● జాతీయ లోక్ అదాలత్లో4,477 కేసుల పరిష్కారం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్
విశాఖ లీగల్: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్ వద్ద శనివారం జాతీయ లోక్ అదాలత్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ జరిగితే.. వాటికి ఎటువంటి అపీలు లేదన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. తొలుత రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెల్హరి అమరావతి నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని విశాఖపట్నం, భీమునిపట్నం, గాజువాక, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, అరకు, పాడేరు, చింతపల్లి, మాడుగుల న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 4,477 కేసులు పరిష్కరించినట్లు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment