ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్
ఆటగాళ్లకు వీసా నిరాకరించిన అమెరికా
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) జట్టు అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఏడుగురు ఆర్చర్లు, ఇద్దరు కోచ్లు, ఒక సాయ్ అధికారికి మాత్రమే వీసా మంజూరయ్యింది.
ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసిన వీసా అధికారి అంతగా సంతృప్తి పడలేదని, వీరంతా అక్కడికి వెళ్లి తిరిగి రారేమోనని రిజెక్ట్ చేసినట్టు భారత ఆర్చరీ సంఘం కోశాధికారి వీరేందర్ సచ్దేవ తెలిపారు. ‘వీసా నిరాకరణకు నిరసనగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నాం. మరోసారి వీసా కోసం అప్లై చేసుకున్నప్పటికీ ఏఏఐ అధ్యక్షుడు వీకే మల్హోత్రా సూచన మేరకు వైదొలిగేందుకు నిర్ణయం తీసుకున్నాం’ అని సచ్దేవ పేర్కొన్నారు.