-
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
పిల్లల కథ.. 'మల్లారం గ్రామంలో మారిన మాల్యాద్రి'..
మీర్పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు. వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు. ‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు. ‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి. ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు. ‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
ఫన్డే: పిల్లల కథ - 'ఛూ.. మంతర్'
ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి జాలి, కరుణ, దయ అనేవి లేవు. చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది. పులికి బద్ధకం కూడా ఎక్కువే. ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టంలేదు. సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది. దాంతో.. ఆ అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది. ఆ అడవిలో కుందేళ్లన్నీ వాటి నాయకుడిని కలిసి పులి బారి నుంచి కాపాడమన్నాయి. కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ‘మనం నీడని చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుగుంటేనే నీడలుంటాయి. పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయేకాలం దగ్గర పడిందని నాకనిపిస్తోంది’ అంటూ ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు. గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి∙పెద్దగా గాండ్రించింది. దాంతో.. ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది. బండి నుంచి గుర్రం విడిపోయింది. ఇంద్రజాలికుడు ప్రాణ భయంతో ఎటో పరుగుతీశాడు. అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలోంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది. అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది. పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలును కుందేళ్ల నాయకుడు చేరదీశాడు. ‘నాయకా! నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండటంతో నాకు ఇంద్రజాల విద్యంతా తెలుసు. అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను’ అంది కుందేలు పిల్ల. ‘అయ్యో! వినోదం సంగతి దేముడెరుగు! అసలు క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నాము. పులి సంగతి నీకు తెలీదు. అది చిన్ని చిన్ని పసికూనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటోంది. దాంతో మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం!’ అన్నాడు కుందేళ్ల నాయకుడు. కానీ కుందేలు పిల్ల అక్కడి నుంచి కదలలేదు. తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది. మరుసటిరోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది. ఇంతలో వాటికి దూరంగా పులి గాడ్రింపు వినిపించింది. ‘బాబోయ్! పులి వస్తుంది! పారిపోయి దాక్కోండి!’ పెద్దగా అరిచింది ఒక కుందేలు. వెంటనే మిగిలిన కుందేళ్లన్నీ పొదల్లో దాక్కున్నాయి. కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలుచుంది. ‘మిత్రమా! ఆ పులి సంగతి నీకు తెలీదు. పారిపో!’ అంటూ అరిచాయి. కుందేళ్లన్నీ. అయినా అది కదలలేదు. ‘ఓసేయ్.. నీకెంత ధైర్యమే! నేను వస్తున్నా పారిపోలేదు. ఇదిగో నిన్ను ఇప్పుడే లటుక్కున చప్పరిస్తా!’ అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి. ‘ఆగక్కడ! నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదలి పారిపో!’ అని అరిచింది కుందేలు పిల్ల. ఆ మాటకు పులి బిత్తరపోయింది. కుందేలు తన మంత్రదండం తీసుకుంది. కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు. పులి తిరిగి పెద్దగా గాండ్రించింది. ‘ఛూ.. మంతర్’ అంటూ మంత్ర దండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది. ‘నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు శక్తి లేదు. నువ్వు గాఢంగా నిద్ర పోతున్నావ్.. నిద్ర పోతున్నావ్.. పోతున్నావ్!’ అంది కుందేలు పిల్ల. కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది. వెంటనే కుందేళ్లన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి. కొంతసేపటికి పులి తేరుకుంది. కండ్లు తెరిచి చూసి భయపడింది. ఏం జరిగిందో దానికి అర్థంకాలేదు. దాని కాళ్ళు, చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది. తిండి తిప్పలు లేక నీరసించి పోయింది. అటుగా వెళుతున్న నక్క, తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి, నాలుక చప్పరించాయి. ఇక ఆ అడవిలో పులిబాధ తప్పింది. కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి. –పైడిమర్రి రామకృష్ణ ఇవి చదవండి: ఈ వారం కథ: 'లెఫి బొ' -
పరాయి సొమ్ము పాముతో సమానం.. వజ్రం కథ
రామయ్య అడవిలో ఎండిన చెట్ల కొమ్మలు గొడ్డలితో కొట్టి, వాటిని మోపుగా కట్టి, సాయంత్రం సంతలో అమ్మి.. ఆ వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేస్తాడు. రామయ్యతో పాటు కొమ్మలు నరికే వారు తొమ్మిది మంది ఉన్నారు. ఒకసారి బాగా పొద్దు పోయాక రామయ్య వద్ద కట్టెల మోపును, రైతు చంద్రయ్య కొన్నాడు. వాటితో అతని భార్య వంట చేసింది. వంట పూర్తి అయ్యాక పొయ్యిలోని బూడిదను ఎత్తి పోస్తుంటే ఒక వజ్రం ధగధగా మెరిసింది. భర్తతో విషయం చెప్పి ‘అబ్బ ఇన్నాళ్లకు మన కష్టాలు తీరాయి’ అంది. ‘తప్పు.. మన మహారాజు ప్రజలను కన్న బిడ్డలుగా చూస్తున్నాడు. ఈ వజ్రం బహుశా కట్టెల మోపులో వచ్చి ఉంటుంది. పరాయి సొమ్ము పాముతో సమానం. ఇది మనకు వద్దు’ అని భార్యకు నచ్చజెప్పి ఆ వజ్రాన్ని తీసుకుని కోటకు వెళ్లి జరిగింది చెప్పి రాజుకు ఇచ్చాడు. ‘నీవు ఎవరి వద్ద కట్టెల మోపును కొన్నావో గుర్తు తెచ్చుకో!’ అని అడిగాడు రాజు. ‘ఆ రోజు బాగా పొద్దుపోయాక కొన్నాను.. ఎవరి వద్ద కొన్నానో తెలియదు మహారాజా!’ అన్నాడు చంద్రయ్య. ‘ఈ వజ్రం ఎవరిది? కట్టెల మోపులోకి ఎలా వచ్చింది?’ అని మంత్రితోనూ, న్యాయాధికారితోనూ చర్చించాడు రాజు. ‘మాంసం ముక్క అనుకుని ఏదైనా పక్షి ఈ వజ్రాన్ని ముక్కుతో కరుచుకుని.. కొమ్మ మీద ఉన్నప్పుడు అది జారి చెట్టు కొమ్మ సందులో ఇరుక్కుని ఉంటుంది. కొమ్మలు నరికినప్పుడు అది ఏ కొమ్మలోనైనా ఉండిపోయి ఉంటుంది. దానిని కట్టెలు కొట్టే అతను గమనించి ఉండడు. సంతలో ఎవరెవరు కట్టెల మోపును అమ్ముతారో వారందరినీ పిలిపించండి’ అని సలహా ఇచ్చాడు న్యాయాధికారి. రాజు అలాగే ఉత్తరువులు ఇచ్చాడు. తొమ్మిది మంది సభకు వచ్చారు. ‘కట్టెల మోపులను మేమే అమ్మాము. ఆ వజ్రం మాకే చెందుతుంది. మేము దానిని అమ్మి ఆ సొమ్మును సమానంగా పంచుకుంటాం’ అన్నారు ఆ తొమ్మండుగురు. గ్రామాధికారిని పిలిపించి ‘వీరేనా.. కట్టెలు కొట్టి అమ్మేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అని అడిగాడు రాజు. ‘వీరితో పాటు రామయ్య అనే అతను కూడా ఉన్నాడు మహారాజా!’ చెప్పాడు గ్రామాధికారి. రామయ్యను కూడా పిలిపించాడు రాజు. ‘ఏం రామయ్యా! ఉత్తరువులు ఇచ్చినా నువ్వు సభకు ఎందుకు రాలేదు?’ అని కోపగించుకున్నాడు రాజు. ‘మహారాజా! కష్టపడి కొట్టిన కట్టెలను సంతలో అమ్ముతాను. దానికి గిట్టుబాటు ధర వస్తుంది. నాకు ఎలాంటి నష్టమూ జరగలేదు’ అన్నాడు రామయ్య. రామయ్య మాటలు విన్నాక ‘సందేహం లేదు మహారాజా! నేను ఆ రోజు ఇతని వద్దనే కట్టెల మోపును కొన్నాను. అతని మాటల వల్ల అతని కంఠాన్ని గుర్తు పట్టాను’ అని చెప్పాడు చంద్రయ్య. ‘నిజాయతీపరుడు ఎప్పుడూ ధైర్యంగానే మాట్లాడతాడు మహారాజా!’ అన్నాడు మంత్రి. ‘ఆ తొమ్మిది మందినీ చెరసాలలో పెట్టండి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘ఆ వజ్రం రామయ్యకు చెందుతుంది అతనికే ఇవ్వండి’ అని ఉత్తర్వులూ జారీ చేశాడు రాజు. ‘మహారాజా! నాది కాని దానిని నేను ఎలా తీసుకోను?’ అన్నాడు రామయ్య. ‘మరి ఎలాగా?’ అన్నాడు రాజు. ‘దీనిని మన రాజ్యం కోసం మీ వద్దనే ఉంచండి అదే ధర్మం’ అన్నాడు రామయ్య. ‘చంద్రం, రామయ్య లాంటి నిజాయతీ పరులు మా రాజ్యంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని వారిద్దరికీ చిరు సత్కారం చేసి ‘నీ కోరిక ఏంటో చెప్పు రామయ్య’ అన్నాడు రాజు. ‘మహారాజా! నా మిత్రులైన ఆ తోమ్మండుగురిని చెర నుండి విడుదల చేయండి’ అన్నాడు రామయ్య. ‘విడుదల చేస్తాను. నీవు ఏదైనా కోరుకో’ అన్నాడు రాజు. ‘ప్రస్తుతం ఎండిన చెట్ల కొమ్మలను నరుకుతున్నాం. వాటి స్థానంలో కొత్తగా మొక్కలను నాటితే రాబోయే రోజులలో అవి మహావృక్షాలు అవుతాయి మహారాజా!’ అన్నాడు రామయ్య. రాజు మొక్కలను నాటాడానికి అనుమతి ఇచ్చాడు. చంద్రం, రామయ్యలను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. -
మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?
మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement