‘కొండె’క్కిన పండుగ
– మొక్కలు నాటి సంరక్షణ విస్మరించారు
– దేవరకొండలో ఎండిపోయిన మొక్కలు
- మిగతా కొండ గుట్టల్లోనూ ఇదే పరిస్థితి
అనంతపురం అర్బన్ : మొక్కల పెంపకం పెద్ద ఎత్తున్న చేపట్టి జిల్లాను హరితవనంగా మారుస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. అందులో భాగంగా గత ఏడాది జూలైలో చేపట్టిన కొండ పండుగ కార్యక్రమం కొండెక్కింది. ఆరంభంలో దాదాపు రెండు నెలల పాటు కొండ పండుగపై ఆర్భాటం చేశారు. బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండ వద్ద మొక్కలు నాటారు. అనంతరం సంరక్షణ మరిచారు. ఫలితంగా నీరులేక అవి ఎండిపోయాయి. జిల్లాలో 63 కొండ గుట్లల్లో మొక్కలు పెంచే బాధ్యతను గాలిమరల కంపెనీలకు అప్పగించగా వారు గాలికొదిలేశాయి.
1.11 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యం
జిల్లాను ‘హరిత అనంత’ తీర్చిదిద్దే లక్ష్యంతో గత ఏడాదిలోగా 1.13 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా కలెక్టర్ ప్రకటించారు. రోడ్లకు ఇరువైపులా, పొలం గట్ల వెంబడి మొక్కలు నాటడంతో పాటు ప్రత్యేకంగా కొండగుట్టల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్ చెప్పారు. గుట్టల్లో నాటి మొక్కలను నీటి వసతిని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ముఖ్యంగా జిల్లాలోని కొండ గుట్టల్లో మొక్కలు నాటి పచ్చదనం సంతరించుకునేలా చేయాలి.
మొక్కలు నాటే కార్యక్రమానికి సంబం«ధించి పక్కా ప్రణాళికను వారంలోగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా జిల్లాలో గాలిమరల కంపెనీలు ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి స్వీకరించాలన్నారు. జిల్లాలో 615 గ్రామల సమీపంలో మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న బోడి కొండలను, పవన్ విద్యుత్ టవర్లు ఉన్న 63 కొండలను గుర్తించినట్లు అప్పట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. కానీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారు.