KM Pillai
-
మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది ఎలాంటి సంబంధాలు?
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి. ఏ పునాదుల ఆధారంగా మానవ సంబంధాలు నిర్మితం అవుతున్నాయి... కాలక్రమంలో ఎలాంటి కారణాలు మానవ సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఎలాంటి వ్యవహారాలు నైతిక విలువలను పరిహాసం పాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీసే సంగతులు. వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను చంపేసే భార్యలు, కన్న పిల్లలను చంపేసే తల్లులు, అదేమాదిరి పురుషులు మనకు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆ వివాహేతర సంబంధం కంటె వారికి ఏదీ ఎక్కువ కాదేమో అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు.తాజాగా ఒకేరోజు దినపత్రికల్లో కనిపించిన నాలుగు వేర్వేరు వార్తలు గమనించినప్పుడు.. అసలు మానవసంబంధాలు ఎంత దారుణంగా పతనం అవుతున్నాయో కదా.. అనే అనుమానం కలుగుతుంది. అనుబంధాల్లో నైతికత అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా మారిపోతున్నది కదా అని కూడా భయమేస్తుంది. ముందు ఆ నాలుగు ఉదాహరణలు పరిశీలిద్దాం.ఉదాహరణ 1 :వైవాహిక బంధంలో కొనసాగుతున్న మహిళ, మరొక ప్రియుడితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నైతికతకు సంబంధించిన విషయమే తప్ప, నేరం కాదు అని దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పైగా ‘భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలానికి చెందిన భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని కూడా వ్యాఖ్యానించింది.ఉదాహరణ 2 :ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో రాహుల్ అనే వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. మరో పదిరోజుల్లో పెళ్లి. ఈలోగా ఆ అమ్మాయి తల్లి స్వప్న.. కాబోయే అల్లుడితో కలిసి పారిపోయింది. వారి కుటుంబీకులు పోలీసు కేసు పెట్టారు. అప్పటికే నేపాల్ సరిహద్దుల దాకా పారిపోయిన వారు.. కేసు సంగతి తెలిసి తిరిగివచ్చారు. కానీ స్వప్న మాత్రం.. కాబోయే అల్లుడితోనే జీవితం పంచుకుంటానని భర్త తనకు వద్దని ఇంకా మొండిపట్టుపడుతోంది.ఉదాహరణ 3 : ఉత్తరప్రదేశ్ లోని బదాయూపట్టణంలో మరో ఉదంతం జరిగింది. మమత అనే 43 ఏళ్ల మహిళ ఇంట్లో డబ్బు నగలు తీసుకుని తన కుమార్తెకు మామ అయిన శైలేంద్రతో కలిసి పారిపోయింది. వరుసకు అన్నయ్య అయ్యే అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ప్రస్తుతం పరారయ్యారు.ఉదాహరణ 4 :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ఫూర్ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మంగళగిరిలో నివాసం ఉంటాడు. అతనికి స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమార్తెతో కలిసి నంద్యాల శివార్లలో నివాసం ఉంటోంది. నాలుగురోజుల సెలవుమీద ఆమె ఇంటికి వచ్చిన ఫరూక్ ఆమె కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గొడవ అయింది. కుమార్తె స్నేహితుడితో కూడా గొడవ అయింది. దీంతో ఆ యువకుడు, మరోనలుగురు కలిసి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ ను హత్య చేశారు.మానవ సంబంధాల గురించి చాలా మంది పెద్దలు చాలా చాలా ఆదర్శాలను, నీతులను వల్లెవేస్తూ ఉంటారు. కానీ.. మానవ సంబంధాల్లో ఉండే చేదు వాస్తవాన్ని చాలా నిష్కర్షగా చెప్పాడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తేల్చేశాడు. సమాజంలో చాలా వ్యవహారాలను భిన్నమైన కోణంలో చూడగలిగిన ప్రతిసారీ మార్క్స్ చెప్పినది అక్షర సత్యం అని అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న నాలుగు ఉదాహరణలు గమనిస్తే.. మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది సెక్స్ సంబంధాలేనా? అనే అనుమానం మనకు కలుగుతుంది. 497 అధికరణం రద్దయిపోయింది తను చేసిన పనిని నేరం అని ఏ కోర్టు చెప్పజాలదు గనుక.. ఓ వివాహిత.. భర్తకు తెలిసినా నిర్భయంగా తన ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. కూతురుకు కాబోయే భర్తతో.. ముందే లేచిపోయింది మరో తల్లి. వరుసకు అన్నయ్యతో అదే ఘోరానికి తెగబడింది మరో ఇల్లాలు. ఏపీఎస్పీ కానిస్టేబులు ఏకంగా తల్లితో వివాహేతర సంబంధంలో ఉంటూ కూతురులాంటి అమ్మాయిపై అత్యాచారానికి తెగబడి హతమయ్యాడు. ఇలాంటి దారుణమైన బుద్ధులు ఎలా వ్యాప్తిలోకి వస్తున్నాయి.నేరాలు జరిగినప్పుడు.. చంపిన వారిని ముక్కలు చేసి ఆచూకీ తెలియకుండా మార్చేస్తున్నప్పుడు.. అలాంటి దారుణాలు చూసి ఓటీటీ సినిమాలు మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయని మనం నీతులు వల్లిస్తుంటాం. కానీ.. ఇలాంటి ఘటనలు ఎలా ప్రభావితం అవుతున్నాయి. నైతిక విలువల పట్ల ప్రజల్లో కనీసస్పృహ లేకపోతుండడమే ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నదనే అభిప్రాయం కలుగుతోంది. పరిష్కారం అంతుచిక్కని సమస్య లాగా సమాజ గతిని ఈ పరిణామాలు దిగజారుస్తున్నాయి....ఎం. రాజ్యలక్ష్మి -
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్ మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి -
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి -
వైరల్ : తప్పుడు వార్తలు ఎలా వ్యాపిస్తుంటాయంటే..
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంటు అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమావతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళుతున్న ఆ నలుగురు వ్యక్తులూ, ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే.. ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.’’ ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.‘దేవుడి మహిమ అంటే అదీ’ అని వాదించేవాళ్లు..‘వాళ్లు మేకను బలి ఇవ్వాలనుకున్నారు. దేవుడు వాళ్లనే బలి తీసుకున్నాడు’ అనే వాళ్లూ..‘దేవుడు కరుణమాయుడు.. తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు’ అని సూత్రీకరించేవాళ్లూ.. బోలెడు మంది తయారవుతారు.ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది తప్పుడు వార్త! మరి ఫోటో ఎలా? అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావొచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే.. దాని నెంబర్ ప్లేట్ మాత్రం.. స్ట్రెయిట్ గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫాబ్రికేషన్ లో ఒక లోపం.తత్వ ఇండియా (#thetatvaindia) అనే బ్లూటిక్ ఉన్న అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడవక ముందే.. ఈ పోస్టును కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు మూడువేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. దాదాపు 30 వేల మంది దీనిని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంతగొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే.. అది కాస్తా తప్పుడు వార్త అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మాట నిజం. కానీ ఈ పోస్టు మాత్రం తప్పు!వాస్తవాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భేడాఘాట్ చౌకీతాళ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు.. నర్సింగ్పూర్ జిల్లాలోని దుల్హా దేవ్ మహరాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకుని వెళ్లారు. ఆ ఆలయంలో ప్రతీకాత్మకంగా మాత్రమే బలి జరుగుతుంది. బలి ఇచ్చినట్టు గుర్తుగా మేక చెవులను మాత్రం కత్తిరిస్తారు. వీళ్లు ఆ బలి మొక్కుబడిని తీర్చుకుని గోటగావ్ నుంచి జబల్పూర్ కు తిరిగి బయల్దేరారు. చెవులు కత్తిరించిన మేక కూడా అదే వాహనంలో ఉంది. డ్రైవ్ చేస్తూనే బాగా మద్యం సేవించారు. జబల్పూర్ సమీపంలో ఛర్గావాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత.. అదుపు తప్పి వంతెన మీదనుంచి సోమవతి నదిలో పడిపోయింది. ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మేకమాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు ఫోటో ఇది (తెల్ల స్కార్పియో ఉన్నది). వాహనంలో ఉన్న వాళ్లు మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.సంఘటన నిజంగానే జరిగింది. కానీ దానిని.. తమకు కావాల్సిన రీతిలో వక్రీకరించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు. ఏ రకంగా వక్రీకరించి ప్రచారంలో పెడితే.. వ్యూస్ ఎక్కువగా వస్తాయో.. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు బాగా తెలుస్తుంది. అంత తెలివైన వాళ్లు కాబట్టే.. ఒక్కరోజు కూడా గడవకముందే కోటి వ్యూస్ సంపాదించుకున్నారు. దీనిని బట్టి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే.. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మకూడదు. కంటికి కనిపించేవి.. చెవులకు వినిపించేవి అన్నీ నిజం కాదు. బ్లూ టిక్ ఉన్నంత మాత్రాన ఆ సోషల్ మీడియా అకౌంట్లు నిజాలు చెప్పే నిజాయితీ ఉన్నవి అనుకోవడానికి కూడా వీల్లేదు. సోషల్ మీడియాలో ఏ సంగతి కనిపించినా.. ముందు దానిని అపనమ్మకంతో చూడాలి. ఇంకాస్త అనుమానం కలిగితే.. ఏదో ఒక రకంగా క్రాస్ చేసుకోవాలి. లేకపోతే.. ఈ తప్పుడు ట్వీట్ ను షేర్ చేస్తూ వెళ్లిన మూడు వేల మంది అమాయకుల్లో ఒకరుగా మనం కూడా మారిపోతాం...ఎం.రాజేశ్వరి -
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి -
చంద్రబాబు హైటెక్ తెలివిలో డొల్లతనం బయటపడిందిలా?
ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలో ‘సహకార్ ట్యాక్సీ’ అనే విధానాన్ని తీసుకురావడం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్ సభలో ప్రకటించారు. ప్రజలకు స్థానిక ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇలాంటి యాప్ ల నిర్వాహకులు ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఎంతో విస్తృతంగా ఇవి సేవలందిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ సంస్థలు వాహన డ్రైవర్లనుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి దోపిడీకి విరుగుడు అన్నట్టుగా.. అమిత్ షా ఈ విధానాన్ని ప్రకటించారు. దీనిప్రకారం స్థానికంగా సహకార సంస్థల వద్ద వాహనాల వారు రిజిస్టరు చేసుకోవాలి. నిర్వహణ మొత్తం ఆ సహకార సంస్థలే చూస్తుంటాయి. ఇది పారదర్శకంగా నడిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు మాటల్లోని కపటత్వం, ఆయన హైటెక్ తెలివితేటల్లోని డొల్లతనం కూడా బయటపడుతున్నాయి. ఇటీవల చంద్రబాబునాయుడు.. ర్యాపిడో అనే అగ్రిగేటర్ సంస్థతో ఒప్పందం చేసుకుని.. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ ర్యాపిడో డ్రైవర్లుగా మార్చేస్తానని వారికి ఈ బైక్ లు, ఈ ఆటోలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలులో ఎన్ని దందాలకు పాల్పడుతుందో తెలియదు గానీ.. మొత్తానికి ర్యాపిడో వ్యాపారాన్ని విస్తరించడానికి చంద్రబాబు తన వంతు కృషి చేయడం తప్ప కొత్తగా ఇందులో కనిపిస్తున్న సంగతేం లేదు. నిజంగా మహిళలకే మేలు చేయదలచుకుంటే.. వారికి ఈ బైకులు, ఈ ఆటోలు కొనుగోలు చేసుకోవడానికి వడ్డీలేని రుణ సదుపాయం ప్రభుత్వం కల్పించవచ్చు. వారు ర్యాపిడోకు డ్రైవర్లుగా పనిచేస్తారో మరో సంస్థకు పనిచేస్తారో వారి ఇష్టానికి వదిలేస్తే బాగుండేది. ఒక సంస్థ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తున్నదనే ఆరోపణలు లేకుండా ఉండేవి. చంద్రబాబు అలా చేయలేదు. పైగా అమిత్ షా ప్రకటన తర్వాత.. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో అమల్లో ఉన్న కొన్ని యాప్ ల గురించి కూడా కొత్త వివరాలు తెలుస్తున్నాయి. వారు నిజంగా.. దోపిడీని అడ్డుకునే యాప్ లను తయారు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడి మమతా దీదీ ప్రభుత్వం యాత్రీ సాథీ పేరుతో ఒక యాప్ తీసుకువచ్చింది. ఇందులో కమిషన్ల రూపేణా డ్రైవర్లను దోచుకోవడం, టైమింగులను బట్టి, మొబైల్ లో చార్జింగును బట్టి ప్రయాణికులను దోచుకోవడం వంటి వక్రమార్గాలు ఉండవు. యాత్రీ సాథీ యాప్ లో రిజిస్టరు చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు ఒక రోజులో తొలి పది రైడ్ లకు ఒక్కోదానికి రూ.10 వంతున చెల్లించాలి. ఒక రోజులో ఒక రైడ్ మాత్రమే వెళితే.. 10 చెల్లిస్తే చాలు. పది రైడ్లకు రూ100 చెల్లించిన తర్వాత ఎన్ని రైడ్లు చేసుకున్నా ఆరోజుకు ఇక ఏం చెల్లించక్కర్లేదు. అలాంటి మంచి విధానం మమత ప్రభుత్వం తెచ్చింది. ఓలా, ఊబర్ దోపిడీలతో విసిగిపోయిన కర్ణాటకలోని ఆటో డ్రైవర్లు తామే స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థను ఆశ్రయించి ఒక యాప్ డిజైన్ చేయించుకున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరుతో ఉండే ఆ యాప్ లో కూడా ఇదే మాదిరిగా రైడ్ లను బట్టి చెల్లిస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే.. టెక్నాలజీ మీద అవగాహన ఉండే పాలకులైతే ఇలాంటి కొత్త విధానాలు తీసుకురావడం ద్వారా.. అటు వాహన డ్రైవర్లు, ఇటు ప్రయాణికులు అగ్రిగేటర్ సంస్థల దోపిడీకి గురికాకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు తనను తాను హైటెక్ ముఖ్యమంత్రి అని చాటుకుంటూ ఉంటారు. కంప్యూటరును నేనే కనిపెట్టానని చెప్పుకుంటూ ఉంటారు. ఏఐను తానే కనుగొని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని కూడా చెప్పుకోగలరు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి.. తిరిగి అగ్రిగేర్ సంస్థకు దోచిపెట్టే ఒప్పందమే చేసుకుంటున్నారు. ఆయన చెప్పుకునే హైటెక్ తెలివితేటల్లో డొల్లతనం బయటపడుతోందే తప్ప.. మంచి నాణ్యమైన ఆలోచన చేయలేకపోతున్నారనే విమర్శలు ప్రజల్లో వినవస్తున్నాయి...ఎం. రాజేశ్వరి -
కాల్లో ప్రియురాలు.. కాబోయే ఇల్లాలు వీడుకోలు!
‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్’ అంటూ ఆ కుర్రవాడు బహుశా లోలోపల సాంగేసుకుని ఉండవచ్చు. ఒక ప్యారీతో ప్యార్ నడుస్తూ ఉండగానే.. మరో పోరి పెళ్లికి రెడీ అయిపోయి.. తనకు కట్నం కూడా ముట్టజెప్పిన తరువాత.. ఇక డర్ నే కోయీ బాత్ హై క్యా అనుకుని సంబరపడుతూ చెలరేగి ఉండవచ్చు. కానీ.. అరచేతిలో ఉండే భూతం మొబైలు ఫోను మీటలు నొక్కడంలో చిన్న పొరబాటు అతగాడి కపటమైన కలలన్నింటినీ కల్లలు చేసేసింది.ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఎంత కాదనుకున్నా.. వంటింట్లో ప్రియురాలిని పనిలో పెట్టి.. ఆ సంగతి ఇల్లాలికి తెలియకుండా మేనేజ్ చేయడానికి నానా పాట్లు పడుతూ.. హీరో ఆ చిత్రంలో ఒక వర్గం ప్రేక్షకులను బాగానే అలరించాడు. అయితే జీవితం అంటే ముందుగా స్క్రిప్టు రాసుకుని, ఆ మేరకు మాత్రమే సీన్లను నడిపించుకుంటూ వెళ్లే సినిమా కాదు కదా! జీవితం అన్నాక.. అందులో ఎన్నెన్నో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అనూహ్య మలుపులు ఎదురవుతాయి. కొన్ని మన కొంప ముంచుతాయి కూడా! ఆదిలాబాద్ జిల్లాలోని ఓ జల్సారాయుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతగాడు దాచిన గుట్టు రట్టవడంతో.. కొంప కొల్లేరయింది. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లి పెటాకులు అయింది.ఏం జరిగిందో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడికి నెలకిందట పెళ్లి నిశ్చయమైంది. వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. నిశ్చయమైన తరువాత.. ఒకరితో ఒకరు ఫోను సంభాషణలు కూడా ప్రారంభించుకున్నారు. నెలరోజుల్లో పెళ్లిఉంది. ఇరువైపులా పెళ్లి పనులు కూడా ముమ్మరంగానే మొదలయ్యాయి. రోజులిలా రొమాంటిక్ గా నడుస్తుండగా.. ఒకనాడు కాబోయే భర్తకు ఆ అమ్మాయి ఫోను చేసింది. కాల్ వెయిటింగ్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి అతగాడు.. ఫోనులో తన ప్రియురాలితో ముచ్చట్లు నడిపిస్తున్నాడు. స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి రొమాంటిక్ సమయంలో వచ్చిన కాల్.. పెళ్లయని తర్వాత భార్యనుంచి అయితే.. కాస్త ఇగ్నోర్ చేసి ఉండేవాడేమో గానీ.. ‘కాబోయే’ భార్య గనుక వెంటనే ఆన్సర్ చేశాడు. అవతలి ప్రియురాలి కాల్ ఆటోమేటిగ్గా ‘హోల్డ్’ లోకి వెళ్లింది. ‘తాను బైక్ పై ఉన్నానని, మళ్లీ కాల్ చేస్తానని’ కాబోయే భార్యకు చెప్పాడు. ఆమె కూడా నమ్మింది.అక్కడే మనవాడు పప్పులో కాలేయడం జరిగింది. కాబోయే భార్య కాల్ను కట్ చేయబోయి.. ‘మెర్జ్’ బటన్ నొక్కేసి.. ప్రియురాలితో సంభాషణను యథావిధిగా కొనసాగిస్తూ పోయాడు. మళ్లీ చేస్తానన్న కాబోయే భర్త, ఆయనే కాల్ కట్ చేస్తాడని ఎదురుచూస్తున్న వధువుకు.. సంభాషణ కంటిన్యూ అవుతూ వినిపించింది. ఒకటి రెండు డైలాగులు విన్న తరువాత, ఆ సంభాషణ కాబోయే ప్రియురాలితో సాగుతున్నదని కూడా అర్థమైంది.ఆ బంధం బహు రొమాంటిక్ గా సాగుతున్నదని కూడా ఆమె గ్రహించింది. సైలెంట్ గా వారి సంభాషణ మొత్తం వింది. వినడం మాత్రమే కాదు. రికార్డు కూడా చేసింది. ఆ ఆడియో రికార్డు తీసుకువెళ్లి పెద్దల ఎదుట ఉంచింది. వాళ్లు ముందు కంగు తిన్నారు. తరువాత కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత.. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పటికే సమర్పించుకున్న కట్నం సొమ్మును అణా పైసల్తో సహా వెనక్కు లాక్కున్నారు. కరతలమలపై చరవాణి సేదతీరుతుండగా.. వీనులవిందుగా ప్రియురాలు రస భాషణ సాగిస్తుండగా.. మైమరచిన కైపులో ఒళ్లు దగ్గర పెట్టుకోకుండా.. ఏదో బటన్ నొక్కబోయి.. ఇంకేదో నొక్కితే.. విధి ఇలాగే వికటాట్టహాసం చేస్తుందని కుర్రకారు చాలా మంది పాఠాలు నేర్చుకోవాలి వీడినుంచి!-ఎం. రాజేశ్వరి -
కునాల్ కమ్రా: ‘కర్ర పట్టిన రాజ్యంలో.. నోరు గతేమిటి?’
ఒక పురాణ కథ చెప్పుకుందాం.. రుషుల కాలంలో అష్టావక్రుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కురూపి. శరీర నిర్మాణం సరిగా లేనివాడు. అయితేనేం.. అపరిమిత జ్ఞాన సంపన్నుడు! అనేక శాస్త్రాల మీద పట్టు సంపాదించిన వాడు. ఒకసారి ఏమైందంటే.. ఒక రాజుగారి ఆస్థానంలో పండిత గోష్టి జరుగుతోంది. ఎక్కడెక్కడినుంచో దూరదేశాల నుంచి వచ్చిన మహా పండితులు అక్కడి చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ సభకు అష్టావక్రుడు కూడా వచ్చాడు. ‘ఎవరివయ్యా నువ్వు.. ఇక్కడకు ఎందుకు వచ్చావు..’ అని అడిగారు రాజుగారు.అష్టావక్రుడు తన గురించి చెప్పుకుని.. పండిత గోష్టిలో పాల్గొనడానికే వచ్చాననే సంగతి వెల్లడించాడు. అలా కురూపిగా ఉన్న ఆయన ఆ మాట చెప్పగానే.. సభలో ఉన్నవాళ్లలో చాలామంది ఫక్కున నవ్వారు. అలాంటి అనాకారి తాను పండితుడినని చెప్పగానే వారికి నవ్వొచ్చింది మరి. ఆ వెంటనే అష్టావక్రుడు వెనుతిరిగి సభనుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. రాజుగారు కంగారు పడ్డారు. తన ఆస్థనంలో సభ నుంచి ఒక పండితుడు అలా నిరసనగా తిరిగి వెళ్లిపోవడం తనకు అవమానం కదా అని భావించి, అతడిని వారించాడు. ‘పండితుడా.. ఎందుకు వెళ్లిపోతున్నావు’ అని అడిగాడు. అందుకు జవాబుగా అష్టావక్రుడు..‘‘చర్మంతో చెప్పులు కుట్టుకుని పనిచేసే వాళ్లు నిండిన సభలో నేను పాండిత్యం చూపను.. అది నాకు అవమానం..’’ అని అన్నాడు. రాజుగారు ఖంగుతిన్నారు. ‘‘అదేమిటి ఇందరు పేరుమోసిన పండితులు కూర్చుని ఉన్న సభ నీకు.. తోలు చెప్పులు కుట్టుకునే వాళ్ల కూటమిలా కనిపిస్తున్నదా’’ అని కొంచెం కోపగించుకున్నారు కూడా!. అందుకు అష్టావక్రుడు.. ‘‘రాజా నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట అనలేదు. చర్మాన్ని చూసి విలువను లెక్కగట్టేవాళ్లు చెప్పులు కుట్టేవాళ్లే కదా..’’ అని అన్నాడు.తన ఆకారాన్ని చూసి పాండిత్యాన్ని ఎలా నిర్ణయిస్తారని చెప్పాడు. రాజు కూడా నొచ్చుకున్నాడు. సభలోని సాటిపండితులు కూడా మన్నింపు వేడుకున్నారు. ఆ తర్వాత అష్టావక్రుడు పండితగోష్టిలో పాల్గొనడమూ.. తన పాండిత్యానికి తిరుగులేదని నిరూపించుకోవడమూ జరిగింది. ఇదీ కథ. ఎందుకో.. కునాల్ కమ్రా కు జరిగిన, జరుగుతున్న పరాభవం, హెచ్చరిక, సత్కార ఛీత్కారాలు గమనిస్తోంటే.. ఈ అష్టావక్రుడి కథ గుర్తుకు వస్తోంది. ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం మనం..? ఒకడు కర్రపట్టుకుని కాపలా కూర్చుని.. ఈ దేశంలో ఎవడు ఏం మాట్లాడినా సరే.. నాకు నచ్చిన నాకు ప్రీతికరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి? అని శాసించే రాజ్యంలో బతుకుతున్నామా? అసభ్యపు మాటలతో, బూతులతో ఏమైనా అంటే.. వాటిని నేరాలుగా పరిగణించడానికి చట్టాలున్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా ఉంది. ఏదైనా సరే.. చట్టం అనే ముసుగులో జరుగుతోంది. చట్టాన్ని మీరిన పనులు చేసినప్పుడు.. అలా అనిపించిన పనులు జరిగినప్పుడు జరుగుతోంది.మరి చట్టం పరిధిలోకి రానటువంటి.. సమకాలీన సంగతులను హాస్యస్ఫోరకంగా, ఆలోచింపజేసే చిరు వెక్కిరింతగా ప్రస్తావించే మాటలకు కూడా మహోద్రేకంతో రగిలిపోయి.. కర్రపట్టుకుని దండించి తీరుతాం అని బరితెగించే మూకలు రాజ్యం చేస్తున్న చోట మనం ఎన్నాళ్లు బతకగలం?. నాయకులు తమ గురించి గొప్పలు చెప్పుకునేప్పుడు.. గతచరిత్రలోని చిన్నస్థాయి నేపథ్యాలను చాలా గర్వంగా వల్లెవేసుకుంటూ ఉంటారు కదా..! అదే నేపథ్యాల గురించి ఒక వెక్కిరింత వస్తే.. ఎందుకంత ఉడికిపోతుంటారు?నోటికి వేసే తాళాలు తయారుచేసుకునే కంపెనీలకే ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రోజులు. కర్ర పట్టుకుని కాపలా తిరుగుతూ ఉండే.. కిట్టని మాటలు వినిపిస్తే మూతులు పగలగొట్టాలని చూసే కర్రదండు రాజ్యం చేస్తున్న నేలమీద మనం ఎంతకాలం జీవించగలం? మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో ప్రతి మనిషికీ ఉన్నదని అనుకోవడం ఒక భ్రమే కదా? అందరికీ మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది రాజ్యాంగం.. కానీ, కొందరికి కర్రపుచ్చుకుని దాడులు చేసి, చావచితగ్గొట్టే స్వేచ్ఛను ఇస్తున్నాయి ప్రభుత్వాలు!-ఎం.రాజేశ్వరి -
గూగుల్, గేట్స్ ముసుగులో నడుస్తున్నదంతా మాయేనా?
‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట. వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు. రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు...ఎం. రాజేశ్వరి -
ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?
సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి -
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్సీపీ నాయకులు లొంగిపోతున్నారు. అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.:::ఎం.రాజేశ్వరిఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా? -
బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా!
మర్కర్వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది. బండారం బయటపడుతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ చిన్న గ్రామంలోని ప్రజల్లో ఈవీఎంల పట్ల పుట్టిన అనుమానం.. తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం.. అధికారవర్గాలకు జడుపు తెప్పించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును ప్లాన్ చేసుకోగా.. ఏకంగా మూడు రోజుల పాటూ పోలీసులు పెద్దసంఖ్యలో- ఆ చిన్న పల్లెలో మోహరించి- కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.వివరాల్లోకి వెళితే..ఈ మర్కర్వాడీ గ్రామం మల్షిరాస్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవి మహా ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్రావ్ జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కు చెందిన ఆయన, బిజెపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ని ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్వాడీ గ్రామంలో పోలింగుమీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని ఈ సారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బిజెపికి పడగా, ఎన్సీపీ (ఎస్పీ) జన్ఖడ్ కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు. .గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు.. ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కలిగింది. జన్ఖడ్ కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడి వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు. ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు! ఉత్తమ్రావ్ జన్ఖ్- ధన్గఢ్ కులానికి చెందిన వారు. ఆ పల్లెలో అధికసంఖ్యాకులు ఆ కులం వారే. వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని యన తోసిపుచ్చడంతో.. ఈవీఎంలలో ఏదో మతలబు జరిగిఉండొచ్చునని, అందుకే బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్ తో మాక పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది.మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి.. యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు.మేం వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని.. అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే.. పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు.ఆలోచన పుట్టిస్తున్న చైతన్యం..చిన్న పల్లె లోని ప్రజల్లో పుట్టిన చైతన్యం దేశ ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. వారేీ ప్రభుత్వాన్ని రీపోలింగ్ అడగడం లేదు. మాక పోలిగ్ తరహాలో తమలో తాము నిర్వహించుకోవాలనుకున్నారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు, తాము బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తే రాగల ఓట్లకు తేడాలను గమనించాలనుకున్నారు. ఈవీఎంల సత్యసంధతను పుటం వేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిరపాయకరమైన వారి ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకుంటోంది.ఒకవేళ ఈ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరే.. నలుగురు వ్యక్తులు ఒకచోట గుమికూడరాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా మూడురోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే ఆందరికీ ఆశ్చర్యమే. చిన్న పల్లె మర్కర్వాడీ యంత్రాంగాన్ని అంతగా వణికిస్తూంటే.. ఈవీఎం ల విషయంలో సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని దేశం అనుకోకుండా ఎలా ఉంటుంది?.. ఎం.రాజేశ్వరి -
చల్లపుచ్చుకుని ముంత దాచుకుంటున్న పవన్!
చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా అవసరం వస్తే మొహమాటమూ సిగ్గు లేకుండా సోదెమ్మను అడిగి పుచ్చుకుంటుంది. కానీ సోదెమ్మకు కాస్త సిగ్గు ఎక్కువ. ఓసారి సోదెమ్మకు చల్ల (మజ్జిగ) కావాల్సి వచ్చింది. ఇంట్లో నిండుకున్నాయి. మొగుడికేమో మజ్జిగ చుక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని వేరే గత్యంతరం లేక చేతిలో ఓ ముంత పట్టుకుని ఆదెమ్మ దగ్గరకు వెళ్లింది. ‘రా రా సోదెమ్మక్కా.. ఏంటి సంగతులు’ అని అడిగింది ఆదెమ్మ. సోదెమ్మకు చల్ల అడగాలంటే సిగ్గేసింది. ముంతను కొంగు చాటున దాచుకుంది. కాసేపు కబుర్లు చెప్పి ఖాళీ ముంతతోనే తిరిగి ఇంటికి వెళ్లింది. భోజనంలోకి మజ్జిగ లేనందుకు మొగుడితో తిట్లు కూడా తినింది. ..ఇదీ కథ!ఏదైనా పనిమీద ఒకరి వద్దకు వెళ్లినప్పుడు, ఏ పనిగా వచ్చామో చెప్పకుండా దాచుకుంటే, మొహమాటపడితే పని జరిగేదెలాగ? కాబట్టి కార్యార్థవై ఉన్నప్పుడు మొహమాటం తగదని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత నీతి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు!కానీ పవన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన చల్లకోసం వస్తారు. మొగమాటలం లేకుండా అడిగి పుచ్చుకుంటారు. కానీ.. తాను పొరుగింట్లో చల్ల అరువు పుచ్చుకున్న సంగతి మరెవ్వరికీ తెలియకూడదని మాత్రం అనుకుంటారు. చల్ల పుచ్చుకున్న తర్వాత ఆ ముంతను.. దాచిపెట్టుకుని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. తమ మధ్య కేవలం కబుర్లు మాత్రమే సాగాయని వాడలోని ఇతరుల్ని మభ్య పెట్టాలని అనుకుంటారు. ఆయన అటు ఢిల్లీ, ఇటు ఉండవిల్లీ నేతలతో సాగిస్తున్న భేటీల మర్మం అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తన వ్యవహారాలన్నీ చూసుకున్న అన్నయ్య నాగబాబును ఎంపీగా రాజ్యసభకు పంపాలని పవన్ కోరిక. అడిగితే కాదనేంత సీన్ చంద్రబాబుకు లేదుగానీ.. ఈసారే ఇస్తారా.. నెక్ట్స్ టైం అంటారా అనేది అనుమానం. అందుకే ముందుగా ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో చర్చలు జరిపి.. తన మనోవాంఛను వారి ఎదుట చెప్పుకున్నారు. మూడింటిలో ఒక ఎంపీ సీటు కోసం బిజెపి పట్టుపట్టకుండా ఉంటే.. తాను దక్కించుకోవచ్చునని ముందుగా అక్కడ చక్రం తిప్పారు. తీరా ఇవాళ చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి వెళ్లి మాట తీసుకునే ప్రయత్నం చేశారు.బాబు వద్దకెళ్లడమూ మాట పుచ్చుకోవడమూ అయింది. అయితే తాను ఎంపీ సీటు కోసం వీరందరి ఇళ్లకూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని ప్రజలకు తెలియరాదు– అనేది ఆయన కోరిక. అంటే చల్ల పుచ్చుకోవాలి గానీ.. ఆ సంగతి ఇతరులకు మాత్రం తెలియద్దన్నమాట.పైకి మాత్రం.. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ గురించి బాబుతో చర్చించినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం గురించి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసినట్టుగా.. బాహ్య ప్రపంచానికి ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. తాను అన్నయ్య నాగబాబు ఎంపీ సీటు కోసమే తిరుగుతున్నట్టుగా జనం గుర్తిస్తే పలుచన అవుతానని భయపడుతున్నారో ఏమో పాపం!.. ఎం. రాజేశ్వరి -
ఏ బుర్రలో ఎన్ని పాములుంటాయో?
ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల విషనాగులు, అనకొండలు, ర్యాటిల్ స్నేక్ లు రకరకాల పాములు.. అనేక రకాల టక్కుటమారాల మాయోపాయాల రూపంలో దాగి ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. ఎవడితో ఫోటో దిగాలన్నా సరే.. కూసింత సెలబ్రిటీ స్టేటస్ ఉండే వాడు వణికి చచ్చిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంగారు పుడుతోంది. ఇక్కడ కట్ చేసి ఒక పాత ముచ్చట చెప్పుకుందాం..నాకు తెలిసి సినీ రంగంలో చాలా పెద్దాయన ఉండేవాడు. చాలా అంటే చాలా అన్నమాట. సొంత బ్యానర్ మీద సినిమాలు తీసినా కూడా.. ఎన్నడూ ఆ సినిమా కోసం బయటి కార్యక్రమాలకు రాలేనంత పెద్దాయన. ఆయన సినిమాలకు రాష్ట్రంలో ఏవైనా సంస్థలు అవార్డులు ప్రకటిస్తే.. ఆ సమాచారం పెద్దాయనకు వెళ్లిన వెంటనే.. ‘థాంక్యూ’ అనే పదం వచ్చేది కాదు. అసలు ఆ అవార్డు తాము తీసుకోవాలా వద్దా? అనే మేధోమధనం చేసేవాళ్లు.. తన అనుంగు సహచరులతో కలిసి! తన డికెష్టీలను పరిశోధన కోసం పంపేవాళ్లు. ఆ సంస్థ ఎలాంటిది? దాని సారధులు ఎలాంటి వాళ్లు? వారి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు ఏమిటి? అన్నీ ఆరా తీసేవాళ్లు.అంతా తేలిన తర్వాత.. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా? తీసుకోదలచుకుంటే.. తాను వెళ్లాలా? తన ప్రతినిధులు వెళ్లాలా? అనేది ఆ పెద్దాయన డిసైడ్ అయ్యేవాళ్లు! అవార్డు ఇస్తానన్నారు కదా అని ఎగబడి వెళ్లి తీసేసుకుంటే.. తనతో దిగిన ఫోటోలను అవతలి వాళ్లు మార్కెట్ చేసేసుకుని.. లాభపడిపోతారేమో అని ఆ పెద్దాయనకు భయం. అంత అతిజాగ్రత్త అన్నమాట. ఈ ముచ్చట మొత్తం కొన్ని దశాబ్దాల కిందటిది. ఇప్పుడు ఆయన లేరు. కానీ అప్పట్లో ఆయన పాటించిన జాగ్రత్తలు మాత్రం అందరికీ అవసరమేమో అనిపిస్తున్నది. ఇక్కడ కట్ చేసి అసలు సంగతిలోకి వద్దాం..విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ అనే కుర్రాడున్నాడు. పదో తరగతి ఫెయిలయ్యాడు. సెలబ్రిటీలతో కార్యక్రమాలు నిర్వహించడం వారితో ఉన్న ఫోటోలు పరిచయాలను ప్రచారానికి వాడుకుని.. వారందరూ తనకు భాగస్వాములని, తన వ్యాపారాల్లో బినామీలుగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటూ.. ఇతరుల నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించడం.. అంతా అయిన కొన్నాళ్లకు ఆ వ్యాపారం బోర్డు తిప్పేయడం అనే టెక్నిక్ ను కనుగొన్నాడు.ఊళ్లమీదికొచ్చి చేయి చూసి జాతకం చెప్పే, సిగలో ఈకలు దూర్చుకున్న కొండదొర.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషూ, నాగార్జునలతో దిగిన ఫోటోలని చూపించి డప్పు కొట్టుకున్నట్టే అన్నమాట! ఈ ప్రబుద్ధుడు ముందు విశాఖలో పింక్ థాన్ అనే కార్యక్రమం పేరుతో సెలబ్రిటీలు చాలా మంది అక్కడికొచ్చేలా ప్లాన్ చేశాడు. హైదరాబాదులో సస్టెయినబుల్ కార్ట్ అంటూ ఓ దుకాణం తెరిచాడు. ఓ సెలబ్రిటీతో రెండు కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అందులో గందరగోళాలు గమనించి ఆమె త్వరగానే తప్పుకున్నారు.తర్వాత హైదరాబాదులో చైన్ ఆఫ్ హోటల్స్ ప్రారంభించి.. ఓ మాజీ మంత్రి, ఓ సినిమా ఫ్యామిలీ తన వాటాదారులని నమ్మించి ఇతరులతో కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆ రెండు దుకాణాలను ఎత్తేసి.. తృతీయ జువెలర్స్ అంటూ కొత్త దందా మొదలెట్టాడు. సినీ నటి అందులో పార్టనర్ అని చెప్పుకుని.. ఇతరులతో మరికొన్ని కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీరా ఒకటి రెండు వ్యవహారాలు పోలీసు గడప తొక్కగానే ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.కట్ చేస్తే.. జనం ఇంత సులువుగా ఎలా మోసపోతున్నారనేది ఆలోచించాల్సిన సంగతి. అలాగే సెలబ్రిటీలు ఎవరికైనా తమకు పుట్టుపూర్వోత్తరాలతో సహా తెలియని వ్యక్తులు వచ్చి కార్యక్రమాలకు, అవార్డులకు పిలిస్తే వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితి. ఏ అవార్డు పుచ్చుకుంటే.. ఆ ఫోటోలతో ఎవరెలాంటి కొత్త మోసాలను ప్లాన్ చేస్తుంటారో ఎవ్వరికీ బోధపడని ఆధునిక రోజులు. సైబర్ మోసాల ద్వారా.. అమాయకులైన పేద ప్రజలు అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా మోసపోవడం చాలా చూస్తున్నాం. ఇప్పుడిలా సెల్రబిటీలు మోసపోయే వారు కొందరు.. మోసాల క్రీడలో తాము పావులుగా మారుతున్నవారు మరికొందరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. ఎవరు ఏ అవార్డు ఆఫర్ చేసినా, గెస్టుగా పిలిచినా.. సెలబ్రిటీలు.. ముందు చెప్పుకున్న పెద్దాయన సిద్ధాంతాన్ని ఫాలో అయి.. వంద ఆలోచిస్తారేమో మరి!-ఎం. రాజేశ్వరి. -
చంద్రబాబును చూసి టీడీపీ సీనియర్లలో జాలి!
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.-ఎం.రాజేశ్వరి -
అది కత్తి పార్టీ అని ముందే తెలీదా!
నలుగురినీ మోసం చేసేవాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం.. నీతో వాడికి ఏదో అవసరం ఉన్నదని.. అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని!. ఈ మర్మం తెలియకుండా.. చాలా మంది.. ‘వాడు ఎలాంటి వాడైతే నాకేంటి.. నాతో మంచిగానే ఉంటున్నాడు కదా’ అనే కన్వీనియెంట్ ఆత్మవంచనతో స్నేహాలు చేస్తుంటారు, కొత్తబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ నీతో అవసరం తీరిన తర్వాత.. అవతలివారి నిజస్వరూపం బయటపడిన తర్వాత బుద్ధి వస్తుంది. అప్పటికి సరిదిద్దుకోవడానికి ఏమీ మిగలదు.. ఆ చేదు అనుభవం తప్ప! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఈ వ్యవహారం కూడా అంతే!.ఈ ఉపోద్ఘాతం మొత్తం ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి అతికినట్టుగా సరిపోతుంది. తాడికొండ ఎమ్మెల్యేగా.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. అనర్హురాలిగా ప్రకటింపబడిన శ్రీదేవి ఇప్పుడు గొల్లుమంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మోసం చేసి.. చంద్రబాబు పంచన చేరి దొడ్డిదారిలో ఆయనకు చేసిన మేలుకు తనకు తగిన శిక్ష పడింది. ఆమె బహుశా పశ్చాత్తాప పడుతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఏమిటి ప్రయోజనం? గత జల సేతుబంధనం అంటే ఇదే!. ఇంతకూ ఏం జరిగిందంటే.. సీఎం జగన్ అనుగ్రహంతో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి దందాను ప్రారంభించారు. ఇసుక దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. పోలీసు అధికారులతో చాలా దురుసుగా మాట్లాడిన ఆడియో రికార్డులన్నీ అప్పట్లో బయటకు వచ్చాయి. తీరు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదనే ఉద్దేశ్యంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆమెను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ను మార్చారు. దీంతో, ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి, వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేశాక.. పదవిలో మాత్రం కొనసాగారు. ఇటీవల స్పీకర్ ఆమెను అనర్హురాలిగా కూడా ప్రకటించారు. అయితే.. తెలుగుదేశానికి దొడ్డిదారిలో చేసిన ఫేవర్కు ప్రతిఫలంగా ఆమె తిరువూరు ఎమ్మెల్యే లేదా, బాపట్ల ఎంపీ సీటును ఆశించారు. కానీ.. ఆమెతో అవసరం తీరిపోయినందున చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఆ రెండు స్థానాలనూ వేరే వారికే కేటాయించేశారు.ఈ ఘటనలతో శ్రీదేవికి జ్ఞానోదయం అయింది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’ అంటూ హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని ఒక కత్తి బొమ్మతో సహా ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ కత్తి బొమ్మకు అర్థమేమిటి అనేదే చర్చ. బాపట్ల టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనేది ఆమె ఉద్దేశం కావొచ్చునని ట్వీటు చూసిన వారి ఊహ. తెలుగుదేశం వెన్నుపోటుల కత్తిపార్టీ అని కూడా ఆమె ఆగ్రహించి ఉండవచ్చు. అయితే, అది కత్తి పార్టీ అనే సంగతి ముందే తెలియదా అని, మామను కూలదోసి పార్టీని కబ్జాచేసిన చంద్రబాబు వెన్నుపోటులకు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియదా? అంటూ రకరకాలుగా ఇప్పుడు ప్రజలు ఆమె ట్వీట్పై కామెంట్ చేసుకుంటున్నారు. అయినా కత్తి బొమ్మతో నిరసన తెలియజెప్పే హక్కు ఆమెకు లేదని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్ను వెన్నుపోటు పొడిచిన ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.-వంశీకృష్ణ -
బాబు సీక్రెట్ సిగ్నల్.. నా ఆశీస్సులుంటాయ్ గెలుచుకు రండి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ ఎత్తుగడలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాల కోసం త్యాగాలు తప్పవని అంటూనే.. మరోవైపు వారి వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు తిరుగుబాటు చేసి బరిలో నిలుస్తూ ఉంటే, పైపై బుజ్జగింపులతో వారిని పోటీ నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.అయితే, ఈ బుజ్జగింపులు మొత్తం నాటకాలేనని, రహస్య సంకేతాలు, సందేశాలు, రహస్య దూతల ద్వారా వారికి ఆయన పుష్కలంగా ఆశీస్సులు అందజేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాగస్వామీపక్షాలకు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులను దొంగ చాటుగా ప్రోత్సహిస్తూ, ఆ సీటు గెలుచుకుని మళ్లీ మన పార్టీలోకి వచ్చేయండి అని చంద్రబాబు వారికి రహస్యంగా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్న ఒకటి రెండు చోట్ల.. అనివార్యమైన పరిస్థితుల్లో ఒకరికి టికెట్ కట్టబెట్టినప్పటికీ రెండో నాయకుడు తిరుగుబాటు చేస్తుంటే చంద్రబాబు నిర్లిప్తంగా ఉన్నట్లుగా, చిత్తశుద్ధి లేని బుజ్జగింపులు చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. అసంతృప్తులు, అసమ్మతులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆఫీసులలో విధ్వంసం జరుగుతోంది. ఐదేళ్లపాటు చాకిరీ చేయించుకున్న పార్టీ అధిష్టానం ఎన్నికల సమయం వచ్చేసరికి రిక్త హస్తం చూపించడంపై ఇన్నాళ్లు కష్టపడిన నాయకులు కుతకుతలాడిపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే బరిలో ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వర్మ వర్గీయులలో అసంతృప్తి రాజుకుంది. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్గా విజయం సాధించినంతటి సొంత బలం వర్మకు ఉంది. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన వర్మ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హవా ఎదుట నిలబడలేకపోయారు. ఓటమి తప్పలేదు. కానీ, అప్పటినుంచి ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థిగా పవన్ వస్తాడు అనేసరికి ఆ వర్గం భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడు వర్మకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం వస్తోంది. చర్చించడానికి ఉండవల్లిలో నివాసానికి రమ్మని చంద్రబాబు ఆహ్వానిస్తే.. కార్యకర్తలతో సమావేశం పూర్తయిన తర్వాత వస్తానని వర్మ సమాధానంగా చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అక్కడ బోడే ప్రసాద్కు టికెట్ దక్కదని తేల్చి చెప్పేశారు.మైలవరం సీటును వైసీపీ నుంచి కొత్తగా ఫిరాయించి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వాల్సి రావడంతో, దేవినేని ఉమామహేశ్వర రావును పెనమలూరుకు బదిలీ చేయాలని చంద్రబాబు కుట్ర. ఇన్నాళ్లు ఆ నియోజకవర్గంలో పనిచేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు రగిలిపోతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే బరిలో ఉంటానని.. ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని, విజయం సాధించి నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఆయన తన భక్తిని చాటుకుంటున్నారు.బీజేపీకి జనసేనకు కేటాయించిన సీట్లలో తన పార్టీ వారు బరిలోకి దిగేలాగా చంద్రబాబు చేసిన వ్యూహరచన పాతది. కొన్ని సంవత్సరాల కిందట బీజేపీలోకి ప్రవేశించిన తెలుగుదేశం నాయకులు, పులవర్తి రామాంజనేయులు తరహాలో ఇప్పుడిప్పుడే జనసేనలో చేరుతున్న నాయకులు అభ్యర్థిత్వాలను దక్కించుకుంటున్నారు. ఆ మొదటి వ్యూహం పూర్తయిన తర్వాత, రెండో వ్యూహాన్ని చంద్రబాబు కార్యరూపంలో పెడుతున్నారు. తమ పార్టీకి చెందిన కొందరిని ఇండిపెండెంట్లుగా బరిలోకి దించుతున్నారు. వారికి తన ఆశీస్సులు ఉంటాయని రహస్య దూతల ద్వారా తెలియపరుస్తున్నారు.పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచే సీట్లు తన ప్రభుత్వానికి అవసరం కానీ, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వంలో తలనొప్పిగా మారుతారని, తన కొడుకును వారసుడిగా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అడ్డు తగులుతారనే భయం చంద్రబాబులో ఉంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వర్మను బుజ్జగిస్తున్నట్లుగా నటిస్తూ, ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి ఆయనే ఎగదోస్తున్నారని అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక నియోజకవర్గాలలో ఇలాంటి కుటిల వ్యూహాలతో చంద్రబాబు మిత్ర పక్షాల అభ్యర్థులను కూడా తనకు అలవాటు అయిన దారిలో వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.- వంశీకృష్ణ -
Pawan Kalyan: ప్చ్.. ఈసారి పూర్తిగా క్షవరం!
పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా చేయిస్తూ ఉంటారని, ఆ క్షుద్రపూజలే ఎన్నికల్లో గెలిపిస్తాయనే విశ్వాసంతో కూడా ఉంటారని కూడా గతంలో విస్తృతంగా ప్రచారం అయింది. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కో సమయంలో ఒక్కో రకం సెంటిమెంటును ఆశ్రయిస్తుంటారు. ఈసారి 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ‘క్లీన్ షేవ్’ సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తరచుగా బవిరిగడ్డంతో కనిపిస్తూ ఉంటారు. నిజానికి సినిమా హీరోలు చాలా వరకు షూటింగులు లేని సమయాల్లో గడ్డం మెయింటైన్ చేస్తూ షూటింగు ఉన్నప్పుడు మాత్రం ఆ పాత్ర అవసరాన్ని బట్టి క్లీన్ షేవ్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్, రాజకీయ నేతగా నిత్యం గడ్డంతో కనిపించడాన్నే ప్రజలకు అలవాటు చేశారు. గడ్డంతో మాత్రమే తన మొహానికి కాస్త పెద్దరికం వస్తుందని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. లేదా గడ్డంతో వెళితే గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావని ఎవరైనా స్వాములు ఆయనకు ఉపదేశించారో తెలియదు. మొత్తానికి గడ్డంతోనే రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆయన సాధించిన ఫలితం సున్నా. ఈ ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ముందుగా గడ్డాన్ని పూర్తిగా త్యజించారు. ఎప్పుడు చూసినా ‘క్లీన్ షేవ్డ్’ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ‘క్లీన్ షేవ్’ లుక్ గెలిపిస్తుందనే సెంటిమెంటు ఆయనను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది. పాపం ఎన్నికల సీజన్లో పవన్ ఇంకా అనేక సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టారు. గత ఎన్నికల సమయానికి ఆయన మెడలో అందరికీ కనిపించేలా కట్టుకున్న ఒక తావీదు సాయంతో రాజకీయం చేశారు. ఎర్రటి దారానికి కట్టిన తావీదు ఉండేది. తావీదు మహిమ తనను గెలిపిస్తుందనే ఆయన బలంగా నమ్మారు. కానీ అది పనిచేయలేదు. తావీదు ఎంత దారుణంగా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే, గెలిచిన వెంటనే ఫిరాయించేశాడు. స్వయంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు.తావీదు మీద ఆయనకు నమ్మకం పోయింది గానీ.. చాలాకాలం దానిని కొనసాగించాడు. ఈలోగా ఉంగరాల పిచ్చి పట్టుకుంది. రాళ్ల ఉంగరాలు ధరిస్తే రాజయోగం పడుతుందని బాబాలో, స్వాములో మళ్లీ పవన్ చెవిలో ఊదినట్టున్నారు. వెంటనే ఆయన బాగా స్ఫుటంగా కనిపించేలా ఎర్రటి పెద్ద రాయి, పగడం లాంటిది, పొదిగిన ఉంగరాన్ని ధరిస్తూ దూసుకెళ్లిపోయారు. ఆ ఉంగరాల ప్రభావం కూడా రాజకీయ వైభవాన్ని అందించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మొత్తంగా స్టైల్ మార్చారు. చేతులకు ఉన్న పదివేళ్లకూ ఒక్క ఉంగరం కూడా లేదు. రాళ్ల ఉంగరాలు గానీ, ఇతరత్ర మంత్ర శక్తులు ఆవాహన చేసిన బంగారు ఉంగరాలు గానీ పెట్టుకోవడం లేదు. తాయెత్తులు ధరించడం లేదు. ఎట్ లీస్ట్ మెడలో అందరికీ కనిపించేలా ధరించడం లేదు. గడ్డాన్ని కూడా పరిత్యజించారు. క్లీన్ షేవ్డ్ వ్యక్తిగా, ఏ ఎగస్ట్రా సెంటిమెంటు ఆభరణాలు, తొడుగులు లేని మనిషిగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ సెంటిమెంట్ కనీసం ఆయననైనా గెలిపిస్తుందా? లేదా, ఫలితాలు కూడ క్లీన్ షేవ్ అయిపోతాయా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. తమ పార్టీ స్థాయికి తగినన్ని సీట్లు పొందడంలోనే విఫలం అయ్యారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే పాక్షికంగా ‘షేవ్’ అయినట్టే. ఎన్నికల ఫలితాల తర్వాత ‘క్లీన్ షేవ్’ అయినట్టా కానట్టా అని తేలుతుంది!.-వంశీకృష్ణ -
జనసేన పవన్: 15 టికెట్లున్నాయ్.. రండిబాబూ రండి!
తనకేదో వీరబీభత్సమైన ప్రజాదరణ ఉన్నదని ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే.. ఎమోషన్స్ రకరకాలుగా పండించినంత ప్రొఫెషనల్గా, వేదిక ఎక్కితే ఆవేశపూరిత ప్రసంగాలతో విజిల్స్ కొట్టించుకోవాలి. చాలు.. అక్కడితో మాబలం అపూర్వం అని చాటుకుని.. సీట్ల విషయంలో పెద్ద బేరాలు పెట్టవచ్చు. పెద్ద నెంబరు దగ్గర ప్రారంభించి.. వీలైనన్ని దక్కించుకోవచ్చు. సీట్లు దక్కిన తర్వాత పరిస్థితి ఏమిటి.. వాటిని బహిరంగమార్కెట్లో వేలానికి పెట్టవచ్చు. ..అచ్చంగా ఇది పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు!జనసేన పార్టీని స్థాపించి పదేళ్లకు పైగానే అయింది గానీ.. పార్టీ సంస్థాగత నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియని నాయకుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పొత్తుల్లో ఉంటూ, ఈసారి వారు విదిల్చిన సీట్లలో పోటీకి దిగుతున్నారు. ఇంతకూ ఆయనకు అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? అంటే ఆ పార్టీలో ఎవ్వరివద్దా సమాధానం ఉండదు. ప్రతీచోటా టికెట్ ఆశించే అనాకానీ నేతలు బోలెడుమంది ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆశించే ‘బలం’ చూపించగలిగిన వాళ్లు ఎందరుంటారు? అందుకే 24 అనుకుని 21 తగ్గిన తర్వాత 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్.. మిగిలిన 15 సీట్లను బేరానికి పెడుతున్నారు.పవన్ కల్యాణ్ తాను ఎంత గొప్ప నాయకుడిని అని చెప్పుకున్నా.. తన పార్టీ ఎంత గొప్పదని చెప్పుకున్నా.. సభలు గట్రా నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదికమీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడికి గతి లేదు. అలాగే 24, 21 కాదు కదా.. ఆయన పార్టీకి చంద్రబాబు 50 సీట్లు కేటాయించినా ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరు అనే భావన ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి కట్టబెట్టేస్తున్నారు. చూడబోతే ఒకటీ అరా తప్ప జనసేన వాటాకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా ఉంది. అన్ని సీట్లను కొత్తవారికే ఇస్తోంటే ప్రధానంగా రెండు అనుమానాలు కలుగుతాయి. ఒకటి- జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి పోటీచేయగల నాయకుల కొరత చాలా ఉంది. రెండు- పంపకాల్లో సీట్లను తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండో ఆప్షన్ ఎక్కువ సందర్భాల్లో నిజమని ప్రజలు నమ్ముతున్నారు.పార్టీ దుస్థితి అనాలో లేదా, పవన్ కల్యాణ్లోని వ్యాపార మెళకువ అనాలో తెలియదు. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే. తెలంగాణలో బీజేపీతో చాలా దూరం సాగదీసి 119లో ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్కు ఆయా స్థానాల్లో పోటీచేయించేందుకు కూడా అభ్యర్థులు లేరు. సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి ఆ సీట్లను అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కినది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించేయగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు.నిజానికి పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎటూ దక్కిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్ కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చునని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని అనుకుంటున్నారు.-వంశీకృష్ణ -
‘బీజేపీ, జనసేనల్లో వీళ్లను ఓడించండి’
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనలాగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినవాళ్లు ప్రస్తుతానికి లేరు. అలాగే ఆయన పేరుకు ఒక పర్యాయపదం కూడా ఉంది. అదే ‘వెన్నుపోటు’! రాజకీయంగా ఓడిపోయి దిక్కులేకుండా పడి ఉన్న సమయంలో చేరదీసి పార్టీ కీలక బాధ్యతలు కూడా అప్పగించిన సొంత మామయ్యను వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు.. తన వెన్నుపోటు బుద్ధులను ఎలా మార్చుకుంటారు? ఎందుకు మార్చుకుంటారు?.. అందుకే.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీచేయబోయే కొందరు అభ్యర్థుల్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పటినుంచే స్కెచ్ సిద్ధం చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా చంద్రబాబు.. మిత్రపక్షాలు ఇద్దరికీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీస్థానాలు మాత్రమే కేటాయించారు. వారిలో వారు కొట్టుకునేలా, బీజేపీ అంటే మితిమీరిన భయం ఉన్న పవన్ కల్యాణ్ తనకు విదిలించిన 24 సీట్లలో కూడా కొన్ని కోల్పోయేలాగా ఆయన తన స్కెచ్ ను పదును పెట్టారు. అయితే తాజాగా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే.. బీజేపీ తరఫున, జనసేన తరఫున కూడా పోటీచేయబోతున్న కొందరు కీలక నాయకుల్ని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని!. చంద్రబాబుతో పొత్తుబంధాన్ని వ్యతిరేకించిన వారు, ఆయన వెన్నుపోటు దారుడని, ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే తమను నట్టేట ముంచేస్తాడని బహిరంగంగానే తమ అనుమానాలను వ్యక్తంచేసిన వారు ఈ రెండు పార్టీల్లో కూడా ఉన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో నెగ్గరాదని.. వారికి ఓటమి రుచిచూపించి వారి రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.ఈ వ్యూహానికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అద్యక్షుడు సోము వీర్రాజు విషయమే తీసుకుందాం. ఆయన పార్టీ సారథిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబునాయుడుకు చుక్కలు చూపించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల గురించి ఒక రేంజిలో ఆడుకున్నారు. చంద్రబాబు అక్రమాల మీద విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు. పొత్తుల గురించిన చర్చలు మొదలైన తర్వాత కూడా.. సోము వీర్రాజు ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్రంలో పొత్తులు ఉండవని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు తాము ఒంటరిగా పోటీచేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు పొత్తులు కుదిరిన తర్వాత ఆయన రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చునని వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు ఎంపీగా నెగ్గకుండా.. ఇప్పటికే చంద్రబాబు తమ పార్టీ వారిని పురమాయించినట్లుగా తెలుస్తోంది. పగబట్టిన తాచుపాములాగా.. తనను తిట్టిన సోము వీర్రాజుకు తన తడాఖా చూపించాలని ఆయన అనుకుంటున్నారట. జనసేనలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యేల విషయంలోనైనా రాజీపడతారేమో గానీ.. ఎంపీల జాబితాలో మాత్రం.. తనకు గిట్టని వారిని ఓడించడానికి చంద్రబాబు లిస్టు సిద్ధంచేసినట్టు సమాచారం. చంద్రబాబునాయుడు అసలు వైఖరి తెలిసిన వాళ్లు మాత్రం.. ఒకవేళ రాష్ట్ర బీజేపీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి నిలబడినా కూడా.. ఆమెను ఓడించడానికి తెరవెనుక కుట్రలు చేస్తారని, మంత్రి పదవుల వద్ద చికాకు పెడతాడనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఓటమికి ఆయన కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. :::వంశీకృష్ణ -
వదినమ్మను లూప్ లైన్లోకి నెట్టిన చంద్రబాబు!
కాపురం చేసే కళ.. కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత! చంద్రబాబునాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలిరోజునే బయటపడిపోయింది. బతిమాలి బామాలి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి మొత్తానికి వారితో పొత్తు కుదుకున్న నారా చంద్రబాబునాయుడు.. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత.. సీట్ల సర్దుబాటు చర్చల కోసం కూర్చున్న తొలిరోజునే తన విశ్వరూపం, అసలు రూపం చూపించేశారు. బిజెపిలో అంతర్గతంగా పొత్తులకు అనుకూలతను రాబట్టిన వదినమ్మ పురందేశ్వరికి అప్పుడే వెన్నుపోటు పొడిచేశారు. చర్చల రోజు నాటికే ఆమెను లూప్ లైన్లోకి నెట్టేశారు. రాష్ట్ర బిజెపి సారధి అయినప్పటికీ.. ఆమె చర్చల్లో లేకపోవడం ఇవాళ్టి రాజకీయ పరిణామాల్లో హైలైట్.రెండు రోజుల కిందట చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు ఢిల్లీలో రెండు రోజుల పాటు మకాం వేసి భాజపాతో పొత్తులు కుదర్చుకున్నారు. అయితే ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలి అనేది తేలలేదు. ఆ విషయాలు చర్చించడానికి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బిజెపి నేత బైజయంత్ పండా వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యథావిధిగా తన వెన్నంటి నాదెండ్ల మనోహర్ ను తీసుకువెళ్లారు. తెలుగుదేశం తరఫున కూడా అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ భేటీలో పురందేశ్వరి లేరు. ఏపీ భారతీయ జనతా పార్టీకి ఆమె సారథి! అయినా సరే.. ఆమె లేకుండానే.. ఈ మూడు పార్టీల భేటీ జరగడం.. సీట్ల పంపకాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె పట్ల అవమానకరమైన నిర్ణయం అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది. ఒకవైపు పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపట్టిన నాటినుంచి.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా తిడుతూ చంద్రబాబునాయుడు బలం పెరగడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. చంద్రబాబు తరపున బిజెపిలో పనిచేస్తున్న సరికొత్త కోవర్టుగా కూడా ముద్ర వేయించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అలవాటు గురించి.. ఆమె మరచిపోయినట్టున్నారు. నిజానికి పురందేశ్వరి చంద్రబాబు వెన్నుపోటు ధోరణిని మర్చిపోకూడదు. ఎందుకంటే.. స్వయంగా ఆమె తండ్రి ఎన్ టి రామారావును వెన్నుపోటు పొడిచి.. అధికారం దక్కించుకున్న వ్యక్తి ఆయన! కాకపోతే ఆ వెన్నుపోటు పర్వంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాత్రధారి కావడం వలన ఆమె దానిని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. కొంతకాలం గడవగానే.. ఆమె భర్తను కూడా లూప్ లైన్లోకి నెట్టేసి పార్టీని మొత్తంగా హస్తగతం చేసుకున్న కుయుక్తుల మేధావి చంద్రబాబు. అలాంటి మరిది కుట్రబుద్ధుల గురించి ఆమెకు తెలియదని అనుకోలేం. అయినా సరే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బిజెపి సారథిగా వచ్చిననాటినుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. పొత్తులకు అనుకూల నివేదికలను తయారుచేసి ఢిల్లీ పంపారు. మరిది కోసం ఇన్ని చేసినప్పటికీ.. ఆయన మాత్రం.. తన వెన్నుపోటు బుద్ధి పోనిచ్చుకోకుండా.. ఆమెను పొత్తుకుదిరిన వెంటనే లూప్ లైన్లోకి నెట్టేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు టేలెంట్ ను ముందుముందు ఆమె మరింతగా చూడాల్సి వస్తుందని కూడా పార్టీలో అనుకుంటున్నారు.:::వంశీకృష్ణ