Janagam
-
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
వర్గాల పేర్లతో క్యాడర్ ను విభజిస్తున్నారు: ముత్తిరెడ్డి
-
జనగామ రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వివాదం
-
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
వీడియో: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు
-
జనగామలో భట్టి పాదయాత్రలో ఉద్రిక్తత
-
గానుగుపహాడ్ క్రాస్ రోడ్ వద్ద రహదారిపై రైతుల ధర్నా
-
బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం!
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూటే సెపరేట్.. ఆయన ఏం చేసినా సంచలనమే. అతని వ్యవహారశైలీ నిత్య వివాదాస్పదం.. గతంలో తీవ్ర ఆరోపణలతో మంత్రి పదవిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఓ మహిళ విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చిలిపిచేష్టలతో చిక్కులో పడుతున్న ఎమ్మెల్యే యవ్వారం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అధికార పార్టీ లో కలకలం రేపుతోంది. పోరాటాల పురిటిగడ్డ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉంటాయి, కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార పార్టీ బిఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తుంది. నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ ప్రజాసేవకు అంకితమైన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య యవ్వారం వివాదాస్పదంగా మారుతుంది. నిత్యం వార్తల్లో వ్యక్తిగా ప్రజల నోళ్ళలో నానుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. వైద్య వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న రాజయ్య మహిళల పట్ల ఆయన చూపే జాలి, ప్రేమ వికటించి అటు పార్టీని ఇటు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుంది. తాజాగా దళిత మహిళా సర్పంచ్ ఎమ్మెల్యే పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ దుమారానికి తెరలేపారు. రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే మంచిది.. లేకుంటే ఆయన సహకార అందించకుండా అణిచివేస్తాడని విమర్శించారు. ఎమ్మెల్యేను కలిసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదని, ఫోటోలు దిగేటప్పుడు అతుక్కుని ఉండాలనే ధోరణితో ఎమ్మెల్యే వ్యవహరిస్తాడని ఆరోపించారు. అలా ఉండకపోవడంతో ఓర్వలేడని తెలిపారు. ధర్మసాగర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసేటప్పుడు దూరంగా ఉంటే అందరి ముందు బొమ్మవా నువ్వు... కష్టపడి రాజకీయాల్లోకి వచ్చావు.. దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా..రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో కులపోళ్ళ ముందు ఇజ్జత్ పోయిందని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తోపాటు మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి, మరో అగ్రవర్ణ నాయకుడు నా బతుకును ఆగం చేయాలని చూశారు.. కానీ ఆగం కాలేదన్నారు. తనను నాశనం చేయాలని చూసిన మహిళను సాటి మహిళగా వారిని నాశనం చేయదలుచుకోలేదని తెలిపారు. తనకు ఎమ్మెల్యే తో పాటు మహిళ ప్రజాప్రతినిధి అగ్రవర్ణ వ్యక్తితో ప్రాణభయం ఉందని తనకు ఏమి జరిగినా ఆ ముగ్గురే బాధ్యులని స్పష్టం చేశారు. వారి నుండి రక్షణ కావాలని కోరుతూ కేసిఆర్ కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి వాళ్ళు ఉంటే ఆరాచకాలు ఉంటాయని, కెసిఆర్ కేటీఆర్ క్రింది స్థాయిలో ఏం జరుగుతుందో చూడండని కోరారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం కేటీఆర్ మీ క్రింద పనిచేసే వారి పనితీరును పరిశీలించండని మహిళా సర్పంచ్ నవ్య విజ్ఞప్తి చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. గ్రూప్ రాజకీయాలే కారణమా? నిప్పులేనిదే పొగ రాదన్నట్లు కొంత వాస్తవమే అయినప్పటికీ విమర్శల వెనుక అంతర్గత విబేదాలు గ్రూప్ రాజకీయాలే అందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా చక్రం తిప్పేందుకు అదృశ్య శక్తులు పావులు కదుపుతున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది పొలిటికల్ హీట్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య గత కొంత కాలంగా పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కప్పుడు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార పార్టీ బిఆర్ఎస్ లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. తుఫాను ముందటి ప్రశాంతతలా సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. అందులో భాగంగా వైరి వర్గం అంతర్గత కుమ్ములాటలు ఈ రకంగా బయట పడుతున్నాయని ప్రచారం సాగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు మహిళల వేదికగా తారస్థాయికి చేరుకుంటుందనే భావన ప్రజల్లో వ్యక్తమౌతుంది. స్వపక్షంలోనే విపక్షం తయారైనట్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి తమ పరువుతోపాటు పార్టీ పరువు తీస్తున్నారనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది. బిఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరిస్తున్న తరుణంలో నేతల మధ్య ఆధిపత్య పోరు, మహిళల పట్ల ఎమ్మెల్యే వైఖరి ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రాజకీయ కోణం దాగిఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టానని స్థానికులు కోరుతున్నారు. గులాబీ దళపతి వేసి చూసే ధోరణి అవలంబించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసేలా రాజయ్య వ్యవహారం మహిళా సర్పంచ్ నవ్య చేసిన విమర్శలు ఆరోపణకు ఆజ్యం పోసేలా రాజయ్య వ్యవహారం ఉంటుంది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్య అనతి కాలంలోనే తీవ్ర ఆరోపణలతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజయ్య మాటలు వ్యవహారశైలి స్త్రీ లోలుడిలా అర్థం వచ్చేలా ఉంటాయి. నియోజకవర్గంలో బర్డ్డే సందర్భంగా మహిళ పట్ల వ్యవహరించిన తీరు అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పిల్లలు పుట్టడానికి తన పుణ్యమేనని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటపుట్టించాయి. తాజాగా మహిళా సర్పంచ్ ని పట్టుకుని అతుక్కుని ఫోటోలు దిగాలని, రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని సూచించడం, అందుకు అనుగుణంగా ఓ మహిళా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అనుచరురాలు ఎమ్మెల్యేకు సహకరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడం ఎమ్మెల్యే వైఖరిని తేటతెల్లం చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాత్రం రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అలాంటి విమర్శలు ఆరోపణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిదొంగలు శిఖండి పాత్ర పోషిస్తు తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని, కుట్రలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్ళి తిప్పికొడుతానని రాజయ్య స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరవర్గం మహిళలు సైతం సర్పంచ్ నవ్య తీరును తప్పుపడుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మహిళా విషయంలో వర్గపోరుపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్ల దాడి
-
సెభాష్ సైనికా..!
-
జనగామకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్లోహైదరాబాద్ నుంచి బయలుదేరి 11.35 గంటలకు జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో దిగుతారు. 11.45 గంటలకు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.05 గంటలకు వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన యశ్వంతాపూర్ శివారులో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు అదే ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ప్రసంగం ముగింపు ఉంటుంది. 5.15 గంటలకు హెలికాప్టర్లో సీఎం హైదరాబాద్కు తిరిగి వెళతారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు గురువారం బహిరంగ సభాస్థలిని, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయాన్ని కలెక్టర్, పోలీసు కమిషనర్లతో కలిసి సందర్శించారు. సీఎంకు ఘనస్వాగతం పలకాలి: మంత్రులు కరువు జిల్లాగా ఉన్న జనగామను సస్యశ్యామలం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు శుక్రవారం జరిగే సభకు భారీ ఎత్తున పోటెత్తనున్నారని చెప్పారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించిన తర్వాత, పార్టీ జిల్లా అధ్యక్షులు పదవీ బాధ్యతలు చేపడతారని, అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. -
జనగామ: ఎసీ బస్సులో చెలరేగిన మంటలు
-
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి..
సాక్షి, స్టేషన్ఘన్పూర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా భర్తను ప్రియుడితో కలిసి భార్యహత్య చేయించిన ఘటన స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. దీంతో పోలీసులు బావినుంచి మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసుస్టేషన్లో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ వైభవ్గైక్వాడ్, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. నమ్మించి.. మద్యం తాగించి హైదరాబాద్ ఘట్కేసర్ మండలం వెంకటాపూర్కు చెందిన ఆకుల మహేష్ – అశ్విని దంపతులకు ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. అశ్వినికి గతంలో మరో వ్యక్తితో వివాహం కాగా ఆయన చనిపోయాక మహేష్ను పెళ్లిచేసుకుంది. మహేష్ జోడుమెట్ల పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా అశ్విని ఘట్కేసర్లో పూలు అమ్మేది. స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండకు చెందిన పశుల కుమార్ కొన్నేళ్లుగా ఘట్కేసర్లో ఆటో నడుపుతుండగా ఆయనతో అశ్వినికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై మహేష్, అశ్వినికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మహేష్ అడ్డు తొలగించాలని కుమార్, అశ్విని పథకం వేసుకున్నారు. మహేష్తో పశుల కుమార్ పరిచయం ఏర్పర్చుకుని తమ గ్రామంలో ఫంక్షన్కు వెళ్దామని నమ్మించాడు. ఈనెల ఐదో తేదీన పెట్రోల్బంక్లో ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీ దిగిన మహేష్.. కుమార్తో కలిసి కారులో స్టేషన్ఘన్పూర్ వచ్చారు. నమిలిగొండకు చెందిన వరసకు బావమరిది అయిన పల్లెపు కృష్ణ కుమార్కు నమిలిగొండ వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చాక ముగ్గురు గ్రామ శివారులోని ఓ రేకుల కొట్టం సమీపాన మద్యం తాగాక మత్తులో ఉన్న మహేష్ తలపై రాత్రి 11 గంటలకు కుమార్ బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం బావమరిది సాయంతో ఖాళీ గోనె సంచిలో మహేష్ మృతదేహాన్ని మూటగట్టి సమీపంలో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. ఘట్కేసర్లో మిస్సింగ్ కేసు ఈనెల ఐదున హైదరాబాద్ జోడుమెట్ల పెట్రోల్బంక్ నుంచి వెళ్లిన మహేష్ తిరిగి రాలేదు. హత్య చేసినట్లు భార్య అశ్వినికి తెలిసినా ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించసాగింది. చివరకు ఆయన సోదరులు, బంధువులతో కలిసి ఈనెల ఏడున ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ ఘట్కేసర్ పోలీసుల విచారణలో అశ్వినిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసినట్లు చెప్పిన ఆమె, కుమార్ స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో ఉన్నట్లు విచారణలో వెల్లడించింది. దీంతో ఘట్కేసర్ ఎస్ఐ స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్కు శనివారం చేరుకుని స్థానిక సిబ్బంది సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒప్పుకున్నాడు. ఆ వెంటనే నిందితులు చెప్పిన సమాచారం మేరకు వ్యవసాయ బావి వద్దకు ఘన్పూర్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ రమేష్నాయక్ వెళ్లి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి, జనగామ ఏసీపీ వినోద్కుమార్, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ వైభవ్ రఘునాధ్ గైక్వాడ్ చేరుకుని నిందితులు కుమార్, కృష్ణను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. -
Photo Story: మనసున్న పోలీస్
సోమవారం మధ్యాహ్నం.. జనగామ పట్టణం.. లాక్డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బాబుకు.. మండుటెండలో ఊతకర్ర సాయంతో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అడుగులో అడుగేసుకుని వస్తూ కనిపించింది. ఆమెనా స్థితిలో చూసి చలించిన బాబు వివరాలు ఆరాతీయగా, తన పేరు కౌసల్య అంటూ ఓ చీటీ చేతిలో పెట్టింది. అందులోని నంబర్కు ఫోన్చేస్తే అవతలి నుంచి స్పందన లేదు. అప్పటికే ఆకలిదప్పులతో నీరసించిపోయిన వృద్ధురాలు ‘అయ్యా! నాకు చేతకావట్లే.. ఈడెవరూ తెలియదు. నీ దయ సారూ!’ అంటూ చేతులు జోడించింది. మనసు ద్రవించిన ఆయన, తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని అందించారు. చేతిలో కొంత పైకం పెట్టారు. ఓ వాహనాన్ని ఆపి.. ఆమెను నర్మెట్టలో దించాలని డ్రైవర్ను రిక్వెస్ట్ చేసి ఎక్కించారు. ఆమె క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం డ్రైవర్ ఫోన్ నంబర్ను తీసుకున్నారు. – జి.వేణుగోపాల్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జనగామ చదవండి: ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి.. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా; ఎగబడ్డ జనం
సాక్షి, జనగామా/రఘునాథపల్లి: డీజిల్ లోడ్తో వెళుతున్న ఓ ట్యాంకర్ జనగామ జిల్లా నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి జిల్లాలోని యశ్వంతాపూర్లో ఓ పెట్రోల్ బంక్కు ట్యాంకర్ ద్వారా రూ.9.5 లక్షల విలువైన 12 వేల లీటర్ల డీజిల్ను తరలిస్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి యశ్వంతాపూర్ను దాటి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సర్వీస్ రోడ్డుపై బోల్తాపడింది. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ ఒక్కసారిగా బయటకు చిమ్మడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ చంద్రమౌళిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 40 మంది చిన్నారులు.. మృత్యు లారీ) కాగా, ట్యాంకర్ నుంచి డీజిల్ వరదలా బయటకు వస్తుండడంతో దానిని పట్టుకునేందుకు క్యాన్లు, బకెట్లతో జనం ఎగబడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బం దితో కలసి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 9 వేల లీటర్ల డీజిల్ నేలపాలైందని పోలీసులు తెలిపారు. -
ట్రంప్కు కరోనా: గుండెపోటుతో అభిమాని మృతి
సాక్షి, జనగామ : అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ మృతి చెందాడు. ట్రంప్కు కరోనా పాజిటివ్గా తేలడంతో నుంచి తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన కృష్ణకు ట్రంప్ అంటే ఎనలేని గౌరవం, ప్రేమ. తనమీద ఇష్టంతో ఇంటిముందు ఓ షెడ్డు నిర్మించి అందులో ట్రంప్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. రోజు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించి దేవుడాతో సమానంగా కొలుస్తాడు. (ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్: డొనాల్డ్ ట్రంప్) గత ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా.. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా తన దేవుడిని కలిసే అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంతేకాదు ఉపవాస దీక్షలకు కూడా పూనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే గతవారం ట్రంప్కు కరోనా పాజిటివ్గా తేటడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురికావడంతో గుండెపోటు వచ్చి ఆదివారం మరణించాడు. కొన్నే గ్రామస్తులు అతన్ని ముద్దుగా కృష్ణా ట్రంప్ అని పిలుస్తుంటారని స్నేహితులు చెబుతున్నారు. ట్రంప్ తన కలలోకి వచ్చేవారని.. ఆయన ఫొటో చూసి రోజు మొదలుపెడితే తనకు మంచి జరుగుతుందని.. అందుకే ఆయన్ను పూజిస్తున్నానని బుస్సా కృష్ణ చెబుతుండేవాడు. -
జనగాం పట్టణంలో పర్యటించిన మంత్రి కెటీఆర్
-
దేశంలోనే నంబర్ వన్
సాక్షి, జనగామ : ఉద్యమనేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా అత్యున్నతమైన గౌరవం లభిస్తుందని పోలీసుశాఖ హౌజింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయ ఆవరణలో రూ.కోటి నిధులతో నూతనంగా నిర్మాణం చేస్తున్న డీసీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడే మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటగా పోలీసు శాఖలో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.375 కోట్లు కేటాయించారన్నారు. రెండో విడతలో రూ.500 కోట్లు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసి అందించినట్లు చెప్పారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రతీనెలా జనరల్ ఖర్చుల కోసం ఎస్హెచ్ఓకు రూ.50 వేలు, పోలీస్స్టేషన్లకు రూ.25 వేలు, మేజర్ పోలీస్స్టేషన్లకు రూ.75వేలు విడుదల చేస్తున్నారన్నారు. ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనం రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని నిర్మల్ మినహా 13 ఎస్పీ, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్ పరిధిలో నూతన భవన నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ.55 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.25 కోట్లు విడుదల చేసి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసులకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టంచేశారు. నిర్మాణాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖ హౌజింగ్ బోర్డు విద్య, వైద్య, అటవీశాఖ, క్రిస్టియన్, మైనార్టీ ఇలా అనేక శాఖల పరిధిలో తాము టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నామన్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా కూడా రాజీలేకుండా పనిచేస్తుండడంతో అన్ని శాఖలు ఇటువైపు చూస్తున్నాయన్నారు. జనగామ డీసీపీ కార్యాలయంలో పై అంతస్తులో పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సై శ్రీనివాస్, రాజేష్ ఉన్నారు. -
డాక్టర్ల మెడపై కత్తి
సాక్షి, జనగామ : మేడమ్ తట్టుకోలేకపోతున్నాం.. ఉమ్మనీరు పోతుంది.. సుఖప్రసవం అయ్యేట్టు లేదు.. ఆపరేషన్ చేయండి అంటూ గర్భిణి.. కుటుంబ సభ్యులు నెత్తినోరు మొత్తుకుంటున్నా డాక్టర్లు పట్టించుకోవడం లేదు. సుఖప్రసవం కోసమే ప్రయత్నిస్తున్నారు. మొదటి కాన్పులో ఆపరేషన్ల సంఖ్య తగ్గించాలి.. సుఖ ప్రసవాలు తప్ప.. సిజేరియన్లు ఉండకూడదంటూ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు హుకుం జారీ చేస్తుండడంతో డాక్టర్లు కక్కలేక మిగలేక అయోమయంలో పడిపోతున్నారు. దీంతో వైద్యులకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మొదటి కాన్పులో ఆపరేషన్ చేస్తే పై అధికారులకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందనే భయంతో నార్మల్కు ట్రయ్ చేస్తూ ఇరుకున పెడుతున్నారు. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చే గర్భిణులు ఒక్కోసారి ప్రసూతి కోసం రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తే నార్మల్ వరకు ఆగాల్సిందే లేదంటే తీసుకెళ్లండి అంటూ తెగేసి చెబుతుండడంతో చేసేది లేక అక్కడే ఉండిపోతున్నారు. దీంతో డెలివరీ అయ్యే వరకు కుటుంబ సభ్యులు ఊపిరి బిగపట్టుకుని దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ... గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రులో మొదటి కాన్పు కోసం వచ్చే వారికి సుఖ ప్రసవం చేయాలని వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారుల ఆదేశాలు. ప్రతీ నెలా నార్మల్, ఆపరేషన్లపై సమీక్షలు నిర్వహిస్తూ సెక్షన్ రేటు ఎక్కువగా ఉన్న దవాఖానలకు సంబంధించిన బాస్లను సంజాయిషీ అడుగుతున్నారు. మొదటి కాన్పులో వందశాతం సుఖ ప్రసవాలు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితి చివరి స్టేజీ వరకు వేచి చూస్తుండడంతో తల్లులకు కడుపుకోత తప్పడం లేదు. నార్మల్ డెలివరీలను ఎవరూ తప్పుపట్టకున్నా కొన్ని సమయాల్లో ఆపరేషన్లు తప్పవు. సుఖప్రసవం కాదని తెలిసినా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాలని డాక్టర్ల వేచి చూసే ధోరణిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పాతకాలంలో సుఖ ప్రసవాలు కాలేదా అని వితండవాదం చేస్తున్న కొందరికి ఆస్పత్రికి వచ్చే గర్భిణుల కుటుంబ సభ్యులు దిమ్మదిరిగే సమాధానంచెబుతున్నారు. ఆహారంలో కల్తీ ముఫ్పై ఏళ్లు దాటకుండానే అనేక రోగాలు కష్టమంటే తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో సుఖ ప్రసవం అవడం చాలా కష్టమంటున్నారు. ఎంసీహెచ్లో కడుపుకోతలు.. చంపక్హిల్స్లోని జనగామ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో కడుపు కోతలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. సుఖ ప్రసవాలకు ప్రయత్నించే సమయంలో శిశువుల మరణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే కడుపు కోతలు తప్పడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా సుఖ ప్రసవం కోసం ప్రయత్నించడం తప్పు ఎలా అవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇరువురి ఆరోపణలు ఎలా ఉన్నా భావితరాలకు మార్గదర్శకులుగా తయారు కావాల్సిన శిశువులు లోకాన్ని చూడకుండానే అమ్మకడుపులో కన్ను మూస్తున్నారు. ఎదురుచూడని కుటుంబాలు ప్రైవేట్ బాట సుఖ ప్రసవం అంటూ కాలయాపన చేస్తుండడంతో కొందరు ప్రైవేట్ బాట పడుతున్నారు. పరిస్థితి విషమిస్తున్నా ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో తమ బిడ్డలను ప్రైవేట్ దవాఖానలకు తీసుకెళ్తున్నారు. ప్రైవేట్కు వెళ్తున్న క్రమంలో డ్యూటీలో ఉన్న వైద్యులు వారిని ఆపలేకపోతున్నారు. ఎంసీహెచ్లో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ చివరి మాసం వరకు 2773 డెలివరీలు చేయగా జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 872 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఎంసీహెచ్లో 870 సుఖ ప్రసవాలు, 1903 ఆపరేషన్లు, ప్రైవేట్లో 833 ఆపరేషన్లు, 39 నార్మల్ డెలివరీలను చేసినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. ఈ లెక్కన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రతీ నెలా సుమారు 80 ప్రసూతి కాన్పులు జరుగుతున్నాయి. ఇందులో 95 శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలే. ఎంసీహెచ్లో వేచి చూసే ధోరణి లేక నార్మల్ కోసం ప్రయత్నిస్తూ క్రిటికల్గా ఉన్నా ఆపరేషన్కు నిరాకరిస్తుండంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ బాటపడుతున్నారు. నూటికి 80శాతం నార్మల్ చేయాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం వందశాతంలో 80 నార్మల్, 20 శాతం ఆపరేషన్లు చేయాలి. క్రిటికల్గా ఉంటే ఆపరేషన్ చేయవచ్చు. ఇంటర్నేషల్ స్టాండెడ్కు అనుకూలంగా ఎంసీహెచ్లో గైనిక్ డాక్టర్, మత్తు, చిన్న పిల్లల వైద్యులతో పాటు ప్రసూతికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. మొదటి కాన్పులో సుఖ ప్రసవం అయ్యేట్టుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. డెలివరీ అయ్యే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అత్యవసర సమయంలో చాలా సార్లు ఆపరేషన్లు చేసి ఎంతో మందిని కాపాడాం. – డాక్టర్ సుగుణాకర్రాజు, ఎంసీహెచ్ ఆర్ఎంఓ, జనగామ -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ల పరిస్థితి విషమం
సాక్షి, జనగామ : జనగామ మండలం పెంబర్తి గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్కు వెళ్లి తిరిగి హన్మకొండకు వస్తున్న క్రమంలో పెంబర్తి వద్ద లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణీకులకు స్వల్పగాయాలు అవ్వడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వన్ వే ఉన్న రోడ్డుపై మరమ్మత్తుల కారణంగా డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాలకు గురైన వాహనాలను పక్కకు జరిపి ప్రయాణికులను ఇతర బస్సులో పంపించారు. కాగా డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. -
రేవంత్ది తప్పు.. ఉత్తమ్కే అధికారం
జనగామ: హుజూర్నగర్ ఉప ఎన్నికలో భాగంగా రేవంత్రెడ్డి తన అభ్యర్థిని ప్రకటించుకోవడమే కాకుండా పత్రికలకు ఎక్కడం పద్ధతి కాదని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే, రాహుల్గాంధీ ఆదేశాల మేరకు ఒకసారి ఎంపీగా పోటీ చేసి, పీసీసీ అధ్యక్షు డిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డికి స్టేట్వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్రెడ్డి వేలెత్తి చూపించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా పనిచేసిన ఆయనకు సొంత నియోజకవర్గంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసుకునే విధంగా ఉండాలే తప్ప... బహిరంగంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదన్నారు. విద్య, వైద్య, మిషన్భగీరథ, రైతుబంధు ఇలా అనేక హామీలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేసే కార్యక్రమాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష రుణమాఫి ఎక్కడ పోయిందన్నారు. ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతుంటే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీల అమలుకు కార్యరూపం దాల్చడం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని 5 ఎకరాలోపు ఉన్న రైతులకు ఇస్తామని ఓ మంత్రి అంటుంటే.. మరో మంత్రి అదేమీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వందలాదిమంది ప్రాణత్యాగం చేసి..తెలంగాణ సాధించుకుంటే.. కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో డీసీసీ వైస్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వలరక్ష్మి, సర్పంచ్లు మాసపేట రవీందర్రెడ్డి, రమేష్, మాజీ జెడ్పీటీసీ నల్ల అండాలుశ్రీరామ్, నాయకులు ఎల్లన్న ఉన్నారు. -
జనగామ ‘బాహుబలి’
సాక్షి, జనగామ: ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి సినీ హీరో ప్రభాస్ను చూడాలి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ఐదు గంటల పాటు హల్చల్ చేశాడు. ఉదయం 8 గంటలకు సెల్టవర్ ఎక్కిన ఇరవై ఏళ్ల యువకుడు... మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘బాహుబలి’ స్టైల్లో సర్కస్ ఫీట్లు చేస్తూ... ఆల్ ఆఫ్యూ గెట్ అవుట్ అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వరంగల్ హైవే ఉడుముల ఆస్పత్రి ఎదురుగా పెట్రోల్ బంకు పక్కన ఓ సెల్ టవర్పై చోటు చేసుకుంది. వివరాళ్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగుల గ్రామం శివారు పాపాయతండాకు చెందిన యువకుడు గుగులోతు వెంకన్న(20) జిల్లా కేంద్రంలోని సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. హీరో ప్రభాస్ను చూడాలని టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ వినోద్కుమార్, సీఐ సంతోష్కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, రవికుమార్, జిల్లా వైద్యాధికారి మహేందర్, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పుజారి రఘు, ఆర్ఎంఓ డాక్టర్ పడిగిపాటి సుగుణాకర్రాజు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీం హుటాహుటినా అక్కడకు చేరుకున్నారు. హిందీ..ఇంగ్లిష్లో మాట్లాడుతూ... ఐ లవ్యూ ప్రభాస్.. ఇలా మరికొందరి పేర్లు రాసి.. కిందకు విసిరేశాడు. అంతేకాకుండా సెల్టవర్ కేబుల్, సిగ్నల్ పాయింట్కు సంబంధించిన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసి.. సైకోఇజాన్ని ప్రదర్శిస్తుండగా పోలీసులు టవర్ చుట్టూ వలలను ఏర్పాటు చేశారు. పోలీసులు మాట్లాడుతూ హీరో ప్రభాస్ వచ్చాడు.. కిందకు దిగు తమ్ముడు అంటూ గంటల పాటు బతిమిలాడారు. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ఒక్కోమెట్టు దిగుతూ మధ్యకు చేరుకున్న యువకుడు... బాటిల్లోని నీటితో స్నానం చేసి కిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకుని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. -
జనగామలో ప్రభాస్ అభిమాని హల్చల్
-
మృత్యుంజయుడు
-
చిగురిస్తున్న ఆశలు
సాక్షి, జనగామ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఉన్న పట్టణం కావడంతో పాటు.. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉంది. ఉన్నత విద్యాసంస్థలు ఉన్నప్పటికీ మెడిసిన్ చదువు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. దీంతో ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మిస్తే అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లా ఏర్పాటు తరువాత మెడికల్ కాలేజీ కావాలనే కోరికను ప్రబలంగా విన్పిస్తున్నారు. కేసీఆర్ హామీతో తెరపైకి.. మెడికల్ కాలేజీ కోసం ప్రజల్లో డిమాండ్ ఉన్నప్పటికీ పాలకుల నుంచి మాత్రం స్పందన లేదు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఎన్నికల బహిరంగ సభలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. తాజాగా భువనగిరి లోక్సభ ఎన్నికల బహిరంగ సభలో మెడికల్ కాలేజీ గురించి మరోసారి ప్రస్తావించి ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రకటనతో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వస్తే లాభాలు ఇవి.. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయడంతో 250 పడకల ఆస్పత్రిగా మారింది. మెడికల్ కాలేజీ మంజూరైతే 600 పడకల ఆస్పత్రిగా మారుతుంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. 13 రకాల ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది. ఐసీయూ, ట్రామా సెంటర్ వస్తాయి. వీటితోపాటుగా ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
రిజిస్ట్రేషన్ కోసం వెళ్లి.. అనంత లోకాలకు
సాక్షి,జనగామ: ఆటో రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ వెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపూర్ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్లో నివాసముంటున్న కె.హేమంత్హరిశ్రీకాంత్(23) ఆటో నడుపుతూ కటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితుడు రమేష్ వద్ద ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటో రిజిష్ట్రేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. దానిని తన పేర మార్పిడి చేసుకునేందుకు హేమంత్హరిశ్రీకాంత్ తన స్నేహితులు రమేష్, దాస్లతో కలిసి ఆటోలోనే ఉదయం వరంగల్కు బయలుదేరారు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి హైదరాబాద్కు తిరిగి వెళ్తున్నారు. యశ్వంతాపూర్ శివారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో ఎగిరి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్, దాస్లకు తీవ్ర గాయాలయాయ్యయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.విషయం తెలుసుకున్న హేమంత్హరిశ్రీకాంత్ భార్య దివ్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి కోసం ఏడాది కూతురు ఎదురు చూపు.. తండ్రి కనిపించపోవడంతో హేమంత్హరిశ్రీకాంత్ ఏడాది కూతురు బిక్కు బిక్కుమంటూ ఉండి పోయింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో తల్లి దివ్య రోదిస్తుంటే.. ఏం జరిగిందో తెలియని ఆ పసిపాప దీనంగా చూసింది. నాన్న ప్రేమకు దూరమైన చిన్నారిని చూసిన వారు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
రవాణా శాఖలో ఓడీల బాగోతం..
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ డీటీవో కార్యాలయంలో ఎంవీఐగా పనిచేస్తున్న కె.వేణు నిన్న మొన్నటి వరకు ఇన్చార్జి డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జి డీటీవోగా కొనసాగుతున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న బద్రునాయక్ అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్నారు. ఇలా రవాణాశాఖలో కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు (ఎంవీఐలు) ఇప్పుడు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులు ఉంటే చాలు... పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఇన్చార్జి డీటీవోలు, డీటీసీలుగా కూడా కొనసాగుతున్నారు. అవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు సాగిస్తున్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి. రవాణాశాఖలో ఎంవీఐ ఉద్యోగం.. వారి ఆదాయం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే మరీ ‘నీకది.. నాకిది’ అన్న చందంగా ఆన్ డెప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్లు తెచ్చుకుంటుండటం ఆ శాఖలో వివాదస్పదం అవుతోంది. రవాణాశాఖలో ఆన్ డెప్యూటేషన్(ఓడీ)ల పేరిట అక్రమార్జన తంతు సాగుతోంది. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికా రులు, మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. వివిధ కారణాలతో రవాణాశాఖలో ప్రమోషన్లకు అడ్డుచక్రం వేసిన సదరు వ్యక్తులు ఖాళీల పేరిట కథ నడిపిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు కీలక అధికారులు పో స్టుకో రేటును ఫిక్స్ చేసి అనుయాయులకు ‘ఆన్ డెప్యూటేçషన్’ పేరిట అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ బాగోతం ఇటీవల వివాదస్పదంగా మారింది. ‘ఏ శాఖలో కూడా ఆన్ డెప్యూటేషన్లు ఉండవద్దు.. అవసరమైతే డీపీసీలు పెట్టి నియమాకాలు, పదోన్నతులు ఇవ్వాలి’ అంటూ ఇటీవ ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉ త్తర్వులు రవాణాశాఖలో మాత్రం వర్తించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆన్ డెప్యూటేషన్ పోస్టింగ్ల వ్యవహారం ఏకంగా రవా ణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి పేషీకి చేరడం ఆ శాఖలో చర్చనీయాంశం అవుతోంది. ఖాళీల పేరిట ‘ఓడీ’ల వ్యవహారం... రవాణాశాఖలో 2013 తర్వాత పదోన్నతులు లేవు. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట ఈ తతంగం నడిపిస్తున్నారు. కానిస్టేబుళ్లు, క్లర్క్ల నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)ల నుంచి ఎంవీఐల పదోన్నతులు నిలిచిపోయాయి. ఎంవీఐల నుంచి డీటీవో/ఆర్టీవోల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. ఇటీవలే హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీవోల)కు ఉప కమిషనర్ (డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్లు ఇచ్చారు. ఇందులో భాగంగానే వరంగల్ డీటీసీగా పురుషోత్తంను నియమించారు. ఇదిలా వుంటే క్లర్క్లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందిన వారి పదోన్నతుల ఫైలు ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞాపన మేరకు రవాణాశాఖలో పదోన్నతుల కోసం డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో డీపీసీ ఇప్పటివరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా... రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసి పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి ఆన్ డెప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ములుగు కోసం పోటీలో ఆ ఇద్దరు... ట్రాన్పోర్ట్ డిపార్టుమెంట్లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కోసం కూడా పోటీ పడుతుండటం ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీఐ రమేష్రాథోడ్ జనగామ ఇన్చార్జి ఎంవీఐతో పాటు డీటీవోగా మూడు బాధ్యతలు నిర్వహిస్తూ ములుగు ఇన్చార్జి డీటీవో కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవిందర్ ఇన్చార్జి డీటీవోతో పాటు ఖమ్మం ఇన్చార్జి ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉండి, ములుగు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా, అక్కడే ఇన్చార్జి డీటీవోగా, ఖమ్మం ఇన్చార్జి డీటీవోగా వ్యవహరిస్తున్న బద్రునాయక్కు కూడా ఈ రేసులో ఉన్నట్లు మంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులో పేర్కొనడం ఆ శాఖలో చర్చనీయాశంగా మారింది. -
జనగామ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాల నామినేషన్
-
కోదండరాంకు లైన్క్లియర్!
సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్కు కేటాయించే అవకాశాలు ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి. సిద్ధమైన ప్రచార రథాలు కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్ ప్రకటించింది. టీజేఎస్ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు. దాదాపుగా జనగామ టీజేఎస్కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. -
ఎన్నికల బరి నుండి తప్పుకోనున్న కోదండరామ్
-
జనగామ నుంచి కోదండరాం?
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీపీసీసీ, టీజేఎస్ పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదిరింది. గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షు డు ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్లతో టీజేఎస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి దిలీప్కుమార్, ముఖ్యనేతలు రాజేందర్రెడ్డి, గోపాల్శర్మలు సమావేశమయ్యారు. టీజేఎస్కు 8 స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 5 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, మరో మూడు స్థానాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న 8 సీట్ల పై టీజేఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఇస్తామన్న 8 స్థానాల్లో తమకు బలం లేదని, తమకు పట్టున్న, తాము సూచించిన 8 స్థానాల్లోనే సీట్లు కేటా యించాలని టీజేఎస్ అధినేత కోదండరాం గురువారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. పొత్తుల్లో భాగంగా జనగామ నుంచి ప్రొఫెసర్ కోదండరాం పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను టీజేఎ స్కు కేటాయించబోతున్నట్టుగా తెలిసింది. అయితే మరో రెండు సీట్లు కావాలని కోదండరాం పట్టుబడుతున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహబూబ్నగర్, వరంగల్ తూర్పు నియోజకవర్గాలు తమకు కావాలని కోదండరాం కోరుతున్నట్టుగా సమాచారం. సీట్లపై చర్చలు తుదిదశకు చేరుకున్న దశలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి కోదం డరాం శుక్రవారం ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కోదం డరాం ఢిల్లీ పర్యటన అనంతరం చర్చలకు సంబం« దించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం
సాక్షి, జనగామ: జిల్లాలో 6,76,586 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓటర్ల ముసాయిదా విడుదల చేశారు. శాసన సభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడంపై ఎన్నికల కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల ఏర్పాట్లుపై జిల్లాస్థాయి అధికారులతోపాటు రెవెన్యూ శాఖ అధికారులకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మునిగిపోయింది. కొత్త సాంతికేతిక పరిజ్ఞానంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సాంతికేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటును సరిచూసుకునే యంత్రాలకు వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎం మిషన్లపై పలు రాజకీయ పార్టీలతోపాటు పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఈ సారి వీవీ ప్యాట్లను అమర్చనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటు ఎవరికి నమోదైందో రశీదు ద్వారా తెలుసుకోవచ్చు. 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేని వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, 15, 16వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణకు గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు, అక్టోబర్ 4వ తేదీన అభ్యంతరాల పరిష్కారానికి తుది గడువు, 7వ తేదీ వరకు మార్పులు, చేర్పులతో జాబితా ముద్రణ, అనంతరం 8వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా ప్రకారమే శాసన సభ ఎన్నికలను నిర్వహిస్తారు. -
ఎవరికి వారే..!
సాక్షి, జనగామ: జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో సమన్వయం కరువైందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నాయకులు పోటాపోటీగా ప్రజలను కలవడానికి ప్రయత్నిస్తుండడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మినహా జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యనే పోటీ నెలకొంది. జనగామ నియోజకవర్గంలో పట్టు కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జనగామ అంతర్భాగంగా ఉంది. 2009–14 మధ్య కాలంలో భువనగిరి ఎంపీగా రాజగోపాల్రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో జనగామ ప్రాంతంలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి రాజగోపాల్రెడ్డి సొంత క్యాడర్ను కలిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటారనే పేరున్న రాజగోపాల్రెడ్డి ఇటీవల జనగామలో పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు దంపతుల కుటుంబాన్ని సిద్ధంకిలో పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే జనగామలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జనగామ నుంచి 2019లో జరుగనున్న ఎన్నికల్లో ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో భర్త రాజగోపాల్రెడ్డి గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఆమె స్వయంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సరళిలో ఆమె ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ప్రజలకు పరిచయం ఉండడంతో టికెట్ను ఆశిస్తున్నట్లు కొమటిరెడ్డి వర్గీయులు చెబుతుండడం గమనార్హం. ఘన్పూర్లో మూడు ముక్కలాట.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాటగా మారింది. మాజీ మంత్రి జి.విజయరామారావు, బి.ఆరోగ్యం, సిం గపురం ఇందిర మూడు వర్గాలుగా విడిపోయారు. ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వర్గాలు విడిపోయి ప్రజలను కలుస్తున్నారు. ముగ్గురు టికెట్ల ను ఆశిస్తూ సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నా రు. అయితే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ముందు టీపీసీసీ నియోజకవర్గ సభ్యులుగా జి.విజయరామారావు, గంగా రపు అమృతరావును నియమించింది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో బస్సు యాత్ర నియోజకవర్గంలో కొనసాగినా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. కనీసం రోడ్ షోను సైతం చేపట్టక పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. యాత్రను ప్రజల చైతన్యవంతం కోసం ఉపయోగించుకోవడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొన్నాలపై ఏఐసీసీ కార్యదర్శికి ఫిర్యాదు.. ఇటీవల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు పొన్నాల లక్ష్మయ్యపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి పొన్నాల కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఈ నెల 17వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. దీంతో ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. కానీ, జనగామ నుంచి పొన్నాల నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు పర్యాయాలు కేబినెట్ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి మేధావిగా, బీసీ నేతగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో జనగామ అనగానే పొన్నాల అనే స్థాయిలో పేరుంది. అయితే పొన్నాల, కోమటిరెడ్డి ఒకే పార్టీ అయినా వేర్వేరుగా పర్యటనలు చేయడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. పాలకుర్తిలో గ్రూపులకుతావివ్వకుండా.. పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి మాత్రమే ఎలాంటి గ్రూపులకు తావివ్వకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యలో ఎండగడుతూనే నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏప్రిల్లో పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రను సక్సెస్ చేయడంతో జంగాకు అధిష్టానం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల రైతు దీక్ష సందర్భగా పాలకుర్తి నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఆకర్షించారు. -
వచ్చేది మా.. ప్రభుత్వమే..
సాక్షి, జనగామ : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది.. డిసెంబర్లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి.. 80కి పైగా సీట్లను గెలుచుకోనున్నాం..’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత బస్సు యాత్ర బుధవారం పాలకుర్తి నియోజకవర్గానికి చేరింది. గూడూరు నుంచి బమ్మెర మీదుగా పాలకుర్తికి చేరగా.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్రంలో ఎక్కడైనా సరే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతం చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంప్రదాయాలను ఇప్పుడు అధికారులు పాటించడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాల పాలయ్యారని.. అణచివేతకు గరౌతున్నారన్నారు. మాల, మాదిగలు లేకుండా రాష్ట్ర కేబినెట్ ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర 21 నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. 12 రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్రలో పాలకుర్తి బహిరంగ సభ పెద్దదన్నారు. రానున్న రోజుల్లో జంగా రాఘవరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని, ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటికి పోవడం ఖాయమని.. మీ అందరిని చూస్తే తెలిసిపోతోందని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సభలో మల్లు రవి, నంది ఎల్లయ్య, రవీంద్రనాయక్, పొన్నం ప్రభాకర్రెడ్డి, గండ్ర జ్యోతి, నాయిని రాజేందర్రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు
సాక్షి, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జనగామ పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు పెడతామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రైతులు ఆనందంగా ఉంటున్నారని చెప్పడం దారణమన్నారు. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో పెంబర్తి రైతులను వచ్చి అడగాలన్నారు. భూములు లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే రూ.14వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు.. సక్రమంగా చెల్లించిన రైతులకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పెట్టుబడి పథకంలో కౌలు రైతులకు అవకాశం కల్పించక పోవడం సిగ్గుచేటన్నారు. జనగామ నియోజకవర్గంలోని ఆదర్శరైతులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎండీ అన్వర్, రంగరాజు ప్రవీణ్కుమార్, కొత్త కరుణాకర్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, ఎండీ నాజీజ్, క్రాంతికుమార్, నాంపల్లి చందన, లింగాజీ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
జనగామ అర్బన్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించాలని టీటీజేఏసీ చైర్మన్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీటీజేఏసీ నూతన కార్యవర్గాన్ని వివిధ భాగస్వామ్య సం ఘాలు, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి కొల్ల మహిపాల్రెడ్డి సమన్వయంతో స్ధానిక పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. పీఆర్సీ ఏర్పాటు కోరుతూ పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అనంతరం టీటీజేఏసీ జిల్లా చైర్మన్గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్గా టీపీయూఎస్ అధ్యక్షుడు ముసిని వేణుగోపాల్, డిప్యూటీ చైర్మన్గా టీఎస్హెచ్ఎంఏ అధ్యక్షుడు గాండె మల్లికార్జున్, కోచైర్మన్గా డీజీటీయూ ప్రధాన కార్యదర్శి జె.రత్నాకర్, కార్యదర్శిగా టీఎస్టీఎస్టీయూఎస్ అధ్యక్షుడు సలాడి సత్తయ్యను ఎన్నుకున్నారు. సమావేశంలో రమేష్, అర్జున్కుమార్, విద్యాసాగర్, సోమరాజు, విజ య్కుమార్, ప్రభాకర్, పంచాక్షరి, రత్నాకర్, మనోజ్కుమార్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
జనగామ అర్బన్: మేనకోడలు వివాహ వేడుకకు వచ్చిన ఓ వీఆర్ఏ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట శివారు తూర్పుగుడెం వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న ఝెండ్రు కృçష్ణ(40) జనగామలోని తన మేనకోడలు వివాహానికి కూతురు సోనితో కలిసి హాజరయ్యాడు. పెళ్లి ముగిశాక పెళ్లింటికి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. జనగామ రైల్వే బిడ్జిపై సిద్ధిపేట వైపునకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎక్స్ఎల్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కృష్ణ తలకు తీవ్రగాయాలు కాగా కూతురు సోనికి సైతం గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా కృష్ణ మార్గమధ్యలో మృతిచెందాడు. సోని ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. కాగా వీఆర్ఏ కృష్ణ భార్య యాదలక్ష్మి, కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మృతిచెందారని బంధువులు తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న జనగామ ఎస్సై శ్రీనివాస్ వివరాలు తెలుసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెండ్లివారు ఆస్పత్రికి చేరుకొని చేసిన రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన బస్సు ఫ్లైఓవర్ బిడ్జిపై మరో ప్రమాదం.. జనగామ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు తృటిలో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లికి చెందిన బైరిగి రాము, అదే జిల్లా బస్వాపురానికి చెందిన గుండెగళ్ల నర్సింహులు బైక్పై జనగామ నుంచి సిద్ధిపేట వైపు వెళ్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం వారి బైక్ను ఢీకొట్టి అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్ను తాకి ఆగిపోయింది. ఈ ఘటనలో రాము, నర్సింహులకు గాయాలుకాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఈ సంఘటనలో బైక్ ధ్వంసం కాగా, కొద్దితేడాతో బొలెరో వాహనం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
144 సబ్సిడీ గొర్రెలు పట్టివేత
సాక్షి, జనగామ : రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుబలు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారిపడుతోంది. రైతులకు దక్కాల్సిన గొర్రెలను బ్రోకర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ రోడ్డు కళింగ ధాబా వద్ద హన్మకొండ నుంచి రెండు డీసీఎం వాహనాలలో 281 గొర్రెలను హైదరాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ పరమేశ్ కాపుకాసి గొర్రెలను తరలిస్తున్నరెండు వాహనాలను పట్టకున్నారు. జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డ ఆలయ సమీపంలో వాటిని ఉంచారు. ఇందులో 144 సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు పశుసంవర్దక శాఖ వైద్యులు గుర్తించారు. వైద్యులు సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు నిర్దారించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : ఇద్దరు మృతి
-
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : ఇద్దరు మృతి
జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీలు ఢీకొన్నాయి. హన్మకొండ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుండి హన్మకొండకు వస్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ను అర్.ఎల్.రెడ్డిగా గుర్తించారు. గాయాలపాలైన పలువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. -
బ్యాంక్లో అగ్నిప్రమాదం
జనగామ: జిల్లా కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణంలో ఉన్న బ్యాంకులో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని చితక్కొట్టిన టీచర్
-
జనగామలో 144 సెక్షన్ ఎత్తివేత
జనగామ(వరంగల్): వరంగల్ జిల్లా జనగామలో గత 85 రోజులుగా కొనసాగుతున్న 144వ సెక్షన్ను ఎత్తేస్తున్నట్టు డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆదివారం తెలిపారు. చట్టపరిధిలో శాంతియుత ఉద్యమాలకు మినహా.. అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడితే తిరిగి 144 సెక్షన్ను పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక జిల్లా కోరుతూ.. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండటంతో.. 85 రోజుల నుంచి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. -
కలెక్టర్ వాహనం అడ్డగింత
రఘునాథపల్లి: జనగామ జిల్లా చేయాలనే డిమాండ్తో మండల జేఏసీ పిలుపుమేరకు మంగళవారం బంద్ జరిగింది. మండలంలోని భాంజీపేట శివారు పిట్టలగూడెంను సందర్శించిన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తిరిగి వెళ్తుండగా రఘునాథపల్లి బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు అడ్డగించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, జేఏసీ మండల కన్వీనర్ మారుజోడు రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హన్మకొండ జిల్లా వద్దు.. జనగామ జిల్లా కావాలని కలెక్టర్ వాహనం ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేందుకు యత్నిస్తుండగా కలెక్టర్ వాహనం దిగి వచ్చి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ చేసిన తీర్మాణ ప్రతిని ఆందోళనకారులు కలెక్టర్కు అందించి జిల్లా చేయాలని కోరారు. ఆందోళనలో జేఏసీ కన్వీనర్ మారుజోడు రాంబాబు, కోకన్వీనర్లు కడారి నాగేష్, పోకల శివకుమార్, కావటి యాదగిరి, ఎండీ.బాషుమియా, దుబ్బాక నాగేష్, కోళ్ల రవి, హర్యానాయక్, ద్యావర యాకయ్య ఉన్నారు. -
జిల్లా ఏర్పాటు ఖాయం
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు విషయం లో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులతో కలిసి గురువారం డి ప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిశా రు. జనగామ జిల్లాకు ఉన్న అర్హతలు, పూర్తి నివేదికను ఆయనకు సమర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మకొండ వద్దనే డిమాండ్ పెరుగుతుండడంతో జనగామకు అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే సీహెచ్ రాజరెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, పజ్జూరి గోప య్య, పసుల ఏబేలు తదితరులు ఉన్నారు. -
రైతన్న బలవన్మరణం
జనగాం (వరంగల్) : నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లిలో నీరటి రాజు(32) వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాడు. ఈ ఏడు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో దిగులు చెందాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. తిరిగి వస్తూ పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అతడికి భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
జనగామ ( వరంగల్) : వరంగల్ జిల్లా జనగామ బస్టాండ్ వద్ద లారీ ఢీకొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామానికి చెందిన సుంకోజు అనంద్ ఫ్యాషన్ ప్రో బండి కొనుగోలు చేశాడు. దీని రిజిస్ట్రేషన్ కోసం సోమవారం ఆనంద్, అతని తమ్ముడు కృష్ణమూర్తి కొత్త బైక్పై జనగామకు వెళుతున్నారు. కృష్ణమూర్తి బైక్ నడుపుతుండగా, ఆనంద్ వెనుక కూర్చున్నాడు. బైక్ జనగామ బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్దకు రాగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఆనంద్ను ఢీకొంది. దీంతో అతడు ఎగిరి రోడ్డుపై పడిపోగా, అతనిపై నుంచి లారీ ముందుకు వెళ్లిపోయింది. దీంతో అతడు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో కృష్ణమూర్తి ప్రాణాలతో బయటపడ్డాడు. -
జనగాం డీఎస్పీ ఇళ్లపై ఏసీబీ దాడులు
-
జనగాం డీఎస్పీ ఇళ్లపై ఏసీబీ దాడులు
జనగాం(వరంగల్): ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీ సురేందర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లాలోని జనగాం, హన్మకొండతోపాటు హైదరాబాద్లోని ఆయన ఇళ్లపై దాడులు చేశారు. జనగాంలోని డీఎస్పీ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జనగాంలో ఓటు కోసం జనం బారులు