commodity prices
-
రూపాయి పతనం ఎగుమతులకు ఊతమే కానీ...
న్యూఢిల్లీ: రూపాయి బలహీనపడటమనేది దేశీ ఎగుమతులకు ఊతమిచ్చేదే అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు సంక్లిష్టంగా ఉంటాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వని కుమార్ వ్యాఖ్యానించారు. చాలా మటుకు భారతీయ ఎగుమతిదారులు.. ముడివస్తువులు, విడిభాగాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని ఆయన చెప్పారు. రూపాయి గణనీయంగా పడిపోతే ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోయి సదరు ఎగుమతిదారులపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కరెన్సీ క్షీణత ప్రయోజనాలు పెద్దగా లభించవని వివరించారు. ‘బలహీన రూపాయి ప్రభావమనేది ఎగుమతిదారులందరిపైనా ఒకే తరహాలో ఉండదు. ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ పతనానికి మూలకారణాలను సరిదిద్దడానికి వ్యూహాత్మకమైన, బహుముఖ విధానం అవసరమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు రూపాయి రెండు శాతమే క్షీణించినా, పోటీ దేశాల కరెన్సీలు అంతకన్నా ఎక్కువగా 3–5 శాతం పడిపోతే, గ్లోబల్ మార్కెట్లలో భారత ఎగుమతిదారులు పోటీపడే పరిస్థితి ఉండదని కుమార్ తెలిపారు. రూపాయి పతనం వల్ల ముడి వస్తువుల ధరలు, కరెన్సీ మారకం రేటులో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ రుణాల భారం మొదలైనవన్నీ కూడా పెరిగిపోతాయని ఆయన చెప్పారు.ఆర్బీఐ జోక్యం ఎగుమతులకు ప్రతికూలండాలరు బలోపేతం అవుతుండటం వల్ల ఇతర కరెన్సీల్లాగే రూపాయి కూడా పతనమవుతోంది. ఇలాంటప్పుడు రూపాయి మాత్రమే హఠాత్తుగా పతనమైతేనో లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనైతేనో తప్ప దాన్ని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే భారతీయ ఎగుమతిదార్లకు ప్రతికూలమవుతుంది. – రఘురామ్ రాజన్, మాజీ గవర్నర్, ఆర్బీఐ రూపాయి అధిక స్థాయిలో ఉందిరూపాయి విలువ ప్రస్తుతం అధిక స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయంగా మన ఎగుమతి సంస్థలు పోటీపడటంపై ప్రతికూల ప్రభావం ఉంటోంది. కాబట్టి ఆర్థిక ఫండమెంటల్స్కి తగ్గ స్థాయికి రూపాయిని చేరుకోనివ్వాలి. రూపాయి క్షీణతను కొనసాగనివ్వడం వల్ల ఎగుమతులకు, అలాగే వృద్ధి సాధనకు సహాయకరంగా ఉంటుంది. – దువ్వూరి సుబ్బారావు, మాజీ గవర్నర్, ఆర్బీఐ -
సామాన్యుడి బతుకు.. పెనం నుంచి పొయ్యిలోకి..
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులు, తగ్గిన పంటల దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఏం కొనేటట్టు లేదని.. ఏం తినేటట్టు లేదని వాపోతున్నాడు. దేశవ్యాప్తంగా 14 నెలల గరిష్టానికి నిత్యావసరాల ధరలు చేరుకున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్పష్టం చేసింది. దేశంలో 70 రకాల పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 20 నుంచి 25 రకాల పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నట్లు భారత వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా దేశంలో గత పదేళ్లలో 22 రకాల సరుకుల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం లెక్కలు వేసింది. మొత్తమ్మీద సగటు వినియోగదారుడు వెచ్చాల కోసం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి. కాగా, డిసెంబర్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణంపై సమీక్షించనుందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంతమేర ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. బియ్యం ధరలకు రెక్కలు బాస్మతీయేతర తెల్లబియ్యంపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం రద్దు చేసింది. అలాగే పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఆంక్షలు ఎత్తివేయడంతో దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యం, పారా బాయిల్డ్ రైస్లో భారత్ వాటా 45 శాతం కాగా, ఇందులో తెలంగాణ, ఏపీలే కీలకం. రాష్ట్రంలో మేలు రకం బియ్యం ధరలు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7,500కు చేరుకున్నాయి. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి మేలు రకాల ముడి బియ్యం ధరలు రూ.7వేల పైనే ఉన్నాయి. స్టీమ్డ్ రైస్ క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లభిస్తున్నాయి. మిల్లుల నుంచి కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల ధరలు అటు ఇటుగా ఇలాగే ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండుతున్న నూనె కేంద్ర ప్రభుత్వం ఇటీవలే క్రూడ్ పామ్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అలాగే రిఫైన్ చేసిన పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై ఇప్పటికే ఉన్న 12.5 శాతం సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. దీంతో మార్కెట్లో రూ.90 లోపు లభించే లీటర్ పామాయిల్ రూ.130 వరకు చేరుకోగా, సన్ఫ్లవర్ నూనె ధరలు రూ.135 నుంచి రూ.150కి చేరాయి. సుంకం పెంచని వేరుశనగ, రైస్బ్రాన్, కుసుమ నూనె ధరలను కూడా ఆయా ఉత్పత్తి సంస్థలు విపరీతంగా పెంచడం గమనార్హం. కూర ‘గాయాలే’..! కూరగాయల ధరల్లో ఈ ఏడాది సగటున 30 శాతం వృద్ధి కనిపించింది. అందరూ రోజూ కూరల్లో తప్పకుండా వినియోగించే టమాట, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ధరలు కొంతకాలంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. నెలరోజుల క్రితం వరకు ఉల్లిగడ్డ, టమాట ధరలు ఏకంగా కిలో రూ.వందకు చేరాయి. ప్రస్తుతం ఉల్లి రూ.60 వరకు ఉండగా, టమాట ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా, ఇప్పటికీ మేలు రకం రూ.50కి తక్కువ లేదు. క్యారట్ కిలో ఏకంగా రూ.120 వరకు ఉండగా, బీట్రూట్ రూ.80, ముల్లంగి రూ. 72, చిక్కుడు రూ.100, వంకాయలు రకాన్ని బట్టి రూ. 70–90 వరకు విక్రయిస్తున్నారు. క్యాప్సికమ్ రూ.90, బెండకాయ రూ.60, బీరకాయ రూ.70, బీన్స్ రూ.70, కాకర రూ.60, దోసకాయ రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లు, రైతుబజార్లలో కొంత మేర తక్కువకు విక్రయించినప్పటికీ, చిల్లర వ్యాపారుల వద్ద ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ములక్కాడలు ఒక్కోటి రూ.20కి విక్రయిస్తుండగా, నిమ్మకాయలు కిలోకు రూ.120–140 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలూ ఆకాశంవైపే చూస్తున్నాయి. కాగా, సబ్బులు, టూత్పేస్ట్, షాంపూలు, కాఫీ, టీ పౌడర్, సౌందర్య వస్తువుల ధరలు కూడా మూడు నెలలుగా పెరిగినట్లు తెలుస్తోంది. -
నెలవారీ బిల్లులు భారం
న్యూఢిల్లీ: ఆహార, వ్యక్తిగత సంరక్షణ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తుల ధరల పెంపుతో నెలవారీ షాపింగ్ బిల్లులు గడిచిన రెండు మూడు నెలల్లో పెరిగిపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బులు, బాడీవాష్లు మొదలుకొని హెయిర్ ఆయిల్, కాఫీ పౌడర్, నూడుల్స్, ఆటాపై సగటున 2–9 శాతం మేర ధరలను సవరించాయి. హెయిర్ ఆయిల్పై ఈ పెంపు 8–11 శాతం మేర ఉంది. కొన్ని రకాల ఆహారోత్పత్తులపై ధరల బాదుడు 3 నుంచి 17 శాతం మధ్య ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కమోడిటీల ధరలు దిగొచ్చిన ఏడాది తర్వాత ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించడం ఇదే మొదటిసారి. ముడి సరుకుల (తయారీ) వ్యయాలు పెరిగిపోవడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు 2022, 2023లో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలను సవరించడం గమనార్హం. ముఖ్యంగా 2023–24 ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ధరల పెంపు జోలికి చాలా సంస్థలు వెళ్లలేదు. ఉత్పత్తుల తయారీలోకి వినియోగించే ముడి చమురు, పామాయిల్ ధరలు గతంతో పోలిస్తే తగ్గగా.. పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లే తదితర ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల కమోడిటీల ధరల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నందున 2024–25 ఆర్థిక సంవత్సరంలో ధరల సవరణ తప్పదని కంపెనీలు తమ మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా సంకేతమిచ్చాయి. మొత్తం మీద ధరల పెంపు సింగిల్ డిజిట్ (ఒక అంకె)కే పరిమితం కావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎఫ్ఎంసీజీ రంగంపై విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. పెంపు ఇలా.. కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ప్యాక్లపై మారికో 6 శాతం మేర ధరలు పెంచింది. కోప్రా (ఎండుకొబ్బరి) ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, మరో విడత ధరల సవరణ తప్పదన్న సంకేతం ఇచి్చంది. స్నాక్స్ తయారీ సంస్థ బికజీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–4 శాతం మేర ధరలు పెంచనున్నట్టు తెలిపింది. పోటీ సంస్థల మాదిరే తాము సైతం ధరలను పెంచుతున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) గత ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపుజోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది. డవ్ సబ్బుల ధరలను 2 శాతం పెంచడం గమనార్హం. డాబర్ ఇండియా, ఇమామీ కంపెనీలు సింగిల్ డిజిట్ స్థాయిలో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బులపై 4–5 శాతం సవరించింది. సంతూర్ సబ్బుల ధరలను విప్రో సంస్థ 3 శాతం పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీవాష్ ధరలను కోల్గేట్ సంస్థ సింగిల్ డిజిట్ స్థాయిలో పెంచింది. హెచ్యూఎల్ పియర్స్ బాడీ వాష్ ధరలు 4 శాతం ప్రియమయ్యాయి. డటర్జెంట్ బ్రాండ్ల ధరలను హెచ్యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జ్యోతి ల్యాబ్స్ సంస్థలు 1–10 శాతం స్థాయిలో పెంచాయి. హెచ్యూఎల్ షాంపూల ధరలు తక్కువ సింగిల్ డిజిట్ స్థాయిలో (5 శాతంలోపు), చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4 శాతం చొప్పున సవరించింది. నెస్లే తన కాఫీ ఉత్పత్తుల ధరలను 8–13 శాతం మేర పెంచింది. మ్యాగి ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం పెరిగాయి. ఆశీర్వాద్ హోల్ వీట్ ఆటా ధరలు కూడా పెరిగాయి. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
ఎగుమతులు 3 శాతం డౌన్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సెసెప్టెంబర్లో ఇవి 63.37 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్ డాలర్లకు దిగి వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెసెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులపై ఆశాభావం.. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయికి దిగి వచి్చందని సునీల్ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్ మెరుగ్గా రాణిస్తోందని సునీల్ చెప్పారు. ఆగస్టు గణాంకాల సవరణ.. కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్ డాలర్ల నుంచి 38.45 బిలియన్ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్ డాలర్ల నుంచి 60.1 బిలియన్ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో 3.88 శాతం పెరిగినట్లయ్యింది. మరిన్ని విశేషాలు.. ► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. ► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్ టూల్స్ వీటిలో ఉన్నాయి. ► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆహార పరిశ్రమపై కమోడిటీ ధరల ప్రభావం
కోల్కతా: అధిక కమోడిటీ ధరలు, అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆహార పరిశ్రమ (ఫుడ్)పై గణనీయంగా పడినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. దీర్ఘకాలంలో ఈ అంశాల ప్రభావం అధికంగా ఉంటుందని 2022–23 వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి సాయపడినట్టు వివరించింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆహార పరిశ్రమ ఎదుర్కొన్న పెద్ద సవాలు.. ముడి పదార్థాలైన గోధుమలు, పాలు, పంచదార, పామాయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోవడం వల్ల ఎదురైన ద్రవ్యోల్బణమే’’అని పేర్కొంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రధానంగా బిస్కట్లు, కేక్లు, రస్్క, బ్రెడ్, చాక్లెట్ల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ పరిస్థితులు ఎంతో ఆశావహంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులు అన్నవి 2023–24లో ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. సరైన వర్షపాతంపైనే గ్రామీణాభివృద్ధి, ఆహార ధరలు ఆధారపడి ఉంటాయి’’అని బ్రిటానియా తన నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించామని, కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి విస్తరించామని ప్రకటించింది. బ్రాండ్ బలోపేతం, కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, సార్క్ దేశాలపై దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. -
ఎఫ్ఎంసీజీకి ఈ ఏడాది సానుకూలం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కాస్త పుంజుకోవడం ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సానుకూలించనుందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ ఆదాయం 7–9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఎఫ్ఎంసీజీ వినియోగంలో 65 శాతం వాటా కలిగిన పట్టణాల్లో వినియోగం స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెరగొచ్చని తెలిపింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.5–1 శాతం మేర పెరిగి, కరోనా ముందున్న 20–21 శాతానికి చేరుకుంటాయని పేర్కొంది. ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్, కెమికల్స్, ముడి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గడం కంపెనీల అధిక మార్కెటింగ్ వ్యయాలకు సర్దుబాటుగా ఉంటుందని తెలిపింది. రూ.5.2 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్లో 35 శాతం వాటా కలిగిన 76 ఎఫ్ఎంసీజీ సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను క్రిసిల్ రేటింగ్స్ రూపొందించింది. అమ్మకాల పరంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1–3 శాతం వృద్ధినే చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4–6 శాతం మధ్య ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. ఎల్నినో ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాల ఆధారంగానే ఈ విశ్లేషణకు వచి్చనట్టు చెప్పారు. సానుకూలం.. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు క్షీణతను చూడగా, 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లోనే సానుకూల వృద్ధి నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వినియోగ డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. కీలక పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని కూడా ప్రస్తావించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పట్టణ వినియోగం రెండంకెల వృద్ధిని చూడగా, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం వల్ల ఈ వృద్ధి ఇక ముందూ కొనసాగొచ్చని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్: మారికో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో డిమండ్ ధోరణులు స్థిరంగా ఉన్నట్టు మారికో సైతం ప్రకటించింది. అయితే జూన్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం శాంతించినందున ఈ ఏడాది మిగిలిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి పనితీరుపై ప్రకటన విడుదల చేసింది. గడిచిన త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ వర్షపాత అంచనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం, ద్రవ్యోల్బణం దిగిరావడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ను క్రమంగా పెంచుతుందన్న ఆశలు కలి్పస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో దేశీయ అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి కనిపించినట్టు ప్రకటించింది. సఫోలా వంట నూనెల నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. పోర్ట్ఫోలియో పరంగా చానల్ ఇన్వెంటరీలో మార్పులు కూడా చేసినట్టు తెలిపింది. వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం గరిష్టంగా ఒక అంకె స్థాయిలో (7–8 శాతం) పెరిగినట్టు తెలిపింది. బ్రాండ్ల బలోపేతం, నూతన ఉత్పత్తులపై ప్రచారం కోసం అధికంగా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. -
ధరల మంట, ఒక్కో మామిడికాయ రూ.10 పైనే.. పచ్చడి మెతుకులు కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ఎండకాలం వచ్చిందంటే ఎవరింటా చూసినా మామిడికాయ పచ్చడి హడావిడి కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా నిల్వ ఉండేలా పచ్చడిని తయారు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రం ఏడాదికి తగ్గట్టుగా కొత్త ఆవకాయ పెట్టుకోవాలంటే జేబు చిలుము వదలాల్సిందే! పచ్చడికి ఇదే సీజన్ కావడంతో మామిడి కాయల అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి. కాయలను ముక్కలు మొదలు మసాలా దినుసుల కొనుగోలు వరకు గృహిణులతో రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. అయితే పచ్చడికి అవసరమైన సరుకులు ధరలు మాత్రం నింగినంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రెండింతలయ్యాయి. పచ్చడికి మూలమైన మామిడి కాయ ఒకటి రూ.10 పలికితే.. పెద్ద కాయ అయితే రూ.15–20 పలుకుతోంది. కాపు తక్కువగా ఉండడం వల్ల పచ్చడి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మసాలా దినుసుల ధరలు సరేసరి. మిర్చి ధరలు గణనీయంగా పెరగడంతో కారంపొడి నిరుడితో పోలిస్తే రెట్టింపయింది. గతేడాది కిలో రూ.550 ఉండగా.. ఈసారి రూ.800 చేరుకుంది. మసాలాలు, కారమే కాదు అల్లం, వెల్లుల్లి ధరలు మూడింతలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో అల్లం కేజీ రూ. 180–200 కాగా వెల్లుల్లి కేజీ రూ.160 విక్రయిస్తున్నారు. అలాగే బ్రాండెడ్ వేరుశెనగ నూనె లీటర్ ప్యాకెట్ రూ.190–210, నువ్వుల నూనె కిలో రూ.410, మెంతిపొడి కిలో రూ.180, ఆవాలు కిలో 110, జీలకర్ర కిలో 600 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈసారి పెరిగిన ధరలు సామాన్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
సంక్షోభంలో పాక్
ఇస్లామాబాద్: చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు... ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది... పాకిస్తాన్లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది. మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్ మాల్స్ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ వెల్లడించారు. రూ.6,200 కోట్ల ఆదాయే లక్ష్యం... పాక్లో విద్యుదుత్పాదన చాలావరకు చమురు ఆధారితమే. చమురు దిగుమతులపై ఏటా 300 కోట్ల డాలర్ల దాకా ఖర్చు పెడుతోంది. తాజా చర్యల ఉద్దేశం ఈ వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే. అంతేగాక ప్రభుత్వ శాఖల్లో కూడా విద్యుత్ వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. దీనివల్ల మొత్తమ్మీద 6,200 కోట్ల రూపాయలు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. వీటితో పాటు ఉద్యోగులు వీలైనంత వరకూ ఇంటి నుంచి పని చేసేలా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నాసిరకపు విద్యుత్ బల్బుల తయారీ తదితరాలపై త్వరలో నిషేధం కూడా విధించనున్నారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దుకాణదారులు, ఫంక్షన్ హాల్స్, మాల్స్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనాతో రెండేళ్లకు పైగా సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ పాటిల ఇది పిడుగుపాటు నిర్ణయమేనని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా షాపింగులు, రెస్టారెంట్లలో డిన్నర్లు పాకిస్తానీలకు రివాజు. ప్రభుత్వ నిర్ణయంపై వారినుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 600 కోట్ల డాలర్ల రుణం! మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్ నుంచి కనీసం 600 కోట్ల డాలర్ల తక్షణ రుణం సాధించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఆగస్టులో ఐఎంఎఫ్ నుంచి పాక్ 110 కోట్ల డలర్ల రుణం తీసుకుంది. గత వేసవిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేసి వదిలాయి. వాటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 4,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. -
నిత్యావసర ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రైతు బజారులు, స్థానిక మార్కెట్లలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలో ధరల స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎంయాప్–సీపీఏ (కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్) పేరిట ప్రత్యేక యాప్ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. మార్కెటింగ్, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు, రైతు బజారుల సీఈవో ఈ యాప్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ స్థానిక మార్కెట్లలో వివిధ సరుకుల ధరలు, రైతు బజారుల్లోని ధరలను విశ్లేషిస్తూ అందుకు సంబంధించిన డేటాను ఈ యాప్లో అందుబాటులో ఉంచుతారని వివరించారు. రాష్ట్ర మార్కెటింగ్శాఖ కమిషనర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 10 శాఖల అధికారులు ఈ యాప్ను మానిటర్ చేసేందుకు ప్రత్యేక లాగిన్ ఐడీలను ఇస్తామని చెప్పారు. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక మాస్టర్ డ్యాష్ బోర్టును కూడా రూపొందించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణకు యాప్ రూపొందించాలి నైరుతి రుతుపవన కాలంలో తుపానులు, వరదలు వంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ అధికారులను ఆదేశించారు. ఈ విపత్తుల సమాచారాన్ని సకాలంలో సంబంధిత శాఖల అధికారులు పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్ను రూపొందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో వర్షాలు తక్కువగా, చివరి రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారని చెప్పారు. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు మాట్లాడారు. -
కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ మహమ్మారి వల్ల వాటిల్లిన నష్టాలను పూడ్చుకోవడానికి 12 ఏళ్లు పట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కాలంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తి నష్టం జరిగిందని అంచనా వేసింది. ‘‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతరాయాల కారణంగా ప్రపంచ, దేశీయ వృద్ధికి ఆటంకాలు అధికం అవుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతంగా ఉంటుందని ఊహిస్తే.. భారత్ 2034–35లో కోవిడ్ నష్టాలను అధిగమించగలదని అంచనా’’ అని నివేదిక వివరించింది. ఆర్బీఐలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్ బృందం ఈ రిపోర్ట్ను రూపొందించింది. ఇవి పూర్తిగా రచయితల అభిప్రాయాలేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
క్యూ4లో వేదాంత దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,500 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 5,105 కోట్ల లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాల పరిమాణం, కమోడిటీల ధరలు, నిర్వహణా సామర్థ్యం సహకరించాయి. గత త్రైమాసికంలో రూ. 336 కోట్ల అనుకోని పద్దు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా చమురు, గ్యాస్ విభాగంలో రూ. 2,697 కోట్ల ఇంపెయిర్మెంట్ రివర్సల్ ఆర్జనను కెయిర్న్ ఇంధన వెలికితీత వ్యయాల రైటాఫ్ కొంతమేర ప్రభావితం చేసినట్లు వివరించింది. వాటాదారులకు షేరుకి రూ. 31.5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు మే 9 రికార్డ్ డేట్కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 27,874 కోట్ల నుంచి రూ. 39,342 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో వ్యయాలు రూ. 22,549 కోట్ల నుంచి రూ. 29,901 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 51 శాతం వృద్ధితో రూ. 13,768 కోట్ల నిర్వహణా లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేసింది. పటిష్ట క్యాష్ ఫ్లో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంత నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 24,299 కోట్లను తాకింది. 2020–21లో రూ. 12,446 కోట్లు ఆర్జించింది. గతేడాది అత్యుత్తమ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 45,319 కోట్లు ఆర్జించింది. ఇక అనుకోని పద్దులు, పన్ను ఆర్జనకు ముందు నికర లాభం రూ. 24,299 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం, నిర్వహణా సామర్థ్యం, వ్యవస్థాగత ఇంటిగ్రేషన్, టెక్నాలజీ వినియోగం తదితరాలపై తాము పెట్టిన ప్రత్యేక దృష్టికి తాజా ఫలితాలు నిదర్శనమని వేదాంత సీఈవో సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. వెరసి రూ. 27,154 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. తద్వారా వృద్ధి అవకాశాలపై తిరిగి ఇన్వెస్ట్ చేయడం, బ్యాలెన్స్ షీట్ను మరింత పటిష్టపరచుకోవడం, వాటాదారులకు అధిక డివిడెండ్ల చెల్లింపు వంటివి చేపట్టేందుకు మరింత వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో వేదాంత షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 411 వద్ద ముగిసింది. -
త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
Russia-Ukraine crisis: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభంతో ‘రయ్’ మంటూ పైకి లేచిన బంగారం, క్రూడ్ వంటి కీలక కమోడిటీల ధరలు శుక్రవారం కొంత శాంతించాయి. యుద్ధంలో నాటో జోక్యం చేసుకోదన్న స్పష్టమైన సంకేతాలు, ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమన్న రష్యా ప్రకటన వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్ల నష్టంతో 1,888 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం ప్రారంభంలో పసిడి ధర గురువారం అంతర్జాతీయంగా ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా తాకటం గమనార్హం. అంటే తాజా హై నుంచి దాదాపు 100 డాలర్లు పడిపోయింది. దేశీయంగా రూ. 2,000 డౌన్ ఇక దేశీయంగా చూస్తే, మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో (ఎంసీఎక్స్)లో ధర క్రితం ముగింపుతో పో ల్చితే రూ.1,339 నష్టంతో రూ.50,204 వద్ద ట్రేడ వుతోంది. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత రూ.1,873 తగ్గి రూ.50,667 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.1,866 దిగివచ్చి రూ.50,464కి చేరింది. వెండి కేజీ ధర రూ. 2,975 దిగివచ్చి రూ.65,174 వద్దకు దిగివచ్చింది. ఇక క్రూడ్ ధరలు కూడా అంతర్జాతీయంగా గురువారం ముగింపుతో పోల్చితే 2% నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అరశాతం నష్టంతో 96.50 వద్ద ట్రేడవుతోంది. భారత్లో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు లాభపడి, 75.33 వద్ద ముగిసింది. -
ఇంటి బడ్జెట్కు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు, నిత్యావసరాల ధరలు ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో చాలా మటుకు కుటుంబాలు (సుమారు 60 శాతం) ఖర్చులు చేస్తున్నప్పటికీ.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. తమ బడ్జెట్ దాటిపోకుండా, పెట్టే ఖర్చుకు కాస్తంత ఎక్కువ విలువ దక్కేలా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ టాప్ 10 నగరాల్లో నిర్వహించిన ‘వినియోగదారుల ధోరణులు‘ అనే సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సుమారు 61,000 కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది. పండుగ సీజన్లో ఖర్చు చేయాలని భావిస్తున్న కుటుంబాల సంఖ్య సెప్టెంబర్లో 60 శాతానికి చేరింది. ఈ ఏడాది మే లో ఇది 30 శాతం. గడిచిన నాలుగు నెలల్లో కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. గడిచిన 30 రోజులుగా టాప్ 10 నగరాల్లోని కుటుంబాలు.. పెరిగిపోతున్న ఇంధనాలు, నిత్యావసరాల ధరల గురించి ఆందోళన, ఈ పండుగ సీజన్లో షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కు ప్రాధాన్యం ఇవ్వనుండటం గురించి వివిధ ఆన్లైన్ కమ్యూనిటీల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు లోకల్సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా తెలిపారు. టాప్ 10 నగరాల్లోని ఏడు నగరాల ప్రజలు.. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వెల్లడించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆన్లైన్కు హైదరాబాదీల మొగ్గు.. టాప్ 8 నగరాల్లోని వారు తమ పండుగ షాపింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఆర్డర్లివ్వడం లేదా లోకల్గా హోమ్ డెలివరీ పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముంబై, కోల్కతా నగరాల్లో చాలా కుటుంబాలు ప్రత్యేకంగా స్టోర్స్, మార్కెట్కు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. కానీ హైదరాబాద్ (75 శాతం), నోయిడా (72 శాతం), పుణె (67 శాతం), చెన్నై (60 శాతం) నగరాల్లో అత్యధిక శాతం మంది స్టోర్ట్స్, హైదరాబాద్, నోయిడాకు చెందిన కుటుంబాలు .. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై ఆసక్తిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న హైదరాబాదీ కుటుంబాలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సాంప్రదాయ స్వీట్లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు మొదలైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. -
Rahul Gandhi: సబ్ కా వినాశ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతుండడం పట్ల కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సబ్ కా వికాస్ అనేది ఎక్కడా లేదని, సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోందని, దేశంలో కాదు, కేవలం పెట్రో ఉత్పత్తుల ధరల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు లాక్కుంటోందని ఆరోపించారు. పన్నుల బెడద లేకపోతే ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ.66కు, డీజిల్ రూ.55కే లభిస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీ తన ట్వీట్కు జతచేశారు. మోదీ మిత్రులే సంపన్నులవుతున్నారు: ప్రియాంక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతోందని, ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు కష్టాల పాలవుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ట్వీట్ చేశారు. కేంద్రం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచిందని చెప్పారు. బీజేపీ పాలనలో ధరల మంటతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ మిత్రులు మాత్రం నానాటికీ ధనవంతులవుతున్నారని ప్రియాంక నిప్పులు చెరిగారు. వరుసగా నాలుగో రోజు ధరల వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు సైతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 35 పైసల చొప్పున పెంచినట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. (చదవండి: పంజాబ్కు 13 పాయింట్ల ఎజెండా) -
ధరదడ: నిత్యావసరాల ధరలతో గుండెపోటే
బరంపురం: విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఒడిశా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా రోజూ వినియోగించే కందిపప్పు, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్లు వినియోగదారులను బెదిరేలా చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉడకని పప్పులు మార్కెట్లో పప్పుల ధరలు ఆందుబాటులో లేకుండా పోయాయి. కొద్ది రోజుల వ్యవధిలో కిలో కందిపప్పు రూ.150 కు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో దీని ధర రూ.90 నుంచి రూ.95 ఉండేది. నెల రోజుల కిందట రూ.90 ఉండేది. అయితే వారం రోజుల కిందట రూ.120లకు పెరిగి, ప్రస్తుతం కిలో రూ.140కి ఎగబాకింది. ఇక కిలో మినపప్పు ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులు ఇడ్లీ, దోశ వంటి వాటిని వండుకోవడం మానేశారు. వంటనూనె సలసల వంట నూనెల ధర మార్కెట్లో సలసల కాగుతున్నాయి. పేదలు, సామాన్యులు అధికంగా వినియోగించే పామోలిన్ లీటర్ ధర రూ.130కి చేరింది. గతంలో దీని ధర రూ.80 ఉండగా ప్రస్తుతం రూ.130కి చేరింది. ఇక సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ.200కు పెరిగింది. మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ఉల్లి లేనిదే కూర రుచించదు. అన్ని తరగతుల వారు వినియోగించే దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే దీనిధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రిటైల్ బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ.30 నుంచి రూ.40 వరకూ పలుకుతోంది. కూరగాయల ధరలు ఆకాశానికి ఇక టమాటో కిలో రూ.30, బంగాళదుంపలు కిలో రూ.35, ఇతర కురగాయలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, షట్డౌన్ కారణంగా దిగుమతులు తగ్గడాన్ని అసరాగా చేసుకున్న వ్యాపారస్తులు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ధరలు మరింతగా పెంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్మార్కెట్ను అరికట్టి ధరలు తగ్గించే ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
సర్కారీ షేర్లు జిగేల్!
గత నాలుగేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకోని ప్రభుత్వ రంగ దిగ్గజాలు కొద్ది రోజులుగా మార్కెట్లను మించుతూ పరుగందుకున్నాయి. తాజా బడ్జెట్లో పలు పీఎస్యూలను ప్రైవేటైజ్ చేయనున్నట్లు ప్రతిపాదించడంతో రీరేటింగ్కు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ పీఎస్యూల మార్కెట్ విలువ 28 శాతంపైగా ఎగసింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు ఊపందుకున్నాయి. మరోవైపు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పీఎస్యూలను ప్రైవేటైజ్ చేసేందుకు ప్రతిపాదించింది. దీనికితోడు గత నాలుగేళ్లుగా మార్కెట్ ర్యాలీని అందుకోకపోవడంతో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు చౌకగా ట్రేడవుతున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభదాయకత మెరుగుపడనున్న అంచనాలు, ప్రైవేటైజ్ కారణంగా రీరేటింగ్కు పెరిగిన అవకాశాలు కొద్ది రోజులుగా పీఎస్యూ కౌంటర్లకు డిమాండును పెంచినట్లు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలోని పలు కంపెనీలు కమోడిటీ ఆధారితంకావడం, కొద్ది రోజులుగా కమోడిటీల సైకిల్ అప్టర్న్ తీసుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్నిస్తున్నట్లు వివరించారు. జోరు తీరిలా పలు సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో పీఎస్యూ షేర్లు ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. వెరసి 2021 జనవరి నుంచి చూస్తే పీఎస్యూ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 3.84 లక్షల కోట్లమేర జత కలసింది. అంటే గత వారాంతానికల్లా ఈ విలువ 28 శాతం ఎగసి రూ. 19.45 లక్షల కోట్లకు చేరింది. 2017 తదుపరి ఇది అత్యధికంకాగా.. గత రెండు నెలల్లో ప్రామాణిక ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 శాతమే ర్యాలీ చేయడం గమనార్హం! హింద్ కాపర్ స్పీడ్ కొత్త ఏడాదిలో దూకుడు చూపుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజాలలో హిందుస్తాన్ కాపర్ ముందుంది. జనవరి– ఫిబ్రవరి మధ్య ఈ షేరు 152 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎంఎస్టీసీ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఫ్యాక్ట్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్), నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), ఎన్బీసీసీ ఇండియా, ఇండియన్ బ్యాంక్ 90–60 శాతం మధ్య జంప్చేశాయి. -
సంబురం ఆవిరి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగడం.. ఇటీవలి వరదలు, పంట నష్టంతో ఆదాయం తగ్గడంతో పండుగ సంతోషం కాస్తా పటాపంచలవుతోంది. చేతిలో చిల్లిగవ్వ కరువు కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపింది. వ్యాపార లావాదేవీలు తగ్గడం, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు సామాన్యుడి నడ్డి విరిచాయి. మార్చి – ఆగస్టు మధ్య కాలంలో 84 శాతం కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోవడం లేదా తగ్గుదలను ఎదుర్కొంటున్నాయని జాతీయ సర్వేలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభాలో కనీసం 13.9 కోట్ల మంది కరోనా విపత్తు నేపథ్యంలో పొదుపు (సేవింగ్స్)ను పూర్తిగా మరిచిపోయాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. దీన్నుంచి కోలుకుంటున్న సమయంలోనే భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికితోడు వరి, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో కొనుగోళ్లు జరగక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఎదురైంది. ఇక హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వీటి నుంచి తేరుకుంటున్న సమయంలోనే పెరుగుతున్న ధరలు మరింత కలవరపెడుతున్నాయి. పప్పులుడకట్లే.. సామాన్యులకు పప్పన్నమూ కరువవుతోంది. లాక్డౌన్ అనంతరం ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లోనూ కిలో రూ.100కి తగ్గకుండా పలుకుతున్నాయి. దిగిరానంటున్న ధరలతో వంటింట్లో పప్పులుడకట్లేదు. విదేశీ దిగుమతులు తగ్గడం, దేశీయంగా పప్పుల దిగుబడులు తగ్గడంతో ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. లాక్డౌన్ ముందువరకు కంది, పెసర, మినపపప్పుల ధరలు కిలో రూ.100కి తక్కువగా ఉన్నా.. ఆ తరువాత ధర రూ.100కి ఎగబాకింది. ప్రస్తుతం మార్కెట్లో మేలు రకం కందిపప్పు కిలో రూ.110– 115 మధ్య ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే కనిష్టంగా రూ.20 మేర ఎక్కువ. గ్రేడ్–2 రకం కిలో రూ.90–100 పలుకుతోంది. పెసర, మినపపప్పు ధరలూ రూ.105–110 వరకు ఉన్నాయి. వీటి ధరలు గతేడాదితో పోల్చినా రూ.25 మేర పెరిగాయి. కాగుతున్న నూనెలు.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అందుకు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో నూనెల ధరలు అమాంతం పెరిగాయి. లాక్డౌన్కు ముందు సన్ఫ్లవర్ లీటర్ ధర హోల్సేల్లో రూ.100 ఉండగా, ప్రస్తుతం హోల్సేల్లోనే రూ.115 పలుకుతోంది. ఇది వినియోగదారుడికి రిటైల్లో రూ.120కి చేరుతోంది. ఇది గతేడాది ధరలతో పోలిస్తే ఏకంగా రూ.30 మేర ఎక్కువ. సామాన్యులు అధికంగా వినియోగించే పామాయిల్.. గతేడాది సెప్టెంబర్లో రిటైల్లో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం గతేడాది రూ.120 ఉండగా, రూ.150కి చేరింది. ఉల్లి కిలో రూ.100 కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర వారం వ్యవధిలో ప్రస్తుతం రూ.100కి చేరింది. ఉల్లి ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలకు కళ్లెంవేసే చర్యలేవీ లేకపోవడంతో ఇప్పట్లో దిగివచ్చేలా లేవు. ఇక టమాటాదీ అదే పరిస్థితి. దీని సాగు రాష్ట్రంలో తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలతో పంట దెబ్బతినడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.50–60 పలుకుతోంది. వీటితో పాటే వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ ధరలు రూ.60–70 పలుకుతుండటంతో సామాన్యులు ఏం కొనే పరిస్థితి కనిపించట్లేదు. -
2019–20లో జీడీపీ వృద్ధి 7.4 శాతం
ముంబై: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వరకు నమోదు కావచ్చని ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గించింది. వినియోగం సెప్టెంబర్ త్రైమాసికంలో తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వృద్ధి వేగంగా పుంజుకోకపోవచ్చని తాము భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్స్ హెడ్ బి ప్రసన్న తెలిపారు. వృద్ధి రికవరీ వినియోగం ఆధారితంగా కాకుండా పెట్టుబడి ఆధారితంగా ఉంటుందన్నారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రభావాల నుంచి రియల్ ఎస్టేట్, చిన్న స్థాయి పరిశ్రమలు ఇంకా బయటపడకపోవడం వృద్ధికి ప్రధాన అవరోధాలుగా ఐసీఐసీఐ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. కమోడిటీ ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చని, కానీ, చమురు ధరలు వృద్ధిని నిర్ణయించే అంశంగా ప్రసన్న తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం వృద్ధికి, మార్కెట్లకు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
హీరో మోటో వాహన ధరల పెంపు
సాక్షి, ముంబై : ప్రపంచ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సంస్థకు చెందిన అన్ని మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయ కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ వస్తువల ధర పెరుగుదల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పెంపు అక్టోబర్ 3వ తేదీని అమల్లోకి రానున్నట్టు తెలిపింది. 900 రూపాయల దాకా ఈ పెంపు ఉంటుందని, ఆయా మార్కెట్లు, మోడళ్ళ ఆధారంగా సవరించిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. -
నిత్యావసరాల ధరల్ని నియంత్రించండి
లోక్సభ చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. గురువారం లోక్సభలో ధరల పెరుగుదలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ చెబుతున్నా దేశంలో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్లో 5.47 శాతం పెరిగిన ధరలు, మేలో 5.76 శాతానికి పెరిగిపోయాయి. వడ్డీరేట్ల విధానంతోనే ధరలు నియంత్రించవచ్చని ఆర్బీఐ నమ్మడం బాధాకరం. పంట సాగు లేకపోవడం, సబ్సిడీల కొరత, బ్లాక్ మార్కెట్కు నిత్యావసరాలు తరలించడం వంటి అనేక కారణాల వల్ల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి నిర్ణయాత్మాక చర్యలు చేపట్టాలి’ అని మేకపాటి కోరారు. -
నిత్యావసరాల ధరలు దిగొస్తాయ్!
♦ కేంద్ర ప్రభుత్వం ధీమా... ♦ తగిన వర్షపాతం సహకరిస్తుందని భరోసా ♦ పరిస్థితిని సమీక్షించిన ఎఫ్ఎస్డీసీ న్యూఢిల్లీ: దేశంలో తగిన వర్షపాతం నమోదైతే నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయన్న అంచనాలను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో సవాళ్లేనని ఆయన అంగీకరించారు. ఆర్థికమంత్రి అధ్యక్షతన మంగళవారం నాడు ఇక్కడ ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశం జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడ్డంసహా అంతర్జాతీయంగా ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ఉందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హాసహా ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు సమావేశానికి హాజరయ్యారు. 2010లో ఏర్పాటయిన తరువాత 15వ దఫా జరిగిన ఈ సమావేశంలో చర్చల ముఖ్యాంశాలు చూస్తే... ⇒ భారత స్థూల ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ప్రధానంగా దృష్టి. ⇒ మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష. ⇒ అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు జాగరూకతతో గమనించాలని నిర్ణయం. ⇒ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్ల ద్వారా 2013లో సేకరించిన మొత్తాలకు సంబంధించి 2016 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య జరపాల్సిన పునఃచెల్లింపుల సందర్భంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ⇒ ఆర్థిక పరిస్థితిని సమావేశంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వివరించారు. ⇒ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో.. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు, సంస్కరణలు వంటి పలు అంశాల్లో భారత్ తోటి వర్ధమాన దేశాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని సమావేశం అభిప్రాయపడింది. ⇒ భారత్ వద్ద ప్రస్తుత విదేశీ మారక ద్రవ్య నిల్వల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లో ఒడిదుడుకులను భారత్ పటిష్టంగా ఎదుర్కొనగలదనీ అభిప్రాయపడింది. ⇒ 2015-16లో సాధించిన 7.6 శాతం కన్నా, 2016-17లో వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనీ అంచనావేసింది. ⇒ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత, అలాగే బ్యాంకింగ్లో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై సమావేశం చర్చించింది. లక్ష్యం ఇదీ... ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఏర్పాటయిన కమిటీలో ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏ, ఎఫ్ఎంసీల చీఫ్లు సభ్యులుగా ఉన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికశాఖలో సీనియర్ అధికారులు కూడా ఈ కమిటీ చర్చల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ ఛబ్ దుగ్గల్ నేటి సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ జీ కాంట్రాక్టర్లూ పాల్గొన్నారు. ఎఫ్ఎస్డీసీ క్రితం సమావేశం జనవరి 13న జరిగింది. -
ధరలు పెరిగిన మాట వాస్తవమే- మంత్రి ఈటల
హైదరాబాద్ : వర్షాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగిన మాట వాస్తవమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడారు. కొన్నిచోట్ల పప్పుల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని, బ్లాక్ మార్కెట్ అయిన పప్పులను వెనక్కి తెస్తున్నామని తెలిపారు. త్వరలోనే కందిపప్పు ధరను రూ.110 నుంచి రూ.120 వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. కొన్ని నిత్యావసర ధరల నియంత్రణ ప్రభుత్వ అదుపులో ఉండటం లేదని, అయినప్పటికీ ప్రభుత్వమే కొన్ని వస్తువులను సబ్సిడీపై సరఫరా చేస్తోందని తెలిపారు. ఇతర శాఖల సమన్వయంతో ధరలను నియంత్రిస్తామని అన్నారు. -
క్షీణతలోనే టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా.. క్షీణతలో (మైనస్) కొనసాగింది. - 0.9 శాతం క్షీణత నమోదయ్యింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఈ ప్రభావం ప్రధానంగా కమోడిటీ ఆధారిత తయారీ ఉత్పత్తుల మీదా ఉండడం, దేశంలో మందగమన ధోరణి అన్నీ కలిసి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా క్షీణతలో ఉంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ నుంచి క్రమంగా టోకు ద్రవ్యోల్బణం క్షీణ బాట నుంచి పెరుగుదల దారికి మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తుండడం గమనార్హం. డిసెంబర్లో ఈ రేటు -0.73 శాతంగా నమోదయ్యింది. నవంబర్లో ఈ రేటు -2.04 శాతం. అక్టోబర్, సెప్టెంబర్లలో ఈ రేటు -4 శాతం వరకూ ఉంది. టోకు ద్రవ్యోల్బణంలోని ప్రధాన మూడు భాగాలనూ పరిశీలిస్తే... ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించి ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో 4.63 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో భాగమైన ఒక్క ఆహార విభాగాన్ని తీసుకుంటే టోకున ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. ఆహారేతర విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా నమోదయ్యింది. -
పప్పు...నిప్పు!
భగ్గుమంటున్న పప్పుల ధరలు మండుతున్న వంటనూనెలు పండుగ గిరాకీపై వ్యాపారుల కన్ను కృత్రిమ కొరతకు పక్కాగా ఎత్తులు సిటీబ్యూరో: మహా నగరంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ గిరాకీని సొమ్ము చేసుకొనేందుకు వ్యాపారులు పక్కాగా పావులు కదిపారు. కొన్ని రకాల నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచేసి... మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ధరలు పెంచేందుకు ఎత్తులు వేశారు. దీనికి రిటైల్ వ్యాపారుల అత్యాశ తోడవ్వడంతో ధరలు అదుపు తప్పాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయి. ఏం తినాలో... దసరా పండుగకు పిండివంటలు కాదు కదా... కనీసం పప్పన్నం తినే అదృష్టం కూడా లేద ంటూ నిరుపేదలు పెదవి విరుస్తున్నారు. గడచిన 10 రోజులుగా మినపపప్పు, కందిపప్పు ధరలు పోటీపడి పెరుగుతుండడం ప్రజలను కలవర పెడుతోంది. సోమవారం ఉదయం కేజీ రూ.180 ఉన్న కందిపప్పు ధర సాయంత్రానికి రూ.185కు ఎగబాకింది. నగర మార్కెట్లో కందిపప్పుకు కొరత ఎదురైందని చెబుతూ రిటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పప్పులు, వంట నూనెలు, పంచదార, బెల్లం, బియ్యం ధరలు కేజీకి రూ.8-30 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.46 వెచ్చించనిదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు. గత నెలలో సోనా మసూరి బియ్యం క్వింటాల్ ధర రూ.3,800 ఉండగా... ఇప్పుడు రూ.4,500కు చేరింది. కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో ఇదే బియ్యాన్ని క్వింటాల్కు రూ.4,600 వసూలు చేస్తున్నారు. నూనెలూ అంతే... ఇక వంట నూనెల ధరలైతే మంట పుట్టిస్తున్నాయి. అన్ని రకాల నూనెల ధరలు రూ.5-8 వరకు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో పల్లీ నూనె ధర లీటర్ రూ.100కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లో లీటర్కు రూ.105-107 వసూలు చేస్తున్నారు. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం కూడా ఈ పరిస్థితి కారణంగా కనిపిపిస్తోంది. కొన్నిరకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్లో అధికభాగం బియ్యం, వంటనూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. గోదాముల్లో సరుకు పండుగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు వేసిన ఎత్తులు వినియోగదారుల జేబుకు కన్నం పెడుతున్నాయి. వంట నూనె, వివిధ రకాల పప్పుల దిగుమతికి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని చెబుతూ ధరలకు పురిపెట్టారు. పప్పులు, వంటనూనె, కొబ్బరి, మసాలాలు వంటివాటిని గోదాములకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధర పెరుగుదలకు బాటలు వేశారు. నగరంలోని మెహబూబ్ మేన్షన్, సిద్ధిఅంబర్ బజార్, బేగం బజార్, ముక్తియార్గంజి వంటి హోల్సేల్ మార్కెట్లలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను గోదాములలో దాచి పెట్టినట్లు సోమవారం గుప్పుమంది. వీటిని పండుగకు మూడు నాలుగు రోజుల ముందు మార్కెట్లోకి విడుదల చేసి లాభాలు ఆర్జించేందుకు ఎత్తులు వేశారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. -
నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఖైరతాబాద్లో బుధవారం పౌరసరఫరాల భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో లేవని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
బతుకు భారం
ధరల పిడుగుతో సామాన్యుడు సతమతం నిత్యావసర ధరలు ఘోరం ఉల్లి ఆల్టైం రికారు ్డధర పట్టించుకోని ప్రభుత్వం ఉల్లిపాయలు, టమాటాలు తదితర కూరగాయలే కాదు.. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు ధరల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అంతేనా? బియ్యం, నూనెల రేట్లూ పరుగులు తీస్తున్నాయి. ఇలా ఒకటేమిటి జనం తినడానికి అవసరమైన సరకులన్నీ పోటీ పడుతున్నాయి. సామాన్యుడిపై ధరలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. నిత్యం అవసరాలైన వీటిని కొనలేక, తినకుండా ఉండలేక నానా అగచాట్లు పడుతున్నాడు. బతుకు బండిని భారంగా లాక్కొస్తున్నాడు. ఇంటి బడ్జెట్ను సర్దుబాటు చేయలేక గృహిణి ఆవేదన చెందుతోంది. ధరలను నియంత్రించాల్సిన సర్కారు చోద్యం చూస్తోందంటూ ప్రతి ఇంటి ఇల్లాలూ మండిపడుతోంది. విశాఖపట్నం:కొన్నాళ్లుగా అన్ని సరకులూ పెరగడమే తప్ప తగ్గడం లేదు. పప్పులు ధర పెరిగిందని కూరగాయల వైపు మళ్లితే వాటిదీ అదే దారి. కాయగూరలు కొండెక్కాయని చికెన్, మటన్, పప్పుల వైపు వెళ్లినా అవీ అలాగే ఉన్నాయి. వేటికవే ధరల్లో రికార్డులు సృష్టిస్తూ సామాన్యుడిని పిండేస్తున్నాయి. విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ కిలో ఉల్లి రూ.80ల వరకూ పెరిగి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. రైతుబజార్లలో రూ.20లకే దొరుకుతుందని ఆశగా వెళ్లిన వారికి రోజంతా క్యూలో నిలబడితే అక్కడ అదృష్టవంతులనే ఉల్లి వరిస్తోంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే తుళ్లిపడే పరిస్థితి తలెత్తింది. అరకొర ఉల్లితోనే కూర పూర్తవుతోంది. కందిపప్పు కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. కిలో 120కు పెరిగితేనే విలవిల్లాడిన వారికిప్పుడది కిలో రూ.150లకు చేరుకుంది. పెసరపప్పు రూ.140లకు పెరిగింది. వేరుశనగపలుకుల ధర రూ.100లు పలుకుతోంది. తాజాగా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్కు రూ.4-5లు, 15 కిలోల డబ్బాపై రూ.50ల దాకా పెరిగింది. బియ్యం ధరలు పక్షం రోజుల నుంచి ఊపందుకున్నాయి. వరి దిగుబడి తగ్గిందన్న కారణంతో క్వింటాలుకు కనిష్టంగా రూ.400లు, 25 కిలోల బ్యాగుపై రూ. 100ల పెరిగాయి. ఇలా ఓ మధ్య తరగతి ఇంట్లో నెలకు సగటున రూ. 2 వేల వరకూ అదనంగా భారం పడుతోంది. నిత్యావసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఎంతలా ఖర్చు తగ్గించుకుందామన్నా వీల్లేని, విధిలేని పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోని ఇల్లాలూ అల్లాడిపోతోంది. అన్ని బారులూ ఉల్లికే కంచరపాలెం: కంచరపాలెం సమీపంలో రైతుబజారులో సోమవారం ఉల్లి కోసం బారులు తీరి కనిపించా రు. పిల్లాపాపంతో ఉదయం వేకువ జామునుంచి క్యూలు కడుతున్నారు. అమ్మకాలు ప్రారంభం అయిన గంటలోపే మహిళలు సిగపట్లు ప్రారంభించారు. ఉల్లిపాయాలు అయిపోతున్నాయని వార్తా క్యూలో నిలబడిన మహిళల చెవిలో పడింది. దీంతో తోపులాటలు మొదలయ్యాయి . ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు మహిళలు క్యూలో నలిగిపోయారు. దొంగలు సెల్ఫోన్లు, పరసలు తదితర వస్తువులను కాజేశారు. సబ్సీడీ ఉల్లిపాయలను రైతుబజారులకు కా కుండా చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేస్తే బాగుంటుదని మహిళలు సూచిస్తున్నారు. -
అదిరేట్లు
♦ ఏం కొనాలన్నా అందుబాటులో లేని ధరలు ♦ కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ♦ పట్టించుకోని విజిలెన్స్ అధికారులు సత్తెనపల్లి : బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరిగి పోతున్నాయి. ఆ మేరకు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వనరులు పెరగక పోవడంతో సగటు జీవి నెలబడ్జెట్ తలకిందులైంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో వంటింటి బడ్జెట్ దాదాపు రెట్టింపు అయింది. సాధారణ, ఇంధన ధరలు అన్ని భారంగా మారుతున్నాయి. నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబానికి గత ఏడాది వంటింటి బడ్జెట్ సగటున రూ. 5వేలు ఉంటే... ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో అది రూ. 9వేలకు పెరిగింది. గత ఏడాది కిలో కంది పప్పు రూ. 75 కాగా... ఇప్పుడు అది రూ. 145కు పెరిగింది. మినపప్పు రూ. 80 నుంచి రూ. 125కు చేరుకుంది. ఇలా అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగి సగటు జీవి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. విజిలెన్స్ ఎక్కడ?.. మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటో తెలుసుకుని నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదాముల్లో స్థాయికి మించి అధికంగా నిల్వలు చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆదిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. బియ్యం ధరలూ అంతే.. జిల్లాలో ఎక్కువగా సన్నరకం బియ్యాన్ని వాడతారు. బీపీటీ బియ్యం విరివిగా వాడుతు న్నారు. సంవత్సర కాలంగా బియ్యం ధరలు కూడా సామాన్యులకు అందన్నంత స్థాయిలో పెరిగాయి. మరీ వారం రోజులుగా విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ.25 నుంచి రూ.28 వరకు పలికిన బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 40 నుంచి రూ. 45ల వరకు పెరిగిపోయాయి. మేలు రకం బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి పోతుండటం, స్థానికంగా బియ్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే నిత్యవసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. బడ్జెట్ సరిపోవడం లేదు.. పెరిగిన నిత్యవసర ధరలతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ సరిపోవడం లేదు. ఉద్యోగులకే కష్టంగా ఉంది.ఇక పేద, మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టం. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కె.లక్ష్మీ, ఉపాధ్యాయురాలు ధరలు తగ్గించాలి.. పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర ధరలు తగ్గించాలి. పెరిగిన ధరల కనుగుణంగా ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో ఎంత కష్టపడుతున్నా పూటగడవని పరిస్థితి. కూరగాయల ధరలు సైతం బాగా పెరిగి పోయాయి. బియ్యం కొనాలన్నా చాలా కష్టంగా ఉంది. - జి.రోజారాణి, అంగన్వాడీ కార్యకర్త -
‘కూరలు’ కష్టమే!
నగర శివారు ప్రాంతాల్లో తగ్గిన కూరగాయల సాగు ఇతర ప్రాంతాల దిగుమతులపైనే ఆధారం రోజు రోజుకూ పడిపోతున్న సరఫరా... ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టని సర్కారు మహానగరంలో ఇక కూరగాయలు దొరకడం కష్టమే. అసలే నిత్యావసరాల ధరలు మండిపోతుండగా..మరోవైపు కూరగాయలు కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి. వర్షాభావం, సాగు, తాగునీటి కటకట కారణంగా శివారు ప్రాంతాల్లో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాల్సిన సర్కారు మిన్నకుండిపోవడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మరికొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే కూరగాయల ధరలు కూడా ఉల్లి దారిలోనే సాగే ప్రమాదం పొంచి ఉంది. - సాక్షి, సిటీబ్యూరో మహా నగరానికి కూరగాయల సంక్షోభం పొంచి ఉంది. ఒకవైపు వర్షాభావం..మరోవైపు సాగు, తాగునీటికి కటకట కారణంగా నగర శివారు జిల్లాల్లో కూరగాయల సాగు దారుణంగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కూరగాయలు లభించని పరిస్థితి ఏర్పడుతోంది. డిమాండ్ భారీగా ఉండగా..సరఫరా దయనీయంగా ఉంది. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కూరగాయల సాగు పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు 50 శాతం మేర పడిపోయింది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉల్లి కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్థానికంగా ఉల్లిసాగు లేకపోవడంతో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలోని కర్నూలు నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలాగే టమాట, మిర్చి, దొండ, బెండ, కాకర, క్యాప్సికం, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, అరటి, ములగ, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి తదితర కూరగాయలు అత్యధికంగా బెంగళూరు, మదనపల్లి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఆలుగడ్డలు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. అవి కూడా నగర డిమాండ్కు తగ్గట్టు సరఫరా కావట్లేదు. సాధారణంగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూరగాయల కొరతతో ధరలు పెరుగుతాయి. తాజాగా వాతావరణ అననుకూలత కూడా దీనికి తోడయింది. ప్రస్తుతం నగర మార్కెట్లో ఏ రకం కూరగాయలను చూసినా కేజీ రూ.20 నుంచి 50 మధ్యలో ధర పలుకుతున్నాయి. క్యారెట్, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాప్సికం వంటివి స్థానికంగా ఉత్పత్తి కాకపోవడంతో సీజన్లో కూడా వాటి ధరలు ఆకాశంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వం సత్వరం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే భవిష్యత్ భయానకంగా తయారవుతోందని మార్కెటింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘మహా’ డిమాండ్ గ్రేటర్ హైదరాబాద్లో సుమారు కోటి జనాభా ఉందని ఓ అంచనా. ప్రపంచ ఆహార సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్ఏఓ) నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తికి రోజుకు 300 గ్రాములు కూరగాయలు వినియోగించాలి. ఇందులో 50 గ్రాములు ఆకు కూరలు మినహాయిస్తే ఒక్కో వ్యక్తికి రోజుకు 250 గ్రాముల కూరగాయలు వినియోగం తప్పనిసరి. ఈ ప్రకారం నగరంలోని కోటి జనాభాకు అన్నిరకాల కూరగాయలు సుమారు 2500 టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వే సింది. అయితే, ప్రసుతం అన్నిరకాల కూరగాయలు రోజుకు 1600 టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే నగరానికి దాదాపు 45 శాతం మేర కూరగాయల కొరత ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ సత్వరం చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ‘పాలీహౌస్ ఫార్మింగ్’ను ప్రోత్సహించడంతో పాటు రైతులకు తక్కువ కాలవ్యవధిలో ఉత్పత్తినిచ్చే విత్తనాలను సబ్సిడీ ధరపై అందించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంటి ఆవరణలో, రూఫ్పైన కూరగాయల సాగు విధానాలను ప్రోత్సహించాలంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రియల్ వెంచర్లకు అనుమతులిచ్చేటప్పుడే వ్యవసాయ భూముల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. -
ఉల్లి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేత!
ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకునే అవకాశం ధరల అదుపు కోసమే నిర్ణయం గెజిట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఉల్లి దిగుమతులపై గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా దిగుమతి చేసుకునే వెసులుబాటే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రస్తుత నిబంధనలను సవరించింది. అయితే రాష్ట్రాల పరిధిలో చేసుకునే దిగుమతులకు సంబంధించి దిగుమతిదారు ఎప్పటికప్పుడు ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నది ప్రభుత్వానికి ముందుగానే చెప్పాలని సూచించింది. ఈ మేరకు నిత్యావసర సరుకుల చట్టంలో చేసిన సవరణలను పొందుపరుస్తూ కేంద్రం గెజిట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆహార పంటల సాగు తగ్గిన నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఉల్లి సహా ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలకు అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నెల 7న అన్ని రాష్ట్రాలతో ధరల తగ్గింపు చర్యలపై అభిప్రాయాలను తీసుకుంది. నిత్యావసర సరుకుల్లో దేని ధర అయినా అనూహ్యంగా పెరిగిన పక్షంలో ఇతర రాష్ట్రం నుంచి కానీ, దేశం వెలుపల నుంచి కానీ వాటిని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. దీనిపై కదిలిన కేంద్రం ఉల్లిపై గతంలో పరిమిత రవాణా, స్టాక్ నిల్వలు, లెసైన్సులపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జులై 3 నుంచి వచ్చే ఏడాది జులై 2 వరకు ఈ ఆంక్షల నిలుపుదల ఉంటుందని పేర్కొంటూ గెజిట్ విడుదల చేసింది. -
ఎరువులొచ్చాయి.. దించేందుకు లారీలేవి?
లారీల సమ్మెతో తొలిరోజే తీవ్ర ప్రభావం నిత్యావసరాల ధరలు భగ్గుమనే అవకాశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మెతో.. తొలిరోజే తీవ్ర ప్రభావం కనిపించింది. నేరుగా ప్రజలపై పడకున్నా.. సరుకు రవాణ సంస్థలు, మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రజలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జనాభా ప్రాతిపదికన త్రైమాసిక పన్నును తగ్గించాలని, రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు తీసుకుని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు దిగిన తెలిసిందే. మంగళవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. దీంతో బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 శాతం సరుకు రవాణ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందస్తు బుకింగ్స్ నమోదైనవి మినహా ఎక్కడా సరుకుల లోడింగ్ జరగలేదు. పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యంలాంటి నిత్యావసరాలు సహా సిమెంట్, ఎరువుల లోడింగ్, అన్లోడింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకోవటంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు నిత్యం ఎరువులు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం న ల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం, వరంగల్, జడ్చర్ల, మహబూబ్నగర్, మూసాపేట స్టేషన్లకు భారీ పరిమాణంలో ఎరువుల లోడ్లో గూడ్సు వ్యాగన్లు చేరుకున్నాయి. కానీ వాటిలోంచి దించి, లోడ్ చేసేందుకు లారీలు లేకపోవటంతో వ్యాగన్లు అలాగే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. వారు మాట్లాడినా లారీల యజమానులు రాకపోవటంతో కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వ్యవసాయ పనుల నేపథ్యంలో ఎరువులను అత్యవసర వస్తువులుగా భావించి సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ అధికారులు లారీ యజమానుల సంఘాన్ని కోరారు. దీంతో కొన్ని చోట్ల ఎరువుల తరలింపునకు వారు సమ్మతించారు. ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లలో మాత్రం ఏడు వేల టన్నుల ఎరువులు స్టేషన్లలోనే ఉన్నాయి. మూసాపేటకు గోధుమలు, ఉప్పు లోడ్లతో కూడి వ్యాగన్లు కూడా వచ్చి నిలిచిపోయాయి. గురువారం నుంచి కూరగాయల దిగుమతి కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. నిత్యం హైదరాబాద్కు 19వేల మిలియన్ టన్నుల కూరగాయలు వస్తాయి. గురువారం నుంచి దీనిపై ప్రభావం ఉంటుందని మార్కెటింగ్శాఖ ఆందోళన చెందుతోంది. ఇదే జరిగితే ఒక్కసారిగా కూరగాయల ధరలు కొండెక్కటం ఖాయం. లారీ యజమానులతో నేడు చర్చలు సమ్మె తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో మంత్రులు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. త్రైమాసిక పన్నును తగ్గించాలనేది లారీ యజమానుల ప్రధాన డిమాండ్ కావటంతో దానిపై ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనతో చర్చించని కారణంగా రవాణశాఖ మంత్రి మహేందర్రెడ్డి దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. కనీసం చర్చలకు కూడా ఆయన అందుబాటులో లేరు. ప్రస్తుతం సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఉండటంతో మంత్రి ఆయనతో భేటీ కాలేకపోయారు. గురువారం సీఎం నుంచి అందే ఆదేశం మేరకు లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. పన్ను తగ్గింపు లాంటి అర్థిక పరమైన అంశాలు మినహా మిగతా డిమాండ్లపై తాము సానుకూలంగా ఉన్నట్టు మంత్రి మహేందర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని, చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం అధ్యక్షులు భాస్కరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇష్టానుసారం ధరలు...
ధరల పెరుగుదల గురించి అటు కేంద్ర ప్రభుత్వంగాని రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవటంతో నిత్యావసరాల ధరలు చాపకింద నీరులా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడుపుతూ ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసమంటూ జపాన్, సింగపూర్ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో దళారులు, వ్యాపారస్తులు ఎవరి ఇష్టానుసారంగా వారు నిత్యావస రాల ధరలు పెంచుకుంటూపోతున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి నప్పుడు ఆటోల నుండి ఆర్టీసీ బస్ల వరకు అన్ని సేవల చార్జీలు వెనువెంటనే పెంచుకుంటూ పోయారు. మరి ఇప్పుడు చమురు ధరలు అంతర్జాతీయంగా భారీస్థాయిలో పడిపోయినప్పుడు గతంలో పెంచిన ఆ సేవల ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఏ మాత్రం కృషి చేయడం లేదు. చమురు ధరలు పెరిగినా, తగ్గినా సేవల విషయంలో ప్రజలపై పెరిగిన ఆ భారాన్ని అలాగే ఉంచి ప్రజల్ని నిలువునా దోచుకోవడం సబబుకాదేమో... ప్రభుత్వాలు కాస్త ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలు చేయాలని మనవి. పి. శ్రీవాణి రామవరప్పాడు, కృష్ణా జిల్లా -
అసలు బుల్ మార్కెట్ ముందుంది..!
* ఇది ట్రయల్ మాత్రమే: ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా * కమోడిటీ ధరలు ఇక పతనమే 80 డాలర్లలోపే చమురు ధరలు * ఆయిల్ షేర్లపై దృష్టి... పెట్టుబడికి ఓఎన్జీసీ అత్యుత్తమం ముంబై: ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా దేశీ స్టాక్ మార్కెట్లలో అసలుసిసలు బుల్ దశ మొదలైందంటూ వ్యాఖ్యానించారు. ఇది మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అంటూ చెప్పిన రాకేష్ దీపావళి సందర్భంగా ఒక చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి మార్కెట్లపై అత్యంత ఆశావహంగా స్పందించారు. బిగ్బుల్గా ప్రసిద్ధులైన రాకేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... ‘దేశీ స్టాక్ మార్కెట్ సినిమాలో ట్రయిలర్ మాత్రమే మొదలైంది. అసలు సినిమా ముందుంది. అయితే తీవ్ర కరెక్షన్లకు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్ మార్కెట్లో దిద్దుబాట్లు సహజం’. ఇప్పుడే చెప్పలేం మోడీ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేం. మనది ప్రజాస్వామ్య దేశం. మార్పులు సహజం. అయితే ఆరు నెలల్లోనే మోడీ అద్భుతాలు చేస్తారని ఆశించడం తప్పు. అయితే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు కనిపించే అవకాశముంది. చమురు ధరలు లేదా కమోడిటీల పతనానికి అందరూ అనుకంటున్నట్లు వినియోగం తగ్గడం కారణంకాదు. గత 15ఏళ్లలో కమోడిటీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం ఇది అంతమైనట్లే. ఇకపై కమోడిటీల్లో భారీ దిద్దుబాటు(కరెక్షన్) జరిగే అవకాశముంది. అంతేకాదు. ఇది బేర్ ట్రెండ్కు దారితీయొచ్చుకూడా. పతనమవుతున్న చమురు ధరలు బ్యారల్కు 70-80 డాలర్ల ధరలో స్థిరపడే అవకాశముంది. నా అంచనా ప్రకారం దీర్ఘకాలంపాటు ఇదే స్థాయిలో ధరలు కొనసాగవచ్చు. ఆయిల్ షేర్లు భేష్ ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ లబ్దిపొందనున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఓఎన్జీసీ పట్ల బుల్లిష్గా ఉన్నాను. ఇప్పటికే ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేశాను కూడా. 2016 తరువాత ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని పూర్తిగా తొలగించే అవకాశముంది. ఇందువల్ల ఆయిల్ ధరల పతనం నుంచి బాగా లాభపడేది ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అని చెప్పొచ్చు. అంచనా వేయలేం దేశీ మార్కెట్లు సాధించబోయే వృద్ధి పట్ల నేను చూపుతున్న ఆశావహ థృక్పథానికి బిగ్బుల్, మ్యాడ్బుల్ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు. అయితే సైక్లికల్ అప్ట్రెండ్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో వ్యవస్థాగత బుల్ట్రెండ్ కనిపించనుంది. 2017-18 తరువాత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని సాధించనుంది. ఇది ఎన్నేళ్లు కొనసాగుతుందన్నది అంచనా వేయలేం. విదేశీ అంశాల ఎఫెక్ట్ తక్కువే కమోడిటీల పతనం, ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు వంటి సమస్యలను ప్రస్తుతం ధనిక దేశాలు ఎదుర్కొంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశమెక్కడ ఉంది? ఒకవేళ పెంచినా ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే. ఇండియా గరిష్ట స్థాయిలో వృద్ధి సాధించనున్న దేశం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయ్. సంస్కరణలు పుంజుకుంటే పెట్టుబడుల వెల్లువెత్తుతాయ్. రేర్ ఎంటర్ప్రజైస్ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే రాకేష్ గత ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలపై ఇటీవల ఒక పత్రిక లెక్కకట్టింది. ట్రేడింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి గంటకూ రాకేష్ రూ. 35 లక్షలు సంపాదించారంటూ పేర్కొంది. -
పండుగ కళ ఏదీ?
- ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు - కరువుతో కటకటపడుతున్న పల్లెసీమలు కదిరి: ఓవైపు కరువు, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఫలితంగా కరువు జిల్లాలో పండుగలు కళ తప్పుతున్నాయి. కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్న ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోతోంది. సామాన్యులు, మధ్య తరగతివారు ఎందుకొచ్చిన పండుగలురా.. బాబూ అని నిట్టూరుస్తున్నారు. వినాయక చవితి అనగానే కొత్త అల్లుళ్లు పండుగకు అత్తగారిల్లు చేరతారు. నూతన వస్త్రాలతో పిండి వంటలతో ఏ ఇళ్లు చూసినా పండుగ కళతో నిండిపోయేది. ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. కాగుతున్న నూనెలు: వంట నూనె లేనిదే పండుగ లేదు. కిలో వేరుశనగ నూనె రూ.110 నుంచి 120, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.90, వనస్పతి రూ.60, పామాయిల్ రూ.60 ఇలా వంటనూనె ధరలు స్టౌ మీద పెట్టకనే కాగిపోతున్నాయి. బెల్లం ధర చక్కెరను మించిపోయింది. కిలో చక్కెర రూ. 40 కాగా, బెల్లం రూ. 50 పలుకుతోంది. పప్పులు..నిప్పులు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పు ధర చూసినా సరాసరి రూ. 80 పలుకుతోంది. వేరుశనగ పప్పు ఎన్నడూ లేనివిధంగా ఈసారి కిలో రూ. 90కి చేరింది. కంది, పెసరపప్పుతో పోలిస్తే కాస్త తక్కువగా వుండే శనగపప్పు కూడా రూ.80కి అమ్ముతున్నారు. మార్కెట్లో సన్నబియ్యం ధ రలు అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి సంగతే మరచినట్టుంది. ఇప్పుడు బియ్యం కిలో రూ 36 నుంచి రూ. 40 ధర పలుకుతోం ది. కిలో మైదా రూ 25 నుంచి 30, గోధుమపిండి రూ. 30, చింతపండు రూ. 60 నుంచి 80, ఎండుమిర్చి రూ. 80కి అమ్ముతున్నారు. ధరల కారణంగా వ్యాపారా లు కూడా అంతంతమాత్రమే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బోసిపోయిన పల్లెలు: పండుగల సమయంలో పల్లెలు కళకళలాడేవి. కానీ ఏ గ్రామం చూసినా జనంలేక బోయిపోయింది. ప్రతి ఇంటికీ తాళాలే కన్పిస్తున్నాయి. ముసళోల్లు, చిన్నపిల్లలు మాత్రం గ్రామాల్లో కనిపిస్తున్నారు. మిగిలిన వారి సంగతి అడిగితే బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లారని చెబుతున్నారు. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
భారీగా తరలిపోతున్న రేషన్ బియ్యం రూ. కోట్లు దండుకుంటున్న దళారులు కర్నూలు కేంద్రంగా పాలిషింగ్ వ్యాపారం నిద్రపోతున్న నిఘా.. మొక్కుబడిగా కేసులు కల్లూరులో ఓ గోదాములో అక్రమంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సీ క్యాంపు సెంటర్లో ఆటోలో అక్రమంగా తరలుతున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. పేదల బియ్యం అక్రమంగా తరలిపోతుందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలుతున్న వాటినే అధికారులు ఎక్కవగా స్వాధీనం చేసుకుంటున్నారు. లారీల్లో తరలిపోతున్న బియ్యంను పట్టించుకోవడంలేదు. రేషన్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి అమ్ముతున్నారు. కర్నూలులో యథేచ్ఛగా సాగుతున్న పాలిషింగ్ వ్యాపారాన్ని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 11.54 లక్షల తెల్లకార్డుదారులకు 11.5 వేల మెట్రిక్ టన్నులకుపైగా రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఇందులో సగానికి పైగా అడ్డదారిలో తరలిపోతోంది. రూపు మార్చుకుని మళ్లీ ఎక్కువ ధరతో వినియోగదారులకు చేరుతోంది. - సాక్షి, కర్నూలు సాక్షి, కర్నూలు: రూపాయికి కిలో బియ్యం.. జిల్లాలో చాలా మంది పేదల ఆకలి తీరుస్తోంది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో ఈ బియ్యమే కొంత ఊరటనిస్తున్నాయి. అయితే కొందరు అక్రమార్కులు పేదల నోటికాడి కూడును బలవంతంగా లాక్కెళ్తున్నారు. తక్కువ ధరతో కొని వాటినే పాలిష్ చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల్లో బియ్యం అందక.. బయట అధిక ధరలకు కొనలేక చాలా మంది పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. జిల్లాలో ఈ తంతు ఎక్కువగా కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో సాగుతోంది. కర్నూలులో రేషన్ బియ్యం మాఫియా జడలు విప్పింది. కర్నూలు శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో చాలా వరకు పాలిష్ వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక ప్రాంతాలే కాకుండా అనంతపురం, గుంతకల్లు, గుత్తి వంటి ప్రాంతాల నుంచి కూడా సమీపంలోని మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్కార్డుదారులు నుంచి కొనడంతోపాటు ఇటీవల కొందరు డీలర్ల నుంచే నేరుగా వస్తున్నాయి. జిల్లాలోని మిల్లులకు, ఇతర జిల్లాలకు తరలిస్తూ కిలో రూపాయి ఉన్న బియ్యాన్ని రూ. 23 వరకు మార్చుతున్నారు. మిల్లుల్లో ఇవి సన్న బియ్యంగా మారుతున్నాయి. చివరికి వీటిని పోర్టులకు తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిల్లుల్లో ప్రత్యేక మిషన్లు మిల్లులో పాలిష్ చేసే విధానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. పాలిషనర్ మీదనే ఆడించి సన్న బియ్యంగా మార్చుతున్నారు. రంగుమారి తెల్లగా కనిపించేలా పాలిష్ పడుతున్నారు. ఎక్కువ శాతం మిల్లుల్లో దీని కోసం ప్రత్యేకంగా మిల్టెక్ అనే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. రూ. లక్షలు వెచ్చించి ఇటువంటి యంత్రాలను కొంటున్నారు. వీటిపై పట్టించిన తర్వాత రేషన్ బియ్యానికి సన్న బియ్యానికి తేడా కనిపించదు. క్వింటా రేషన్ బియ్యంను ఆడిస్తే ఎనభై ఐదు కిలోల వరకు వస్తాయి. వీటిని నిజమైన సన్న బియ్యంలో 20 నుంచి 40 శాతం వరకు కలుపుతున్నారు. ఇలా వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పాలిష్ అయి వినియోగదారులకు చేరుతున్నాయి. సగానికిపైగా పక్కదారి.. జిల్లా వ్యాప్తంగా 11.54 లక్షల తెల్లకార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా వీరికి 11.5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి వస్తోంది. అయితే ఇందులో సగానికి పైగానే అడ్డదారిలో తరలుతున్నాయి. అధికారులు మామూళ్లు తీసుకుంటూ అక్రమాలను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. తూతూ మంత్రంగా కేసులు.. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తోన్న వారిపై చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. ఐదు క్వింటాళ్లు రవాణా చేసినా.. వందల క్వింటాళ్లు తరలిస్తూ పట్టుబడ్డప్పటికీ కేవలం 6ఏ కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు. 6ఏ కేసు అంటే రెవెన్యూ సంబంధమైంది. జేసీ దగ్గరికి వెళ్లి ఆ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి. కార్డుదారుల దగ్గర కొన్నానని చెప్పి బియ్యం వదిలించుకుని వస్తున్నారు. కానీ వీరిపై చట్టపరమైన చర్యలు ఉండటం లేదు. దీంతో అక్రమ రవాణాదారులు జంకు లేకుండా ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటీవల నందికొట్కూరులో 100 క్వింటాళ్లు రవాణా చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. వారం కిందట కల్లూరులో 30 క్వింటాళ్లతో పట్టుబడ్డ వారిపై కూడా 6ఏ కేసు నమోదు చేశారు. అయితే గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు అక్రమార్కులపై నమోదు చేసిన 6ఏ కేసులను వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఏడాదిలో సుమారు వెయ్యి క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసినా కేసుల నమోదు తక్కువగా ఉంది. -
ఉల్లి ధర బెంబేలెత్తిస్తోంది
కామారెడ్డి : ఉల్లి కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. కొనేందుకు పోతే ధరతో బెంబేలెత్తిస్తోంది. మొన్నటి వరకు కిలో రూ. 10 నుంచి రూ.15 పలికిన ఉల్లిగడ్డ ధరలు రెట్టింపయ్యాయి. కిలోకు రూ.28 నుంచి రూ.30 వర కు అమ్ముతున్నారు. మార్కెట్కు వెళ్లి ఉల్లి ధరలను అడిగి ఖంగుతింటున్నారు. నెలక్రితం ఉల్లిధర కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు ఉండేది. తర్వాత పెరుగుతూ వచ్చిన ధర కిలోకు రూ.12 వరకు చేరింది. పది రోజుల్లోనే ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఉల్లి ధరలు మరింత పెరుగవచ్చని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది కూడా ఇలాగే ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో వాడకాన్ని తగ్గించుకున్నారు. హోటళ్లలో ఏకంగా ఉల్లిపాయలు లేవనే బోర్డులు సైతం తగిలించిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఉల్లిగడ్డ ధర మరింత పెరిగే అవకాశాలుండటం ఆందోళన కలిగిస్తోంది. కూరగాయల ధరలూ.. పేద, మధ్యతరగతి ప్రజలు మార్కెట్కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ కూరగాయలు కొనేందుకు వెళ్లినవారికి వాటి ధరలు దడపుట్టిస్తున్నాయి. పదిరోజుల కిందట వందరూపాయలకు పెడితే వారం, పది రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఇప్పుడు రూ.200లు పెట్టినా తక్కువే వస్తున్నాయి. కొత్తిమీర ధర అమాంతం పెరిగింది. కిలోకు రూ.125 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. ఓ కుటుంబానికి వారం రోజులకు పావుకిలో కొత్తిమీర అవసరమవుతుంది. ఆమేర కొనాలంటే కనీసం రూ.40 వెచ్చించాల్సి వస్తోంది. మొన్నటిదాకా రూ.10కి పావుకిలో వచ్చేదని వినియోగదారులు వాపోతున్నారు. బీరకాయ, బెండకాయలతో పాటు పచ్చిమిర్చి ధరలు కూడా పెరిగాాయి. మిగతా కూరగాయల ధరలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఏది కొనాలన్నా పావుకిలోకు తక్కువలో తక్కువ రూ.10 వెచ్చించాల్సిందే. నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు సరిపడా కూరగాయలు కొనాలంటే కనీసం రూ.50 ఖర్చు చేయాల్సిందే. పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా ఇలా పెరుగుతూ పోతే తాము ఏం తిని బతకాలంటూ.. ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈరోజుల్లో బతకడమే కష్టమవుతోందని వాపోతున్నారు. కూరగాయ ల ధరలను అదుపులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్లైన్: రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడిని గగ్గోలు పెట్టిస్తున్నాయి. రెండు నెలల కాలంలో బియ్యం ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఉప్పు, పప్పు ధరలూ నింగినంటుతున్నాయి. కూరగాయలూ కొనే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ధరలు నియంత్రించాల్సిన కమిటీ సభ్యులు మొక్కుబడి సమావేశాలతో రేషన్ దుకాణాల్లో సమస్యలపైనే చర్చించి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన పప్పు, నూనెల ధరలను కట్టడి చేసేందుకు తమ పరిధిలో ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. నిత్యావసర సరుకుల ధరల సంగతి అటుంచితే.. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఉన్నా..బియ్యం ధరలు ఒంగోలు సెంట్రల్, న్యూస్లైన్:రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడిని గగ్గోలు పెట్టిస్తున్నాయి. రెండు నెలల కాలంలో బియ్యం ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఉప్పు, పప్పు ధరలూ నింగినంటుతున్నాయి. కూరగాయలూ కొనే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ధరలు నియంత్రించాల్సిన కమిటీ సభ్యులు మొక్కుబడి సమావేశాలతో రేషన్ దుకాణాల్లో సమస్యలపైనే చర్చించి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన పప్పు, నూనెల ధరలను కట్టడి చేసేందుకు తమ పరిధిలో ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. నిత్యావసర సరుకుల ధరల సంగతి అటుంచితే.. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఉన్నా..బియ్యం ధరలు