వెళ్లే బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం పాలకపక్షానికి కలసి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాం నుంచి పురుషాధిపత్య రాజకీయాలను చూస్తూ వస్తోన్న బిహార్ మహిళకు నితీష్ పట్ల గౌరవం పెరుగుతూ వచ్చింది. ‘రోజ్గార్’ నినాదానికి ఎక్కువగా ఆకర్షితులైన యువత మాత్రం తేజస్వీ యాదవ్ వైపు వెళ్లింది. ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ నితీష్ కుమార్ చెప్పడం కూడా బిహార్ ఆఖరి విడత ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ఆ మాటలకు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. నితీష్–మోదీ అనే డబుల్ ఇంజన్ ప్రచారం కూడా కలిసొచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడం, యాదవ్ సోదరులకు ఒకరంటే ఒకరికి పడక పోవడం, తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో కాకుండా ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం కూడా బిహార్ పాలకపక్షానికి కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లు లాంటి అంశాలపై తేజస్వీ యాదవ్ పూర్తిగా మౌనం వహించడం 28 శాతం –30 శాతం కలిగిన ముస్లింలు–యాదవ్ల బంధాన్ని బలహీనపర్చింది. 2015 ఎన్నికల సందర్భంగా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోకి అడుగుపెట్టిన అసుదుద్దీన్ ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎంను విస్తరించడంలో విజయం సాధించడం కూడా పాలకపక్ష కూటమికి కలిసొచ్చిన మరో అంశం. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్తో పొత్తు మహా కూటమికి కలసిరాని మరో అంశం. (చదవండి: ఎన్నికల ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) -
బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం ఎదురయింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో 33 స్థానాల్లో తలపడి కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. తమ ఓటమిని కాంగ్రెస్ నాయకులు ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఏఐఎంఐఎం సెక్యులర్ ఓట్లను చీల్చడమే తమ ఓటమికి కారణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయిందని, పైగా ఆ రెండు పార్టీలు కూడా ఒకే నాణెంకు రెండు ముఖాలని ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఎదురు దాడికి దిగారు. ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధాన పాత్ర పోషించాల్సిన బిహార్లోనే కాంగ్రెస్ పార్టీ ఇలా చతికిల పడితే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర నిర్వహించగలదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఎక్కువనే విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తగినన్ని సీట్లను గెలుచుకోలేక పోయినప్పటికీ తన పూర్వ వైభవాన్ని చెప్పుకొని ప్రాంతీయ పార్టీల నుంచి ఎక్కువ సీట్లను దక్కించుకుంటూ వస్తోంది. (బిహార్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం) 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే నాయకత్వంలో కూటమిలో 41 సీట్లను పంచుకొంది. అయితే వాటిలో ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. నాటి ఎన్నికల్లో ఏఐఏడిఎంకే ఏకంగా 134 సీట్లను గెలుచుకోగా, దాని ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే కేవలం 98 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఏఐఏడిఎంకే తాను గెలుచుకున్న స్థానాల్లో సగటున 40.78 శాతం ఓట్లు సాధించగా, డిఎంకే తాను గెలిచిన స్థానాల్లో 41.05 శాతం ఓట్లను సాధించింది. ఏఐఏడిఎంకేతో 41 స్థానాల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీ 33 చోట్ల ఓడిపోయింది. ఆ పార్టీకి 36.46 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన నాడు ఎన్నికల్లో డీఎంకే విజయావకాశాలను కాంగ్రెస్ పార్టీయే దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకొని 105 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 92 సీట్లకు పోటీ చేసి 44 సీట్లను గెలుచుకుంది. సీపీఏం 148 సీట్లకు పోటీచేసి కేవలం 26 సీట్లను మాత్రమే గెలుచుకుంది. రానున్న తమిళనాడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కలసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అయితే గతంలో ఇచ్చినన్ని సీట్లు ఇవ్వమని ఓ డీఎంకే నాయకుడు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలహీనతను మరోసారి చాటి చెప్పాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ లెక్కన వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. డీఎంకే–కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డీఎంకే కాదని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే అవకాశం లేదని, అందుకు బిహార్ ఎన్నికల ఫలితాలు కూడా దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: తేజస్వీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు) -
తేజస్వీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు
భోపాల్ : బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరొందిన ఆమె ప్రతిపక్షాలపై తరుచూ విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థులను పొగడటం చాలా అరుదు. బుధవారం భోపాల్లో జరిగిన కార్యక్రమంలో ఉమాభారతి మాట్లాడుతూ.. తేజస్వీ యాదవ్ మంచి కుర్రాడని, అతడికి మంచి భవిష్యత్ ఉందని ఆమె ప్రశంసించారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని.. కానీ ఎప్పటికైనా బిహార్ను పాలించేది అతనేనని జోస్యం చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపైనా ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి పరిపాలన అందించిఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఆయన తన పెద్దన్నయ్య లాంటి వాడని, ఈ ఎన్నికల కోసం ఎంతో నేర్పుగా పనిచేశారని ప్రశంసించారు. కాగా, మధ్యప్రదేశ్లో 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ19 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైన విషయం విదితమే. (బిహార్లో సరికొత్త అడుగులు!) -
టాపర్ ఎవరు..?
-
తేజస్వి వైఫల్యానికి ఐదు కారణాలు
పట్నా: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ అధికారపీఠాన్ని అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే అతి చిన్న వయసులో సీఎంగా రికార్డులకెక్కేవారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 200 ర్యాలీల్లో పాల్గొని, ఆర్జేడీ కుల సమీకరణలకు భిన్నంగా పది లక్షల ఉపాధి అవకాశాలపై హామీలిచ్చి, యువతరం మదిని మెప్పించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. బిహార్ రాజకీయాలను సుదీర్ఘకాలంపాటు శాసించిన రాజకీయ దురంధరుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిల కుమారుడు తేజస్వి. చదువు పెద్దగా అచ్చిరాక, అర్ధంతరంగా 10వ తరగతిలోనే చదువుకి స్వస్తిపలికిన తేజస్వి యిప్పుడు దేశంలోనే అతి తక్కువ వయస్సున్న ప్రతిపక్ష నేత. ఆయన రాజకీయారంగేట్రం 2015లో జరిగింది. 2018 నుంచి ఆర్జేడీ అధినాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ గెలుపుని ఖాయం చేసినా, ఆ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. అయితే బిహార్లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలపగలిగారు. క్షేత్ర స్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేజస్వి అనుకూల ఓటుగా మలుచుకోలేకపోయారు. మహాగఠ్ బంధన్ వైఫల్యం తేజస్వి వైఫల్యంగానే చూడాలని నిపుణులు అంటున్నారు. మహాకూటమి ఎందుకు ఓడిందంటే... 1. పేదరికం, ఉపాధి కల్పన, వలస కార్మికుల సంక్షోభం లాంటి విషయాలపై తేజస్వి ఎక్కువ దృష్టిపెట్టి, కులాలకు అతీతంగా ప్రచారం చేశారు. ఈ ఎత్తుగడ కలిసిరాలేదు. 2. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీపడి 19 మాత్రమే గెలవడం ఓటమికి ప్రధాన కారణమంటున్నారు. 3. ఏఐఎంఐఎం కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో పోటీచేసి, 5 స్థానాలు పొందడంతో పాటు, మిగిలిన చోట్ల ఓట్లు చీల్చింది. 4. ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది. 5. తేజస్వి క్షేత్ర స్థాయిలో జనంతో మమేకమై ఉంటే ఆర్జేడీ గెలుపు ఖాయమయ్యేదని అంచనా. -
నితీశ్కు ‘చిరాక్’
పట్నా: ‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే నా ప్రధాన ఉద్దేశం. ఈ ఎన్నికల్లో నేను చూపించిన ప్రభావం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’’.. ఎన్నికల ఫలితాల అనంతరం లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలివీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారం దక్కించుకుంది. ఈ కూటమిలోని బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుంది. మరో పార్టీ జేడీ(యూ) దారుణంగా చతికిలపడింది. ఇందుకు ప్రధాన కారణం ఎల్జేపీ పోటీలో ఉండడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలుండగా, 120 స్థానాల్లో చిన్నాచితక పార్టీలు ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీశాయి. ఇందులో 54 సీట్లలో ఎల్జేపీ బలమైన ప్రభావం చూపింది. వీటిలో 25 సీట్లలో జేడీ(యూ) రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎల్జేపీ పోటీ చేయడం వల్ల జేడీ(యూ) ఓడిపోయింది. మొత్తం 54 స్థానాల్లో ఎల్జేపీ మూడో స్థానంలో నిలిచింది. ఆయా స్థానాల్లో గెలిచిన, ఓడిన ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కంటే ఎల్జేపీకి దక్కిన ఓట్లే అధికం కావడం విశేషం. ఈ ఓట్లన్నీ ఓడిపోయిన ప్రధాన పార్టీకి పడి ఉంటే కచ్చితంగా గెలిచేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎల్జేపీ మతీహన్ అనే స్థానంలో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని చోట్లా పరాజయం పాలైంది. మహాకూటమికీ గట్టి దెబ్బ ఎన్డీయే మిత్రపక్షమైన వికాశీల్ ఇన్సాన్ పార్టీ కూడా ఎల్జేపీ వల్ల 4 స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చాలాచోట్ల ఎల్జేపీ అభ్యర్థులను నిలపలేదు. కొన్నిచోట్ల ఎల్జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎల్జేపీ వల్ల ఒక స్థానంలో మాత్రమే బీజేపీ ఓటమి మూటకట్టుకుంది. ఎల్జేపీ అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల మహాకూటమిలోని ఆర్జేడీ 12 సీట్లు, కాంగ్రెస్ 10, సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లలో ఓడిపోయాయి. మొత్తంగా చూస్తే చిరాగ్ పాశ్వాన్ వల్ల ఎన్డీయే 30, మహాకూటమి 24 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. లాభమెంత? నష్టమెంత? ఎల్జేపీ వల్ల ప్రధాన పార్టీలకు నష్టమే కాదు, లాభం కూడా దక్కింది. ఆయా పార్టీలు ఓడిపోవాల్సిన చోట గెలిచాయి. ఓట్లను ఎల్జేపీ చీల్చడంతో ఇది సాధ్యమైంది. ఎల్జేపీ పోటీ కారణంగా ఆర్జేడీ 24, కాంగ్రెస్ 6, జేడీ(యూ) 20, హిందూస్తాన్ ఆవామ్ మోర్చా 2, బీజేపీ ఒకటి, వీఐపీ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. స్థూలంగా చెప్పాలంటే.. చిరాగ్ పాశ్వాన్ కారణంగా బిహార్లో ఎన్డీయేకు లాభం 24, నష్టం 30. మహాకూటమికి లాభం 30, నష్టం 24. చిరాగ్ ఆత్మాహుతి దళంలా పని చేశారు ప్రధాని మోదీకి తాను హనుమంతుడి లాంటి భక్తుడినని చెప్పుకుంటున్న చిరాగ్ పాశ్వాన్ జేడీ(యూ)ను దెబ్బకొట్టడంపైనే దృష్టి పెట్టారు. ఆయన అనుకున్నది నెరవేరింది. ఈ ఎన్నికల్లో చిరాగ్, ఆయన బృందం ఆత్మాహుతి దళంలా పని చేసిందని జేడీ(యూ) నేత రాజీవ్ రంజన్ విమర్శించారు. -
మహిళలు మా సైలెంట్ ఓటర్లు
న్యూఢిల్లీ: 21వ శతాబ్ది రాజకీయాల ఏకైక ప్రాతిపదిక అభివృద్ధేనని తాజా బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ విజయాల వెనుక సైలెంట్ ఓటర్లుగా ఉన్న మహిళల పాత్ర మరవలేనిదన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మోదీ ప్రసంగించారు. బిహార్లో ఎన్డీయే విజయానికి తమ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదమే కారణమని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా బీజేపీని ఎదుర్కోలేక తమ పార్టీ కార్యకర్తలను హతమార్చే కుతంత్రాలకు కొందరు దిగుతున్నారని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీపై పరోక్ష ఆరోపణలు గుప్పించారు. ‘బీజేపీ కార్యకర్తలను హతమార్చి తమ లక్ష్యాలను సాధించగలమని కొందరు అనుకుంటూ ఉంటారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపు, ఓటములు సహజం. కానీ ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు మంచివి కాదు. ఈ హత్యా క్రీడ ఓట్లు రాల్చదు’ అని వ్యాఖ్యానించారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడాన్ని బీజేపీ తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిత్వంలో బిహార్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు విస్తరించాయని, దేశ ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద ముప్పు అని ప్రధాని తెలిపారు. ఓ జాతీయ పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లో చిక్కుకుపోయిందని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. దేశ సేవ చేయాలనుకునే యువత బీజేపీలో చేరాలని ప్రధాని కోరారు. మహిళలు, దళితులు, పేదలు, ఇతర అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని వివరించారు. ‘రెండు గదులు, రెండు సీట్ల’ స్థాయి నుంచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి బీజేపీ ఎదిగిందని మోదీ గుర్తు చేశారు. దేశాభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని దీనితో స్పష్టమవుతోందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరాడే విషయంలో బీజేపీ సుపరిపాలనను ప్రజలు గమనించారన్నారు. బిహార్లో గెలుపును ప్రస్తావిస్తూ.. అధికారంలో ఉండి కూడా వరుసగా మూడుసార్లు సీట్ల సంఖ్యను పెంచుకున్న ఏకైక పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, గుజరాత్ల్లో కూడా అధికారంలో ఉండి, మంచి విజయాలు సాధించామన్నారు. బిహార్లో బీజేపీ, జేడీయూ కూటమికి మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారన్న విశ్లేషకుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ విజయంలో మహిళల పాత్ర గణనీయంగా ఉందన్నారు. బిహార్లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీ ఘనతేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. బిహార్ ప్రజలకు సెల్యూట్: నితీశ్ పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు విజయం అందించిన బిహార్ ప్రజలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘సెల్యూట్’ చేశారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్డీయేకు మెజారిటీ అందించిన ప్రజలకు నా సెల్యూట్. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని నితీశ్ బుధవారం ట్వీట్ చేశారు. హాజరైన పార్టీ శ్రేణులు -
సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఎన్డీయే
పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు. మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీపావళి తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. నితీష్ కుమార్ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని, బీహార్ నితీష్ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్ చేశారు. (చదవండి : నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్మోదీ మాట్లాడుతూ.. బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. -
ఏడు లక్షల ఓట్లతో.. తేల్చిచెప్పారు!
పట్నా: టీ-20 మ్యాచ్లా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సాధారణ మెజార్టీతో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బిహారీలు పెద్ద ఎత్తున ‘నోటా’ వైపు మొగ్గుచూపారు. ఏడు లక్షలకు పైగా ఓటర్లు ‘నోటా’కు ఓకే చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7,06,252 (1.7 శాతం) మంది ఓటర్లు ‘నోటా’కే జై కొట్టారు. బిహార్లో 7.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం 4 కోట్ల మంది (57.09శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగినా ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ‘నోటా’ కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. హోరాహొరీగా జరిగిన పోరులో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ‘నోటా’తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 2013 నుంచి నోటా ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈవీఎంలలో చివరన దీన్ని పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’ గుర్తును ఎంచుకోవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటా గుర్తుకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. (చదవండి: నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
12 ఓట్లతో గెలుపు, అన్నీ అనుమానాలే!
పట్నా: ఉత్కంఠ రేపిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో జేడీయూకి ఓ చోట అనూహ్యం విజయం దక్కింది. హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణ మురారీ శరణ్ 12 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థి ఆర్తీ మునిపై విజయం సాధించారు. మురారీకి 61,848 ఓట్లు రాగా, మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీ మాత్రం ఇవన్నీ తప్పుడు లెక్కలని ఆరోపణలకు దిగింది. తొలుత తమ అభ్యర్థి ముని 547 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారని రిటర్నింగ్ అధికారి చెప్పి.. మళ్లీ మాట మార్చారని ఆర్జేడీ నేతలు వాదిస్తున్నారు. విన్నింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తామని చెప్పి.. అంతలోనే డ్రామాకు తెరతీశారని విమర్శించారు. (చదవండి: బిహార్ సీఎం పదవిపై ఉత్కంఠ!) సీఎం నితీష్ కుమార్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఇదంతా జరిగిందని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ‘తొలుత తమ అభ్యర్థికి 500 పైగా ఓట్ల మెజారిటీ అని చెప్పారు. సీఎం ఆఫీస్ నుంచి కాల్ రాగానే 13 ఓట్ల తేడాతో తమ అభ్యర్థి ఓడిపోయాడని కొత్తగా మాట్లాడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రద్దు కారణంగా విజయం తారుమారైందని సమర్థించుకుంటున్నారు’అని ఆర్జేడీ నేతలు విమర్శించారు. మరోవైపు జేడీయూ అభ్యర్థికి 232 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. ఆర్జేడీ అభ్యర్థికి 233 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ తెలిపింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఈసీ అధికారులు స్పష్టం చేసింది. ఇక తమ కూటమి అభ్యర్థులు 119 చోట్ల విజయం సాధించాల్సి ఉండగా.. 111 మంది మాత్రమే గెలిచారని, ఫలితాలపై అనుమానాలున్నాయని ఆర్జేడీ తెలిపింది. 119 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. (చదవండి: బీజేపీదే బిహార్) -
నితీష్ గెలిచింది ప్రధాని మోదీ వల్లే..
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ గెలిచినది ప్రధాని మోడీ వల్ల మాత్రమే అని అన్నారు. బుధవారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. బిహార్లోని ఓటర్లు ప్రధాని మోడీపై తమకున్న విశ్వాసం వ్యక్తం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధిని సాధించడానికి బిహార్లో బీజేపీ బలోపేతం కావడం అవసరమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎల్జేపీ బాగా పోరాడిందని అన్నారు. బిహార్ ఎన్నికల్లో 150 స్థానాల్లో సొంతంగా పోటీచేసి మెజారిటీ స్థానాల్లో మంచి ప్రదర్శన కనబరిచామన్నారు. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనే నినాదంతో పోటీచేసిన 6శాతం ఓట్లు సాధించాము. మమ్మల్ని పిచ్లాగ్ పార్టీ అని పిలిచారు. అయినా మేము ఎవరి మద్దతులేకుండా ధైర్యం చూపించామన్నారు.. దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. (బీజేపీదే బిహార్) కాగా.. సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. -
సీఎం పదవిపై ఉత్కంఠ!
-
బిహార్ సీఎం పదవిపై ఉత్కంఠ!
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్కుమార్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. 73 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సీఎం పీఠం తమకే కావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. ఈనేపథ్యంలో జూనియర్ స్థాయికి పడిపోయిన జేడీయూకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అభీష్టం మేరకే మంత్రివర్గం కూర్పు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కీలక మంత్రి పదవులు, స్పీకర్ పదవి తమకే కావాలని బీజేపీ స్పష్టం చేసినట్టుగా సమాచారం. (చదవండి: ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) అయితే, ముందుగా అనుకున్నట్టుగా సీఎం పదవి నితీష్కు ఇస్తామని, దానిలో ఎలాంటి అనుమానాలకు తావులేదని బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. మరోవైపు జేడీయూపై బిహార్ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిన క్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. సీఎంగా నితీష్ ఉన్నప్పటికీ రిమోట్ తమ చేతిలోనే ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా మచ్చలేని నాయకుడిగా పేరున్న నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. ఇక బిహార్లో ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ కార్యకర్తలు, ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. (చదవండి: బీజేపీదే బిహార్) -
బిహార్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా తెలంగాణ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింది. 2015లో జరిగిన బిహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఐదుచోట్ల తన అభ్యర్థులను బరిలో దింపి అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఒక్క స్థానమూ దక్కలేదు. 2019లో కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోక్సభకు పోటీ చేయటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి మజ్లిస్ గెలుపొందడం ద్వారా బిహార్లో బోణీ కొట్టింది. ఆ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్ఎఫ్)తో జత కట్టి 20 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఇందులో ఐదుగురు గెలిచారు. అమోర్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ 49.75 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. మూడుచోట్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ముందు నుంచీ పార్టీ నేతలు భావించారు. కానీ ఐదు సీట్లు రావటంతో ఆ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, 2019 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్గంజ్లో ఓటమి చవిచూడటం గమనార్హం. మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మాత్రం అడుగు పెట్టింది. పూర్తి ఫలితాల తర్వాతే మద్దతుపై నిర్ణయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిహార్ ఎన్నికల పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పడనున్న పరిస్థితులను బట్టి.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. సిమాంచల్ అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన బిహార్లో ఎంఐఎం సాధించిన విజయం చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?
పట్నా : అతి చిన్న వయసులోనే బిహార్ పీఠం ఎక్కాలన్న ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కల చెదిరింది. కాంగ్రెస్తో జత కట్టడం వల్లే ఆయన కథ మారిపోయిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ తేజస్వి యాదవ్ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ సారి యువతరం తేజస్వికి జై కొడుతుందని అంచనా వేసింది. మహాకూటమిలో భాగస్వామి కాంగ్రెస్కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్కి అత్యధిక సీట్లు కేటాయించారా ? ఈ సారి ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తే, కాంగ్రెస్కి 70 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు 23 స్థానాలను కేటాయించారు. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసింది. ఎన్డీయేకున్న అధికార వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలుచుకోవడంలోనూ, అగ్రకులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ దక్కించుకోవడంతో కాంగ్రెస్ కుదేలైంది. కాంగ్రెస్ని నమ్మి ఎక్కువ సీట్లు కేటాయించడంతో తేజస్వి ఇరకాటంలో పడిపోయారు. చీలిపోయిన ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిసి గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్ఎఫ్)గా ఏర్పడ్డాయి. ఎంఐఎం 5స్థానాలను గెలుచుకుంది. ఆర్జేడీకి మద్దతుగా నిలిచే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చిందనే చెప్పాలి. మహాఘట్బంధన్ ఓటమి పాలు కావడంలో జీడీఎల్ఎఫ్ పాత్ర కూడా ఉంది. -
బీజేపీదే బిహార్
సాక్షి, న్యూఢిల్లీ/ పట్నా: సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. 2015లో ఆర్జేడీతో కలిసి పోటీచేసి గద్దెనెక్కిన జేడీయూ.. రెండేళ్లకే ఆర్జేడీతో విభేదించి, బీజేపీకి చేరువై, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీశ్తో విబేధించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, సొంతంగా బరిలో నిలిచిన లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. కానీ, సుమారు 30 సీట్లలో శత్రు పక్షం జేడీయూ విజయావకాశాలను ఎల్జేపీ దెబ్బతీయగలిగిందని భావిస్తున్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్డీయే కూటమి మేజిక్ మార్క్ అయిన 122కి పైనే ఉన్నప్పటికీ.. సాయంత్రం ఒకదశలో 120కి పరిమితమయ్యేసరికి ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సమయంలో దాదాపు 20కిపైగా స్థానాల్లో ఆయా పార్టీల ఆధిక్యత వెయ్యి లోపే ఉండడంతో తుదివరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాజీ చీఫ్ అబ్దుల్ బారీ సిద్దిఖీ, లాలు ప్రసాద్ సన్నిహితుడు భోలా యాదవ్ ఓడిపోయారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధువు, బీజేపీ అభ్యర్థి నీరజ్ సింగ్ బబ్లూ ఛతాపూర్ స్థానం నుంచి గెలుపొందారు. మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ రఘోపూర్ స్థానం నుంచి, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్పూర్ నుంచి గెలుపొందారు. మాజీ షూటర్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన శ్రేయసి సింగ్(బీజేపీ) జముయి నుంచి గెలుపొందారు. హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ ఇమామ్గంజ్ స్థానంలో విజయం సాధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌధరిపై ఆయన గెలిచారు. ధమ్దహా స్థానం నుంచి జేడీయూ అభ్యర్థి లేసి సింగ్ గెలుపొందారు. బలం పెంచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 73 స్థానాల్లో విజయం నమోదు చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 157 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం 53 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీచేసి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం విశేషం. అయినప్పటికీ 2010తో పోలిస్తే తక్కువే. 2010లో 102 స్థానాల్లో పోటీచేసి ఏకంగా 91 స్థానాల్లో నెగ్గింది. అప్పుడు కూడా జేడీయూతో పొత్తు ఉంది. జేడీయూతో పొత్తు ఉన్న రెండు సందర్భాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకోవడం విశేషం. 2015లో ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హిందుస్తాన్ ఆవామ్ మోర్చాతో కలిసి పోటీచేయగా కేవలం 53 స్థానాల్లో మాత్రమే బీజేపీకి విజయం చేకూరింది. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఎల్జేపీ వల్ల నష్టం చేకూరకపోవడం, కోవిడ్ లాక్డౌన్ కాలంలో వలస కూలీలకు ఉచితంగా రైళ్లు నడపడం వంటి పరిణామాలు బీజేపీకి సానుకూలంగా మారాయి. నిరుద్యోగిత అంశం నేరుగా నితీష్కుమార్పై ప్రభావం చూపిన రీతిలో బీజేపీపై చూపలేదు. నితీష్ ఓటు బ్యాంకు ఏమేరకు పనిచేసింది? 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఇప్పుడు 43 సీట్లకు పరిమితమైంది. నితీష్కుమార్కు మహా దళితులు, ఎంబీసీలు, మహిళలు అండగా నిలవడం వల్లే 43 సీట్లు అయినా దక్కించుకోగలిగారు. ఎల్జేపీ ఎన్డీయే కూటమిని వీడి విడిగా పోటీచేయడం వంటి కారణాల వల్ల 2015 నాటి స్థాయిలో జేడీయూ సీట్లు గెలుచుకోలేకపోయింది. యాదవ సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లాలూప్రసాద్యాదవ్కు ఉన్నట్టుగా.. కుర్మి సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు నితీష్కుమార్కు లేదు. అత్యంత వెనకబడిన కులాలు, మహాదళితుల నుంచి నితీశ్కు మద్దతు ఉంది. అత్యంత బలహీన తరగతులకు ఓబీసీల్లో ప్రత్యేక గుర్తింపు, మహాదళితులకు ఎస్సీల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో వారు నితీష్ వెన్నంటి నిలిచారు. వామపక్షాల ఊపు మహాకూటమిలో భాగంగా ఉన్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) జోరు కనబరిచాయి. ఆయా వామపక్షాలు మొత్తం 29 సీట్లలో పోటీ చేసి 16 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో సీపీఐ(ఎంఎల్) 12, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు గెలుచుకున్నాయి. ఒకప్పుడు బిహార్లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డాయి. 2010లో కేవలం సీపీఐ ఒక సీటు మాత్రమే గెలుచుకోగా.. 2015లో సీపీఐ(ఎంఎల్) మూడు సీట్లు గెలవగలిగింది. ఆర్జేడీ పిలుపునిచ్చిన ‘ఆర్థిక న్యాయం’ నినాదాన్ని వామపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ బేజారు.. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పోటీ చేసిన సీట్లలో కనీసం మూడో వంతు కూడా గెలవలేకపోయింది. అయితే ఆయా సీట్లన్నీ గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నవేనని, అక్కడ గెలవలేకపోవడంలో ఆశ్చర్యమేదీ లేదని ఆ పార్టీ నాయకులే విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ మరికొన్ని సీట్లు నెగ్గి ఉంటే ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించగలిగేది. ఉనికి చాటుకున్న ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2015లో ఇక్కడ ప్రస్తానం ప్రారంభించిన పార్టీ ఈ ఎన్నికల్లో తన ఉనికి చాటుకుంది. అమౌర్లో జేడీయూపై(గతంలో కాంగ్రెస్ స్థానం), బహదూర్గంజ్(గతంలో కాంగ్రెస్ స్థానం)లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీపై, బైసీలో బీజేపీపై(గతంలో ఆర్జేడీ సీటు), జోకిహాట్లో ఆర్జేడీపై(గతంలో జేడీయూ), కొచ్చదామన్లో జేడీయూ(గతంలోనూ జేడీయూ సీటు)పై ఎంఐఎం గెలిచింది. అంటే మహాకూటమికి చెందిన మూడు స్థానాలను గెల్చింది. రెండు ఎన్డీయే సిట్టింగ్ సీట్లను గెలుచుకుంది. చతికిలపడిన ఎల్జేపీ దివంగత రాంవిలాస్పాశ్వాన్ కుమారుడు చిరాగ్పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన్శక్తి పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కింగ్మేకర్ కావాలనుకున్న చిరాగ్ పాశ్వాన్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గొప్పగా ఆశీర్వదించారు : మోదీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గొప్పగా ఆశీర్వదించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో చరిత్రాత్మక విజయం దక్కిందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ప్రత్యేకం అని పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు, బీజేపీ మధ్య ఉన్న బంధం విడదీయరానిదని గుర్తుచేశారు. ఎనిమిది స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వారు తమపై అభిమానం, ఆప్యాయతను చూపించారని తెలిపారు. మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ ప్రగతిశీల అజెండా, బీజేపీ రాష్ట్ర శాఖ కఠోరమైన శ్రమతో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించగలిగామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాహిత విధానాలు బీజేపీని ప్రజలకు చేరువ చేశాయని వెల్లడించారు. -
బిహార్లో పెద్దగా మార్పేమీ ఉండదు.. కానీ: పవార్
పుణె: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిదాయకమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మంగళవారం నాటి ఫలితాల వల్ల రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తును ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారు అవుతుండటంతో ఎన్డీయే, మహాగట్ బంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ విషయంపై స్పందించిన శరద్ పవార్ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ- జేడీయూ కూటమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (చదవండి: రానున్న ఎన్నికలకు ట్రైలర్ వంటిది: సీఎం ) ‘‘ఎన్నికల ప్రచారాన్ని గమనించినట్లయితే ఓ వైపు.. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్లు గుజరాత్ను పాలించిన, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. ఆయనతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తే.. మరోవైపు.. ఏమాత్రం అనుభవం లేని తేజస్వి యాదవ్ వంటి యువకుడు సొంతంగా పోరాడాడు. అతడు ప్రదర్శించిన ధైర్యం యువతకు స్ఫూర్తిదాయకం. ఈనాటి ఫలితాలు పెద్దగా మార్పు తీసుకురానప్పటికీ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆశించవచ్చు’’అని పేర్కొన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్పుర్ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపొందారు.(చదవండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
ఎన్నికలంటే కౌంటింగ్ ఒక్కటే కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంల పుణ్యమా అని ఓట్ల లెక్కింపు మొదలైన రోజే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన నాలుగు రోజుల వరకు ఫలితాలు వెలువడక పోవడంలో ఎన్నికల నిర్వహణలో అమెరికా, భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వెలువడ్డాయి. త్వరితగతిన ఫలితాలు వెలువడడం కన్నా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా సాగడం మంచిదన్న విషయం గ్రహించాల్పి అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పోలింగ్లో పారదర్శకత ముఖ్యం. భారత్లో జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతో ఉంటుందన్నది అందరికి తెల్సిందే. ఎన్నికల సందర్భంగా అధిక నిధులను ఖర్చుపెట్టే పార్టీలది, అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మేరకు డబ్బుతో ప్రలోభ పెట్టి ఓట్లను కొనుక్కోవచ్చు. వీధుల్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రకటనలు కుమ్మరిస్తూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ పార్టీలకు వస్తోన్న పెండింగ్ వల్ల ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు. రాజకీయ పార్టీలకు నిధుల విరాళాలపై పారదర్శకతను తీసుకొస్తానంటూ సవాల్ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’లను తీసుకొచ్చింది. ఎవరు ఇచ్చారో, ఎంత ఇచ్చారో పార్టీలకుగానీ, ప్రజలకుగానీ తెలియకుండా ఉండేలా ఎలకోటరల్ బాండ్లను తీసుకరావడంతో రాజకీయ పార్టీలకు నల్లడబ్బంతా విరాళాల రూపంలో వచ్చి పడుతోంది. దాంతో ఎన్నికల సందర్భంగా డబ్బు ప్రభావం పెరిగింది. అన్ని పార్టీలకు నిధులు వస్తాయి కనుక ఎన్నికలపై డబ్బు ప్రభావం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది కుహనా మేథావులు వాదిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీకే అధిక నిధులు వస్తాయని, ఆ పార్టీయే ఎన్నికల సందర్భంగా అధిక నిధులను కుమ్మరించి లాభ పడుతుందనే విషయం మనకు కొత్త కాదు. అమెరికా తరహాలో అందరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మనకు లేకపోవడం భారత్ ఎన్నికల వ్యవస్థలో మరో లోపం. మన దేశంలో ఉపాధి కోసం కోట్లాది మంది వలసలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసలు పోయారు. ఏటా కోట్లాది మంది యువత ఉపాధి కోసం వలసలు పోతూనే ఉన్నారు. ఎన్నికల సమయాలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లోనే ఉండి పోవడం వల్ల వారు పోలింగ్కు రాలేకపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో మరి కొన్ని కేటగిరీల వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్సించారుగానీ అది సరిపోదు. అందరికి దాన్ని కల్పించాల్సిందే. భారత్లో పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలే మారిపోతాయి. 2019లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యుల ఫిరాయింపును ప్రోత్సహించడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ, పోలీసు శాఖ అధికారులు కూడా పాలకపక్షం తరఫున కొంతమేరకు ఓటింగ్ను ప్రభావితం చేస్తారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అన్నీ ఏవీఎంలకు ఎవరికి ఓటు వేశామో ఓటరు తెలుసుకునేలా రసీదు పద్ధతిని ప్రవేశపెట్టాల్సిందే. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రసీదు సౌకర్యం కలిగిన ఈవీఎంలను ప్రతి నియోజకవర్గానికి ఐదింటిని మాత్రమే ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల్లో గెలవడమంటే అంతో ఇంతో డబ్బు అవసరం కనుక సామాన్యులు, నిజాయితీపరులు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆ పరిస్థితి కూడా మారాల్సిందే. -
బిహార్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు రావడం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిహార్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, 105 స్థానాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ముందంజలో ఉంది. ఇక మధ్యప్రదేశ్లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పది రౌండ్లు ముగిసేటప్పటికీ పాలకపక్ష టీఆర్ఎస్కంటే బీజేపీ అభ్యర్థి 3,734 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. బిహార్లో పాలకపక్షమైన జేడీయు–బీజేపీ కూటమి ఓడిపోతుందని, ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలియజేయగా, వెలువడుతున్న ఫలితాల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బిహార్ పోలింగ్లో అక్రమాలకు పాలకపక్షం వ్యూహం పన్నిందని, అందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు. (చదవండి: నితీష్కు సీఎం పీఠం దక్కుతుందా?) ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఈవీంలను ఉపయోగిస్తారు కనుక, వాటన్నింటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిపుణులే స్పష్టం చేశారు. అయితే ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదని, అలా చేయడం వల్ల అనుమానాలొస్తాయని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఎన్నికల విశ్లేషకులు పేర్కొన్నారు. బీహార్లోని 40 లోక్సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ ‘మోదీ ఓటింగ్ మెషిన్లే’ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గత బుధవారం విమర్శించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం (ఎం2) వెర్షన్ను కాకుండా వాటిని ఈవీఎం (ఎం3) వెర్షన్గా అభివద్ధి చేసి ఉపయోగించారు. అయితే, వాటన్నింటికి ‘ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ స్లిప్స్’ లేవు. 50 శాతం ఈవీఎంలకు ఆ సౌకర్యం ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ విషయమై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీం కోర్టు, మధ్యేమార్గంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల ఆడిట్ ట్రయల్స్కు అవకాశం ఉన్న ఐదు ఈవీఎంల చొప్పున ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాల తీరు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఉండడంతో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రెట్టింపవుతున్నాయి. (చదవండి: ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!) -
ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత వెనుకబడిన ఎన్డీఏ కూటమి.. ప్రస్తుతం అధిక స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. అయితే, కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల వరకు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ ఎక్కువ స్థానాల్లో లీడింగ్లో ఉండటం.. ఎగ్జిట్ పోల్స్ కూడా వారికే జైకొట్టడంతో జేడీయూ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ నితీష్ తిరిగి అధికారంలోకి రాకపోతే.. దానికి ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులేనని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తాం. నితీష్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను కాదని ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే.. బిహార్ వెనుకబడిందనేది నిజమని ఒప్పుకున్నట్టే’అని త్యాగి పేర్కొన్నారు. వలసలు, వరదలు, కరోనా ఇలా వరుస సంక్షోభాలు నితీష్ ప్రభుత్వాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి సొంతంగా పోటీచేసిన ఎల్జేపీక చిరాగ్ పాశ్వాన్ తమకు నష్టం కలిగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. (బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
బిహార్ ఓటరు తీర్పు నేడే
-
బిహార్ పీఠం ఎన్డీయేదే.. మరోసారి సీఎంగా నితీష్!
ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అవసరమైన సీట్ల కంటే ఎక్కువ దక్కించుకుంది. మెజారిటీ మార్క్ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. 243 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 123 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిహార్ పగ్గాలను మరోసారి సీఎం నితీష్ కుమార్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ కూటమి 108 స్థానాలో విజయం సాధించింది. మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మెజారిటీ మార్క్ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇక ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కి కాస్త దూరంలో ఆగిపోయింది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. ఇక ఎల్జేపీ ఒక్కస్థానంలో గెలిచింది. మళ్లీ పుంజుకున్న ఆర్జేడీ బిహార్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇంతవరకు వెనుకంజలో ఉన్న ఆర్జేడీ మళ్లీ పుంజుకుంది. ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్పుర్ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఇక అధికార జేడీయూ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మహా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మేమే గెలుస్తాం : ఆర్జేడీ బిహార్ ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. దర్బాంగలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బెనిపూర్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి వినయ్ చౌదరి జయకేతనం ఎగరవేశారు. జాలే, కెవాటిలో బీజేపీ గెలుపొందగా, మోకామాలో ఆర్జేడీ అభ్యర్థి అనంత్ సింగ్ విజయం సాధించారు. ఇక సుపాల్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్ గెలుపొందాడు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్లో, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ హసన్పూర్లో ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ ఇమాజీ గంజ్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాంకీపూర్లో శతృష్ను సిన్హా తనయుడు లవ్ సిన్హా, బిహారిగంజ్లో శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెనుకంజలో ఉంది మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఆర్జేడీ బిహార్లో ప్రభుత్వాన్ని తమే ఏర్పాటే చేస్తామని ఆర్జేడీ ధీమా వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ముందజలో కొనసాగుతున్నప్పటికీ.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాను వ్యక్తం చేసింది. ప్రతి జిల్లా నుంచి తమకు సానుకూల స్పందన వస్తుందని, రాష్ట్రంలో కచ్చితంగా మార్పు జరుగుతుందని ఆర్జేడీ ట్వీట్ చేసింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ బిహార్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇక ఎగ్జిట్ ఫలితాలను తారుమారు చేస్తూ బిహార్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 25స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 15 చోట్ల విజయం సాధించగా.. 91స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇతరులు 9చోట్ల, ఎల్జేపీ 2చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం ఈవీఎం ట్యాంపంరింగ్ జరిగిందనడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా.. ఈవీఎంలను తప్పపట్టరాదు. ఈవీఎం చాలా కచ్చితత్వమైన ఫలితాలను అందిస్తుందన్నారు. అలాగే ఈవీఎం ట్యాపంరింగ్ చేశారన్న ఆర్జేడీ నేతల ఆరోపణలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ కొట్టిపాడేశారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయడం అసాధ్యమని, గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తుది ఫలితం చీకటిపడ్డాకే కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఈవీఎం మెషీన్లు వాడటంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితం ఆలస్యం కానుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. రాత్రి పొద్దుపోయిన తర్వాతగానీ ఫలితాలన్నీ వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదని వెల్లడించింది. ఇక మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. మరో 118 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 3 చోట్ల విజయం సాధించగా.. 102 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇతరులు 10 చోట్ల, ఎల్జేపీ 2 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. కాక పెంచుతున్న ఓట్ల తేడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల పదుల సంఖ్యలో ఓట్ల తేడా ఉండటం ఆయా అభ్యర్థుల్లో, పార్టీల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. కాస్బా స్థానంలో ఎల్జేపీ 5 ఓట్ల ఆదిక్యంలో ఉండగా.. రాజ్గిర్లో జేడీయూ 26 ఓట్ల లీడింగ్ ఉంది. అలాగే, షేక్పురాలో జేడీయూ 48 ఓట్ల ఆదిక్యంలో ఉంది. నోఖా నియోజకవర్గంలో 73 ఓట్లు, ఎక్మాలో 104 ఓట్లు, బెలాగంజ్లో 113 ఓట్ల ఆదిక్యంలో ఆర్జేడీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 21.4 శాతం కౌంటింగ్ పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బిహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 5 గంటలపాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 1 గంట వరకు 87 లక్షల, 88 వేల, 780 ఓట్లు (21.4 శాతం) లెక్కించామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఓట్లున్నాయి. 170కి పైగా స్థానాల్లో స్వల్ప తేడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలుత కాంగ్రెస్-ఆర్జేడీ మహాఘట్ బంధన్ వైపు మొగ్గిన ఫలితాలు.. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపునకు మళ్లాయి. 170కి పైగా స్థానాల్లో అభ్యర్థుల మధ్య తేడా 2000 వేల ఓట్ల కంటే తక్కువగా ఉందని ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం 12 గంటలకు తెలిపింది. మొత్తం 243 స్థానాల్లో 99 చోట్ల 2000 ఓట్ల తేడా, మరో 54 చోట్ల 1000 ఓట్లలోపు వ్యత్యాసం మాత్రమే ఉందని వెల్లడించింది. 28 స్థానాల్లో 500 ఓట్ల కంటే తక్కువ తేడా ఉందని తెలిపింది. దాంతో ఓట్ల తేడా తక్కువగా ఉన్న స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించేది అంచనా వేయడం కష్టమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు రాజధాని పట్నాలో ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తొలుత ఆదిక్యం కనబరిచిన కాంగ్రెస్-ఆర్జేడీ మహాఘట్ బంధన్ వెనకంజలో కొనసాగుతుండటంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనౌతున్నారు. కౌంటింగ్ సరళిని బట్టి ఎన్డీఏ కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 120 కి పైగా స్థానాల్లో ఎన్డీఏ, 100 కు పైగా స్థానాల్లో మహాఘట్ బంధన్ ఆదిక్యంలో కొనసాగుతున్నాయి. కాగా, బిహార్లో మహాఘట్ బంధన్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన విషయం తెలిసిందే. అధిక స్థానాల్లో ఎన్డీఏ దూకుడు కౌటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటలు వెనుకంజలో ఉన్న ఎన్డీఏ కూటమి అనూహ్యంగా పుంజుకుని మెజారిటీ స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.40 గంటలకు ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం. ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉంది. అందులో బీజేపీ 70 స్థానాల్లో, జేడీయూ 48 స్థానాల్లో, వీఐపీ 6, హెచ్ఏఎం ఒక చోట ఆదిక్యంలో ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్లో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఇక గంట క్రితం వరకు ఎన్డీఏను వెనక్కినెట్టి ఎక్కువ స్థానంలో ఆదిక్యంలో కొనసాగిన మహాఘట్ బంధన్ క్రమక్రమంగా నెమ్మదించింది. ప్రస్తుతం 101 స్థానాల్లో లీడింగ్లో ఉంది. వాటిలో ఆర్జేడీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ 20, లెఫ్ట్ పార్టీలు 19 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ ఒక స్థానంలో, ఎంఐఎం రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎల్జేపీ ఐదు స్థానాల్లో, స్వతంత్రులు 4 చోట్ల ఆదిక్యంలో ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీ పోటాపోటీ! బిహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి బీజేపీ, ఆర్జేడీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. రాష్ట్రంలోని 243 స్థానాల్లో 230 సీట్లకు సంబంధించి ఎన్నికల ఫలితాల గణాంకాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. ఎన్డీఏ కూటమి 120 సీట్లలో ఆదిక్యంలో ఉండగా.. అందులో బీజేపీ 62 స్థానాల్లో, జేడీయూ 51 స్థానాల్లో లీడింగ్ ఉన్నాయి. వివాస్ షీల్ ఇన్సాన్ పార్టీ 6 చోట్ల, హెచ్ఏఎం పార్టీ ఒక స్థానంలో ఆదిక్యంలో ఉంది. మహా ఘట్బంధన్ 114 సీట్లలో ఆదిక్యంలో కొనసాగుతోంది. అందులో ఆర్జేడీ 62, కాంగ్రెస్ 24, లెఫ్ట్ పార్టీలు 18 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ, ఎంఐఎం కూటమి ఒక స్థానంలో, ఎల్జేపీ 5 చోట్ల, స్వతంత్రులు 4 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నారు. అనూహ్యంగా ఎన్డీఏ ముందంజ కౌటింగ్ మొదలైనప్పటి నుంచి వెనుకంజలో ఉన్న జేడీయూ-ఎన్డీయే కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం 121 సీట్ల ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక తొలి నుంచి ఆదిక్యంలో కొనసాగుతున్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 112 సీట్లలో లీడింగ్లో ఉంది. సెక్యులర్ ఫ్రంట్ 3, ఎల్జేపీ 6 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. ఆదిక్యంలో తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్న మహాఘటన్ బంధన్ (ఎంజీబీ) సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ 700 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఆదిక్యంలో ఉన్నారు. జాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జీవేశ్ కుమార్ 2538 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ వందకుపైగా స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. లీడింగ్లో ఉన్న ప్రముఖులు: మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ, మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నేత తేజ్ప్రతాప్ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్కుమార్, కాంగ్రెస్ నేతలు లవ్ సిన్హా, సుభాషిని బుందేలా ఆదిక్యంలో ఉన్నారు. వెనుకంజలో ఉన్న ప్రముఖులు బిహార్ బిజేపీ సీనియర్ నేత నంద కిశోర్ యాదవ్, జేడీయూ నేత జైకుమార్ సింగ్, బీజేపీ నేత శ్రేయాసి సింగ్, జడీయూ సీనియర్ నేత విజయ్ చౌదరి, జేఏపీ నేత పప్పు యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ! దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ-ఎన్డీఏ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 93 సీట్లలో ఆదిక్యం కొనసాగుతుండగా.. జేడీయూ-ఎన్డీఏ కూటమి 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్లో ముందంజలో కొనసాగుతున్నారు. హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్న లాలూ పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ ఆదిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే బిహార్లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, జేడీయూ ఉండనున్నాయి. 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిహార్లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్ ఫిగర్ 122. పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఓటరు తీర్పు నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. నితీశ్ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయజతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్లోని వాల్మీకినగర్ లోక్సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
రేపే బిహార్ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం
పట్నా : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు(నవంబర్ 10) బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారు. లాలూకు డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నానని, అయినప్పటీకి ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేస్తున్నట్లు రిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ పాల్గొననప్పటికీ, ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలు, ప్రజల అభిప్రాయాలను టీవీ చానళ్లు, వార్త పత్రికల ద్వారా సమీక్షించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారని చెప్పారు. రేపే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆరోగ్యం క్షీణించిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టాయి.